Search This Blog

Wednesday, January 9, 2019

మంచు తెరలు

                                                                

గత వారం రోజులుగా ఒకటే పొగమంచు. సూర్యుడిని చూసి వారమౌతోంది. వాతావరణం అంతా మసకమసకగా ఉంది... కీర్తన మనసులా..


స్టవ్ మీద పాలల్లో బియ్యం  కుతకుతలాడుతూ ఉడుకుతోంది....  కీర్తన ఆలోచనలూ అలానే ఉన్నాయి. ఎంత సంభాలించుకుంద్దామన్నా ఆలోచనలు "ఆమె "  వైపే వెళ్తున్నాయి. మనసులో ఎంత మధనపడుతున్నా అడగడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు. అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? తను చేసిన తప్పు ఏవయ్యి ఉంటుంది? లంచ్ అంతా రెడీ చేసి, పాయసం చేస్తూ  అతని కోసం ఎదురుచూస్తోంది  కీర్తన. గన్ట క్రితం 'ఆమె ' నుంచి ఫోన్ వచ్చింది.. వస్తుంటే కారు ఆగిపోయిందిట వచ్చి పిక్ అప్ చెసుకోమని. వెంటనే తన భర్త "ఆమె " ని తీసుకొని రావడానికి బయలుదేరాడు.


 

***************


మూడు నెలల క్రితం కీర్తన భర్త మురళి "ఆమె " గురించి చెప్పాడు. ఆమె పేరు " సంజన" ట.  గుజరాతి అమ్మాయి. మురళి ఆఫీస్ లో ఆరు నెలల క్రితం జాయిన్ అయ్యిందిట. ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్ లో ఉండటంతో కలిసి లంచ్ లు, కార్ పూల్ లు సహజంగా జరుగుతూనే ఉన్నాయిట. ఇవేవీ అంతగా పట్టించుకోలేదు కీర్తన. కానీ ఒకరోజు మురళి  "నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను " అని పక్కన కూర్చొని తనతో అన్నాడు.


"సంజన నన్ను ఇష్టపడుతోంది... తను డైవర్సీ, నాతో కలిసి ఉంటానంటోంది. ఒకరోజు లంచ్ కి పిలుద్దామనుకుంటున్నాను, ఎల్లుండి ఆదివారం తనని పిలుస్తున్నాను " అని తన అభిప్రాయం కనుకోకుండా ఆఫీస్ కి టైం అవుతోందని లేచి వెళ్ళిపోయాడు.


***********


పాలు పొంగి చేతి మీద పడటంతో వాస్తవంలోకి వచ్చింది కీర్తన. ఇప్పుడు ఆ అమ్మయిని ఎందుకు తీసుకొస్తోనందుకు? మురళి అతని  ఇల్లు, వాకిలి చూపించి... ఇంకొన్ని రోజుల తరవాత " అవి నీవే " అని చెప్పడానికా? పదేళ్ళ కాపురంలో ఏ రోజూ అతని అభీష్టానికి వెతిరేకంగా తను ప్రవర్తించలేదు. అతని అమ్మని అతని కంటే ఎక్కువగా చూసుకుంది. అతని వైపు చుట్టాలు కూడా తనని చాలా ఇష్టపడతారు. మరి ఎందుకు ఇప్పుడీ కొత్త మోజు? పాయసం లో గరిటకు దాని రుచి తెలీదు, అలాగే ఈ మగాళ్ళకు భార్య విలువ తెలీదు.  పిల్లల పెంపకంలో కానీ, వాళ్ళ చదువులో కానీ ఏ రోజూ మురళి సాయాం లేకుండానే అన్నీ సమర్ధించింది తను. మరి ఏ తక్కువ చేశానని మురళి ఈ దారి వైపు వెళ్ళాడో... అన్ని ఆలోచనల మధ్యలో పాయసం అయితే పూర్తి చేసింది కానీ మనసు మనసులో లేదు.  కార్ హారన్ తో ఒక్కసారి ఉలికిపడింది. రావల్సిన టైం వచ్చేసింది.. "ఆమె " అదే సంజన వచ్చేసింది. తను ఇప్పుడు వెళ్ళి ఇద్దరికీ హారతి ఇచ్చి స్వాగతం చెప్పాలా? " భగవంతుడా ఇలాంటి పరీస్థితి ఏ భార్యకూ రాకూడదు. మురళి కారు దిగి , పక్కకు వచ్చి కార్ వెనక డోర్ తీసి సంజనను ఇంట్లోకి రమ్మన్నట్టు సైగతో ఆహ్వానించాడు. సంజనతో పాటు ఐదేళ్ళ బాబు కూడా వచ్చాడు. ఆ బాబు సంజన కొడుకని కిటికీలోనుంచి చూస్తొన్న కీర్తన అర్ధం చేసుకుంది.


"కీర్తి... కీర్తీ.. " అరచుకుంటూ  ఇంట్లోకి హడావిడిగా వచ్చాడు మురళి...


మురళి వెనకాలే సంజనా, కొడుకు.


" నేను చెప్పాను కదా ... మా ఆఫీస్ లో పని చేసే ఆమె .. సంజన అని " అని పరిచయం చేశాడు.


కీర్తన చేతులు జోడించి నమస్తే చెప్పింది.. సంజన మొదట "హాయ్ " చెప్పింది కానీ కీర్తన నమస్తే చెప్పడం తో ఆమె కూడా నమస్తేనే చెప్పింది.


ఇంట్లోకి రాగానే సంజన కొడుకు " ఈ ఇల్లు చాలా బాగుంది.. మనం ఇక్కడే ఉండిపోద్దామా " అని అడిగాడు


మురళి... " ఈ ఇల్లు ఆంటీది.. ఆంటీ ఒప్పుకుంటే ఉండిపోవచ్చు " అని అన్నాడు...


హ్మ్మ్.. పిల్లాడి దగ్గర నుంచి ప్రిపేర్ అయ్యిపోయి వచ్చేసినట్టున్నారని మనసులోనే అనుకుంది కీర్తన.


చిరునవ్వు నవ్వుతూ " మంచి నీళ్ళు కావాలా? " అని అడిగింది. వాళ్ళ సంభాషణ మొత్తం హింది, ఇంగ్లీష్ లోనే జరుగుతోంది.


"పర్లేదు.. వద్దు " అని సంజన అంది.


" కీర్తన మాత్రం లేచి వంటింట్లోకి వెళ్ళి మూడు గ్లాసులతో మంచి నీళ్ళు తీసుకొని వచ్చింది.


"పిల్లలు ఎక్కడకి వెళ్ళారు? " అని అడిగింది సంజన


"వాళ్ళ నాన్నమ్మతో ఊరు వెళ్ళారు రేపు వచ్చేస్తారు " అని సమాధానం చెప్పింది కీర్తన.


ఇంటికి వచ్చినప్పటి నుంచి కీర్తనని చూస్తూనే ఉంది సంజన. ఈ విషయం కీర్తన కూడా గ్రహించింది. కానీ పట్టించుకోనట్టుగానే ఉంది. సంజన  పాతిక నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటుంది . కానీ నిత్యం బ్యూటీ పార్లర్ కి వెళ్ళే రకం అని మొహం చూస్తేనే అర్ధమవ్వుతుంది. అందువల్లనేనేమో వయస్సు ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే నమ్మేయవచ్చు. నార్త్ ఇండియన్ ఏమో మంచి రంగు, సన్నగా నాజూకుగా ఉంది.   సంజనని చూశాక కీర్తన మనసు ఇంకొంచం కలత చెందింది. "చిదిమితే పాలుగారే మొహం సంజనది, తానేమో చామన ఛాయ , సంజన స్టైల్ గా ఉంటుంది, తానేమో పాత చింతకాయ పచ్చడిలా మొహానికి పౌడర్ కూడా రసుకోదు , సంజన జట చక్కగా కట్టింగ్ చేయించుకొని అలా వదిలేసుకొని ఉంది, తానేమో పెద్ద జడ వేసుకొని జిడ్డుమొహంతో ఉంది... బహుశా ఇందుకేనేమో భర్తకు ఆమె నచ్చింది " అని అనుకొంది.


మనసులోని భావాలు ఏవీ బయటపడనివ్వకుండా చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంది కీర్తన. భోజనాల దగ్గర " ఇన్ని రకాల వంటకాలు ఎందుకు చేశారు? " అని అడిగింది సంజన...


"మామూలుగా హాలీడే రోజు మేము రెండు కూరలు, పప్పు, రసం, పచ్చడి తో తింటాము, ఆయనకి అలానే ఇష్టం " అని అంది కీర్తన...


"నేను రోజు ఒక దాల్, లేకపోతే ఒకసబ్జీ చేస్తాను  అంతే... ఇన్ని రకాలు ఇంట్లో ఏదైనా పండగ అప్పుడే లేకపోతే ఇంటికి ఎవరేనా వస్తేనే చేస్తాము " అని అంది సంజన.


" మీ వంట నేను మురళి టిఫిన్ బాక్స్ లో నుంచి చాలా సార్లు తిన్నా , ఇన్ని ఐటంస్ మీరు ఒక్కరే ఎలా చేశారు? పొద్దుటే లేచి చేసారా? " అని అడిగింది సంజన...


"లేదు తను ఒక్క గంటలో ఇరవై మందికి వండగలదు , అదీ రుచి చూడకుండా పెర్ఫెక్ట్ గా " అని అన్నాడు మురళి.


"వంటలు ఎంత బాగా చేసినా మిమల్ని మెప్పించలేకపోయాను కదా " అని మనసులోనే అనుకుంది కీర్తన.


భోజాలు కడుపు నిండా తిన్నాక మురళి సంజనకి ఇల్లు చూపిస్తూ మేడపైకి తీసుకొని వెళ్ళాడు.. వాళ్ళ వెనకాల కీర్తన , సంజన కొడుకూ వెళ్లారు, మేడ పైన వీణలు చూసి " ఇవి ఎవరు వాయిస్తారు " అని అడిగింది సంజన


" ఇవి కీర్తనే వాయిస్తుంది, తను వీణ కూడా నేర్పిస్తుంది... ఇదిగో గోడ మీద పైంటింగ్ కూడా కీర్తన వేసినదే, ఈ పాట్ పైంటింగ్ కూడా తనదే, కర్టేన్స్ మీద పైంటింగ్స్ తనవే... " అని ఒక్కొక్కదాన్నే చూపించాడు మురళి...


బాల్కనిలో మొక్కలు, వాటికి వచ్చిన పూలు కాయలు, పళ్ళూ చూసి ఆశ్చర్యపోయింది సంజన. ఇంత తక్కూ స్థలంలో ఇన్ని మొక్కలు, వాటికి ఇన్ని పూలూ కాయలా? అని అంది...


"గార్డనింగ్ అంతా కీర్తిదే... నేను ఏ రోజు మొక్కకి నీరు పోసింది లేదు "


"  కష్టపడితేనే మొక్కలు పెరుగుతాయి, కానీ కలుపు మొక్కలు వద్దంటేనే వస్తాయి " అని అనాలనుకుంది...కానీ అనలేకపోయింది కీర్తన....


వాటిని కీర్తనని మార్చి మార్చి చూడసాగింది సంజన. కబుర్లతో సాయంత్రం అయ్యిపోయింది. "ఇక బయలుదేరుతా " అని బ్యాగ్ తీసుకుంది సంజన...కానీ సంజన కొడుక్కి వెళ్లడ ఇష్టం లేదు... "మనం ఇక్కడే ఉండిపోద్దాం.." అని మారాము చేశాడు.


"హాలీడేస్ వచ్చినప్పుడు మళ్ళీ రా " అని చేతిలో చాక్లెట్లు ఇచ్చింది కీర్తన...


"పద మనం వెళ్ళి సంజనని డ్రాప్ చేసి వద్దాము " అని అన్నాడు మురళి.


సంజన కి రాత్రికి తినుబండారాలు ప్యాక్ చేసి ఇచ్చింది కీర్తన.


కార్ దిగి సంజన మురళి పక్కకు వచ్చి " కీర్తనని చూస్తుంటే చాలా జెలసీ గా ఉంది " అని అనేసి పిల్లాడిని తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో కీర్తన సంజన కొడుకుతో మాట్లాడుతోంది.. కానీ ఆ మాట కీర్తన చెవిలో పడినట్టు మురళి, సంజన గ్రహించలేదు.


సంజనని దింపి కారులో ఇంటికి వస్తునప్పుడు ఇద్దరి మధ్యలో మౌనమే రాజ్యం చేసింది. సాయంత్రం ఆరు దాటిందేమో దారి ని కప్పేస్తూ పొగమంచు. మంచుపొరల కన్నా మనసులో పొరలే దిట్టంగా ఉన్నాయి...


రాత్రి కీర్తనకు నిద్దర పట్టలేదు. ఇప్పుడు ఇంట్లో తన స్థానం ఏంటో అర్ధం కావడం లేదు. ఇంట్లో ఉండాలా? ఒకవేళ మురళి ఇంత్లో నుంచి వెళ్ళిపొమ్మంటే... బ్రతిమాలాలా? లేక వెళ్ళిపోవాలా? వెళ్తే ఎక్కడకు వెళ్ళాలి? ... పొద్దుట ఐదు అయ్యేటప్పటికి లేచి ఈ అలోచనలతో సోఫాలో కూలబడింది.


ఎప్పుడు లేచాడో కానీ మురళి రెండు కాఫీ కప్పులతో కీర్తన దగ్గరకు వచ్చి ఒక కపు కీర్తనకిచ్చి " నీ అంత బాగా కాఫీ కలపలేను కానీ... ప్రస్తుతానికి ఇది తీస్కో... " అని ఇచ్చాడు.


మురళి వైపు కాస్త ఆశ్చర్యంగా చూసింది కీర్తన.


కాఫీ సిప్ చేస్తూ మురళి  "   సంజన చాలా తెలివైన పిల్ల , కానీ అంత కన్నా మొండిది, మంకుపట్టుది. తను చాలా డిప్రషన్ లో ఉంది, భర్త డ్రగ్ ఎడిక్ట్, చాలా టార్చర్ పెట్టాడుట, తను చిన్న పిల్ల చెప్పినా వినిపించుకోదు "


"తను ఎర్రగా బుర్రగా ఉంటుంది, నేనే రంగు తక్కువా, ఊరి దానిలా ఉంటాను " అని ఎన్నో అనాలనుకున్నా.. కీర్తన నోటంపట ఈ మాటొక్కటే వచ్చింది... బహుశా అడగడానికి సంస్కారం అడ్డొచ్చింది కాబోలు..


 "  తనని ఇంటికి పిలిచి నీ మనసు బాధ పెట్టానా?నిన్నూ, నీ పద్దతినీ, నా జీవితంలో నీ స్థానాన్ని ఒక్కసారి సంజనకి చూపించాలని తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయికి ఏ విధంగా చెప్పాలో అలా చెప్పాలనుకున్నా, నిన్ను చూశాక అర్ధమయ్యింది,   ఆ అమ్మాయికి నేను ఎంత అద్రుష్టవంతుడినో అని... " తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది కీర్తన...


" నువ్వు పాత చింతకాయ పచ్చడి అని అనుకుంటున్నావు... నాకు మాత్రం నువ్వు బాపూ బొమ్మవి, పెళ్ళి చేసుకున్నప్పు డు నిన్ను ఎంత ఇష్టపడ్డానో ఇప్పటికీ అదే ఇష్టంతో ఉన్నాను. పైపై మెరుగులకి ఎట్రాక్ట్ అయ్యేవాడిని కాదు, ఎవెరెస్ట్ శిఖరం ఎక్కినవాడు ఇసుక తిన్నెలు ఎక్కాలనుకోడు, పెసిఫిక్ ఓషన్ ఈదినవాడు పిల్లకాలువలు ఇదాలనుకోడు " అని తనదైన స్టైల్ లో చెప్పాడు మురళి...


తూరుపున లేలేత సూర్య కిరణాలు మంచుతెరలను తొలగించుకుంటూ మరో శుభోదయానికి నాందిపలుకుతూ వస్తున్నాయి...

Friday, January 4, 2019

అ ' పరిచిత '




ట్రైన్ బెంగుళూరు లో మొదలయ్యింది. అప్పుడప్పుడే ఎండలు మొదలవుతున్నాయేమో చాలా వేడిగా ఉంది. ఒక్కసారి రైలు బయలుదేరాక చల్లగా అనిపించింది.  పొద్దుట నుంచి ప్రయాణ హాడావిడిలో ఉన్నారేమో జనాలు రైలు ఎక్కగానే కాస్త  స్థిమిత పడ్డాక కారేజీలు తీసి భోజనాలు మొదలెట్టారు. నేను భోజనం చేసి  బయలుదేరాను కాబట్టి ఏమీ తినలేదు. అందరూ తినగానే ఎవరి బెర్తుల వైపు వాళ్ళు వెళ్ళి కాసేపు నడుము వాల్చారు. నేను ఏదో పుస్తకం పట్టుకొని చదువుతున్నాను.

నా ఎదురుగా ఒక జంట వాళ్లకి ఇద్దరు పిల్లలు పాపకి ఏడూ ఎనిమిదేళ్ళ   మధ్య ఉంటుంది వయసు.  బాబుకి మూడేళ్లు ఉంటాయి. పదేళ్ళ నుండి బెంగుళూరులోనే ఉంటున్నారుట ... అతని పేరు ముకుంద్, అతని భార్య పేరు శిరీషట.   ఇంకో పెద్ద జంట యాభై పైనే ఉంటుంది వారి వయసు. అతని పేరు సూర్యనారాయణ  భార్య పేరు శైలజ , కొడుకు ఇంటికి వెళ్ళి వస్తున్నారుట. ఇవన్నీ రైలు ఎక్కిన అరగంటలో అయిన పరిచయాలు.


రైలు కుప్పం దగ్గర ఆగింది.. కొందరు పుస్తకాలు అమ్మే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అమ్మే పుస్తకాలలో 'చందమామ ' కూడా ఉంది. నేను కొనుకున్నాను.. ఇంకా వేరే ఏ పుస్తకాలు ఉన్నాయో అని చూస్తుండగా... ఒక 'ఆవిడ ' పెద్ద సూట్ కేస్తో హడావిడిగా రైలు ఎక్కింది . సన్నగా, పొడుగ్గా ఉంది.  నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలిపేసినట్టుగా తెల్లవెంట్రుకల  మధ్యలో నల్ల వెట్రుకలతో జుత్తు చిన్న ముడి, ఒంటి మీద ఏ రకమైన నగ నట్ర లేదు.. చేతికి వాచి తప్పా. నీలి అంచుతో తెల్లటి ధర్మవరపు చీర, డబ్భైలో జయసుధ వేసుకొనే కాలర్ బ్లౌజ్ తో ఉంది.  అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఏదో తెలియని అందం ఉంది ఆవిడలో. మా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. బహుశా అదే 'పెద్ద ' ఆభరణమేమో ఆవిడకి. మా పక్కనే కూర్చుంది. కాస్త ఆయస పడుతోంది.    డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాల అతనిని పంపేశాను.

మా వైపు చూసి " హడావిడిగా ఎక్కేశానండి.. నెక్స్ట్  స్టాప్ లో దిగి వేరే బోగి లోకి వెళ్తాను " అని మెల్లగా చెప్పింది. 

"పరవాలేదండి, మంచి నీళ్ళు కావాలా   " అని అడిగాను.

"థాంక్స్ తల్లి, కాసేపాగి తాగుతాను " అని తన హాండ్ బాగ్ నుంచి నీళ్ళ బాటిల్ బయటకు తీసుకొంది. 

రెండు నిమిషాలు ఆయసం తీర్చుకున్నాక నా చేతిలో 'చందమామ ' చూసి...

"ఒకప్పుడు ఉన్న కథలు ఇప్పుడు లేవమ్మా... ఒకప్పుడు కథలు బాగుండేవి.. ఇప్పుడు ఏదో అభిమానం కొద్ది కొంటున్నాము కానీ ఆ సారం లేదమ్మ " అంది ఆవిడ.

"అవునండి " అన్నాను నేను.

"  'చందమామ 'లో వచ్చే ప్రతీ కథ ఒక అపురూపమైన జ్ఞాపకం అమ్మా, ముఖ్యంగా 'తోక చుక్క ' ,  ' కంచుకోట ' ,'  రాకాసిలోయ' మొ!!  కథలు కల్పితాలైన ఎంత బాగుండేవో ? రాసిన ఆయిన దాసరి సుబ్రహ్మణ్యం గారు శైలి కూడా బాగుందేది,  ఆ కథలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆశక్తిగా చదివేవాళ్ళం. మళ్ళీ వచ్చే నెల పుస్తకం కోసం ఎదురు చూపులు చూసేవాళ్ళం,   అసలు పిల్లలు తెలుగు నేర్చుకున్నారంటే కారణం ఆ అపురూపమైన పుస్తకాలే కదండి, ఈ రోజుల్లో అటువంటి పుస్తాకాలేవీ?  " అని వాపోయింది. 

మా మాటలన్నీ ఆశక్తిగా వింటున్నాను. నాకు నిజంగా 'చందమామ ' లో కథలు "దాసరి సుబ్రహ్మణ్యం గారు ' రాశారన్న సంగతి తెలియదు.

" మా నాన్న గారు చిన్నప్పటి నుంచి ఈ 'చందమామ ' కొనేవారండి. అంతకు ముందు వచ్చినవి కూడా బైండింగ్ చేసి ఉంచారండి. ఇప్పటి పాత 'చందమామ ' లు మా ఇంట్లో ఉన్నాయి  " అని అన్నాను.

" నీ పేరు ఏంటమ్మా? " అని అడిగింది ఆవిడ.

"సుగాత్రి అండి " అని చెప్పాను.

" భలే మంచి పేరు,  నీ పేరుకి అర్ధమేంటో తెలుసా? " అని అడిగింది

" ఆ తెలుసండి...  మంచి గాత్రము కలది..., కళాపుర్ణోదయం లో  నాయిక పేరు సుగాత్రి, అలాగే సరస్వతిదేవి సహస్రనామాలలో ఒకటి సుగాత్రి. "

" ఈ పేరు పెట్టుకున్నారంటే మీ తల్లితండ్రులకి మంచి టేస్ట్ ఉందని తెలుస్తోంది. " అంది ఆవిడ

" అవునండి మా నాన్న గారికి తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టము ... మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టము " అని చెప్పాను.

" సంగీతము మనము మనతో మాట్లాడుకోడానికి ఉన్న ఏకకైక భాష, సాహిత్యము మనమేమిటో మనకి చెప్పేది.. "ఏకమాపాత మధురం..... అన్యదాలోచనామృతం ' ఇవి లేని జీవితాలు నిస్సారాలే తల్లీ " అని అంది. 

ఇంతలో ముకుంద్ పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే " నో బేటా, కం అండ్ సిట్ హియర్.. ఐ విల్ గివ్ యూ చాక్ లెట్ ఇఫ్ యూ లిసిన్ టు మి " అంటూ ఇంకా ఏదో అంటున్నాడు.

వాళ్ల వైపు అలాగే చూస్తూ ఉంది ' ఆవిడ ' ...

" వేర్ ఆర్ యూ ఫ్రమ్ " అని అడిగింది

" కాకినాడ " అని చెప్పాడు ముకుంద్

" తెలుగు వాళ్ళు కాదా? " అని అడిగింది

" అబ్బే! తెలుగు వాళ్ళమేనండి... " అన్నాడు ముకుంద్ కొంచం ఇబ్బందిగా.

" మరి.... ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరు తెలుగులో మాట్లాడటం లేదు... "

" ఓ.. అదా.. మా పిల్లలు బెంగుళూరిలో పుట్టారు,   వాళ్ళ కోసం మేము ఇంట్లో ఇంగ్లీష్, హింది మాట్లాడుతాము, బయట ఇబ్బంది పడకూడదు కదండి  " అని నవ్వుతూ జవాబిచ్చాడు ముకుంద్.

" అదేంటయ్యా! ఇంత పసి పిల్లలకి ఏ భాషా  సరిగ్గా మాట్లాడటం రాదు....ఏ భాషైనా అర్ధం చేసుకోగల నైపుణ్యం మాత్రం ఉంటుంది... అదీ తల్లి లాలనతో చెపితే ఇంకా చక్కగా అర్ధం చేసుకుంటారు.  మీరు ఇలా మీ మాతృభాషని పిల్లలకి తెలియకుండా పెంచుతూ ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? వాళ్లకి నాన్నమ్మ, అమ్మమ్మ  తాతగార్లతో మాట్లాడే అవకాశం మీరు ఈ విధంగా కట్ చేసేస్తున్నారు. పిల్లలకి ఇంకో భాష తెలిస్తే తప్పేంటీ?

మన ముత్తాతలు గ్రాంధికంలో మాట్లాడుకునే వారుట, అప్పట్లో ఆడవాళ్ళు కూడా 'అమరకోశం '  చదువుకొని చాలా పదాలకి అర్ధలు తెలుసుకునే వారుట. మన తాతల దగ్గరకు వచ్చే సరికి గ్రాంధికం తగ్గింది... కొంచం వాడుక భాష వచ్చింది. పోనీ అదీ ఒకందుకు మంచిదే అనుకున్నాము.. మంచి మంచి పుస్తకాలు అందరూ చదివే అవకాశం వచ్చిందని ఆనందించాము.  మన దగ్గరకి వచ్చేసరికి వాడుక కూడా పోయీ.. 'తెలుగు ' కి 'తెగులు ' పట్టేసింది. ఇంక మన తరవాతి తరానికి వచ్చే సరికి 'సమాధులు ' కట్టేసే సమయం వచ్చేసింది. పిల్లలకి ఇంగ్లీష్, హింది మాట్లాడటం ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు.. ఈ రోజుల్లో స్కూల్లో అవి వాళ్లంతట వాళ్ళే నేర్చుకుంటున్నారు. కానీ మాతృభాష మాత్రం నేర్పవలసింది మాత్రం 'తల్లిదండ్రులే ' ఇంగ్లీష్, హింది నేర్చుకోవల్సిన అవసరం చాలా ఉంది కానీ మాతృభాష ని నేర్చుకోకుండా అవే నేర్చుకోవడం సబబు కాదు..
'ఆవు పాపు శ్రేష్టమైనవే... అలా అని గేదె దూడ ఆవు పాలు తాగదు కదా? .. పశువుల్లో ఉన్న ఇంగితం మనకు లేదా?'  " అంటూ కాస్త కోపంగా, బాధగా చెప్పుకుపోతోంది.

ఆవిడ మాట్లాడుతున్నంత సేపు అందరూ ఆవిడ వైపే చూస్తూ ఉండిపోయాము. మంచి వాక్పటిమ ఉన్నావిడే!! 'ముకుంద్ ' మొహం లో చిరాకు, విసుగు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి 'ఆవిడ ' మాటలకి.

పక్కన కూర్చొని వింటున్న సూర్యనారాయణ గారు " అవునండి.. ఇప్పుడు మేము మా కొడుకింటి నుంచి వస్తున్నాము... మా మనవలకి ఇంగ్లీష్, హింది తప్ప వేరే భాష రాదు. మాకు ఇంగ్లీష్ హింది అర్ధమౌతాయి కానీ మాట్లడలేము. వాళ్ళని దగ్గరకు పిలిచి కథలు చెపుద్దామంటే భాషే పెద్ద ఆటంకం అయ్యింది. హాయిగా మాట్లడలేని పరీస్థితి మాది. వాళ్ళు మాకు ఇన్నాళ్లైనా 'దగ్గర ' కాలేకపోయారు.. కారణం ...'భాష ' " అని ఆయన బాధ చెప్పుకొన్నారు.

వీళ్లందరూ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ముకుంద్ కి, అతని భార్యకి కొంచం ఇబ్బందిగా అనిపించింది. వాళ్ల పిల్లలకి వీడియో గేంస్ ఇచ్చి పక్కకు తీసుకెళ్ళెపోయారు మమల్ని ఎవాయిడ్ చేస్తూ. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.

ఇంతలో 'చాయ్ ' వాడు వస్తే అందరూ 'చాయ్ ' తీసుకున్నారు.. నేను  రెండు 'టీ ' లు  తిసుకొని ఆవిడకు ఇచ్చాను. 

"పర్లేదండి.. నేను ఇస్తా ' అని చాలా బలవంతం పెట్టినా సరే ఆవిడే 'టీ ' వాడికి డబ్బులు ఇచ్చింది.

టీ తాగుతున్నప్పుడు అందరూ ఏదీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. 

" ఇంతకీ మీరేమి చేస్తూంటారు? " అని అడిగాను మౌనాన్ని ఛేదిస్తూ.. 

" నేను ఒక రైటర్ ని అమ్మా!, సాహిత్యము నా ఊపిరి " అని చెప్పింది ఆవిడ.

ఆవిడ రైటర్ అనగానే ఒక్కసారి అంతా ఆవిడ వైపు చూశారు.. 'ముకుంద్ ' తో సహా...

"ఏవేవి రాసారండి? "  అడిగాను

" చాలానే రాసానండి, రాసిన చాలా వాటికి వాజ్ పయ్ , పి.వి. నరసింహా రావు గారు, వేటూరి గారు మొ! వాళ్ళ నుండి ప్రశంసలు కూడా వచ్చాయి. " అని చెప్పింది

మేమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాము. ప్రముఖులతో ఆవిడ పరిచయాలు, సాహిత్యములో ఆవిడకు తెలిసిన విషయాలు చెప్తుంటే అంతా మంత్రముగ్ధులై వింటున్నాము. 

"ఢిల్లీ  లో మా ఇల్లు ఒక ' భువన విజయం ' లాగానే ఉండేది.  ఎంతో మంది కవులు పండితులు మా ఇంటికి వస్తూ ఉండేవారు.  మీరు ఎప్పుడేనా ఢిల్లీ వస్తే మా ఇంటికి రండి. " అని చెప్పింది.    

"మరి మీరు ఇక్కడకు ఎందుకొచ్చారు? అని అడిగాను....

ట్రైన్  ఆగడంతో ఆవిడ "సరేనమ్మ.. నేను వేరే బోగికి వెళ్తాను.. మీతో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.. " అని అంత పెద్ద సూట్ కేస్ మోసుకుంటూ దిగింది. సాయం చేస్తానని ఆ సూట్ కేస్ తీసుకుంటుంటే వారించింది  "నా పని నేనే చేసుకోవాలన్న స్వార్ధం ఉంది నాకు " అని నవ్వేసింది.

నా ప్రశ్నకు జవాబు ఆవిడ నుండి దొరకలేదు.

ట్రైన్ కదిలింది.. టి.సి.. అటువైపు గా వెళ్తోంటే టి.సి ని అడిగాను..

" ఒక పెద్దావిడ  అరవై డభై ఏళ్ళ మధ్యలో ఉంటుంది.. వేరే బోగిలోకి వెళ్తానని చెప్పింది.. ఆవిడ వేరే భోగి ఎక్కిందా సార్? " అని

"ఒక పెద్ద సూట్ కేస్ ఆవిడేనా? సన్నగా పొడుగ్గా ఉంటుంది ఆవిడేనా? " అని అడిగాడు

" అవునండి " అని అన్నాను

" ఆవిడ దిగి వెళ్ళిపోయింది... " అన్నడు

"అదేంటీ? " నేను ఆశ్చర్యంగా అన్నాను..

"ఆవిడకి మతి స్థిమితం లేదండి.. ఇలాగే వారానికో పది రోజులకోసారి ఒక గంట రెండు గంటల ప్రయాణం చేస్తుంది. మళ్ళీ స్టేషన్ లో దిగి వచ్చిన దారినే వెనక్కు వేరే ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతుంది.  ట్రైన్ లో కనపడిన వాళ్ళతో కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకుపోతూ ఉంటుంది. ఆవిడకు ఒక్కడే కొడుకట, అతను వేరే దేశం అమ్మాయి పెళ్ళి చేసుకొని అక్కడే పరాయి దేశం లో స్థిరపడిపోయాడుట. ఇక్కడకు రాడు, ఈవిడను అక్కడకు తీసుకెళ్ళడు.  తెలుగు లెక్చరెర్ గా చేసి రిటైర్ అయ్యింది.    మంచి రచయిత కూడా.  భాషాభిమానం ఎక్కువయ్యి ఇలా అయ్యిపోయింది. అప్పుడప్పుడు కొన్ని స్కూల్స్ కి వెళ్ళి 'తెలుగు ' లో మాట్లాడమని పిల్లలకు చెపుతూ ఉంటుంది. ఇవన్నీ నాకు ఆవిడ స్టూడెంట్స్  చెప్పారు ఇలాగే ప్రయాణం లో కలిసినప్పుడు.  బాగా బ్రతికినావిడే... ఎప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు ఆవిడ.. కబుర్లే బోలేడు చెప్తుంది.. అదో రకం.. అంతే " అని వెళ్ళిపోయాడు.  

నమ్మలేకపోయాను నేను టి.సి. మాటలని.

" నాకు ఎందుకో ఆవిడ పిచ్చిదనే అనిపించింది ఆ వాగుడికి. ఇలా తిక్క తిక్కగా వాగుతోంది కాబట్టే పిల్లలు భరించలేక వదిలేశారు, పిచ్చి మొహంది. భాష , సేవ ఇలాంటి తలతిక్క కబుర్లు చెప్తోంది కాబట్టే ఎవరూ పట్టించుకోరు.... పిచ్చిది నోరు మూసుకొని ఎక్కడో మూల కూర్చోకా ఊరు మీద పడి ఇలా ఈ పైత్యపు వాగుడెందుకో.. షిట్.. కబుర్లలో పెట్టి  ఎవరి దగ్గరేనా  దొంగ తనము కూడా చేస్తుందేమో !! బ్లెడీ... ఇలా తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడూ ఏ రైలు కింద పడో...."

"జుస్ట్ షట్ అప్ " అని గట్టిగా అరిచాను....

అంతా నావైపే చూస్తున్నారు....

"ఎవరికి పిచ్చి? భాష ని కాపాడాలని సాయశక్తులా ప్రయత్నిస్తోన్న ఆవిడకు కాదు 'పిచ్చి ' .  తల్లీతండ్రులని సరిగ్గా చూసుకోలేక వదిలేసిన ఆ కొడుక్కి  'పిచ్చి ',  పర భాష వ్యామోహం లో పడి మాతృభాష కి నీళ్ళొదిలేసిన మీలాంటి వాళ్ళకి 'పిచ్చి ', ఆవిడ కనీసం మన దగ్గర 'టి ' కూడా తీసుకోడానికి ఇష్టపడలేదు.  అలాంటావిడ దొంగతనం చేస్తుందనా మీకు భయం. ఎవరో ఆవిడకు మతిస్థిమితం లేదన్నారని మిగిలినవి మనం ఊహించేసుకోవడమే? మీకు పిల్లలతో మాట్లాడటానికి 'తెలుగు ' పనికి రాలేదు , కానీ ఆవిడని అసభ్యంగా తిట్టేటప్పుడు  'తెలుగు ' గుర్తుకొచ్చిందా? " ఒక్క నిముషం ఆగాను... 

" మీకు ఆవిడ మొసగత్తెగా, పిచ్చిదనిలా కనిపించిందేమో... నాకు మాత్రం చిక్కి శైల్యమై పోతున్న ఆదరణకు కరువైన,  అనాధ అయిన  'తెలుగు తల్లి ' గా కనిపిస్తోంది ఇప్పుడు. తనని కాపాడమని,  బ్రతికించమని ఇలా ప్రతీవారినీ దీనంగా వేడుకుంటోంది.  మీకు కుదిరితే చేతనైతే మాతృభాషలో మాట్లాడండి... 'తెలుగు ' బ్రతికించండి. లేకపోతే మీ  ఏడుపేదో మీరు ఏడవండి.. అంతే కానీ ఇలాంటివాళ్లని 'పిచ్చి వాళ్ళు ' అని ముద్ర వేసి మీ సంస్కారాన్ని బయట పెట్టుకోకండి " అని రాగల పర్యంతంగా వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ అన్నాను. 

" అవునమ్మా.. ఆవిడ పిచ్చిది కాదు " అని సముదాయిస్తూ అన్నారు సూర్యనారాయణ గారు, ఆయన భార్య.

కూర్చొని వెనకకు వాలగా.. ఏదో గట్టిగా తగిలింది. అది ఒక పుస్తకం లాంటి డైరీ! అందులో ఫొటోలు, కొన్ని కవితలు ఉన్నాయి. కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పుస్తకం. చదువుతుంటే ఎక్కడో చదివనట్టు ఉంది.. అవును.. అది అది.. ' సుగాత్రి ' గారివి. ఆవిడ మీద అభిమానంతోటే మా నాన్నగారు నాకా పేరు పెట్టారు. అవును ఆవిడ గొప్ప సాహిత్యాభిమాని "సుగాత్రి " !!