Search This Blog
Sunday, June 30, 2019
Thursday, June 6, 2019
చేదు మనిషి
"అయ్యో అయ్యో ఇంట్లో చేదు వృక్షం ఉంటే ఇంటికి అరీష్టమని ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికి ఎక్కదా? " అంటూ మళ్ళీ వచ్చాడు సాక్షి రంగారావు గారు. ఆయనంటే ఎవరో నాకు తెలీదు, కానీ అచ్చు సాక్షి రంగారావులా ఉండేవాడు. ఎప్పుడు ఎవరింటికి వచ్చినా చెట్ల గురించే మాట్లాడేవాడు. అలా అని చెట్టు పాతమని ఎప్పుడూ చెప్పేవాడు కాదు, చెట్లు కొట్టెయమనే చెప్పేవాడు.
మా పక్కింట్లో ఒక వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదని ఆయన వాదన. ప్రతి వారం వచ్చేసేవాడు, వచ్చిన వాడు ఊరుకోకుండా ఇదిగో ఆ చెట్టుని కొట్టెయ్యమని చెవిలో ఇల్లు కట్టుకొని అరిచేవాడు. మా పక్కింటి వాళ్ళ బాత్ రూం పక్కనే కుంకుడు చెట్టు ఉండేది, బాత్ రూం నుంచి విసిరేసిన ఆ కుంకుడు గింజలు పాపం వాటంతట అవే మొలకలెత్తి, ఆ బాత్ రూం నుంచి వచ్చే నీళ్లతో చెట్తై కూర్చున్నాయి. మేము ఆ కాయలని పిన్నీసుతో గుచ్చి, బుడగలూదేవాళ్ళము.
ఇక మా ఇంట్లో, పక్కవారింట్లో జామచెట్లు ఉండేవి. ఈ సాక్షిరంగారావు, "ఇదిగో ఆ ఫల వృక్షాలు ఇంట్లో ఉండకూడదు, పిల్లలకి అరీష్టము " అని అనేవాడు. ఆయన మాటలు ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోలేదు. మాకు ఈ జామ చెట్లు సాయంకాలము ఆడుకొనే ప్లే గ్రౌండ్స్, ఆ చెట్టు కాయలే ఈవింగ్ స్నాక్స్. మాకే కాదు రామచిలుకలకి, కోతిపిల్లలకి కూడా చెట్టు అంటే చాలా ఇష్టము. ఆ జామచెట్టుని కొట్టేయమంటే మా పిల్లల గ్యాంగ్ కి చాలా కోపం వచ్చేది. ఆయన వస్తున్నాడంటేనే విసుగ్గా అనిపించేది. ఆ వేపచెట్టు కన్నా ఇతనే చేదు మనిషి అని అనిపించేది.
మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఒకసారి ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి కాబోయే భర్త బైక్ మీద బయటకు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే.
ఈ పెద్దమనిషి అదే మన సాక్షి రంగారావు వచ్చి " చెప్పానా, ఆ చేదు మొక్క వలనే ఈ అరీష్టము, ఆ ఫల వృక్షము కూడా, ముందు ఆ చెట్లను కొట్టించేసేయండి " అని మళ్ళి చెప్పాడు. తొభై తొమ్మిది గొడ్దలి దెబ్బలకు పడని వృక్షము, వందో దెబ్బకు పడినట్టు, ఆ రోజు ఆ మాటలు ఆ ఇంట్లో వాళ్లకి బాగా పని చేసాయి. పెళ్ళీ కి ముందు చెట్టు కొట్టకూడదని ఎందరో చెప్పినా వినలేదు, ఆ మరునాడే ఆ వేప చెట్టు, కుంకుడు చెట్టు జామ చెట్టు కొట్టేశారు.
అవి చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని మోసిన చెట్లు, అట్లతద్ది వస్తే మా అందరిని ఉయ్యాలూపిన ఆ వేప చెట్టు, విరిగిపోయినా ఇంట్లో చెక్క ఉయ్యాలయ్యి ఆ అక్క (పెళ్ళైన అమ్మాయి ) పిల్లలకి కూడా జోలపాట పాడింది.
Wednesday, June 5, 2019
లవ-కుశ సుబ్రహ్మణ్యం
తెలుగు సినిమా జగత్తులో ఆణిముత్యాలు ఎన్నైనా మకుటముగా నిలిచినవి మాత్రం అతి కొన్నే! అందులో చెప్పుకోదగినది "లవ-కుశ " . ఈరోజుకీ సినిమాలకి దిక్సూచి, కొలమానము లవ-కుశ... ఎన్ని పౌరాణిక చిత్రాలు వచ్చినా లవ-కుశ మాత్రము.. "న భూతో న భవిష్యతి ". అందులో నటించిన సుబ్రహ్మణ్యం గారు... అదే కుశుడు గారు ఆయన అనుభవాలను మనకు ఈ ఎందరో మహానుభావులు " ద్వారా చెప్పారు.
బాల్యం- విద్యాభ్యాసం :
శ్రీ సుబ్రహ్మణ్యంగారు 1946 ఏప్రెల్ 21, గొల్లపాలెం లో జన్మించారు. వారి తల్లి సుబ్బాయమ్మగారు, తండ్రి వియూరి సుబ్బారావు గారు. వారి నాన్నగారిని "గొల్లపాలెం అబ్బాయి " గారు అనేవారు.(మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారిని 'కాకినాడ అబ్బాయీ అనేవారుట). ఆయన యన్ మెన్స్ క్లబ్ మెంబర్ గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు. 1953 లో దంటు భాస్కర రావు గారి ప్రోత్సాహంతో లవకుశ నాటకం వేశారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన తమ్ముడు ఫకీర్ బాబు.
వీరి నటన చూసి ఆ తరవాతి కాలంలో సి. పుల్లయ్యగారి "లవకుశ " లో సుబ్రహ్మణ్యంగారినే కుశుడి పాత్రకు ఎన్నుకున్నారు. సుబ్రహ్మణ్యం తమ్ముడిని అదే సినిమాలో సుర్యకాంతం కొడుక్కా నటింపచేశారు. ఈ లవకుశ సీనిమా ఐదేళ్ళ పాటు తీయడం వలన సుబ్రహ్మణ్యంగారు బడికి వెళ్ళలేకపోయారు. ఆ విధంగా చదువు కొనసాగలేదు.
నటించిన ఇతర సినిమాలు :
" వెలుగు నీడలు " సినిమాలో జగ్గయ్య మేనల్లుడిగా, "శ్రీవేంకటేశ్వర మహత్యం " సినిమాలో శాంతకుమారి పాట పాడినప్పుడు చిన్ని కృష్ణుడిగా, "సీతారామ కల్యాణం " లో చిన్నరాముడిగా (గురుబ్రహ్మ పాటలో), 2006 లో వచ్చిన 'కల్యాణం ' అనే సినిమాలో కూడా నటించారు.
వివాహం :
సుబ్రహ్మణ్యం గారికి వారికి 1978 లో వివాహం అయ్యింది. ముగ్గురు కొడులు. వారి శ్రీమతి నర్శారత్నం గారికి మూడొవ సంతానం కలిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలు ఆవిడ మంచానికే అంకితమవ్వాల్సి వచ్చింది. 2017 లో ఆవిడ పరమపదించారు.
వారి భార్య కి ఒంట్లో బాలేదని ఒకసారి ఆయన నాకు చెప్పారు. అప్పుడు నేను కొంతమంది మిత్రుల సహకారంతో (ఈ ఎఫ్.బి. లో ఉన్నారు వారంతా) వారికి సాయం చేశాను. ఆ డబ్బు అందిన వారం రోజులకే వారి భార్య పరమపదించారు. నేను ఆయనకు ఫోన్ చేసి "ఆ డబ్బు ఇలా ఉపయోగపడినందుకు చింతిస్తున్నాను " పరామర్శిస్తే "తల్లీ! పెళ్ళికంటే ఎవరేనా సాయం చేస్తారు, ఈ కార్యక్రమానికి ఎవరిని సాయం అడుగుతాను, కరక్ట్ టైం కి డబ్బు అందేలా ఇచ్చావు " అని అన్నారు.
ప్రస్తుతం సుబ్రహ్మణ్యంగారు అమలాపురంలో టైలరింగ్ చేసుకుంటున్నారు. కోటీశ్వరులకు లేని గౌరవమర్యాదలు వారికి ఈ లవకుశ సినిమా ద్వారా లభించాయని ఆనందపడుతూ ఉంటారు.
Subscribe to:
Posts (Atom)