నాకు ఇష్టమైన వ్యాసాలు, నేను పత్రికలకు వ్రాసిన వ్యాసాలు, కొన్ని పిచ్చాపాటి విషయాలు పొందుపరచుకున్న అందమైన "ఊహల కుటీరం " ఇది.
Search This Blog
Sunday, June 30, 2019
శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి
హాస్య కథలకు ఆమేచిరునామా...
తెలుగు కథా ప్రపంచంలో ఆమెది ఒక సుస్థిర స్థానం...
నవ్వించడం ఆవిడ చేస్తున్న మహాయజ్ఞం....
విజయం ఆవిడ పథం...
(ధైర్య) లక్ష్మి ఆవిడ నైజం...
నడిచే నవ్వుల రథం...
ఆవిడే.. శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి గారు.
జననం :
విజయ లక్ష్మి గారు విజయ నామసంవత్సరం (అనగా 1953) జులై లో బాపట్లకు 9 కిలోమీటర్లు ఉన్న యాజలి లో జన్మించారు. వారి నాన్న గారు పి.డబల్యు ఇంజినీరు కావడం వలన వారికి ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉండేవి. కాబట్టి ఆవిడ చదువు చాలా ఊర్లల్లో జరిగింది. ఏడాదికి రెండో మూడో ఊర్లు తిరగడం మూలంగా ఎందరో వ్యక్తులను, వ్యక్తివ్యాలను, దగ్గరగా పరిశీలించే అవకాశం ఆవిడకు లభించింది. అదే తరవాత తరవాత రోజుల్లో ఆవిడకు కథా వస్తువులుగా పనికొచ్చాయి. విజయలక్ష్మి గారి నాన్న గారికి ఆవిడని ఒక డాక్టర్ గా చూడాలన్న కోరిక! కానీ ఆవిడకు పరీక్షలు రాయాలంటే బద్ధకం. పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు కావాలో అంతే పరీక్ష రాసేవారుట. ఆవిడ ఒక రచయిత్రి అవ్వాలని ఏనాడు అనుకోలేదు. పరీక్షలో జవాబు రాయడానికే బద్ధకించే తను ఇన్నిన్ని పేజీల నవలలూ, కథలు ఎలా రాయగలుగుతున్నానో అని ఆశ్చర్యపడ్డారు.
వివాహం :
విజయలక్ష్మి గారికి 17 వ ఏటనే వివాహం అయ్యింది. వివాహం అయిన వెంటనే ఆవిడ భర్త శివరావు గారితో కలిసి "చిత్తరంజన్ " కి వెళ్ళారు. తరవాత ఒక గృహిణిగా ఆవిడ ఇంటికి వచ్చేవారి వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడంలో పూర్తిగా లీనమైయ్యిపోయారు. వారికి ఒక అమ్మాయి శిరీష, కలకత్తాలో స్థిరపడ్డారు, శిరీష ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా "దాదాసాహెబ్ " అవార్డ్ తెచ్చుకున్నారు. ఒక అబ్బాయి ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటున్నారు.
రచయిత్రిగా :
1982 లో చిత్తరంజన్ లో తెలుగు పిల్లల చేత చిన్ని చిన్ని తెలుగు నాటకాలు వేయించడానికి చిన్న చిన్న కథలు రాశారు. అదే ఆవిడ రచయిత్రిగా మొదటి మెట్టు. తరవాత కొద్ది రోజులకి "స్క్రిప్ రెడిగా ఉంది.. సినిమా తీయ్యండి " అనే పేరుతో ఒక వ్యంగ్య కథ రాశారు అది "ఆంధ్ర ప్రభ " కి పంపారు. కొన్ని రోజుల వరకు అటు నుంచి ఏ రకమైనా ప్రత్యుత్తరం రాలేదు. మరి కొన్ని రోజుల తరవాత 'చతుర ' కి "ప్రేమించని ప్రేయశి " పేరుతో ఒక నవల రాశారు. కానీ 'చతుర ' వారు "ప్రేమ లేఖ " అనే పేరు మార్చారు. ఇలా రెండు కథలు పేపర్లలో పడడంతో ఇక వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు విజయ లక్ష్మి గారికి.
ఎక్కువ హాస్య కథలే రాసే విజయలక్ష్మి గారు అప్పుడప్పుడు కొన్ని హాస్యేతర కథలు కూడా రాసి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది "ఆత్మ కథ " . ఈ కథ " ...." లో సిరియల్గా వచ్చింది. చివరి భాగం పోస్ట్ చేశాక ప్రేక్షకుల నుండి ఏడుప్తో ఆవిడకు ఫోన్ ల వరదే వచ్చింది.
ఆవిడ జ్ఞాపకాలను పదిలపరచి మనకు బహుమతిగా "జ్ఞాపకాల జావళి " గా ఇచ్చారు.
అలాగే పూర్వీ కథ... మనస్సుని కలిచివేస్తుంది, మానవత అంటే ఇదేనా అని అనిపిస్తుంది.
కథా వస్తువు :
విజయ లక్ష్మి గారికి ఒక కథ అంటే అందులో కుటుంబం మొత్తం ఉండాలి. అందుకే ఆవిడ చుట్టూ ఉన్న జనాలే ఆవిడ కథా వస్తువులుగా ఎన్నుకొనేవారు. ఉదాహరణకి శ్రీవారికి ప్రేమ లేఖలో "సుత్తి వీర భద్ర రావు " కారెక్టరు... ఆవిడ మాతామహులే, పేకాట గాంగ్ వారి శ్రీవారి స్నేహితులే, కథలు చెప్పే శ్రీలక్ష్మి వారి ఇంటి పక్కావిడే. ఆత్మ కథలో "బల్వి " చిత్తరంజన్ లో వారి స్నేహితుడే!
రచనలు :
మా ఇంటి రామాయణం, పూర్వి, ఆత్మ కథ, పొత్తూరి విజయ లక్ష్మి హాస్య కథలు, ఆనందమే అందం, చంద్ర హారం,సంపూర్ణ గొలాయణం... అన్నీ అపురూపమైన కథలే!
సినిమాలో ప్రవేశం :
1983 లో ఉషా కిరణ్ మూవీస్ వారు చతురలో పడిన "ప్రేమ లేఖ " ఆధారంగా సినిమా తీయాలనుకున్నారుట. దానికి డైరెక్టర్ జంధ్యాల గారు. సువర్ణానికి సుగంధాన్ని అబ్బినట్టుగా విజయ లక్ష్మి గారి హాస్య కథ, జంధ్యాల గారి దర్శకత్వంలో "శ్రీవారికి ప్రేమలేఖ " గా విజయవంతమయ్యింది. అలా విజయ లక్ష్మి గారి రచన సినీ జగత్తులో కూడా వెలిగింది. ఆ తరవాత "సంపూర్ణ గోలాయణం ", "ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం " అనే నవలలు కూడా సినిమాలుగా తెరకెక్కాయి.
చిరంజీవి నటించిన "చూడాలని ఉంది " సినిమాలో బెంగాల్ లో ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు బ్రహ్మానందం చెప్పే డైలాగులు విజయలక్ష్మి గారు రాసినవే. ఇలా సినిమాలలో అప్పుడప్పుడు రాసినా పూర్తిగా మాత్రం కథలు రాయడం లోనే స్థిరపడారు విజయలక్ష్మి గారు.
సంఘ సేవకురాలిగా :
చిత్తరంజన్ లొ ఉండగా విజయలక్ష్మి గారు తెలుగు ఎసోషియేషన్ కి జెన్రల్ సెకరేటరీగా ఉండేవారు. అప్పుడే ఆర్ధికంగా వెనుక బడిన పిల్లలకి స్కూల్ ఫీజిలు, స్త్రీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సాయం చేశారు.
"నా కథలు ఎవరి కష్టాలు తీర్చకపోవచ్చు, కానీ కాసేపైనా కష్టాలను మరచి హాయిగా నవ్వుకొనే భాగ్య కలిపిస్తాయి.., ఇది చాలు నా రచనలకి " అని ఆనంద పడ్డారు.
బహుమతులు అవార్డ్ లు :
2012 లో స్వాతికి రాసిన "సన్మానం " కథకి అనీల్ అవార్డ్ వచ్చింది.
పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుంచి "కీర్తి పురస్కారము "
గృహలక్ష్మి స్వర్ణకంకణం
ముణిమాణిక్యం నరసింహ రావుగారి "స్మారకపురస్కారము"
భానుమతి గారి పురస్కారము
ఈ బహుమతులు, అవార్డులు విజయలక్ష్మిగారిని వరించి తరించాయి.
ఆనందమే అందం :
" " 1970 లో నా పదిహేడవ ఏట ఏమీ తెలియని అమాయకత్వంలో "చిత్తరంజన్ " లో అడుగుపెట్టాను. భాష రాదు, ఒంటరి జీవితం, జీవితంలో సుఖాలే కాదు కష్టాలనీ చవి చూశాను. మా తాతగారు " ఎప్పుడేనా ఏదైనా సమస్య వస్తే ఒకసారి రామాయణం, భారతం గుర్తు తెచ్చుకో... నీకు తప్పకుండా పరీష్కారం దొరుకుతుంది.
మనకు ఆకలి వేస్తే మనమే తినాలి, అట్లాగే మనకు కష్టం వస్తే మనమే భరించాలి. నీ కష్టాలు అందరితోనూ చెప్పుకోకు... నీ వ్యధ్య ఎదుటివారికి సొద " అన్న మాటలు నాకు భగవద్గీత ...
జీవితం ఇచ్చిన కష్టాలను తలచుకుంటూ బాధ పడే కంటే, అదే జీవితం ఇచ్చిన ఆనందాన్ని తీసుకొంటే మరింత ఆనందం పొందచ్చు. ఇదే నేను నమ్మిన సూత్రము... ఇదే నా కథలకు ఆధారం. "
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే పొత్తూరి విజయలక్ష్మి గారు ఆవిడ జీవిత అనుభవాలను జ్ఞాపకాలను నాతో పంచుకుంటూ చెప్పిన మాటలు ఇవి.
ప్రస్తుతం :
పస్తుతం "ఆంధ్ర భూమి " లో "నోస్టాల్జి " రాస్తున్నారు. అప్పుడప్పుడు పత్రికలకు కథలు పంపుతున్నారు. ఫేస్ బుక్ లో కూడ అరాస్తున్నారు. వారు ఫేస్ బుక్ లో వారి పుస్తకాల గురించి ఒక ఆర్టికల్ పెట్టినప్పుడు పుస్తకాలు సెట్ సెట్లే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
నవ్వుల ప్రపంచంలో విహరింప చేసే ఆ హాస్య సామ్రాజ్ఞి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Hi visali garu.
ReplyDeleteAre you raga from andhrafolks.
This is Ravi
This comment has been removed by the author.
ReplyDeletesorry giving correct mail I'd
ReplyDeleteravikiarnpp@gmail.com