Search This Blog
Thursday, December 21, 2017
Wednesday, December 13, 2017
ఆనందం
ఆనందం ఎక్కడ ఉంది? ఖరీదైన వస్తువులలోనా? పెద్ద పెద్ద బంగ్లాలలోనా? కాస్ట్లీ బట్టలలోనా? ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే ఎన్ని గ్రంధాలు తిరగెయ్యాలి? ఎంత మంది గురువులని ఆశ్రయించాలి? ఇవన్నీ ఒక ఎత్తు.. ప్రకృతి పార్వతీ దేవి స్వరూపంగా భావించే వారికి ప్రతి అణువు ఒక పాఠమే! ప్రతి జంతువు, ప్రతి పునుగు మనకు ప్రతి నిత్యం ఏదో ఒకటి భోధిస్తూనే వుంటుంది.
అసలు విషయానికి వస్తే.. గత నెల్లాళ్ల నుంచి మా ఇంటి కిటికీ దగ్గరకు ఒక పక్షి పొద్దుటే అదేదో డ్యూటికి వచ్చినట్టువస్తోంది. సాయంత్రం చీకటి పడెవరకు ఆ కిటికీ బయట నుంచి దాని మొహం దానికి కనిపిస్తోందేమో, రోజూ ఆ ప్రతి బింబంతో పోట్లాటే! ఆ కిటికీ దాటాక ఏ లోకం ఉందో అని దాని ఆలోచనో ఏమిటో మరి! దాని ముక్కు ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం కూడా వేస్తుంది అది కిటికీని కొట్టే విధానం చూస్తే! ఒకసారి ఆ కిటికీ తలుపు తీసి "అంత అందమైనది కానే కాదు పిచ్చమ్మ " అని చెప్పాలనిపిస్తుంది.
ఇంకో విషయం... మా పనిమనిషి కూతురు. దాని పేరు సత్య. రోజూ రాగానే "ఆంటీ బిస్ కెట్లు " అంటుంది. బిస్ కెట్టు ఇస్తే కొన్ని సార్లు తింటుంది, మరి కొన్ని సార్లు దాచుకుంటుంది. కానీ ఈ రోజు అది ఆ బిస్కెట్టు పాకెట్టు తీసుకొని అద్దం లో చూసుకొంటూ డాన్స్ చేస్తుకుంటూ పాటలు పాడుకోసాగింది. చాలా సేపు దాని వైపు ముచ్చటగా చూస్తూనే ఉన్నా! తరవాత ఆ బిస్కెట్లతో బ్రిడ్జ్ కట్టింది, ఇంకా ఏవేవో కట్టింది.
సాయి బాబా జీవిత చరిత్రలో "ఈశావాస్యోపనిషత్ " ఘట్టం గుర్తొచ్చింది. లేదన్న చింతన లేదు, ఉందన్న గర్వం లేదు. ఎప్పటికీ నిలిచే ఆనందమే... నిత్యానందం... బ్రహ్మానందం.!!
Sunday, December 3, 2017
వోలేటి పార్వతీశం
వోలేటి పార్వతీశం గారు... ఒక గొప్ప రచయిత, వ్యక్త, నిగర్వి, సాహితీవేత్త, పరిశోధకుడు, అన్నిటినీ మించి... ఒక మంచి వ్యక్తి! దూరదర్శన్ లో 'జాబులు - జవాబులు " లో తనదైన ఒక ముద్ర వేసుకొన్న వారు. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వోలేటి పార్వతీశం గారి మనువడు. విద్వత్కవి శ్రీ కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు. సుప్రసిద్ధ గేయకవి "శశాంక గారి " తనయుడు. ఇవి వారికి జన్మతహ లభించిన అదృష్టాలు.
వారిది శ్రవణ సుభగమైన కంఠస్వరం. ఎన్నో అర్హతలు కలిగినా ఏమాత్రమూ అహం లేని గొప్ప వ్యక్తి వారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు ప్రసారమాధమానికి సేవలందించారు. గంభీర గళంతో, స్వచ్ఛమైన భాషణంతో, అచ్చమైన భావంతో, అందమైన లాస్యంతో తెలుగు భాషకే వన్నె తెచ్చిన నిలువెత్తు తెలుగు సంతకం... వోలేటి గారు!!
ఏమాత్రము గర్వమూ, అతిశయోక్తి లేకుండా వారి గురించి తెలుసుకోడానికి వెళ్ళిన నాతో వారి జీవిత విశేషాలు చెప్పారు.
ఇప్పటికీ ఎన్నో సాహితీ సభలకు అధ్యక్షత వహించి ఎంతో సాహితీ సేవ చేస్తున్న 'మహానుభావులు" !! ఆ మహానుభావుడి ద్వారా విన్న ఆయన జీవిత విషయాలు మీతో పంచుకుంటున్నాను.
Thursday, November 9, 2017
పాటలతో.... పాట్లు
"గుడివాడ వెళ్లాను గుంటూరు పోయా... " పాట పూర్తవ్వలేదు... నెత్తి మీద ఠంగుమని మోగింది. ఒక్కసారి దక్షుడి 28 మంది కూతుర్లు కనిపించేశారు. ఇంతకీ నేనేం తప్పు పాడానని ఇలా ముదస్తు హెచ్చరిక లేకుండా ఈ పిడుగు ? (అదే మొట్టికాయ) , అదే ప్రశ్నార్ధకమైన మొహంతో చూశాను అమ్మమ్మ వైపు. " ఇలాంటి పిచ్చి పాటలు పాడకు" అన్న వార్నింగ్ ఇచ్చింది. ఇది పిచ్చిపాట ఎందుకయ్యిందో ఆలోచించే వయసు కాదు. చిన్నప్పుడు కొన్ని పాట పాడితే, గుళ్ళో గంట కొట్టినట్టు ఇదిగో ఇలా మొట్టికాయలు పడిపోతుండేవి. ఎప్పుడేనా బాత్ రూం లో గట్టిగా పాడేసుకుంటుంటే మా అమ్మమ్మ వచ్చి " ఇలా పాటలు పాడుకునే బదులు, ఎక్కాలు చదువుకోవచ్చు కదా " అని అనేది. ఎంత ఐనస్టీన్ అయినా ఆనందానికి " న్యూటన్స్ లా " నో "ఆర్కమెడీస్ తియరీ " ఓ చదువుతాడేంటీ? ఈ అమ్మమ్మల చాదస్తం కాకపోతే!
చిన్నప్పుడు ఇలాగే బోలెడు పాటలకి అర్ధాలు తెలియకుండా పాడేసేవాళ్ళము. ఒకసారి.. కాదు మొదటి సారి నేను టేప్ రికార్డర్ లో విన్న పాట "శంకరాభరణం " . ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు. ఆ పాటలో "రసికులకనురాగమై " అన్న చోట అర్ధం కాలేదు. (మిగితాదంతా అర్ధమయ్యిపోయినట్టు అనుకోకండి). అంటే ' రసికులు ' అనేది అంత వరకు వినని పదం. ఆ రికార్డ్ లో ఒక చోట పాపం ఒకాయన "ఖళ్ళు ఖళ్ళు " అని దగ్గాడు కదా, ఆయనకి పాపం జ్వరం వచ్చింది, అందుకే 'రసుకులు " (rusks) అని పాడి ఉంటాడు. ఇలా తోచిన అర్ధం వెతికేసుకున్నాను.
అలాగే "మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు " లో "పదిలంగా " అన్న పదం. వాళ్ళ ఇంటి చుట్టూరా దండం కట్టుకొని పది లంగాలు ఆరేసేవాళ్ళేమో అని అనుకునేదాన్ని. ఆ పది పట్టులంగాలూ ఏ రంగువయ్యింటాయో అని ఊహలు కూడా ఉండేవి. కొన్నేళ్ళ తరవాత " ఈ గాలి ఈ నేల (సిరివెన్నల ) " పాటలో " నా కళ్ళ లోగిళ్ళు " విన్నాను. పాపం కళ్ళు లేవు కదా ఆ అబ్బాయికి అందుకే కళ్ళు గిళ్ళమంటున్నాడనుకునేదాన్ని. (దీనికి దానికి సంబంధమేంటీ అని అడగొద్దు).🤔
ఒకసారి మా పక్కింటి స్వరాజ్య లక్ష్మి అక్కని చూసి వెంకట్ అన్న" ఆ జడ పొడుగు మెడ నునుపు చూస్తుంటే " అనీ, " అడగక ఇచ్చిన మనసే ముద్దు లో... " చెక చెకలాడే " లైన్ పాడాడు. స్వరాజ్యం అక్క సిగ్గు పడింది. అదే నేను పాడితే మూతి మీద సిక్సర్ పడింది! 😷
ఒకసారి మా ఇంట్లో మా తాతగారి తల్లిగారి తద్దినం అయ్యింది. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే అన్నట్టు, 'తద్దినం కూడా తాంబూలాలు " లాంటిదే కొన్ని ఇళ్ళల్లో. (పెళ్ళికి ముందు తాంబూలం కాదు... భోజనం అయ్యాక తాంబూలం అన్న మాటా) . అదీ మనవలూ, మునిమనవలూ ఉన్న ఇళ్ళల్లో. ఇంట్లో గాడిపొయ్యె మీద వంట. గుండిగళ్ళతో హడావిడిగా ఇంట్లోకి బయటకు తిరిగే బాబయ్యలు, మావయ్యలు. నేనూ , మా కజిన్ వీధిలో రెండు స్థంబాలాట ఆడుకుంటున్నాము. ఆడుతూ పాడుతూ పరిగెడుతుంటే ఆకలి తెలియదని, గట్టిగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నాము. నేను 'బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే " అని పాడితే, మా కజిన్ "కాపురమొస్తే కాదంటానా " అంటూ పాడటం మొదలెట్టింది. అంతే... వెనకాల నుంచి ఎవరో మమల్ని గుండిగలు ఎత్తినట్టు ఎత్తుకొని పెరట్లోకి తీసుకెళ్ళిపోయి.. ప్రైవేట్ చెప్పేశారు! హన్నా... మేము చిన్నవాళ్ళమా.. చితకవాళ్ళమా? మా అంతటి వాళ్లము మేము. అయినా కాపురం అంటే డబ్బాల్లో పప్పులు, ఉప్పులు సర్ధడమే అని మా చినమామ్మ చెప్పింది. " పెద్దత్త కాపురానికి వెళ్తోంది " అని అన్నప్పుడు , "కాపురం అంటే ఏంటీ " అని అడిగాను, అదిగో అప్పుడు చెప్పింది. 😎😎
ఈ పైత్యం ఇటు తెలుగులోనే కాదు, హిందిలోకీ పాకింది. "క్యా హువా తేరా వాదా , ఓ కసం ఓ ఇరాదా " వచ్చినప్పుడు ఆ పాడేవాడు లెఖల మాస్టారేమో అని అనుకునేదాన్ని. ఎందుకంటే " ఒక్క సమ్ము చేయరాదా " అని అంటున్నట్టుగా ఉండేది. అలాగే జంగిలి సినిమాలో " ఎహసాన్ తెరా హోగా ముఝ్ పర్.... పల్ఖోంకి చావ్ మే రెహనేదో " నాకు "పళ్ళు తోముకొని చావు " అనేటట్టు వినపడేది. పాపం ఆ హీరో పాచి పళ్ళతో తిరుగుతోంటే హీరోయిన్ "పళ్ళు తోముకోమంటోంది " అని అనుకునేదాన్ని. " సంఝోతా గమోసే కర్లో " పాట "సంజోతా సమోసే కర్లో " లా వినపడీ, సమోసాలు అమ్ముకొనేవాడి పాటెమో అని ఊహించుకునేసేదాన్ని. 🤩😋
అప్పుడు ప్రైవేటు చెప్పినా, ఒన్ డే ఇంటర్నేషనల్ ఆడేసినా ఇప్పుడా పాటలు వింటే మాత్రం... పాటలతో పడిన ఆ పాట్లు... భలే నవ్వు తెప్పిస్తాయి. 😁
Thursday, October 26, 2017
కాదేది దొంగతనానికి అనర్హం
ఏంటో ఈ రోజు పొద్దుటే నాకు మా ఊరిలో "పాపి ' గుర్తుకొచ్చింది. పాపి ఎవరూ? ఆ వృతాంతం ఎట్టిది? అనగా... పాప మా ఊరిలో పొలం పనులు చేసుకొనే అమ్మాయి.. యువతి.. అన్న మాట. అసలు పేరు ఏంటో తెలియదు. కానీ ఆమె చేసే దొంగతనాలకు ఆ ఊరి ప్రజలందరూ ఆమెని 'పాపి " అని కసిగా పిలుచుకొనేవారు. పొద్దుట ఎవరింటి ముందు నుంచేనా వెళ్తే చాలు... సాయంత్రానికి వారింట్లో వస్తువులు కనపడేవి కావు. కాదేది దొంగతనానికి అనర్హం అనే రీతిలో దొంగతనం చేసేది 'పాపి '.
అందరి ఇళ్ళల్లో దొంగతనం చేసే పాపి మనసు ఆదే ఊర్లో ఉంటొన్న 'ఇటికెడు ' దొంగలించేశాడు. 😍ఇటికెడు పాపి ని మించిన దొంగ కావడంతో వారి సంసారం 'మూడు దొంగతనాలు ఆరు దోపిడీలుగా ' సాగింది. వారి దోపీడీలకు చిహ్నాలుగా ఒక కొడుకు, ఇద్దరు కుతుర్లు... ఇలా ముగ్గురు పిల్లలూ పుట్టారు. 😍😍😍🤩 వాళ్ళ సుపుత్రుడు పుడుతూనే నర్స్ చేతి ఉంగరం దొంగలించేశాడని చెప్పుకుంటారు. 😎
ఒకసారి మా ఇంట్లో పప్పు గిన్నె పోయింది. మా మామ్మ పరవాన్నముతో ఆ గిన్నె పాపికి ఇచ్చింది. ఇంక అంతే... గిన్నె ఇవ్వలేదు సరిగదా... " గిన్నె ఎప్పుడిచ్చారు " అని ఎదురు ప్రశ్న వేసింది పాపి. ఇక తప్పేది లేదని ఒకసారి వీధిలోకి వచ్చిన 'పేరూరు ' ఇత్తెడి గిన్నెల అతను వస్తే కొనడానికి అనుకుంది మా మామ్మ. ఆ ఇత్తెడి గిన్నెల అతను కొన్ని గిన్నెలు చూపించాడు, ఒక గిన్నే అచ్చు మా ఇంట్లో పోయిన పప్పు గిన్నెలా ఉందని అదే గిన్నె తీసింది మా మామ్మ. దాని మీద పేరు చూసి అవాక్కయ్యింది. " కొ|| సు|| శాస్త్రి " అని ఉంది. అది మా తాతగారి పేరు. నా పోస్ట్లు తిరిగి మళ్ళీ నాకే వాట్స్ ఆప్ మేసేజ్ వచ్చినట్టు మా పప్పు గిన్నె మళ్ళీ మాకే వచ్చింది.😉 ఆ గిన్నె వివరాలు ఆ 'పేరూరి ఇత్తడి సామాన్ల " అతన్ని అడగగా, అది 'పాపి ' అమ్మినట్టు తెలిసింది. 'పాపి ' ని అడిగితే అంత నోరేసుకొని మరీ పోట్లాడేది. దానితో గొడవ ఎందుకులే అని ఇలానే చాలా మంది వదిలేసేవారు.
ఒకసారి దొంగతనానికి వెళ్ళిన ఇటికెడు, వాడి కొడుకు ఆ పొలంలో కరంటు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. ఊరి జనాల శాపానికే వాళ్ళు పోయారని 'పాపి ' ఇంకా కసిగా దొంగతనాలు చేయడం మొదలెట్టింది. పాపి దొంగతనాల్కి ఎక్కడా అదుపు ఆపు లేకుండా పోయింది ఆ ఊర్లో!! ఒకసారి నరాయణ మూర్తి అనే రైతు అంత వరకు అతని అరటి తోట కి సేవ చేసుకొని అన్నం తినడానికి వెళ్ళాడు, అన్నం తిని వచ్చి చూస్తే అరటి గెలలు మాయం. సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి 'పాపి ' ని వెతుకుంటూ వెళ్తే అప్పటికే ఆ అరటి తోటలో గెలలు తీసేసి మార్కెట్టు లో అమ్మేసి ఆ డబ్బుతో 'కల్లు ' తాగేసి ఇంట్లో దొర్లుతూ ఉంది 'పాపి '. అసలే 'పాపి ' పైగా 'కల్లు ' తాగింది... ఇంక తన జోలికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని ఆ రైతు ఇంటి ముఖం పట్టాడు. 🤬🤬
ఇంక ఊరు జనం తట్టుకులేక పంచాయతిలో వారి గోడు వెళ్లగక్కుకుంటే 'పాపి ' కి ఊరి నుంచి బహీష్కరింపు వేశారు పంచాయతి వారు. కొన్ని రోజులకి తాగి తాగి మతి స్థిమితం తప్పింది పాపికి. పాపం ఆమె కూతుర్లు ఆమెని బానే చూసుకోసాగారు. రోజూ ఇంట్లో కనీసం పది రూపాయిలైనా ఆమెకు కనిపించెలా పెట్టేవారు. ఆ డబ్బు ఎవరూ చూడకుండా దొంగలించేసేది 'పాపి ' ఆ డబ్బు తిరిగి కూతురికి ఇచ్చి దానితోటే కూరలు కొనమనేది. ఏ వస్తువూ దొంగతనం చేయలేని రోజున ఏవీ తినేది కాదు పాపి. మంచం మీద పడ్డాక కూడా చేతిలో ఎంతో కొంత డబ్బు పెడితే కానీ మందు వేసుకొనేది కాదు పాపి. పోయే ముందు కూడా చేతిలో పది రూపాయిలు పెడితే కానీ ప్రాణం పోలేదు పాపికి!! 😥
ఇంతకీ పాపి ఎందుకు గుర్తొచ్చింది అనేగా మీ ప్రశ్న. పొద్దుట వీధి గుమ్మం తలుపు తీయగానే ఒక తాడు వేళాడింది. అది భగత్ సింగ్ సినిమాలో అజయ్ దేవగన్ కి మొహం మీద వేసినట్టు నా మొహం మీదకి ఉంది. కెవ్వు మని అరవలేదు కాని భయపడ్డా.... ఆ తాడు చూసి పాము అనుకొని... తీరా తేరుకొని చూస్తే అది గుమ్మానికి కట్టిన గుమ్మెడి కాయకి కట్టిన తాడు. ఎవరో దిష్టి గుమ్మెడి కాయ దొబ్బేశారు. ఈ పాటికి అది ఏ పులుస్లోనో ముక్కయ్యి ఉంటుంది. కాదేది దొంగతనానికి అనర్హం....!!!😁😁
😁
Monday, October 9, 2017
గరికిపాటి నరసింహారావు గారు
" కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయ్ నవతరానికి " అని మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా ప్రస్తుత యువతరానికి తన మాటలతో ఉత్తేజాన్నిచ్చే వారు ఇన్నాళ్ళకు దొరికారు. ప్రవచనాలంటే కాటికి కాలు చాపుకొనేవారే వింటారు అనే అపోహ ఈయన ప్రవచనం వింటే తొలగిపోతుంది. ఏ ప్రవచనం విని యువత లో ఒక వివకానందుకు వెలుగుతాడో.. ఆ ప్రవచనం ఆ గరికపాటివారి సొంతం. ప్రస్తుతం సమాజం లో ఉన్న కుళ్ళును తన మాటలతో ఉతికిపారేసే నైజం వారిది. ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. నిద్రాణమైన యువత శక్తిని మేల్కొలిపే నవరసగూళికలు... వారి మాటలు.
వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. వారి గురించి చెప్పడం ముంజేతి కంకణానికి అద్దం చూపడం లాంటిదే! కానీ వారి గురించి చెప్పడం లో చాలా ఆనందం ఉంది. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మిత్రులు పెద్దమనసుతో ఆశ్వాదిస్తారనే ఆశిస్తున్నాను.
ఈ సాహితీ రంగంలో అపార కృషి చేస్తున్న గరికిపాటి గారు కవి, పండితులు, అవధాని, గ్రంధ రచయిత, ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రవచనకర్తగా రాణిస్తున్నారు. సమ్రుదఘోష నెపంతో సాహితీ సముద్రాన్నే అవపోసన పట్టేసిన అపర అగస్త్యుడు, ఆ మహాత్ముడు దగ్గరకు ఒక చిన్న లోటాతో వెళ్ళి అంతే నీరు తెచ్చుకోగలిగాను.
బాల్యము :
గరికిపాటి నరసింహారావు గారు భాద్రపద శుద్ద పాడ్యమి సెప్టెంబర్ 14వ తేదీ 1958 వ సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వేంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో ఎం. ఏ. , ఎం. ఫిల్, పి. హెచ్. డి. చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు.
అవధానాలు :
తెలుగు, సంస్కృత భాషలకే సొంతమైన ఈ అవధాన ప్రక్రియలో చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసిన బహు కొద్ది మందిలో గరికపాటి వారు చెప్పుకోతగినవారు. వీరు 275 అవధానాలు, ఎనిమిది అర్ధ శత అవధానాలు, ఎనిమిది శతావధానాలు, ఎనిమిది ద్వి శతావధానాలు చేశారు. ఒక మహాసహస్రావధానము చేసి వారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. మొదటి అవధానం 1994 సంవత్సరం విజయదశమి రోజు చేశారు.
2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ( NIIMS ) ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. ఆ విధంగా మేధా పరీక్షావధానం కూడా తొలిసారి నిర్వహించింది శ్రీ గరికపాటి వారే! యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.
రచనలు :
సాగరఘోష - పద్యకావ్యం
మనభారతం- పద్యకావ్యం
బాష్పగుఛ్ఛం- పద్య కవితా సంపుటి
పల్లవి - పాటలు
సహస్రభారతి
ద్విశతావధానం
ధార ధారణ
కవితా ఖండికా శతావధానం
మౌఖిక సాహిత్యం- పరిశోధనా కావ్యం
పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
మా అమ్మ- లఘుకావ్యం
అవధాన శతకం
శతావధాన భాగ్యం- సంపూర్ణ శతావధానం
శతావధాన విజయం- 101 పద్యాలు
పురస్కారాలు :
ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)
* కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)
* సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)
* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)
* 2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం
* 2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి
* 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)
* 2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి
* భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం
* 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం
* 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
* సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)
* తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
* 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.
బిరుదులు :
కాకీనాడలో 1994 అక్టోబర్ 9 -10 (విజయదశమి) మొదటి శతావధానము చేసినప్పుడు ధారణగా 75 పద్యాలు నలభై నిమిషాలలో చెప్పేశారు. అది చూసి ఆశ్చర్యపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మమ గారు వారికి "శతావధాన గీష్పతి " అన్న బిరుదు ఇచ్చారు.
ఆ తరవాత రెండో శతావధానం చేసినప్పుడు అంత కంటే తక్కువ వ్యవధిలో ధారణ పద్యాలు చెప్పారు.
కాకినాడలో జరిగిన "ఖండికా శతావధానం " చేసి, ప్రతీ పధ్యం లోనూ కవిత్వం వచ్చేలా చేసి, ఆ తరవాత ఆ 100 పద్యాలు ధారణ చేసినందుకు అబ్బురపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు గరికపాటివారికి " ధారణ లో నిన్ను మించినవారు లేరు " అని మెచ్చుకున్నారుట.
ఆ తరవాత సహస్రావధానంలో 750 పద్యాలు ధారణగా చెప్పినందుకు " ఈ విధంగా 750 పద్యాలు సహస్రావధానంలో అప్పజెప్పడం ఇదే ప్రధమం, ఏ బిరుదివ్వాలో తెలియడం లేదు.. ఈ ధారణకి సాటైన బిరుదేవీ లేదు..... అందుకే "ధారణ బ్రహ్మ రాక్షసుడు " అన్న బిరుదు ఇస్తున్నాను " అని అన్నారుట.
భక్తి టి.వి. లో మహాభారతం ప్రవచనం చెప్పినప్పుడు , శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు అభినందన సభలో శ్రీ గరికపాటి వారిని ప్రశంసించి " ప్రవచన కిరీటి " అన్న బిరుదు ఇచ్చారు.
వారికి "అవధాన శారద, అమెరికా అవధాన భారతి " అన్న బిరుదులు కూడా కలవు. ఈ బిరుదులన్నీ ఆయన్ను వరించి తరించాయి.
అష్టావ శతావధానలలో ఘనాపాటి
నవీన భారత కురుక్షేత్రం లో చెమక్కులతో చురకలేసే ప్రవచన కిరీటి...
ప్రవచనాలతో సమాజాన్ని జాగృతం చేయడం లో ఆయనకు ఆయనే సాటి
ఆయనే శ్రీ గరికపాటి...
ఆ గరికపాటి వారికి నా ఈ చిన్ని అక్షర గరిక నివేదన!!
కరిముఖునకు హితకారిణి
పరమోతృష్టకణజాల పాపరహితమౌ
'గరిక ' గృహనామధేయులు
సరస సహస్రావధాన శతవందనముల్ !!
వారితో మాట్లాడినప్పుడు తెలుసుకొన్న విషయాలు...
Saturday, October 7, 2017
విధి బలీయమైనది
ఇంట్లో ఎవరూ లేరు, బయట చల్లని గాలి, చిన్న తుంపర.. ఆహా ఇలాంటి టైమ్ లో మంచి కాఫీ కప్పు తో అందమైన సినిమా చూస్తే ఎలా ఉంటుంది.. అలాంటి ఆలోచన రాగానే వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తో హాల్ లోకి వచ్చి టి.వి ఆన్ చేశాను.
పడవలో మాధవి ( అదేనండి 70-80 దశకంలో సినిమాని ఏలేసిన అమ్మాయి), పక్కన ఒక బుడ్డోడు ఇంకా సినిమా పేర్లు పడుతున్నాయి... ఏదో 70 - 80 లో వచ్చిన సినిమా చూద్దాము అనుకున్నాను ....
భక్తప్రహ్లాద సినిమాలో కశ్యపుడు " విధి బలీయమైనది " అని అన్నప్పుడు ఏంటో అనుకున్నా. విధి బలీయమైనది.. మనము బలహీనులమే అని గ్రహించడానికి ఒక్కొక్కరికి ఒక్కో సంధర్భం లో జ్ఞానోదయం అవుతుంది.
సూక్షంగా సినిమా :
మాధవికి కి పెళ్ళి అవుతూ ఉండగా పెళ్ళి కొడుకు కరంటు షాకు తో చనిపోతాడు, అందరూ మాధవిని తిడుతోంటే పక్కన ఉన్న ఒక బుడ్డోడు ఆవిడ మెళ్లో ఆ తాళి కట్టేస్తాడు. ఇద్దరూ వేరే ఊరికి వెళ్లి అక్కడే ఒక ఇంట్లో ఉంటారు. ఆవిడ ఒక రాధగా , ఆ బుడ్డోడు ఒక కృష్ణుడిగా ఊహించేసుకొని ఆరాదించేస్తూ ( ఆక్రోషించేస్తూ ) పాటలు కూడా పాడేసుకుంటుంది. ఆ బుడ్డోడు పెద్దైయ్యాక రాజేంద్ర ప్రసాద్. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ మాధవి ఒక డాక్టర్ దగ్గర నర్స్ గా చేస్తుంది . ఆ డాక్టర్( శరత్ బాబు ) ఈవిడని ఇష్టపడతాడు. కానీ ఈవిడ తనకి పెళ్లైపోయిందని ఆ త్యాగరాజు ని రిజక్ట్ చేస్తుంది. అదేంటో శరత్ బాబు ప్రతీ సినిమాలోనూ త్యాగరాజే అవుతాడు (త్యాగాలు చేస్తూ).
అలా అలా సాగీ కథ చివర్లో నిజం చెప్పి మాధవి చచ్చి పోతుంది (అదేదో మొదట్లో చస్తే ఆరభం కాదిది అంతం అని సినిమా టైటిలు పెట్టేయచ్చు కదా).
ఒక కంటి తుడుపు చర్యా ఏమిటంటే, ఒక పాట... ఈ పాట నేను చిన్నప్పుడు రేడియో లో విన్నాను.. ఆ టైం లో నాకు చాలా నచ్చిన పాట అది " రాధా కృష్ణయ్య ఇటు రా రా కృష్ణయ్య " పాట సాహితీ పరం గా బాగుంది కానీ చూడటానికే చాలా ఛండాలంగా ఉంది.
ఆ పిల్లాడిని చూసి మాధవికీ కలిగే ఆరాధన చాలా వికారం గా ఉంటుంది.
ఈ సినిమా అయ్యేటప్పటికి పిల్లలు బయటనుండి తిరిగి వచ్చారు, రాగానే " ఏంటీ ఒంట్లో బాలేదా జ్వరం వచ్చిందా ? అలా ఉన్నావేంటి " అని అడిగారు.
కాబట్టి ఎవరూ ఈ సినిమా ఎప్పుడైన ఎక్కడైనా పొరపాటున ఫ్రీ గా వస్తోంది కదా అని మాత్రం చూడకండి. చేతిలో రిమోట్ ఉండగా మార్చలేకపోయావా? అనేగా మీ ప్రశ్న... మారిస్తే విధి బలీయమెందుకౌతుంది..
దేవుడా రక్షించు నా సినీ అభిమానులని
పగబట్టిన దర్శకుల నుండి...
పొగరెక్కిన ప్రోడ్యూసర్ల నుండి...
పైత్యమెక్కిన హీరోయిన్ల నుండి...
పిచ్చెక్కిన రచయితలనుండి...
ముదిరిపోయిన బాలనటుల నుండి...
ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా... మూడు ముళ్ల బంధం....
ఇంతటి తో శెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ విధివక్రించి ఏవైనా చెత్త సినిమాలు చూస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను...
(ఇది కొన్ని రోజుల క్రితం చూసిన సినిమా.. జాగ్రత్త మళ్ళీ ఈ సినిమా వస్తోందని అడ్వటైజ్ మెంట్ వచ్చింది).
Friday, October 6, 2017
సినిమా
" హ్ష్.. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో " ఈ మాటా మాత్రం ఇప్పుడు స్పష్టంగా వినిపించింది. ఆ తరవాత ఇంకొన్ని మాటలు కొంచం గుణుకున్నట్లుగా వినపడ్డాయి. మధ్యాహ్నం 2 - 2:30 అవుతూ ఉంటుంది. జనవరీ నెల, మంచు ధ్యాన్యాలు కొలుస్తూ ఇంకా పుష్యమాసం వెళ్లలేదు. ఎండగా ఉందని పెరట్లో అరుగు మీద కూర్చొని నోట్స్ రాసుకుంటున్నాను. ఇంక ఆగలేక మెల్లగా నడుచుకుంటూ పశువుల పాక దాటాను, మాటలు అస్పష్టంగా గడ్డి మోపు వెనక నుంచి వస్తున్నాయి...
"పెళ్ళి చేసేసుకుంటే ఈ కష్టాలు తీరిపోతాయి బాబూ " అంది కనక
కనక మా ఇంటి పక్కన ఉంటుంది.
"అవును నాకూ అదే అనిపిస్తోంది " అని జవాబు... ఇచ్చింది వెంకట లక్ష్మి. వెంకట లక్ష్మి చాకలి మహాలక్ష్మి మనవరాలు.
" చక్కగా పెళ్లైతే మనకి కొత్త కొత్త చీరలు వస్తాయి, ఎవరివీ వెసుకోక్కలేదు, మనకో బీరువా ఉంటుంది, హాయిగా సాయంత్రం స్కూటర్ మీద సినిమాకి వెళ్ళొచ్చు, ఇప్పుడు నా బట్టలు మా చెల్లెల్లు వేసేసుకుంటున్నారు " అని వాపోయింది కనక.
"నావీ అంతే " అని వంత పాడింది వెంకట లక్ష్మి.. ఇది ఎప్పుడూ ఊర్లో వాళ్ళ బట్టలే వేసుకుంటుంది, దీనికి సెపరేటుగా బట్టలు ఎక్కడవి అని అనుకొని " అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ " అని నవ్వాను. నన్ను చూసి ఇద్దరూ పరార్... 😘
ఈ విషయం మా తమ్ముడికీ, మా బాబాయ్ గారి అబ్బాయికి చెప్పి తెగ నవ్వుకున్నాము. వాళ్ళిద్దరూ సంక్రాంతి సెలవలకి వచ్చారు. ఇద్దరూ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ వేసుకొన్నారు. నాకు ఒకసారి మా ఊరి వీరభద్ర థియేటర్ లో సినిమా చూడాలని ముచ్చటేసింది. ఇంట్లో ఒప్పించడం చాలా అంటే చాలా కష్టం. ఒక వేళ మా అమ్మ ఒప్పుకున్నా, వీళ్ళిద్దరూ ఒప్పుకోరు.. ఎందుకంటే వాళ్ళ అల్లరికి నేను అడ్డు. అందరూ ఏ కళనున్నారో కాస్త బతిమాలగానే చివరాఖరిలో ఒప్పేసుకున్నారు. 😍
సినిమా మొదలయ్యింది... థియేటర్లో చుట్ట కంపు, ఎలకల కోసం హడావిడిగా కుక్కలు తిరిగేస్తున్నాయి. రెండున్నర గంటల సినిమా, మేము నాలుగంటలు చేడచ్చు. మొత్తానికి ఇంటర్వెల్ అయ్యింది.. బాదాం గీర్ తాగడానికి బయటకి వచ్చాము.
బాదాం గీర్ తాగుతూ మా బాబాయ్ గారి అబ్బాయ్ మా తమ్ముడితో " ఒరేయ్ నీ టెంత్ పోయింది కదా, ఏం చేద్దామనుకుంటున్నావు? " అని అడిగాడు
మా తమ్ముడు " అమితాబ్ బచ్చన్ సినిమాలలోంచి వెళ్ళిపోతాడుట ( వీడికి చెప్పాడు మరి), నా సైకిల్ అమ్మేసి బొంబాయ్ వెళ్ళిపోద్దామనుకుంటున్నా ఈ సారి పాస్ అవ్వకపోతే అని అన్నాడు.
" మరి నీ సెవెంత్ ఏడో సారి తప్పావుగా నువ్వేం చేద్దామనుకుంటున్నావు? " అని మా తమ్ముడి ప్రశ్న.
" రజనీ కాంత్ తమిళ్ సినిమా నుంచి రిటైర్ అయ్యిపోతాడుట, నేను ఈ ఉంగరం అమ్మేసి మదరాస్ పోద్దామనుకుంటున్నాను " అని జవాబిచ్చాడి బాబాయ్ గారి అబ్బాయి.
" ఏమేయ్... నువ్వు ఎన్ని సార్లు టెంథ్ కడతావు? నువ్వేం చేద్దామనుకుంటున్నావు? " అని నా వైపు బాణం వేశాడు మా తమ్ముడు.
నేను నీళ్ళు కాదు బాదం గీర్ లో బాదం నమిలాను. " నీ గొలుసు అమ్మేసుకొని నువ్వూ మదరాస్ వెళ్ళిపో " అని మా తమ్ముడు సలహా.
"అవును.. టెంథ్ పాస్ అయితే పెళ్ళి చేస్తారనుకొంటున్నాను, ఎంచక్క పెళ్లైతే బీరువా నిండా బట్టలు, స్కూటరూ, సాయంకాలం రోజు ఆ స్కూటర్ ఎక్కి సినిమాకి వెళ్ళొచ్చు " అని ముందు రోజు విన్న డైలాగు అక్కడ అప్ప చెప్పేశాను.
మా తమ్ముడు ఒకసారి సైగ చేసి వెనకాల చూడమని చెప్పాడు. నేను వెనకాల చూస్తిని కదా ఒక పెద్దాయన మా వైపే చూస్తున్నాడు. ఇప్పుడర్ధమయ్యింది, ఈ పత్యపు మాటలకి కారణం ఏంటో. నేను ఇంక మాట్లాడ దలచుకోలేదు. మా ఊరు సంగతి నాకు తెలుసు... గాలి కన్నా వార్తలు ముందుగా ప్రయాణం చేస్తాయి.
ఆ పెద్దాయన నా వైపు ఆ సినిమా పొస్టర్ వైపు అలా చుస్తూనే ఉన్నాడు. బహుశా ఆ సినిమా హీరోయిన్ నాలా ఉంటుందని చూస్తున్నాడనుకొని మురిసిపోయా......
సినిమా మొత్తానికి చూసి, సెంటర్ లో " దొమ్మేటి " వాళ్ళ కొట్టు లో ద్రాక్ష రసం బాగుంటుందని అక్కడ ఆగి అది తాగేసి, ఎదురుగా చెప్పులు కొనుకొని హాయిగా ఇల్లు చేరాము. సావిట్లో ఒక పెద్దాయన.. సినిమా హాల్ దగ్గర కనిపించిన అతనే.
"వీళ్ళేనా మీరు చెప్పిన వాళ్ళు " అని నాన్న మమల్ని చూపించి అడిగారు. ఆయన కోపంగా " అవును వీళ్ళే " అని జావాబు ఇచ్చారు "
అంతా చెప్పేశాడన్న మాట, ఇలాంటి వాళ్ళు బి. బి. సి , పి.టి. ఐ. లో పని చెయ్యాలి అని తిట్టుకొంటూ రాబోయే తుఫాన్ తలచుకొని కాస్త భయపడి త్వరగా తినాల్సింది తినేశాము ( తరవాత తింటి తినడానికి టైం ఉండదు .. చివాట్లకే కడుపు నిండిపోతుంది).😥😥
ఆయన వెళ్తూ వెళ్తూ " మీ అమ్మాయికి త్వరగా పెళ్ళి చేసేయండి " అని ఓ చెత్త సలహా ఇచ్చి మళ్ళీ నా వైపు అదే లుక్ వేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంట్లో 'వన్ డే మాచ్ ' . ఆ తరవాత మళ్ళీ మా ఊరిలో సినిమాకి వెళ్ళలేదు నేను..😢😢
ఇంతకీ మేము చూసిన సినిమా పేరు చెప్పలేదు కదా " దొంగ కోళ్ళు ". 😜
Wednesday, October 4, 2017
Tuesday, October 3, 2017
తుమ్ ఆగయే హో
(మళ్ళీ మళ్ళీ ఇది వచ్చే రోజు)
పెనం మీద వేడి వేడి పెసరట్టు నోరూరిస్తోంది! తినాలని ఉంది కానీ... తనతో పాటు తింద్దామని ఒక ప్లేట్ లో తనకి రెండు, నాకు ఒకటి ఉంచాను. నిన్న కూడా అంతే... తనకి నా చేతి ఇడ్లీలంటే ఇష్టమని, నేను తినకుండా తన కోసం వైట్ చేసి చివరకి రాత్రి ఆ చల్లారిన ఇడ్లీనే తిని ఉన్నాను. నేనే తన గురించి ఇంత ఆత్రము పడాలి కానీ, అసలు తనకి నేను గుర్తొస్తానా? వెళ్ళి పదిహేను రోజులయ్యింది, ఒక్క సారైనా ఫోన్ చేస్తే కదా! నేను చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేం మనిషో! కాసంత అభిమానం కూడా లేదు! రోజు తనతోటే టీ తాగే అలవాటు, టీ తాగుతొన్నంత సేపు ఎన్ని కబుర్లో! ఏంటో ఇప్పుడు ఒక్కదాన్నే తాగుతోంటే చాలా వెలితిగా ఉంది. తను వచ్చాక కొన్ని రోజులు మాట్లాడకూడదు. ముభావంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అలుసు అయ్యిపోతాను! తనకిప్పుడు వాళ్ళ వాళ్ళతో టైం పాస్ అవుతుండవచ్చు, నాకే అంతా శూన్యం గా ఉంది లైఫ్! 😞
" తెరే మేరే హోటో పే మీటే మీటే గీత్ మిత్వా " అని కాలింగ్ బెల్! ఒకప్పుడు కాలింగ్ బెల్ "డింగ్ డాంగ్ " అని మ్రోగేవి. అదేంటో ఇప్పుడు పూర్తి పాటలు. ఏం "మీటే మీటే గీత్" వినిపిస్తుందో వచ్చి! ఈ పాట హిందిలో "చాందిని " సినిమాలోది. ఇదే డబ్బింగ్ కూడ అచేస్తే మా క్లాస్ లో ఒక తుంటరి "నీకీ నాకి పెదవులలో తియ్య తియ్యని పాటలే ప్రియా " అని మక్కికి మక్కి అనువాదం చేసింది. ఈ పాట ఎప్పుడు విన్న నాకు ఆ తెలుగు ప్యారెడి గుర్తొస్తుంది! 😋
తనేమో అని ఆత్రంగా వెళ్ళి చూస్తే పక్కింటావిడ! ఆవిడ ఎందుకొచ్చిందో అర్ధమయ్యింది. కాస్త కాఫీ చేసి ఆవిడకో గ్లాస్, నాకో గ్లాస్ తెచ్చుకొన్నా! ఏవేవో కబుర్లు చెబుతోంది. "ఇంకా తను రాలేదా? " అని అసలు ప్రశ్న వేసేసింది. కళ్ళలో నుంచి ఉబుకి వస్తోన్న నీటిని ఆపుకొని.. "లేదండి " అని ఏదో పనునట్టు వంటింట్లోకి వచ్చేశా! 😢😢ఆవిడ తన గురించి కనుకోడానికే వచ్చింది. కాఫీ తాగి కాసన్ని ఊసుబోని కబుర్లు చెప్పి వెళ్ళింది.
టైమ్ పదయ్యింది... ఇంక ఈ రోజు తను వచ్చే అవకాశాలు తక్కువే! ఇంక తప్పద్దు.. తినాలి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా... వంటింట్లోకి తప్పనిసరై వెళ్ళాను. "ఏం వండాలి? ఏదో సింగిల్ ఐటమ్ చేసేసుకుంటా! ఆకలి తీరాలి అంతే! " రుచుల మీద మనసు వెళ్ళడం లేదు! గత పదిహేనురోజూల నుండి తినాలి కాబట్టి తింటున్నాను! కాళ్ళు ఒళ్ళు ఒకటే నొప్పి... తను రాగానే ఈ విషయం కూడా చెప్పాలి... ఈ నొప్పులకు కారణం తనేనని!!! 😞😔
మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగింది... " తుమ్ ఆగయే హో నూర్ ఆగయా హై " . మనసులో ఏదో మూల చిన్న ఆశ, అదే ఆశతో తలుపు తీశా!
"తనే "... నిజమే తను రావడమే నా ఇంటికి నూర్ వచ్చింది. మరే నా ఇంటికి దీపం తనేగా... అబ్బా.. వసంతం వచ్చినంత ఆనందంగా ఉంది! 😍😍😍😍
"రా లక్ష్మి " అంటూ సాదరంగా ఆహ్వానించాను.. మా ఇంటి పనిమనిషిని! (బెట్టు చేసి మాట్లాడకపోతే... మళ్ళీ మానేస్తుందన్న భయంతో)!!
Friday, September 29, 2017
లలిత భావ నిలయ
1967 లో విడుదలైన సంగీత, సాహిత్యాల అపురూప మేళవింపు 'రహస్యం ' . ఈ సినిమాలో నాగేశ్వర రావు, ఎస్. వి. రంగా రావు, కృష్ణ కుమారి, బి. సరోజా దేవి నటించారు. సంగీతము అందించినది ఘంటసాల గారు. సాహిత్యం మల్లది రామకృష్ణ శాస్త్రి. నాగేశ్వరరావు అంత వరకు ఒక లవ్ బాయ్ గా నటించారు. ఈ సినిమాలో కత్తి యుద్ధాలతో కాస్త వెరైటిగా కనిపిస్తారు. సంగీతపరంగానూ, సాహితీపరంగా చాలా అత్యుత్తమ నాణ్యత కలిగిన సినిమా అయినా అనుకున్నంత హిట్ కాలేకపొయింది. కానీ ఈ సినిమాలోని ప్రతి పాట ఒక ఆణిముత్యము. ఇప్పుడు ఒక పాట గురించి తెలుసుకుంద్దాము...
రహస్యం సినిమా కోసం ముగురమ్మలను వర్ణిస్తూ ఒక పాట వ్రాసి మల్లాది గారు... ఘంటసాలకి ఇచ్చి "సరస్వతీ దేవి వర్ణన సరస్వతీ రాగములో, లక్ష్మీదేవిని వర్ణన శ్రీరాగములో, లలితాదేవి (పార్వతిదేవి) వర్ణన లలితరాగములో " స్వర పరచమన్నారుట. ఆ సాహిత్యానికి ఘంటసాల మాస్టారుగారు ఈ విధముగా స్వరపరిచారు. అలా స్వరపరచిన పాట అర్ధమిదిగో ...
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చార వింద నయనా.. సదయా జగదీశ్వరీ
నవ రసానంద హృదయ = ఎల్లప్పుడూనూతన ఆనందన్ని హృదయం కలది.
లలితా సహస్రంలో అమవారిని "చైతన్యకుసుమ ప్రియా " అని అంటారు. అంటే ఎప్పుడూ చైతన్యంతో ఉండే మనసుని కోరుకుంటుంది.
వికచ + అరవింద = వికసించిన తామరలవంటి కన్నులులు కలది.
మధువుచిలుకు = తేనె కురిపించు
గమకమొలుకు = సంగీతశాస్త్రమునందు స్వరవిన్యాస భేదము గమకము పలికించేది.
వరవీణాపాణీ - వీణాపాణి - సరస్వతి
సంగీత సాహిత్యాలను సమానంగా అలకరించుకొన్నది
సంగీతమపి సాహిత్యం సరస్వత్తాంతనద్వయం
ఏకమాపాత మధురం అన్యదాలొచనామృతం
సంగీతము, సాహిత్యము సరస్వతిదేవి యొక్క స్థనద్వయాలు , ఒకటి గ్రోలినప్పుడు మధురాతి మధురము, మరొకటి ఆలోచనలను రేకెతించేది. ఒక కంటితో సంగీతాన్ని అందిస్తూ, మరొక కంటితో సాహిత్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి.
సుమరదన విధువదన.. = మల్లె మొగ్గలవంటి దంతములు కలది / చంద్రముఖి (శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వలా)
అంబరాంతరంగ శారదా స్వరూపిణి = ఆకాశము వలె విశాలమైన , గంభీరమైన మనస్సు కలది
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే = చిత్ అనే అంబరం.. మనస్సు అనే ఆకాశములో ఉండే శారదాంబిక
శ్రీదేవి కైవల్య చింతామణి = కైవల్యము ఇవ్వడములో ఆవిడే చింతామణి
శ్రీరాగ మోదిని = శ్రీరాగము అంటే ఇష్టపడేది
చిద్రూపిణి = ఆత్మ స్వరూపిణి
బింబాధరా.. = దొండపండు వంటి అధరములు కలది,
రవిబింబాంతరా = సూర్యబింబములో నున్నది
రాజీవరాజీ విలోలా = పద్మసమూహము వలె చలించునది. లేదా విశాల నేత్ర మీనము వలె చలించునది.
రాజి అంటే సమూహము అనే అర్థం. అమ్మ నడుస్తూ ఉంటే తామర పూలు ఊగుతున్నట్టే ఉంటుంది.
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని = ఉత్కృష్టమైన కోరికకు (మోక్షకాంక్ష) సంజీవని వంటిది.
ఇహలోక వాంఛలవైపు కాకుండా పరలోక కాంక్షను సజీవముగా ఉంచునది
నిటలలోచన నయనతారా తారా భువనేశ్వరీ = శివుని మూడవ కంటిపాప(శివుని మూడవకంటిలోని శక్తి అమ్మవారే)
తారా భువనేశ్వరీ = నక్షత్రలోకానికి ఈశ్వరి (ప్రభ్వి, రాణి)
లలితా సహస్రనామములో ఆ తల్లిని ' మహాకామేశనయనా కుముదాహ్లాదకౌముది... మహేశుని కళ్ళు అనే కలువలకు ఆమే చల్లని మూర్తీభవించిన వెన్నెల
ఆ ఈశ్వరుడి శక్తి ఆవిడే, కంటిలో దీప్తీ ఆవిడే... అందుకే ఆవిడని 'శివశక్తైక రూపిణి ' గా అభివర్ణించారు.
ప్రణవధామ = ఓంకారమే నివాసముగా కలది
ప్రణయదామా = ప్రేమభావ హారమువంటిది.
సుందరీ = సుందరి, లాలిత్యముకి మారు పేరు ఆ లలితా దేవే.
కామేశ్వరీ = ఈశ్వరుడికి కామాన్ని పుట్టించినది, కోరికలు తీర్చే ఈశ్వరి.
అందుకే కాళిదాసు ' అశ్వధాటి స్త్రోత్రము " లో " రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ '"
ఆవిడని మించిన సౌందర్యము మరొకటి లేదు, అందుకే 'రుపాధికా శిఖరి (అధికమైన అందానికి శిఖరం ఆవిడ)
అరుణవసన.. = ఎఱ్ఱని వస్త్రములు ధరించునది /
అమలహసనా = అమలినమైన నవ్వు కలది(మాలీన్యము లేని నవ్వు ఆవిడ సొంతము)
మాలిని= పార్వతి, శివుని ఇష్టురాలు
భ్రామరి = భ్రామరాంబ..
శివుడు మల్లికార్జునుడిగా అవతారమెత్తి శ్రీశైలంలో ఒక మల్లె పువ్వుగా మారిపోయారుట, అప్పుడు ఆవిడ భ్రామరి అంటే నల్ల తుమ్మెదగా మారి ఆయన చుట్టూ తిరిగిందిట. ఈ రోజుకీ శ్రీశైలములో భ్రమరాంబ గుడి వెనుక తుమ్మెదల రొద వినపడుతుంది.
ఇక్కడ ఆవిడని భ్రమరముగా పోలిస్తే శివతాండవ స్త్రోత్రములో మాత్రం " రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం " రసప్రవాహముగా ఉన్న ఆవిడ ముఖము దగ్గరకు విజృంభించిన మధువ్రతము అంటే తుమ్మదగా ఆ పరమేశ్వరుడు వచ్చాడుట.
పూర్తిపాట ఇదిగో :
సరస్వతి రాగం:
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
సుమరదన విధువదన.. దేవి
సుమరదన విధువదన.. దేవి
అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
శ్రీ రాగం:
చరణం 1:
శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
బింబాధరా.. రవిబింబాంతరా..
బింబాధరా.. రవిబింబాంతరా..
రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని....
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని..
శ్రీరాజరాజేశ్వరీ...
లలిత రాగం:
చరణం 2:
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన.. అమలహసనా
అరుణవసన.. అమలహసనా
మాలిని... మనోన్మనీ
నాదబిందు కళాధరీ భ్రామరీ...
నాదబిందు కళాధరీ భ్రామరీ... పరమేశ్వరీ
నాదబిందు కళాధరీ భ్రామరీ... పరమేశ్వరీ
సినిమా లో ఈ పాటని 'అంజలీదేవి ' ని పరమేశ్వరిగా, నారదుడిగా 'హరనాథ్ ' నటించారు. లలితా పరమేశ్వరి ఇలాగే ఉంటుందా అనిపించి పూర్ణ చంద్రబింబం లాంటి వదనం అంజలీదేవిది. ఆ ముఖములో చిరునవ్వు కూడా వెన్నెల కురిపిస్తోందా అనిపిస్తుంది. ' సామగానప్రియ ' అని అమ్మవారిని కీర్తిస్తాము, అలా ఆ పాటకి ఆనందిస్తున్నట్టుగా ఆవిడ సంతోషాన్ని ప్రకటించే తీరు అద్భుతము.
పాట ఇదిగో ఇక్కడ వినండి... :
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1735
Tuesday, September 26, 2017
దసరా
దసరా అనగానే అమ్మవారి పూజలే గుర్తొస్తాయి. రోజుకో అవతారంతో ఆవిడ మనల్ని అలరిస్తుంది. ఆ అమ్మ ఆశీస్సులు ఈ రూపంలో ప్రతి ఇంట్లోనూ ఉంటాయి...
మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు...
నిన్న పొద్దుట కూరలకోసమని మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్ పక్కనే అర్పిత వాళ్ళ ఇల్లు, అర్పిత నా చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చాలా రోజులు.. ఉహు... నెలలే అయ్యింది, ఇంట్లో ఉందో లేదో అని ఒకసారి ఫోన్ చేశా. తను ఇంట్లోనే ఉన్న రమ్మని చెప్పింది.
అర్పిత ఇంట్లోకి అడుగెడుతుంటేనే ఒక పర్ణశాలలోకి అడుగుపెడుతోన్న అనుభూతి, ఇంటి ముందు మెళికల ముగ్గు, చల్లటి చెట్ల గాలి, తను ఇల్లు తీర్చిదిద్దే విధానం చూసి ఇంకా ముచ్చటేస్తుంది. ఇల్లు ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. విశ్మయముతో ఇల్లు చూస్తూ ఉన్నా, ఇంతలో "ఇంక ఇంట్లోకి వస్తావా" అన్న అర్పిత పిలుపుతో ఈ లోకములోకి వచ్చా.
కాసేపు పిచ్చాపాటి కబుర్లు అయ్యాక దసర నాటి బొమ్మలకొలువు ఫొటోలు చూపించింది. అసలు ఆమెకి అంత ఓపిక ఎక్కడిది, ఇంటి పని, వంట పని, తోట పని, ఇవి సరిపోనట్టు పేయింటింగ్, అల్లికలు, బొమ్మల కొలువుకి బొమ్మల్ని తయ్యారు చేయడం! ఒక గజేంద్రమోహక్షము, గోపికలు కృష్ణుని ఘట్టాలు తీర్చిదిద్దిన విధానానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయా. మెచ్చుకున్నా, పొగిడినా " ఇదీ ఒక పెద్దపనేనా " అని సున్నితంగా తోసిపారేస్తుంది తను.
"దసరా బాగా జరుపుకున్నట్టున్నావే " అని అడిగా...
ఒక చిరునవ్వు నవ్వుతూ... " నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అలంకారము చేసి, పూజ చేశాను. దగ్గరలోనే అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఆయనతో నవరాత్రులు మొదలవ్వక ముందే చెప్పాను. తీరా నవరాత్రి మొదలయిన రోజే ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఆడపడుచు, పిల్లలు. ఆడపడుచుకి ఈ ఊరిలో ఏదో ఆఫీస్ పని ఉందని పిల్లలతో సహా వచ్చి పిల్లలని నాకు వదిలి తాను ఆఫీస్ పని లో బిజీ అయ్యింది. మొదటి రోజంతా ఆడపడుచు పిల్లలతోటే సరిపోయింది. ఇక రెండో రోజూ ఆడపడుచు తరఫు చుట్టాలు ఆవిడని పిల్లల్ని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి వంట, టీలు, టిఫిలతో సరిపోయింది.
ఇంట్లో పిల్లలు, చుట్టాలు పని తెమలడమే కష్టగా ఉంటే మూడో రోజు సాయంత్రము శ్రీవారు ఆయన ఫ్రండ్స్ ని తీసుకొచ్చి వీణ కచేరి చేయమని పురమాయించారు, అందరి ముందు అడిగారు ఇంక కాదనలేక ఒక కీర్తన వాయించాను. వచ్చిన వాళ్ళు తెగ ముచ్చట పడిపోయారు. ఇంక మూడో రోజు కూడా అమ్మవారు దర్శనానికి తీసుకెళ్ళలేదు.
ఆ మరునాడు ఆడపడుచు పిల్లలు స్కూల్లో ఇచ్చిన హోం వర్కులు బయటకు తీసి నా దగ్గరకు వచ్చారు. ఇంక ఆ రోజు వాళ్ల చేత హోం వర్కులు చేయించడములో బిజీ అయ్యా. వాళ్ళకిచ్చిన ప్రాజెక్టులు చేయించడములో సాయము చేయడముతో సమయం ఎలా గడచిందో తెలియకుండా సాయంత్రము ఏడయ్యిపోయింది, ఈయన సాయంత్రము లేటుగా రావడం తో ఆ రోజు గుడికి వెళ్ళలేకపోయాము.
ఇలా నవరాత్రులు హాడవిడిగా గడచిపోతూ వచ్చాయి. ఇంక నవమి రోజు పిల్లల్ని, చుట్టాలని తయ్యారు చేసి తీరా గుడికి వెళ్దామనుకుంటే మా పనిమనిషి రత్తాలు ఏడుస్తూ మొహనికి రక్తం కారుతూ, చంటి పిల్లని కౌగిలించుకొని రొప్పుతూ , ఏడుస్తూ వచ్చింది. దాని మొగుడు మూడోసారి కూడా దానికి ఆడపిల్ల పుట్టిందని ఆ చంటి పిల్లని ఎవరికో అమ్మడానికి తీసుకెళ్తున్నాడని, అడ్డం వచ్చిన రత్తాలుని కొట్టాడని చెప్పింది. అంతే ఎక్కడ లేని కోపం వచ్చింది. మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తొన్న వాడిని వెంటనే పిలిపించి... రత్తాలు ని తీసుకొని ఇంటికి వెళ్ళీ, రత్తాలిని కొట్టినా, పిల్లలని అమ్మినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని కాస్త గడ్డి పెట్టి వచ్చాము. అసలు ఆడపిల్లంటే అంత అలుసా? అని ఆ రోజంతా మనసు అల్లకల్లోలం అయ్యింది. ఆ గొడవ అయ్యేటప్పటికి రాత్రి 10 అయ్యింది. ఇంక గుడికి వెళ్ళాలి అన్న ఆలోచనే మరచిపోయాము.
ఇంక దసరా రానే వచ్చింది. ఇంటి నిండా జనాలతో పండగ వాతావరణము భలేగా అనిపించింది. సాయంత్రము బొమ్మలకొలువుతో పేరంటాల్లతో చాలా బిజీ అయ్యాము. సాయంత్రము ట్రైన్ కీ వచ్చిన చుట్టాలందరు ఎవరిల్లకు వారు వెళ్ళిపోయారు. అప్పుడేనా కనీసం గుడికి తీసుకెళ్తారేమో అని ఆయన్ను అడిగితే..
" ఇప్పుడు గుడికి ఎందుకోయ్" అని అడిగారు.
చాలా ఉక్రోషం వచ్చేసింది.
" నవరాత్రులలో ఒక్క రోజు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు కూడా తీసుకేళ్ళరా? " అని నిలదీసా...
" నువ్వు చూడలేదేమో కానీ, నేను మాత్రం రోజు దర్శించుకుంటూనే ఉన్నాగా" అని అన్నారు..
" అంటే నన్ను తీసుకెళ్ళకుండా మీరొక్కరే వెళ్ళొచ్చేశారా? " అని అడిగా కాస్త గట్టిగా...
అందుకు ఆయన చిద్విలాసంగా..." నవరాత్రులలో మొదటి రోజు ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు.. వాళ్ళని ఆప్యాయతగా పలకరించి అన్నము పెట్టేటప్పుడు నీలో అన్నపూర్ణాదేవిని చూశాను, పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళల్లో కలిసిపోయినప్పుడు బాల త్రిపుర సుందరిని చూశా, వాళ్లకి చదువు చెప్తోనప్పుడు ఒక గాయత్రిని చూశా, వీణపాణిగా ఉన్న నీలో సరస్వతినీ చూశా, కోపం వచ్చినప్పుడు నీలో ఒక దుర్గ, మహిషాసురమర్ధినినీ చూశా... ఇంక రోజు సౌందర్యలహరిని చూస్తూనే ఉన్నా..." అంటూ నవ్వారు...
ఈ విషయము చెప్తోన్న అర్పిత కూడా సిగ్గుతో నవ్వింది. ఇలా ఒక పొగడ్త విసిరేసి మొత్తానికి నన్ను నవరాత్రులలో గుడికి మాత్రం తీసుకేళ్ళలేదు ఆయన అని చెప్పింది.
"నిజమే కదా అర్పితా! స్త్రీ ఒక శక్తిస్వరూపిణి... కొందరికి సౌందర్యలహరి, కొందరికి మహిషాసురమర్ధిని " అని అనేసి అలా ఇంటి దారి పట్టాను.
Subscribe to:
Posts (Atom)