Search This Blog

Thursday, December 27, 2018

రోషిని శర్మ

రోషిని శర్మ... కన్యాకుమారి నుండి కాష్మీర్ (లేహ్ ) వరకు బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేసిన మొట్టమొదటి వనిత. ఆడపిల్ల  రాత్రి పూట పక్కనే ఉన్న వీధిలోకి ఒంటరిగా  వెళ్ళడనికే భయపడే ఈ రోజుల్లో ఆమె ఇంత దూరం ఒంటరిగా ఎలా ప్రయాణించింది? అందుకు ఆమె కి స్ఫూర్తి ఎవరు? ఎంత మంది వెనకకు లాగారో తెలుసుకుంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎంతో మంది ఈ నాటి ఆడపిల్లలకు స్ఫూర్తి. 



సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషిని నలుగు అక్క చెల్లెల్లో ఒకతి. ఆమె తండ్రి ఆటో మొబైల్ వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పుడు వాళ్ల నాన్నగారు తనకు బైక్ నడపడం నేర్పించారుట. ఆ తరవాత పదేళ్ళ పాటు మళ్ళీ బైక్ నడిపే అవకాశం తనకి రాలేదు. ఒకసారి బెంగుళూరు లో బైక్ రేస్ జరుగుతోంటే ఆమె చాలా ఉత్సాహంతో ఆ రేస్ లో పాల్గొన్నారు. ఒక స్నేహితుడి ద్వారా కన్యాకుమారి నుండి కాష్మీర్ వరకు బైక్ మీద ప్రయాణం గురించి తెలుసుకొని ఇంట్లో చెప్తే.. ఇంట్లో మొదట ససేమిరా అన్నారుట. ఆ తరవాత ఒక గ్రూప్ గా వెళ్తే ఒప్పుకుంటాము కానీ ఓంటరిగా వద్దు అని చెప్పారు. ఆమె దృఢ సంకల్పము ముందు అందరూ తల ఒగ్గక తప్పలేదు. ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి తనని తాను సిద్ధం చేసుకోడానికి, తాను వెళ్ళాల్సిన మార్గం గురించి తెలుసుకోడానికి  ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టిందిట. రోషిని జూన్ 24 న బయలుదేరి జూన్ 28 కి కన్యాకుమారి చేరింది. అక్కడి నుండి తను అనుకొన్న ప్రయాణం మొదలైయ్యింది. జులై పదో తారుఖు కల్లా తను లడక్ చేరుకొంది.

పదిహేను రోజుల్లో (140 గంటల్లో) ఆమె తన గమ్యాన్ని సురక్షితంగా చేరింది. ప్రయాణం హైవే రోడ్ అంత సాఫీగా మాత్రం లేదు. అంత కష్టపడింది కాబట్టే 'లిమ్‌కా బుక్ ఆఫ్ ఇండియా 'లో తన స్థాన్నాన్ని ఏర్పరచుకుంది.  

 చేరిన వెంటనే ఆమె వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుకుందిట. వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ సమయములో పొందిన ఆనందము, గర్వము కన్నా తనకి  ఏ అవార్డ్ ఆనందాన్ని ఇవ్వలేకపోయాయిట. ఈ ప్రయాణం పూర్తి అయ్యక తను నేర్చుకొన్నది :

"దేశాన్ని ఇంకా ప్రేమించాలి , ఆర్మీ లో ఉన్న వారిని చాలా గౌరవించాలి, ప్రాంతాన్ని బట్టి మనుషులను లెక్క కట్టకూడదు " . 



ఒక సారి దారి అంతా ప్రయాణించాక అక్కడ జనాల ద్వారా తెలిసిందిట ఆ దారిలో రాత్రి పూట ఒక స్త్రీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుందనీ, ఆమె ఒక దెయ్యం అని. ఇంకోసారి రోడ్ల మీద ఖాళీ లేకుండా ట్రక్కులు ఉన్నప్పుడు తనకు కొన్ని గంటల పాటు అలా వరుసలో నిలబడాల్సి వచ్చినప్పుడు అనిపించిందిట.." ఎందుకీ ప్రయాశ సుఖంగా ఏ.సి. లో కూర్చొని నెల తిరిగేసరికి మంచి జీతం తీసుకొంటూ, అప్పుడప్పుడు తల్లితండ్రీ, అక్క చెల్లెలతో ఏదైనా మంచి చోటు చూసి సరదాగా గడపక ఈ ఎండలో ఈ ట్రాఫిక్ లో దుమ్ముధూళిలో ఈ కష్టాలు కొని తెచ్చుకున్నానని... " కానీ తన గమ్యము గుర్తుకు రాగానే ఈ కష్టాలన్నీ పెద్దగా కలవరపెట్టలేదు.


రోషినికి బైకే కాదు, మౌటేన్ ట్రెక్కింగ్, సైకిల్ రైడింగ్ అంటే కూడా ఇష్టము. వారాంతరాలలో తాను ఎప్పుడూ పర్వతారోహణము చేయడానికే ఇష్టపడుతుందిట. ఇప్పటికీ దక్షిణ భారత దేశములో ఉన్న అన్నీ ముఖ్యమైన పర్వతాలు ఎక్కేసింది.

ప్రస్తుతం బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తొంది రోషిని. " ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చుకోడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఏ కల రాత్రికి రాత్రే ఫలించదు. దాని కోసం కష్టపడాలి. అప్పుడే కల సాకారమౌతుంది, సమాజములో పేరూ వస్తుంది. ఎంతో మంది మాట అనకుండా ఉండరు, అవి పాజిటివ్ గా తీసుకొని ముందుకే నడవాలి " అని రోషిని,   ఈ  ' కె. టూ కె. '(K-K )  బైక్ రైడ్ అయ్యక యువతకు సందేశం ఇచ్చింది. 




((నాలుగేళ్ల క్రితం ఈ అమ్మాయిని కలిసే అవకాశం లభించింది, అప్పుడు ఆమె నాతో చెప్పిన విషయాలు) 

Wednesday, December 26, 2018

అరుణ కిరణం...

నిన్న మా ఫ్రండ్ మానస కూతురి పుట్టినరోజుకి వెళ్ళాను. అక్కడ కి వెళ్ళి కూర్చూగానే మా ఫ్రండ్ వాళ్ళ చుట్టం ఒకావిడ నా చేతిలో ఒక జూస్ గ్లాస్ పెట్టింది. ఇంకా ఆ పుట్టినరోజు పిల్లని తయ్యారు చేస్తున్నారు. నేను వెళ్ళి మా ఫ్రండ్ అత్తగారిని పలకరించి ఆవిడ పక్కన కూర్చున్నాను. ఆవిడ కాస్త పొట్టిగా పాత సినిమాలో ' రాజసులోచన ' లా ఉంటుంది.

ఆవిడ నన్ను పలకరించిందే కానీ చూపులు మాత్రం నిలకడగా లేవు.. ఏదో వెతుకుతోంది... ఇంత లో వెనకకు చూసింది.. అక్కడ ఆవిడ మనవడు (కూతురి కొడుకు) కొత్త పెళ్ళం చెయ్యి పట్టుకొని నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. అంతే "ఒరేయ్ కిరణు.. కాస్త జానాలలోకి రారా " అని కాస్త సీర్యస్ గానే అంది. ఇంతలో నా ఫ్రండ్ వచ్చి " వాడు జనాలలోనే కదా ఉన్నాడు " అని నవ్వుతూ అంది. నన్ను పలకరించి మళ్ళీ లోపలకి వెళ్ళిపోయింది మానస.  

 ఇంతలో ఆ కిరణ్ వెనకాల వంటిట్లో రెండు కుర్చీలు వేసుకొని,  అతను అతని భార్య అరుణ మళ్లీ  కబుర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతలో ఈ రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణు.. ఇలా వచ్చి మావయ్య పక్కన కూర్చోరా " అంది. అబ్బే మన కిరణుడికి తాత్కాలిక చెవుడు వచ్చేసింది...  వినిపించుకునట్టుగా నటించేశాడు. ఈ రాజసులోచనగారు ఆగలేదు మళ్ళీ గొంతులో స్థాయి పెంచి పిలించింది. ఇంక ఆ అబ్బాయి తప్పదన్నట్టు లేచి వచ్చి హాల్ లో మానసా వాళ్ళ ఆయన పక్కన కూర్చున్నాడు. ఇక్కడ కిరణ్.. ఎదురుకుండా వంటిట్లో అరుణ.. హ్మ్మ్మ్.. కాసేపు కళ్ళతో కబుర్లు చెప్పేసుకోవడం, చూపులతో  సైగలు చేసేసుకోవడం మొదలెట్టారు. అటు చూసి ఇటు చూసి కిరణు మళ్లీ  వెళ్ళి అరుణ పక్కన చేరాడు. మళ్ళీ మన రాజసులోచన గారు వెతుకోవడం మొదలెట్టింది... ఇంతలో కేక్ కట్టింగులు అయ్యాయి. ఈ రాజసులోచన గారి దృష్టి అంతా కిరణ్ వైపు, నా దృష్టి  అంతా ఈవిడవైపే ఉండిపోయాయి.

ఒక ప్లేట్ లో పెద్ద కేక్ ముక్క పట్టుకొని కిరణ్ , అరుణ పక్కకెళ్లీ సగం సగం తింటున్నారు. ఇంతలో మన రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణూ.. ఇక్కడ కేకు ఉందిరా.. రా " అని అరిచింది. పాపం కిరణ్ అరుణని వదలలేక వదలలేక అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు.

ఇంక భోజనాల తంతు మొదలయ్యింది.  రాజసులోచన గారి హడావిడి చూసి ఆవిడకి ఒక ప్లేట్ లో భోజనం పెట్టి   పైకి వెళ్ళి కూర్చోమని ఆవిడ కొడుకు(మానస భర్త)  చెప్పాడు... ఆవిడ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ .. "ఒరేయ్ కిరణు.. నువ్వు ఇలా రా " అని పిలిచింది. ఆవిడ కొడుకు.. "నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళు , వాడిని ఎందుకు పిలుస్తావు... ఏదైనా వడ్దన పని ఉంటే వాడు చేయాలి కదా  " అని చెప్పి రాజసులోచన గారిని మేడ ఎక్కించేశారు. ఇక అరుణ, కిరణులు సరదాగ నవ్వుకుంటూ వడ్దన చేస్తుంటే అందరికీ చూడ ముచ్చటగా అనిపించింది. అరుణతోటే కదా కిరణం ఉండేది!!

ఒక చిన్న మొక్కని పాతి నీరు పోసి పెంచి పెద్ద చేశాక, తీరా అది ఫలాలు ఇచ్చే సమయానికి ఎవరో వచ్చి ఆ చెట్టుని తనది అనేస్తే.. ఆ పెంచిన వ్యక్తికి ఒకరకమైన బాధ, దుగ్ధ వేస్తుంది. ఈ రాజసులోచన గారి బాధ అదే. చిన్నప్పుడు తల్లీతండ్రీ పోతే ఈ రాజసులోచన గారు(అసలు పేరు ఇప్పటికీ తెలీదు) ఆ కిరణ్ ని పెంచింది. ఎక్కడ ఆ కొత్త పిల్ల ఆవిడ మనవడిని ఆవిడకి దూరం చేసేస్తుందో అన్న భయం. ఆ మనవడు అమాయకుడని, ఆ కొత్తగా వచ్చిన పిల్ల వాడిని ఆడించేస్తుందన్న భయము... ఈ భయంతోటే కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటారు వాళ్ళ జీవితాలలో... ఆ చెట్టు నాదే, ఆ కొత్త పిల్ల నాదే అన్న భావం వస్తే ఈ బాధ ఉండదు. ఎక్కువ చొరవ తీసుకుంటే వాళ్ళు మొదట నవ్వుకున్నా తరవాత తరవాత విసుకుంటారు కూడా. చెప్పడం తేలికే ఈ విషయం కానీ ఆచరించడం కష్టం... అయినా తప్పదు మన గౌరవం మనం నిలుపుకోవాలంటే!!

Sunday, December 9, 2018

ప్రయాగ

"నిన్ను అక్కడ నుంచి పక్కకు రమ్మని చెప్పాను కదమ్మా " అని ఐదో సారో ఆరో సారో అన్నారు పంతులు గారు సునందతో...

" వాడికి సరిగ్గా తెలియటం లేదండి " అని మళ్ళీ అదే జవాబు ఇచ్చింది సునంద...

"వాడికి అర్ధమయ్యేటట్టు నేను చెబుతా, నువ్వు పక్కకు రావమ్మా " అని కాస్త కటువుగా చెప్పారు పంతులు గారు.


చుట్టుపక్కల ఎనిమిదిమంది వారి వారి పితృదేవతలకి శ్రాద్ధం పెడుతున్నారు, అందరూ 40 ఏళ్లు దాటిన వారే, కొందరు 60 ఏళ్ళు దాటిన వారూ ఉన్నారు! అందులో  ఒకే ఒకడు మాత్రం పది పదకొండేళ్ళ మధ్యలో ఉన్న వాడు... పేరు సంతోష్! వాడికి ఏదీ అర్ధం కావటం లేదు... అందుకు అతని తల్లి మాటిమాటికి  వచ్చి పంతులుగారు చెప్పింది ఎలా చెయ్యాలో చెబుతోంది, ఇది ఆ పంతులుగారికి నచ్చక ఆవిడని కసురుకుంటున్నాడు.


"ఒరేయ్... అంత పెద్ద పెద్ద ఉండలు కాదురా... ఆ పిండితో నలభై ఉండలు చెయ్యాలి... నువ్వు ఐదు ఉండలు చేశావు ఒక్కో ఉండని ఎనిమిది చిన్న ఉండలు చెయ్యి " అని గదమాయిస్తూ చెప్పారు ఆ పంతులు గారు.


సంతోష్ ఆయన చెప్పినట్టే భయం భయంగా చేస్తున్నాడు.  చుట్టూ ఉన్నవారు అక్కడ జరిగేది చూడలేక సునందని అడిగారు " ఆ పిల్లాడు ఎవరికి పిండప్రదానం చేస్తున్నాడమ్మా? " అని


" నా భర్తకేనండి  " అని వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ అంది సునంద


అప్పుడు చూశాను ఆవిడని రమారమీ 25 - 27 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఇంకా మొహం లో లేతదనం పోలేదు. ఎవరూ ఆ పిల్లాడికి తల్లి అని అనుకోరు, అక్కేమో అని అనిపిస్తుంది.  ఇంత కష్టమా ఇంత చిన్న  వయసులో? 

" ప్రయాగ, కాశి, గయలో శ్రాద్ధం పెట్టిన వాడే అసలైన కొడుకుగా మన పురాణాలు చెబుతున్నాయి " అని గట్టిగా పంతులుగారు అన్నారు.


" చేతికున్న ఆ దర్భ పడిపోయిందిరా.. చూసుకో " అని సంతోష్ తో అన్నారు పంతులుగారు...

వాడు దర్భ అంటే ఏంటో అని విస్తరిలో చూస్తున్నాడు, సునంద ఆగలేక మళ్ళీ దగ్గరకు వెళ్ళి ఆ దర్భని తీసి ఇవ్వబోయింది..

"వాడికి తెలుగు అర్ధమౌతుంది కదా? నేను తెలుగులోనే చెబుతున్నాను కదమ్మా... నువ్వు పక్కకు వెళ్ళు " అని మళ్ళీ  గదమాయించాడు


చిన్నబుచ్చుకొన్న మొహం తో మళ్ళీ వెనకాలకి వచ్చింది సునంద.

"ఎలా పొయారమ్మ మీ వారు? " అని ఎవరో ఆ గుంపులో అడిగారు

" యాక్సిడెంట్ లో పోయారండి " అని సమాధానం ఇచ్చింది సునంద


" ఏదైనా ఆస్తి పాస్తులున్నాయా మరి? నువ్వేదైన ఉద్యోగం చేస్తున్నావా? " అని అడిగింది ఒక పెద్దావిడ ఉండబట్టలేక...

" ఒక పాన్ షాప్ ఉందండి, వెయ్యి గజాల స్థలం మాధాపూర్ లో ఉంది, అదిగో మా అమ్మ నాన్నతో ఉంటున్నాను " అని సంతోష్ పక్కన పితృకర్మలు చేస్తున్న తన తండ్రిని చూపించింది సునంద.


" అయ్యో తాత మనవడు ఇలా ప్రయాగలో ఒకేసారి పిండప్రదానం చేస్తున్నారా? పగవారికి కూడా ఇలాంటి  కష్టం రాకూడదు " అని కళ్ళ నీరు పెట్టుకుంది ఒక పెద్దావిడ


"నేను ఎక్కువ చదువుకోలేదండి, టెంత్ అయ్యిన వెంఠనే పెళ్ళి, పెళ్లైన ఏడాదిలోపలే వీడు పుట్టేశారు " అని చెప్పింది సునంద


" వీడెనా ఇంకా పిల్లలు ఉన్నారా? " అని ఇంకో ప్రశ్న


" ఇంకో ఆడపిల్ల ఉందండి "


"చెయ్యి ఎడమవైపు తిప్పాలిరా అలా కాదు " అని మళ్ళీ పంతులుగారి అరుపు


చెయ్యి అన్ని వైపుల  తిప్పెస్తూ పంతులుగారి వైపు తిప్పాడు  సంతోష్


"నాకు కాదురా ఆ పిండం పెట్టేది అటు వైపు తిప్పి నేను చెప్పింది చెప్పు " అని అన్నారు  పంతులుగారు


ఆ మాటకి కాస్త నవ్వు వచ్చినా అక్కడి జనాలు మాత్రం నవ్వితే ఎమంటారో అని నవ్వలేకపోయారు..

పక్కన ఉన్న సంతోష్ తాత కళ్ళతో అలా కాదు అని సైగ చేశాడు. అది అర్ధం చేసుకున్నాడేమో తాత ఎలా చేస్తున్నాడో చూసి అలా చెయ్యి తిప్పాడు సంతోష్.


మొత్తానికి ప్రయాగలో సంతోష్ చేత అతని తండ్రికి శ్రార్ధం పెట్టించింది సునంద. అందరూ ఆ పంతులుగారికి తోచిన రొక్కం చెల్లిస్తున్నారు. డబ్బులు ఇచ్చి అతని కాళ్ళకి దండం పెడుతున్నారు

సంతోష్ చేతికి రెండు వందల రుపాయిలు ఇచ్చి పంతులుగారికి ఇవ్వమని చెప్పించి సునంద.

సంతోష్ భయంగా ఆయన దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన చెయ్యి అడ్డం పెట్టారు

"అయ్యా.. డబ్బులు తక్కువైతే ఇంకో వంద ఇస్తానండి " అని సునంద పాపం కళ్ళలో నీళ్లతో అంది


"అమ్మా.. శ్రద్ధగా పెట్టేది శ్రార్ధం. ఇంత చిన్న వయసులో మీ అబ్బాయికి వచ్చిన కష్టం శతృవులకు కూడా రాకూడదమ్మా! ఎంతో డబ్బున్నా, శాస్త్రీయ కుటుంబాలకు చెందినవారు తల్లి తండ్రి పోతే ఎవరో ఒకరికి (డబ్బులు) కూలి  ఇచ్చి  దహన సంస్కారాలు చేయిస్తున్నారు. ఇక ఇలా ప్రయాగ, కాశీలో, గయలో పిండప్రధానం అనేదే లేదు. అలాంటిది నీ కొడుకు నా ద్వారా ఆ క్రతువు చేయించుకున్నాడు, ఆ తృప్తి చాలమ్మా. వాడిని కసిరింది వాడి ఆలోచనలు అటు ఇటు పోకూడదని, తప్పుగా అనుకోకే.. నా కూతురు లాంటి దానివి  "   అని పంతులుగారు అనడంతో అందరూ ఆయనవైపు చేతులు జోడించి మరీ చూశారు

సంతోష్ వైపు చూసి "అయ్యవారి కాళ్ళకి దండం పెట్టు " అని చెప్పింది సునంద

కాళ్లకి దండం పెట్టిన సంతొష్ ని లేవదీస్తూ " ఒరేయ్.. మీ నాన్న ఏ లోకాలలో ఉన్నా ఆయన  ఆత్మకి శాంతి కలిగించావు, ఉన్నత లోకాలు కలిగేటట్టుగా చేశావు. , బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకొని ఆవిడకీ కూడా ఆనందాన్ని ఇవ్వు " అని అన్నారు  పంతులు గారు.


 "యథా నవనీతం హృదయం బాహ్మణస్య

వాచి కురో నిశిత స్త్రీక్షధాః  " గుర్తొచ్చింది.


ప్రయాగ వెళ్ళినప్పుడు ఆయనకి నా తరఫున కూడా దండం పెట్టండి. 

Friday, November 23, 2018

పాటకలు

పున్నమి రాత్రిలో కూసే కోయిలలా ...

సముద్రపుటొడ్డున మేసే గోవులా..

కార్తీకాన విరబూసిన మల్లిలా...

నిత్యమూ ఆహ్లాదంగా నీ నవ్వు ఉంటుంది...


(రాత్రి పూట కోయిలా, సముద్రపు ఒడ్డున లేని గడ్డి మేసే ఆవు, కార్తీక మాసంలో మల్లెపువ్వు... దేవుడా)


నడిరోడ్డున ఏడుస్తొన్న ఆకాలి ఏడుపులు వినపడుతూ కూడా నువ్వు ఎలా తినగలుగుతున్నావు?


(అన్నం తినేటప్పుడు నాకు చెవులు పని చెయ్యవు)


పండక్కి నువ్వొక్కదానివే బట్టలు కొనుకుంటే చాలా... దేశంలో బట్టలు లేని వారు ఎందరో...

(పండక్కి కొత్త బట్టలు కొనికొని వెసుకోవడానికి కూడా కోర్టు అనుమతి కావాలా?)


ఇవన్నీ పొద్దుటే వచ్చే వాట్స్ ఆప్ లో కవితా సందేశాలు...కవితలనబడే ముక్కలు చేసేసిన వాక్యాలు.


ఇంకొందరు పాత పాటలలో అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసుకొని అతికించేసి రాసేస్తూ ఉంటారు. అప్పటికే మనసు చంపుకొని "వహ వా.. " అన్నాను... 


అన్నకా ఇంకా పెట్రేగి పోయి..."గంగాభగీరథి సమానురాలైన మా అమ్మ నిత్య పవిత్రురాలు " అంటూ రాసేశారు.. వాళ్ళ నాన్న గుండ్రాయిలా ఉన్నాడు. ఇలా అనకూడదు భర్త ఉన్న వాళ్లని అంటే "పద ప్రయోగం బాగుందని అనేశా... " అంటూ సకిళింపు లాంటి ఇకిలింపు...


రేపటి నుంచి రివర్స్ లో నేనూ పాటల ముక్కలు కవితలుగా .. అంటే "పాటకలు "  (అబ్బాబ్బ ఎంత బాగుందో పేరు) రాసేసి పంపేస్తా.. అంతే!!





Tuesday, October 30, 2018

జ్యోతి

 

 

 

హాల్ అంతా కోలాహలంగా ఉంది. చాలా రోజుల తరవాత కలుసుకున్న చుట్టాలతో ఎప్పటెప్పటివో కబుర్లతో చాలా సందడిగా ఉంది. ఇంకా జ్యోతి రాలేదు. అందరూ తన గురించే ఎదురు చూస్తున్నారు. జ్యోతి భర్త దీపక్ వచ్చిన వారందరికీ కూల్ డ్రింకులు అందాయో లేదో చూస్తూ, అక్కడ పనివాళ్ళకు పనులు పురమాయిస్తూ హాల్ అంతా తిరుగుతున్నాడు. జ్యోతీ దీపక్ లు చాలా శ్రీమంతులు. అటువంటి వారింట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అప్పటికే అక్కడ చేరిన కొంతమంది జ్యోతి సంతానం గురించి ఎన్నో కాలక్షేపం కబుర్లు చెప్పుకోసాగారు. కొందరు కామెడీలు కూడా చేశారు. కాసేపయ్యాక జ్యోతి, తన అమ్మ, అత్తగార్లతో హాల్ కి వచ్చింది. జ్యోతి చేతిలో ఏడాది పిల్లాడు, జ్యోతి వాళ్ళ అమ్మ చేతిలో రెండున్నర ఏళ్ళ పాప, జ్యోతి అత్తగారి చేతిలో మూడేళ్ళ పాప ఉన్నారు. అందరూ కాసేపు ఆశ్చర్యమూ, వెటకారముతో కూడిన నవ్వులతో జ్యోతిని పలకరించారు.

"ఈ రోజుల్లో కూడా ఇంకా ముగ్గురు పిల్లల్ని సాకడం అబ్బో... " అని వంకరగా...

" కాస్తైనా చూసుకోవాల్సింది జ్యోతి " అని ఇంకొకరు ఉచిత సలహా పారేశారు.

"ముగ్గుర్ని... కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది " అని ఒకరంటే...

"సంతాన లక్ష్మిలా భలే నిండుగా ఉన్నావు " అని ఒకరు

అసలు విషయం గ్రహించిన జ్యోతి మాత్రం అందరికీ చిరునవ్వే సమాధానం ఇచ్చింది. కేక్ కట్టింగ్ అయ్యాక, అందరికీ అడిగి అడిగి కొసరి కొసరి మరీ వడ్డించి కడుపు నిండేలా అన్ని రుచికరమైన పదార్ధాలు తినిపించారు జ్యోతీ దీపక్ లు. ఇక అందరూ వెళ్ళే ముందు జ్యోతి.. "ఒక్క నిమిషం మీ అందరితో కొంచం మాట్లాడాలి " అని అంది.  



"మీరందరూ ఈరోజు మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.  నాకు పెళ్లైనప్పటి నుంచి పిల్లలు కావాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది. దీపక్ కి కూడా పిల్లలంటే చాలా ఇష్టము. మా దురదృష్టమేంటో కానీ పెళ్ళైన 10 ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదు. మా పేర్లల్లో జ్యోతీ దీపక్ ఉన్నా మా జీవితాలలో మాత్రం వెలుగు లేదు. ఎంత డబ్బు ఉన్నా పిల్లల చేత "అమ్మ " అని అనిపించుకోని ఆ వెలితి అనుభవిస్తే కానీ అర్ధం కాదు.   అన్ని రకాలుగా ప్రయత్నించివిసిగి వేశారిపోయాక  ఇదిగో అప్పుడు "ద్యుతి " వచ్చింది. మా జీవితం లో నిజం గా ద్యుతి ద్యుతినే తెచ్చింది. కానీ అప్పటికీ నాకు ఇంకా తనివి తీరలేదు. ద్యుతికి ఏడాదిన్నర వచ్చాక ద్యుతికి చెల్లెలు  "మయూఖ "  వచ్చింది. వాళ్ళ అల్లరితో ఇల్లంతా కళకళలాడింది. మా మొహాలలో చిరునవ్వు కూడా అంత అందంగానే విరబూసింది. ఇంక వాళ్ళిద్దరికీ ఒక తమ్ముడు కావాలని అనిపించింది మాకు.. అంతే ఇదిగో "చిరాగ్ " గాడు వచ్చాడు నేనున్నానంటూ! గత పదేళ్ళుగా "అమ్మా " అన్న పిలుపు కోసం ఎంత తపించిపొయానో... దేవుడు దానికి రెట్టింపుగా ప్రతి నిమిషం "అమ్మ , అమ్మా " అంటూ నా వెంట తిరిగే ముగ్గురు ముత్యాలని ఇచ్చాడు. వారి నవ్వుల పువ్వులతో, ఏడ్పుల గాడ్పులతో, కోపాల కారాలతో, ముద్దుల తీపితో నాకూ రోజు ఉగాదే! 



నేను ఒక కూతురిగా అమ్మ నాన్నల నుంచీ అన్ని సిరులు పొందాను. ఇంక ఒక భార్యగా దీపక్ నాకు అన్ని ముచ్చట్లు తీర్చాడు. కానీ ఒక తల్లిగా పొందాల్సిన ముచ్చట్లేవి నాకు పదేళ్ల పాటు దక్కలేదు. నాకు తల్లిగా పిల్లల నవ్వులు కావాలనుకున్నా, వాళ్లతో నిద్ర లేని రాత్రులు కావాలనుకున్నా, వాళ్ళ అలకలు తో కూడిన దొంగ ఏడ్పులు కావాలనుకున్నా, నచ్చినవి ఇస్తే మురిసిపోయి ముద్దులతో కురిపించే ప్రేమ కావాలనుకున్నా, భయపడి "అమ్మా " అని చుట్టేసుకున్నప్పుడు భద్రత అవ్వాలనుకున్నా! అందరూ వాళ్ళ పిల్లల అల్లరితో విసిగిపోతూ ముచ్చటగా చెప్పుకొని కబుర్లు నేనూ చెప్పాలనుకున్నా! నేనూ అలా విసిగిపోవాలనుకున్నా! అమ్మగా నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలని పొందాలనుకున్నా! ఇందాక ఎవరో అన్నట్టు " కాస్త చూసి అందంగా ఉన్న పిల్లల్ని తెచ్చుకోవాల్సిందే " అని .. "మీ కడుపున పుట్టిన పిల్లలు ఏ వంకరతోనైనా పుడితే మీది కాదు అని వదిలేసి వస్తారా?  మీరందరూ శారీరక నొప్పులు పడి "తల్లి " కాగలిగారు.. నేనూ ఎంతో మానసిక వ్యధపడే ఇన్నాళ్ళకు ఒక "అమ్మ " ని అయ్యాను. మీ అందరికీ ఏ కష్టం లేకుండా " అమ్మ " అని అనిపించుకునే వరం దక్కింది. అలా దక్కని వారికి ఎడారిలో ఒక అమృతం చుక్కలా ఇలా " అమ్మా " అని  పిలిపించుకొని అవకాశం ఇచ్చిన అనాథశరణాలయాలకు ఎంతో ఋణపడి ఉన్నాము. ఇప్పుడు నేను మా పిల్లల అల్లరితో ఆటలతో అలసిపోతున్నాను, వారి కబుర్లలో తేలిపోతున్నాను, వారి ముద్దులలో మునిగిపోతున్నాను... ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇప్పుడు నా దగ్గరే ఉంది.   నేను  నా డబ్బు దర్పం చూపించడానికి ఈ ఫంక్షన్ చేశానని అనుకోవద్దు.. నేనూ "అమ్మ " ని అయ్యానన్న గర్వం తో చేశాను. ఏరోజూ నా పిల్లల్ని నేను అనాథశరణాలయం నుంచి తెచ్చుకున్నానని మాత్రం అనొద్దు  " అని అందరికీ దండాలు పెట్టింది.  



కుదిరితే జ్యోతి లాంటివారి విశాల హృదయానికి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము... అంతే తప్పా.. పిల్లలు అందంగా లేరనో, ఏ కులమో,  ఏ మతమో అని వారిని వేలెత్తి చూపి కుసంస్కారాన్ని బయట పెట్టుకోవద్దు!! 




Saturday, October 20, 2018

శక్తి

నిన్న పొద్దుట కూరలకోసమని మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్ పక్కనే అర్పిత వాళ్ళ ఇల్లు, అర్పిత నా చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చాలా రోజులు.. ఉహు నెలలే అయ్యింది, ఇంట్లో ఉందో లేదో అని ఒకసారి ఫోన్ చేశా. తను ఇంట్లోనే ఉన్నా రమ్మని చెప్పింది.

అర్పిత ఇంట్లోకి అడుగెడుతుంటేనే ఒక పర్ణశాలలోకి అడుగుపెడుతున్న  అనుభూతి, ఇంటి ముందు మెలికల  ముగ్గు, చల్లటి చెట్ల గాలి, తను ఇంటిని  తీర్చిదిద్దే విధానం చూసి ఇంకా ముచ్చటేస్తుంది. ఇల్లు ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. విశ్మయముతో ఇల్లు చూస్తూ ఉన్నా, ఇంతలో "ఇంక ఇంట్లోకి వస్తావా" అన్న అర్పిత పిలుపుతో ఈ లోకంలోకి  వచ్చా.

కాసేపు పిచ్చాపాటి కబుర్లు అయ్యాక దసర నాటి బొమ్మలకొలువు ఫొటోలు చూపించింది. అసలు ఆమెకి అంత ఓపిక ఎక్కడిది, ఇంటి పని, వంట పని, తోట పని, ఇవి సరిపోనట్టు పేయింటింగ్, అల్లికలు, బొమ్మల కొలువుకి బొమ్మల్ని తయ్యారు చేయడం! ఒక గజేంద్రమోక్షము , గోపికలు కృష్ణుని ఘట్టాలు తీర్చిదిద్దిన విధానానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయా. మెచ్చుకున్నా, పొగిడినా " ఇదీ ఒక పెద్దపనేనా " అని సున్నితంగా తోసిపారేస్తుంది తను.

"దసరా బాగా జరుపుకున్నట్టున్నావే " అని అడిగా...

ఒక చిరునవ్వు నవ్వుతూ... " నవరాత్రులలో అమ్మవారికి  రోజుకొక అలంకారము చేసి, పూజ చేశాను. దగ్గరలోనే అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఆయనతో నవరాత్రులు మొదలవ్వక ముందే చెప్పాను. తీరా నవరాత్రి మొదలయిన రోజే ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఆడపడుచు, పిల్లలు. ఆడపడుచుకి ఈ ఊరిలో ఏదో ఆఫీస్ పని ఉందని పిల్లలతో సహా వచ్చి పిల్లలని నాకు వదిలి తాను ఆఫీస్ పని లో బిజీ అయ్యింది. మొదటి రోజంతా ఆడపడుచు పిల్లలతోటే సరిపోయింది. ఇక రెండో రోజూ ఆడపడుచు తరఫు చుట్టాలు ఆవిడని పిల్లల్ని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి వంట, టీలు, టిఫిలతో సరిపోయింది.

ఇంట్లో పిల్లలు, చుట్టాలు పని తెమలడమే కష్టగా ఉంటే మూడో రోజు సాయంత్రము శ్రీవారు ఆయన ఫ్రండ్స్ ని తీసుకొచ్చి వీణ కచేరి చేయమని పురమాయించారు, అందరి ముందు అడిగారు ఇంక కాదనలేక ఒక కీర్తన వాయించాను. వచ్చిన వాళ్ళు తెగ ముచ్చట పడిపోయారు. ఇంక మూడో రోజు కూడా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్ళలేదు.

ఆ మరునాడు ఆడపడుచు పిల్లలు స్కూల్లో ఇచ్చిన హోం వర్కులు బయటకు తీసి నా దగ్గరకు వచ్చారు. ఇంక ఆ రోజు వాళ్ల చేత హోం వర్కులు చేయించడములో బిజీ అయ్యా. వాళ్ళకిచ్చిన ప్రాజెక్టులు చేయించడములో,  సాయము చేయడముతో సమయం ఎలా గడచిందో తెలియకుండా సాయంత్రము ఏడైపోయింది, ఈయన సాయంత్రము లేటుగా రావడం తో ఆ రోజు గుడికి వెళ్ళలేకపోయాము.

ఇలా నవరాత్రులు హాడవిడిగా గడచిపోతూ వచ్చాయి. ఇంక నవమి రోజు పిల్లల్ని, చుట్టాలని తయ్యారు చేసి తీరా గుడికి వెళ్దామనుకుంటే మా పనిమనిషి రత్తాలు ఏడుస్తూ మొహనికి రక్తం కారుతూ, చంటి పిల్లని కౌగిలించుకొని రొప్పుతూ , ఏడుస్తూ వచ్చింది. దాని మొగుడు మూడోసారి కూడా దానికి ఆడపిల్ల పుట్టిందని ఆ చంటి పిల్లని ఎవరికో అమ్మడానికి తీసుకెళ్తున్నాడని, అడ్డం వచ్చిన రత్తాలుని కొట్టాడని చెప్పింది. అంతే ఎక్కడ లేని కోపం వచ్చింది. మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తొన్న వాడిని వెంటనే పిలిపించి... రత్తాలు ని తీసుకొని ఇంటికి వెళ్ళీ, రత్తాలుని కొట్టినా, పిల్లలని అమ్మినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని కాస్త బుద్ధి చెప్పి వచ్చాం. అసలు ఆడపిల్లంటే అంత అలుసా? అని ఆ రోజంతా మనసు అల్లకల్లోలం అయ్యింది. ఆ గొడవ అయ్యేటప్పటికి రాత్రి 10 అయ్యింది. ఇంక గుడికి వెళ్ళాలన్న ఆలోచనే మరచిపోయాము.

ఇంక దశమి రానే వచ్చింది. ఇంటి నిండా జనాలతో పండగ వాతావరణము భలేగా అనిపించింది. సాయంత్రము బొమ్మలకొలువుతో పేరంటాళ్లలతో చాలా బిజీ అయ్యాము. సాయంత్రము ట్రైన్ కి వచ్చిన చుట్టాలందరు ఎవరిళ్లలకు వారు వెళ్ళిపోయారు. అప్పుడేనా కనీసం గుడికి తీసుకెళ్తారేమో అని ఆయన్ను అడిగితే..

" ఇప్పుడు గుడికి ఎందుకోయ్" అని అడిగారు.

చాలా ఉక్రోషం వచ్చేసింది.

" నవరాత్రులలో ఒక్క రోజు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు కూడా తీసుకేళ్ళరా? " అని నిలదీసా...

" నువ్వు చూడలేదేమో కానీ, నేను మాత్రం రోజు దర్శించుకుంటూనే ఉన్నాగా" అని అన్నారు..

" అంటే నన్ను తీసుకెళ్ళకుండా మీరొక్కరే వెళ్ళొచ్చేశారా? " అని అడిగా కాస్త గట్టిగా...

అందుకు ఆయన చిద్విలాసంగా..." నవరాత్రులలో మొదటి రోజు ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు.. వాళ్ళని ఆప్యాయతగా పలకరించి అన్నము పెట్టేటప్పుడు నీలో అన్నపూర్ణాదేవిని చూశాను, పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళల్లో కలిసిపోయినప్పుడు బాలా త్రిపుర సుందరిని చూశా, వాళ్లకి చదువు చెప్తున్నప్పుడు ఒక గాయత్రిని చూశా, వీణాపాణిగా ఉన్న నీలో సరస్వతినీ చూశా, కోపం వచ్చిన్నప్పుడు నీలో ఒక దుర్గ, మహిషాసురమర్ధినినీ చూశా... ఇంక రోజు సౌందర్యలహరిని చూస్తూనే ఉన్నా..." అంటూ నవ్వారు...

ఈ విషయము చెప్తోన్న అర్పిత కూడా సిగ్గుతో నవ్వింది. " ఇలా ఒక పొగడ్త విసిరేసి మొత్తానికి నన్ను నవరాత్రులలో గుడికి మాత్రం తీసుకేళ్ళలేదు ఆయన "అని చెప్పింది.

"నిజమే కదా అర్పితా! స్త్రీ ఒక శక్తిస్వరూపిణి... కొందరికి సౌందర్యలహరి, కొందరికి మహిషాసురమర్ధిని " అని అనేసి అలా ఇంటి దారి పట్టాను.

 

 

 

Friday, August 31, 2018

శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు

మిత్రులకు నమస్కారములు! నాదతనుమనిశం ఆ శంకరుడైతే... ఈ శ్యామసుందరుడు 'రాగా తనుమనిశం ... అనురాగా తనుమనిశం " . ఆ అనురాగం లో సగభాగం వారి అర్ధాంగి జయలక్ష్మి గారు. వీణకి తంత్రులులాగా వారు ఒకే రాగం పలుకుతారు.. అదే అనురాగము అను రాగం! తాళికి ముందు ద్వైతమై.. రాగ, తాన, పల్లవి అనే మూడుముళ్ళతో అద్వైతమయ్యారు ఈ సంగీత సహచరులు.  

 



 ఈ  నెల మన " ఎందరో మహానుభావులు "   శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు, వారి సతీ మణి శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారు!




Wednesday, August 15, 2018

స్వతంత్ర దినోత్సవం



ఈ రోజు స్వతంత్ర దినోత్సవం.. ఏదైనా స్పెషల్ గా వండాలనుకుంటూ ఫ్రిడ్జ్ తలుపులు తీశాను, దూట కనిపించింది.. దూట కొబ్బరికోరు వేసి పులిహార కూర చేసుకుంటే చాలా బాగుంటుంది కదా! పక్కనే ఒక ఆనపకాయ కనిపించింది.. పెరట్లో బచ్చలి ఆకులు బాగా పెరిగాయి, కసిన్ని బచ్చలి ఆకులు వేసి ఆనపకాయ ఆవపెట్టి పులుసు చేస్తే! ముద్దపప్పులోకి ఈ పులుసు చాలా బాగుంటుంది. మా మామ్మ అయితే పప్పు బాగా దోరగా వేయించి వండేది ఇత్తడిగిన్నెకి. మా చినమామ్మ గారు ఈ కందిపప్పుని 'మంగలం ' లో వేయించేవారు. మంగలం అంటే కుండకి ఒక వైపు కన్న ఉండేది, అందులో వేయించే వారు. ' ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ' అనే జాతీయం కూడా ఉంది. నా పెళ్ళికి పేలాలు కూడా ఈ మంగళం లోనే వేయించింది మా చినమామ్మ. చేతిలో పేలాలు వేస్తే రాత్రి కాలక్షేపానికి తినడానికి ఇచ్చారనుకొన్నా పెళ్ళిలో, నా ఆలోచన పసిగట్టి గురువుగారు "అమ్మాయి అవి తినడానికి కాదు ఆగు " అని వార్నింగు ఇచ్చారు.. ఇదే కోతి కొమ్మచ్చి అంటే ఒక విషయం లో నుంచి ఇంకో విషయానికి వెళ్ళిపొవడం. ఈ ఆలోచనలు కోతులే!


ఆ... ఏం చెప్తున్నాను.. ఫ్రిడ్జ్ లో కూరగాయలు వండాల్సిన వంట గురించి కదా! కొన్ని వంకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పచ్చని వంకాయలైతే కొత్తిమీరి కారానికి బాగుంటాయి, అదే నీలం వంకాయలైతే కారం పెట్టి కూరకి బాగుంటాయి.. అదే సంతర్పణ కూర, కోనసీమ వాలైతే ధనియాలు వేస్తారు, అదే విశాఖపట్టణం వాలైతే మెంతి కారం అని మెంతులు వేస్తారు. చిన్న చిన్న వంకాయలతో సివంగిపులుసు కూడా చేస్తారు. పక్కనే దోసకాయ కూడా ఉంది, దోసకాయ పచ్చడిముక్కలు తిని చాలా రోజులయ్యింది. రెండు ఆవపెట్టినవి అయితే బాగోదు వేడిచేసేస్తుంది, దోసకాయ టమాట ఇంగువ వేసి పచ్చడి బాగుంటుంది.. సింపుల్ గా!! 

 


అయినా స్వాత్రంత్ర దినోత్సవం నాడు కూడా ఈ వంటేమిటో? నాకూ స్వాత్రంత్రం కావాలి!! మా చిన్నప్పుడూ టి.వి. లో నవంబర్ 14 శనివారం న "మాకూ స్వాత్రంత్రం కావాలి " అనే సినిమా వచ్చింది. సినిమా అంతా కోతుల మయం, అప్పుడు దూరదర్శన్ తప్ప సినిమాలు చూడటానికి మరి వేరే దిక్కు లేదు.. మళ్ళీ మరునాడు ఆదివారం అదే సినిమా హిందిలో వచ్చింది. చాలా బాధ కోపం వచ్చేశాయి. (మళ్ళీ కోతి కొమ్మచ్చి).


అమ్మో ఇలా ఆలోచిస్తే పన్నెండు అయ్యిపోతుంది.. వండాల్సిన వాటికి కావల్సినవి తీసుకొని ఫ్రిడ్జ్ తలుపేసేశాను. అరగంటలో వంట రెడీ! టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి అందరినీ పిలిచాను. ముద్ద పప్పు, ఉసిరి పచ్చడి అన్నము వడ్దించా.. ఇంకా అన్నట్టు చూపులు! " ఇంకేంటి? ఇంతే ! " అని నేనూ శివగామిలా చూశాను.


మా చిన్నది " ముద్దపప్పు అన్నమా? నేను తినను! " అని అరిచింది. టి.వి. ఆన్ చేశాను "అభిరుచి ' లో రాజు గారు సొయా రైస్ చేయడం ఎలాగో చెప్తున్నాడు. అది చూస్తూ ఈ పప్పు అన్నము తినేసింది.


పొద్దుట నుంచి ఇదేనా వండావు? అని ప్రశ్న.. పొద్దుటే మా ఫ్రండ్ మాలతి పుట్టిన రోజు విష్ చేయ్యాలి కదా? ఆ తరవాత అర్పిత, శ్రీదేవి  వాట్స్ ఆప్ లో పెట్టిన చీరలు చూడాలి కదా!(కొన్నాకొనకపోయినా) ఆ తరవాత టి. వి. లో వచ్చిన అల్లూరి సీతా రామ రాజు, ఇంకో చానల్ లో హింది లో వస్తున్న సుభాష్ చంద్ర బోస్ చూడద్దు, అసలే దేశభక్తి సినిమాలు! పొద్దుటే సందీప్ పెళ్ళికి వినాయకుడిని మీదికడితే వెళ్ళొచ్చాను కదా పేరంటానికి! ఒక్కమనిషి ఇన్ని పనులు అసలు ఎలా చేసుకొగలుగుతోందన్న సానుభూతే లేదు జనాలకి! అయినా మొన్న శుక్రవారం తొమ్మిది రకాల పిండి వంటలు వండానా? ఇలా ఒకరోజు పొట్టకి పని తగ్గించాలి కదా!


" రెండు వారాల క్రితం కూరలు లేవని పప్పు అన్నము పెట్టావు, ఈ రోజు అన్ని కూరలు ఉన్నా పప్పు అన్నమే! " అన్న కామెంటు..


" ఏదీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ఉండటం... స్థితప్రజ్ఞత్వం అంటారు " అని అన్నాను.


ఇంకేదైనా అనేస్తారేమో అని వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఇచ్చిన 'నారదబ్బ కాయ " ఊరగాయ తెచ్చా. అబ్బా! ఆ నారదబ్బ కాయ వేడి వేడి అన్నములో కలుపుకొని నెయ్యేసుకొని తింటే!! ఆ ముక్క కమ్మటి పెరుగన్నములో తింటే!! ఇంక మాటలు లేవు.


ఈ ఆవకాయలు, ఈ నారదబ్బకాయలు.. జీవనదులు. పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వచ్చే నదులు కావు... నిత్య పుష్కరిణీలు ఇవి నాలాంటి వారికి!!





Friday, August 3, 2018

నాన్న

మన తెలుగు సినిమా పాటల్లో "నాన్న " మీద వ్రాసిన పాటలు (నాన్న నెత్తి మీదా, వీపు మీదా కాదు.. నాన్న ని ఉద్దేశించి వ్రాసిన పాటలు) చాలా తక్కువనే అనాలి. ఈ రోజు శృతిలయలు సినిమా చూశాను(ఎన్నోసారో గుర్తులేదు, లెక్కపెట్టనూ లేదు). కె. విశ్వనాథ్ గారు వారి సినిమాలో క్లైమాక్స్ పాటకి ఎప్పుడూ పెద్దపీఠే వేస్తారు.  అలాగే శృతిలయలు సినిమాలో షణ్ముఖ శ్రీనివాస్  డాన్స్ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ( శివతాండవం), తల్లి(సుమలత)వచ్చి తండ్రికి కొడుకుని పరిచయం చేస్తూ " తనదు వరసత్వము వారసత్వముగనిడి తనువిచ్చు తండ్రికిదే తొలివందనం ... తండ్రికిదే తొలివందనం " అని పాడుతుంది. పదప్రయోగం ఎంత బాగుందో కదా!

సినిమా పాటలలో "అమ్మ/తల్లి " కే అగ్రతాంబూలం ఇచ్చారు. పాపం "నాన్న " ఎప్పుడూ అమ్మ వెనకాలే..(పాటలలో కూడా). ఇంకో నాన్న పాట అనగానే గుర్తొచ్చేది " నాన్నా నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా  (ధర్మదాత) " .  అది కూడా తల్లి లేనందుకు ఆ నాన్న ని పొగిడారు తప్పా... తల్లి ఉంటే అంత పొగడ్తలు లభించేవి కాదు "నాన్న " కి.


ఇక తండ్రి గొప్పతనం చెప్పే అసలైన సిసలైన పాట "పాండురంగ మహత్యం " లో " దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి. ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని " అని తండ్రి యొగ్గ గొప్పతనము సముద్రాల(రాఘవాచార్య) గారు అద్భుతంగా చెప్పారు. బ్రహ్మోపదేశముతో ఇటు ఈ లోకానికి, అటు పరలోకానికి కావల్సిన పుణ్యం ఇచ్చేది తండ్రే కదా!

కొన్ని పాటలలో అయితే " తల్లితండ్రీ " అని ద్వంద సమాసంలో వారిని ఒకటిగా కలిపి పొగిడేస్తూ ఉంటారు, అందుకంటే అది అద్వితీయ బంధము. అంతెందుకు చిదంబరంలో ఉన్న "నటరాజస్వామి " భంగిమను గుర్తు తెచ్చుకోండి. ఆయన కుడి చేత్తో అభయహస్తం చూపిస్తూ ఎడం చెయ్యి ఎడం కాలు వైపు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఎడం భాగం "అమ్మది". అంటే " అమ్మ కాలు పట్టుకుంటే నేను మోక్షం ఇస్తాను అని అంటూ అగ్నిని ఒక చేత్తో పట్టుకొని మరీ అభయమిస్తున్నాడు ఆ జగత్ పిత. ఇవన్ని తెలుసుకున్నారు కాబట్టే రామదాసు కూడా "నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి " అని ఆ రామయ్య తండ్రి సిఫార్స్ చేశాడు.

ఏది ఎవైనా

" యే పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరము
యే పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
యే పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత ఝరము
యే పాద స్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరము

అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబులకెడమై
తపించువారి కావగల వారు లేరు, లేరు ఈ జగాన లేరే  
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా..." 

 

 

 

 

Tuesday, July 31, 2018

శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు

శుభోదయం!

ఆయన నడిచే వేదాలసారము... ఈ భూలోకానికి భగవంతుడి గురించి చెప్పి జనాలని సన్మార్గంలో పెట్టడానికి అవతరించిన "శుకమహర్షి " .. ఆయనే ప్రవచన పితామహులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు!  వారు వేదాలకే నెలవైన కుటుంబంలో ఆగస్ట్ 28,  1925 న జన్మించారు . వారి తండ్రి గారి పేరు శ్రీదక్షిణామూర్తి గారు. వారి విద్యాభ్యాసం వారి తాతగారైన శ్రీ రామకృష్ణ విద్వత్ చేనుల గారి వద్దే సాగింది. శ్రీ రామకృష్ణ విద్వత్ చేనులు గారు బహుభాషా పండితులు. చంద్రశేఖర శాస్త్రి గారికి తెలుగు సంస్కృత భాషలలో తర్ఫీదు ఇచ్చినది వారి తాతగారే! వారి తాతగారి అభిలాషమెరకే శ్రీచంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచనాలు చేయసాగారు.

శ్రీచంద్రశేఖ్ర శాస్త్రి గారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యతగా నియమించారు. భధ్రాచలంలో ప్రతి ఏటా జరిగే సీతా రామ కల్యాణం మాత్రం ఎవరూ మరచిపోని విధంగా వారు వ్యాఖ్యానించారు. "అమ్మా! సీతమ్మ.. కాస్త తల పైకెత్తి రాములు వారి వంక చూడమ్మా " అని వారు వ్యాఖ్యానించిన తీరు జనకమహారాజుని గుర్తు చేస్తుంది. వారు మన సమకాలికులు కావడం మన అదృష్టము. 

ఇప్పటికి వారు చేసిన ప్రవచనాలు వందలు దాటే ఉంటాయి. ఎన్ని ప్రవచనాలు చేసినా "పలికెడిది రామభద్రుండట " అని అంతా ఆ రామకృపగా భావించే భక్తాగ్రేసరులు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారు! వారితో నాకు లభించిన ఈ ఇంటర్వ్యూ వారి వినయానికి దర్పనం. నా మహద్భాగ్యం. 

గంగవెల్లువని చిన్న కమండలలో పట్టి తేవాలన్న నా అత్యాశకు మన్నించండి. కొన్ని కారణాలవల్ల వారు మొదట విడియో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. వారు సతిమణి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నా ఈ ప్రయత్నాన్ని పెద్దమనస్సుతో ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. నచ్చితే పొగడ్తలు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారికి, నచ్చకపోతే తిట్లు నాకు !!  

 

 

 

'అమ్మా' యి




కావేరి కి అమ్మని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంది. కావేరి చిన్న పిల్లేమీ కాదు ఇద్దరు పిల్లల తల్లి.


 పది రోజులు శెలవలకని  సంక్రాంతికి  వచ్చింది. ఆ పది రోజులు పది నిమిషాలలా గడచిపోయాయి. ఈ పది రోజుల్లో అమ్మ తనకి ఇష్టమైనవి అన్నీ వండి కొసరి కొసరి వడ్డిస్తూ కబుర్లు చెప్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ నవ్విస్తూ తనని మళ్ళీ ఒక చంటిపిల్లని చేసేసింది. సంక్రాంతి ముందు రోజు పిల్లలకి భోగి పళ్ళు పోసి పిల్లల చేత బొమ్మల కొలువు పెట్టించి మళ్ళీ తన  చిన్నతనాన్ని తనకి బహుమతిగా ఇచ్చింది. ఇంక నాన్నగారు పిల్లలకి కావాల్సిన జీళ్లు, తేగలు, మొక్కగుడ్లు తెచ్చిపెడుతూ అసలు వాళ్ళకి బోర్ కొట్టకుండా చూసుకొన్నారు. వాళ్ళని పొలానికి సాయంత్రము పూట తీసుకెళ్ళి బోరింగులో స్నానాలు చేయించి వాళ్ళ ముచ్చట్లు తీర్చేవారు.


ఆ ఇల్లు... అదే తన పుట్టిల్లు... తనకొక దేవాలయము. తన బాల్యమంతా అక్కడే గడచింది. అక్కడ ప్రతి చెట్టు, ప్రతీ గడప, ప్రతీ గోడ తనతో ఎన్నో ఊసులాడుతున్నట్టు ఉంటుంది.

 చిన్నతనములో తను ముగ్గు వేస్తూన్నంతసేపు తనకి కాపల కాస్తూ నిద్దర ఆపుకుంటూ ఉండేవాళ్ళు అమ్మ నాన్న.  తను అందరి కన్నా పెద్ద ముగ్గు వేయాలని చాలా పెద్ద పెద్ద ముగ్గులతో వాకిలి అంతా నింపే ప్రయత్నములో రాత్రి 11 వరకు ఉండేది. అంత వరకు ఎన్ని పనులున్న అమ్మ తనతో పాటే ఉండేది.  ఇప్పటికీ అలా ముగ్గు వేస్తుంటే అమ్మ నిద్దర ఆపుకుంటూ అరుగు మీద కూర్చునే ఉంది.  

తన చిన్నప్పుడు తనకి భోగి పళ్ళు పోసి దిష్టి తీసి ప్రపంచంలో తనే అమ్మ దృష్టిలో అందగత్తేనేమో అనిపించేలా చూసేది. సంక్రాంతి రోజు తన చేత బొమ్మల కొలువు పెట్టించి అన్ని బొమ్మలలో తనని మురిపాల పసిడి బొమ్మగా చేసేది.

ఇంక కనుమ రోజు తన చేతితోటే పని వాళ్ళకు బట్టలు, డబ్బులు, బహుమతులు ఇప్పించేది.

అమ్మ వాళ్ళ ఇంటిలో తనో యువరాణి. ఆడింది ఆట పాడింది పాట. తనకి ఇష్టమైనది ఏదైనా చేయటానికి ఎప్పుడూ అమ్మ రెడీగా ఉండేది. అదీ తను అడగకుండా తన మనసు గ్రహంచి మరీ తనకి ఇష్టమైనవి ఇచ్చేది.   ఒకసారి ఇంటికి వచ్చిన ఒక చుట్టాలావిడ " కావేరి! నీ బెస్ట్ ఫ్రండ్ ఎవరే? " అని అదిగింది. వెంటనే కావేరి " మా అమ్మే నాకు బెస్ట్ ఫ్రండ్ " అని అంది. ఆ మాటకి అమ్మ తెగ మురిసిపోయింది. నిజమే అమ్మ కన్న తనకి సన్నిహితురాలైన స్నేహితురాలు లేదు.....

ఇంత అపురూపంగా పెరిగిన తను ఎవరో ఒక ముక్కుమొహం తెలియని వాడి కోసం ఇంత ప్రేమగా చూసుకొనే అమ్మ, నాన్న ని వదిలి వెళ్ళిపోయిందా?

ఎప్పుడు శెలవకి వచ్చినా ఇలా చుట్టం చూపుగా అమ్మ నాన్నని చూసి వెళ్ళిపోవాలా? ఎప్పుడూ ఆడపిల్ల తల్లిదండ్రి వద్ద ఉండలేదా? ఆడపిల్ల అంటే ఆడ పిల్లేనా? ఇంతలా ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఎందుకుండాలి?  ఇంత అపురూపంగా పెంచిన అమ్మాయి పెళ్ళి అయ్యాక  పరాయి ఎందుకయ్యిపోతుంది?  

ఏంటో పొద్దుట నుండి ఎంత ఆపినా ఆగట్లేదు కన్నీళ్ళు, ఎక్కడ అమ్మ చూసి బాధపడుతుందో అని ఇలా పెరట్లో మొక్కలు, చెట్ల వైపుకు వచ్చి ఫోన్ లో ప్రండ్ తో మాట్లాడుతున్నట్లు  భారంగా తిరుగుతోంది కావేరి. దూరంగా చెట్టు మీద గువ్వలు అరుస్తున్నాయి.. గూడు వీడేడి వేళ, గూటికేగెడి వేళ పక్షి గొంతును మించి పాట గలదే...అన్న గరికపాటి వారి మాట గుర్తుకొచ్చింది. నిజమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ వాళ్ళ ఇల్లు వదినప్పుడు మనసుకి ఎన్ని భావాలో కదా?

అమ్మా.. అమ్మా అని గట్టిగా అమ్మని పట్టుకొని ఏడ్వాలని ఉంది.

అ...మ్మా...

అ... మ్మా...

తన గొంతు కాదు ... పెద్దగా వినపడుతోంది అరుపు... అది తన చిన్న కూతురి అరుపు...

"అమ్మా! అమ్మమ్మ నిన్ను రమ్మని పిలుస్తోంది" అని చెప్పింది.

"నువ్వు వెళ్లు.. నేను ఇదిగో వస్తున్నాను రెండు నిమిషాలలో"

అవునూ!!! అమ్మ కూడా ఒక అమ్మాయే కదా ఈ ఇంటికి వచ్చినప్పుడు, తన తల్లీదండ్రికి గారాలపట్టిగా పెరిగి నాన్న చెయ్యి పట్టుకొని, నాన్నతో పాటు నాన్న వైపు వాళ్ళందరికి ఆప్తురాలయ్యింది. ఇంటికి భాగ్యలక్ష్మిలా, ప్రేమమూర్తిగా నిలబడింది. అమ్మ పెళ్ళి చేసుకునేటప్పటికి నాన్న కూడా అమ్మకి పరాయి మనిషే కదా? మరి తనూ అంతే కదా... తనూ ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి... తల్లిగా తనూ పిల్లలకి ప్రేమ పంచాలి. మెట్టినింటిలో పుట్టింటి గౌరవం నిలపాలి. మెట్టినింటి వాళ్ళని తనవాళ్ళగా చూసుకోవాలి.  తన అమ్మలానే తనూ  తన పిల్లలకు  ఆదర్శం కావాలి.


తన ప్రశ్నలకి సమాధానము దొరికిందన్నట్లు చూసింది కావేరి తన కూతురి వైపు...

 




Saturday, June 30, 2018

డాక్టర్

" సహస్ర శీరుషః పురుషః సహస్రాక్ష సహస్రపాత్.... " అంటూ రోజు ఆ విరాట రూపాన్ని స్తుతిస్తూనే ఉంటాము. వేయి తలలతో, వేయి కళ్ళతో, వేయి చేతులతో ఎప్పుడూ ఆ స్థితి కారకుడు ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. కొందరు అతన్ని విష్ణువుగా పిలిస్తే, కొందరు శక్తిగా పిలుస్తారు, ఇంకొందరు విశ్వేశ్వరుడిగా మరికొందరి నారాయణుడిగా కొలుస్తారు. మరి కొందరు 'వైద్యుడి ' గా కొలుస్తారు.

కింద కనిపించే ఫొటో బెంగుళూరులో 'నారాయణ హృదయాలయ ' లోపలకి అడుగుపెడుతుంటేనే కనిపిస్తుంది. ఒకొక్క చేతిలో ఒక్కొక్క దేవత నివాసమున్నట్టుగా ఉన్న ఆ విగ్రహం. ఈ విగ్రహానికి ఇక్కడ పని చేసే డాక్టర్లకి సంబంధం ఏంటా అని ఆలోచించాను. ఆ విగ్రహం చూడగానే ' వైద్యో నారాయణో హరి ' అని గుర్తుకొచ్చింది. 

నిజంగా ప్రతి డాక్టరూ ఆ విగ్రహంలోలాగా ఒక్క నిముషములో వేయి తలల ఆలోచనలతో, వేయి చేతులు చేసే పనులతో ఎల్లప్పుడూ సహాయం కోసం నిలచి ఉంటారు. రాత్రనక పగలనక రోగులని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు.

వారి చేతుల మీద ఎంత మందికి జన్మనిచ్చినా వారు గర్వపడరు, వారి చేతుల మీద మరెంత మంది ప్రాణాలు పోగొట్టుకొనినా నిరుత్సాహపడని స్థితప్రజ్ఞులు. అందుకే ' తొలిదేబ్యో భిషక్ ' గా నమక చమకాలలో ఆ శివుడికి కొలుస్తున్నాము.

మెడలో పాముకు బదులు 'సెతస్కోపు ' తో.. పీతాంబరాలకు బదులు ' తెల్లటి ఆప్రాన్ ' తో హరిహరుల కలయిక రూపమై కనిపించే దేవతలే ఈ వైద్యులు. అప్పుడే పుట్టిన పాపాయిని మొట్టమొదటి సారి స్పర్శించేది వీరే! వారి సేవలు అనిర్వచనీయము. 

ఈ రోజు మా ఊరి డాక్టర్ గారు డాక్టర్ (ఖండవల్లి) సుబ్బారావు గారిని తలచుకోలేకపోతే అది విశ్వాసఘాతమే! ఆయన ఆ చుట్టుపక్కల ఊర్లకి 'దేవుడు " ... కాదు కాదు.. "వైద్యుడు "! ఎందుకంటే ఆ దేవుడు అందరికి కనపడడు, ఈయన అయితే పిలిచినవారిని ఎప్పుడూ అండగా ఉండేవారు! ఆయన ఇప్పుడు ఆ స్వర్గంలో వైద్యం చేస్తూ ఉండి ఉంటారు.

వైద్య వృత్తిలో ఉండి ఎంతో మానవసేవ చేస్తున్న డాక్టర్ మితృలకు అభినందనవందనం!






Monday, June 4, 2018

ప్రకృతి

మన పురాణాలు " పుష్పవాన్ అంటే తోటలు, పొలాలు కలగడం, ప్రజావాన్ అంటే మంచి సంతానం, కష్టసుఖాలు పంచుకొనే వారు ఉండటం, పశుమాన్ అంటే పాడి కలిగి ఉండటం " కలిగినవాడినే అసలైన శ్రీమంతుడిగా చెప్పింది. కానీ ఒక కండీషన్ ... నీటిలోన భగవంతుడు, ఆ భగవంతునిలో నీరు పరస్పరం ఆశ్రయాలై ఉన్నట్లు తెలుసుకున్నవారికి.. అంటే వారిద్దరూ అభేదం అని తెలిసుకొన్నవారికే ఈ ఆఫర్ అన్న మాట. ( చన్ద్రమా వా ఆపాం పుష్పం, పుష్పవా ప్రజావాన్, పశుమాన్ భవతి, య ఏవం వేద).

 

అలాగే అగ్ని నీటి మీద ఆధరపడి ఉంటుంది, నీరు అగ్ని మీద, వాయువు నీటి మీద, నీరు వాయువు మీద (అదే ) , అంతే కాక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆ నీటికి అధిష్టన దేవతలుగా భావించి వాటిని నమ్మి రక్షించేవాడే వేదాన్ని నమ్మేవాడు అని కూడా చెప్పింది. (అగ్నిర్వా అపా మాయతనం, వాయుర్వా అపా మాయతనం, ఆసోవై తపన్న పామాయతనం, చన్ద్రమా వా ఆపా మాయతనం). అంటే ఇవన్నీ నీటి మీద ఆధారపడి ఉన్నాయి, నీరు కూడా వీటి మీద ఆధారపడి ఉంది. ఇది తెలుసుకున్నవాడే వేదాన్ని తెలుసుకుంటాడు. పొద్దుటే పూజామందిరంలో ఈ మంత్ర పుష్పం చక్కగా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని చదివేసి.. ఒక పువ్వు తీసి ఆ విశ్వనాథుడి పాదాల దగ్గర పెట్టేసి.. వీటన్నిటి రక్షించేస్తానని సంస్కృతం లో వొట్టేసేసి బయటకి వచ్చి కాళ్ళు చేతులు కడుకోడానికో లేక మొహం కడుకోడానికో కుళాయి తిప్పేసి ఫోన్ లో మునిగిపోతూ ఉంటాము.

 

 

ఒక్కసారి సగరుల ని గుర్తుతెచ్చుకుందాము, భూమిని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తేనే కదా వారు అటు నరకానికి కానీ, స్వర్గానికి కానీ వెళ్ళని గతి పట్టింది. వారి కోసం గంగ వస్తే కానీ వారికి మోక్షం దొరకలేదు. ఈ రోజుల్లో మన కోసం తపస్సు చేసి ఏ గంగని భూలోకానికి దింపే వారసులు లేరు.. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాము.

 

 

మన పురాణాలలో ప్రకృతి పార్వతిదేవితో పోల్చారు. ఆవిడని గౌరవించి పూజించిన నాడు ఆర్తానాదులు పాలిట అన్నపూర్ణ అవుతుంది. ప్రకృతితో ఆటలాడితే మహప్రళయసాక్షిణి అవుతుంది.



Friday, June 1, 2018

సినిమా పిచ్చోళ్ళు

" నా ఆజ్ఞ దిక్కరించితే నీకు ఇంట్లో చోటు లేదు, నీకు నీ కుటుంబం ముఖ్యమో, లేక వాళ్ళు ముఖ్యమో తేల్చుకో, నీకు నేను కావాలో వాళ్ళు కావాలో నిర్ణయించుకో " ... ఏంటీ ఈ డైలాగు వింటే ఏదో సినిమాలలో మాట వినకుండా ఎవరినో ప్రేమిస్తొన్న కొడుక్కి తండ్రి ఇచ్చే వార్నింగ్ లా ఉంది కదా... అసలు విషయమేమిటంటే మా సినిమా యాక్టర్ ఆంటి వాళ్ళ అబ్బాయితో అన్న మాటలు. వాడు ఆ కాలనీలో ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఆవిడ వచ్చి వారసి గూడా లో వాళ్ల అన్న ఇంటికి వెళ్ళమని అంది, వాడు "ఊహూ ఆడుకుంటా " అని అన్నాడు.. అంతే ఈ డైలాగు వదిలింది ఆవిడ.

 

ఆ ఆంటీ పేరు నాకు గుర్తులేదు! కానీ ఆవిడ విపరీతంగా సినిమాలు చూసేది, వారానికి కానీసం లో కనీసం నాలుగు! అంకుల్ కి అస్సల్ సినిమాలంటే పడేది కాదు, సినిమాలకి డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. సినిమా టికేట్టు కోసం ఆవిడ ఇంట్లో పూలు, పళ్ళు, కాయలు, సగం వాడేసిన మావిడి కాయ ముక్కలు, మిగిలిపోయిన కాయగూరలు అమ్మేసుకునేది. 🤭🤭అప్పుడప్పుడు బియ్యమూ, పప్పులు, ఉప్పులు కూడా!! ఒక్కసారి అమ్మడానికి ఏవీ లేకపొతే ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు తాకట్టు పెట్టేసింది. నాకు ఆవిడ "సితామాలక్ష్మి " సినిమాలో తాల్లూరి రాజేశ్వరి లా అనిపించేది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కళ్ళు, నోరూ భలే తిప్పేసుకునేది. అప్పట్లో ఆ పేరు నాకు తెలీదు, అందుకు ఆవిడని "సినిమా యాక్టర్ ఆంటీ " అనేదాన్ని, పాపం తెగ మురిసిపోయి ముక్కలైపోయేది. వాళ్ళ అన్నయ్యకి కూడా సినిమాల పిచ్చి బాగా ఉండేది. అప్పుడప్పుడు అతను ఈవిడకి డబ్బులు ఇచ్చేవాడు.

 

ఆవిడకి ఒక కొడుకు, ఒక కూతురు, పేరు శ్రీదేవి, కృష్ణ. ఆంటీ సినిమా చూసీ ఆ సినిమాలో హీరోయిన్ లా చిత్ర విచిత్ర జడలు వేసేది శ్రీదేవికి. ఆ శ్రీదేవిని తయ్యారు చేసి " నా కన్నుల వెన్నెల, నా హృదయాలలో చిరు జల్లు నువ్వే " అని ముద్దు పెట్టుకునేది. ఈ హరివిల్లు, చిరుజల్లు, మమతల కోవెల, పులకింత, పాలపుంత వగైరా పదప్రయోగాలు ఆవిడ రోజూ వాడేది. ఏంటో మా ఇళ్ళల్లో ఇలా ఎప్పుడూ అనేవారు కాదేమో భలే నచ్చేసేవి ఆ మాటలు మాకు!

 

కృష్ణ ఎప్పుడేనా "అమ్మా! ఈరోజు సాంబారు చాలా బాగుంది " అని అంటే...

"అందులో నా ప్రేమ రంగరించాను, బాగోదా మరి " అనేది...

మా ఇళ్ళల్లో ఎప్పుడూ కారం, మిరియాలు, కొబ్బరే వేసేవారు ఈ సాంబారులో, ఈ రంగరించడం ఏంటో మరి!! 

 🤔

ఆవిడ అంతటితో ఆగలేదు, గోరింటాకు రుబ్బుతూ " గోరింటా పూసింది కొమ్మలేకుండా " అని, పూలు కోస్తొనప్పుడు "పూజ సేయ పూలు తెచ్చాను " అని, మరేదో పని చేస్తూ "ఆడది కోరుకునే వరాలు రెండే రెండు " అని పాడుకునేది.😀 

😆

ఇక ఆంటీ వాళ్ళ అన్నయ్య సిని యాక్టర్ "బాలయ్య " అభిమాని. చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ఎప్పుడూ పాతికమంది(ద)నేసుకొని తిరిగేవాడు. వాళ్లందిరిని బాలయ్య సినిమాకి తీసుకొని వెళ్ళి వారి తిండితిప్పలు చూసుకొనేవాడు. బాలయ్య సినిమా రిలీజు అయిన రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మొత్తం టికెట్లు ఆయనే కొనేసేవాడు. ఆయన పరివారం మొత్తం ఆ సినిమా చూడాల్సిందే!

 

ఆ అంకుల్, ఈ సినిమ యాక్టర్ ఆంటీ కలిసినప్పుడు చూడాలీ.. "రక్తసంబంధం " సినిమాయే!! "నీ ప్రేమే నాకు శ్రీరామ రక్షా అన్నయ్య " అని ఆవిడ అంటే, " నా కంటికి, మా ఇంటికి దివ్వెవు నువ్వే, ఒక కొమ్మకి పూసిన పువ్వులం మనము చెల్లెమ్మ " అని ఆయన అనేవాడు... ఒక్కొసారి వాళ్ళు చెప్పే డైలాగులు ఏ సినిమాలోవో మాకు తెలిసిపోయేవి కూడా! కానీ ఆ డైలాగులలో కామెడీ అప్పట్లో తెలియలేదు!!  

😄

ఆ అంకుల్ యంగ్ గా ఉన్న "వెంకయ్య నాయుడు " లా ఉండేవాడు. ఒకసారి ఆయనకి వ్యాపారంలో బాగా నష్టం వచ్చేసింది. పాపం చుట్టూ ఉన్న ఈ మంద ఒక్కక్కరే తప్పుకున్నారు. ఆ అంకుల్ కి మతి కూడా చెడిపోయింది. 😥రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఆయనలో ఆయనే గట్టిగా మాట్లాడేసుకునేవాడు. ఒకసారి ఇలా వెళ్తూ వెళ్తూ తప్పిపోయాడు. పాపం ఇంట్లో వాళ్ళు చాలా వెతికారు. ఆయనకి డిగ్రీ చదివే ఒక కొడుకు, ఇంజినీరింగు చదివే ఇంకో కొడుకూ ఉన్నారు. వాళ్ళు చెరో బైకు వేసుకొని మరీ ఊరంతా వెతికారు. అప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఆయన "తిరుపతి బస్సు " ఎక్కేశారని చెప్పారు. వెంటనే వాళ్ళు తిరుపతి బయలుదేరాలనుకున్నారు. తిరుపతి ఏదైనా చిన్న నగరమా ఆయన దొరకడానికి? అయినా బయలుదేరారు.

 

ఆ కొడుకులు తిరుపతి బస్సు దిగి ఒక పేపరు కొనుకొన్నారు. ఒక నిర్ణయానికి వచ్చినవారులా వెంటనే ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. ఒక సినిమా హాల్ కి వెళ్ళారు , ఆ సినిమా హాల్లో బాలయ్య " తల్లి తండ్రులు " సినిమా చూస్తూ కనిపించాడు వాళ్ళ 'కన్నతండ్రి"! 😎😎😍

Sunday, May 6, 2018

సరసాల జవరాలను

చిత్రం  :  సీతారామ కల్యాణం (1961)
సంగీతం  :  గాలిపెంచల నరసింహారావు
గీతరచయిత  :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం  :  పి. లీల   




పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ...

సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను...


మురిపాలు వెలబోయు భామలలోన
మురిపాలు వెలబోయు భామలలోన


సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను..



చరణం 1 :



బంగారు రంగారు మైజిగిలోన
బంగారు రంగారు మైజిగిలోన
పొంగారు వయసు పొంకములోనా


సంగీత నాట్యాల నైపుణిలోనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ
సంగీత నాట్యాల నైపుణిలోనా
నా సాటి నెరజాణ కనరాదుగా



సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను..



చరణం 2 : 


మగువల నొల్లని  మునియైనా
మగువల నొల్లని  మునియైనా
నా నగుమొగమును గన చేజాచడా


యాగము యోగము ధ్యానములన్నీ ...
యాగము యోగము ధ్యానములన్నీ ...
నా బిగికౌగిలి సుఖమునకేగా



సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను..

 

 

 


                    *****************************



ఈ పాట సీతారామ కల్యాణం సినిమాలోనిది. పాడినవారు పి. లీల, సంగీతం గాలిపెంచల నరసింహారావు,   సాహిత్యము  సముద్రాల రాఘవాచార్య.  ఈ పాట కుచలకుమారి మీద చిత్రీకరించారు. సినిమాలో ఆవిడ రంభగా నటించారు. రంభ తనని తాను పొగుడుకుంటూ పాడుకునే జావళి ఇది. ఇది తెలిసో తెలియకో రావణుడిని ఆకర్షించినందుకు ఈ పాట జావళి అయ్యింది. ఈ పాట అయ్యాకే రావణుడు రంభని బలాత్కరిస్తాడు, నలకూబరుడి శాపానికి లోనౌతాడు. (కొన్ని గ్రంధాలలో రంభే శపించింది అని కూడా ఉంది).   


ఈ జావళిలో రంభ తనను తాను పొగుడుకుంటూ "యాగము యోగము దానములన్నీ  నా బిగికౌగిలి సుఖమునకేగా " అని చాలా గర్వంగా అంటుంది. ఎన్ని తపస్సులైనా, ఎన్ని యాగాలైనా చేసేది స్వర్గం కోసమూ, ఆ స్వర్గ సుఖాల కోసమే కదా! ఆ స్వర్గంలో ముఖ్య ఆకార్షణ తనే (రంభే) అని ఎంత గర్వంగా చెప్పుకుందో కదా!



Thursday, May 3, 2018

మాధవపెద్ది సురేష్

మిత్రులకు నమస్కారములు! ఈ నెల ఎందరో మహానుభావు లలో తెలుగు సినీ సంగీత దర్శకులు "మాధవపెద్ది సురేష్ " గారు గురించి తెలుసుకుందాము. వారి సినీ సంగీతం వహించిన సినిమాలు రాశి తక్కువయినా వాశిలో ఎందరో హృదయాలు "మధురమే సుధాగానం " అనేటట్టు చేశాయి. వారు చాలా సౌమ్య భాషి, మంచి వ్యక్తి ఆయన. ఆయనకి తగిన ఇల్లాలే నిర్మల గారు(చిట్టి పిన్ని). మాధవపెద్ది సురేష్ గారి సంగీతమంత మాధుర్యం నిర్మల గారి వంట. ఆవిడ చేతి 'పండుమిరపకాయ పచ్చడి(కొరివికారం) ' సూపర్.. మాటలు లేవు! ఆ సంగీతం, ఈ వంటకం ఆస్వాదించాలి కానీ వర్ణించలేము.


సురేష్ గారూ, నిర్మల గారు! మీ పరిచయం ఒక అదృష్టం. ఎప్పటికీ మీ అభిమానాన్ని కోరుతూ.. మీ విశాలి.

 

 

 

 

Wednesday, April 25, 2018

నీవెంత నెరజాణవౌరా

  నీవెంత నెరజాణవౌరా...

ఈ రోజు మన "జావళి " జయభేరి సినిమాలోని "నీవెంత నెరజాణవౌరా " . ఈ పాట రాసినవారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు. మొట్టమొదట చెప్పుకోవాల్సినది ఒక మగవాడిని పట్టుకొని "నెరజాణ " అని సంభోదించడం. మల్లాదివారి  గురించి ఎంత చెప్పినా తక్కువే! తెలుగు పాటలని "చిరంజీవులు " చేసిన కలం ఆయనది. 

 

ఆయన బహుభాషావేత్త. బహుముఖప్రజ్ఞాశాలి. ఈపాటకి సంగీత దర్శకులు పెండ్యాలగారు. నృత్య దర్శకులు "వెంపటి పెద సత్యం " గారు. ఈ పాట విని పెదసత్యం గారు మల్లది వారితో "పాట కాస్త సరి చెస్తే నాట్యానికి బాగుంటుందండి. ఇక్కడ కాస్త అడుగులకి ఇబ్బంది అవుతోంది " అని అన్నారుట. అందుకు మల్లాది వారు " మిగిలిన పాటంతా బానే ఉంది కదా? ఈ చిన్న చోటే కదా? ఆ ఒక్క చోట అంజమ్మ (అంజలీ దేవి) ని కాస్త తల గోక్కోమని చెప్పండి, అందంగా ఉంటుంది " అనేసి కండువా దులిపి భుజాన వెసుకొని వెళ్ళిపోయారుట. ఈ జావళి మాత్రం అంజలీదేవి మీద కాకుండా ఆ నాటి నాట్యతార "రాజసులోచన " పై చిత్రీకరించారు. 

 

 

చిత్రం : జయభేరి (1959)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లాది
నేపధ్య గానం : ఎం. ఎల్. వసంత కుమారి 



పల్లవి :


నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ... 


అనుపల్లవి :

తెనెలు చిలికించు గానము వినగానే...
తెనెలు చిలికించు గానము వినగానే... ఈ మేను పులకించురా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  



చరణం 1 :



చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...
చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...


సిరిగన కనులాన.. ఆ... ఆ.. ఆ...
సిరిగన కనులాన.. సిగలో విరులానా
మౌనమే వినోదమా... ఇదే సరాగమా నవమదన


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  




చరణం 2 :



బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా.. స్వామీ
బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా..


మీరిన మోదాన వేమరు నిను వేడు
భామను వరించరా.. తరించరా...
శృంగారధామ ఏలరా... యీ మోడి చాలురా
సరసుడవని వింటిరా.. చతురత కనుగొంటిరా


వన్నె చిన్నె గమనించవేలరా... వన్నెకాడ కరుణించవేలరా
వగలొలికే పలుకులతో నను చేకొమ్మని... నీ కొమ్మని.. నీ సొమ్మని
దరా పురంధరా.. యిదే మనవీ మన్నన సేయరా నాదమయా
మనవి వినర... మనసు పడర పరమ రసిక శిఖామణి...




నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...