Search This Blog

Sunday, February 5, 2023

కళా యశస్వి కె. విశ్వనాథ్

కుంచించుకుపోయిన బుద్ధితో సర్వవ్యాప్తి అయిన ఆ భగవంతుడిని ఈశాన్యానికే పరిమితం చేసిన మనకు 'అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది' అని ఉండమ్మా బొట్టు పెడతానని చెప్పారు.

'కుదురులేని గాలి వెదురులోకి ఒదిగితే ఎదురులేక ఎలా ఎదుగుతుందో' స్వర్ణకమలాలతో చూపించారు.

'ఆలోచనామృతమూ ఆత్మ సంభాషిని సాహిత్యమని, అద్వైతసిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానమని, క్షారజనదులు నాట్య కళ ద్వారా క్షీరములే అవుతాయని, ఆనందంతో చేసిన హేల ఆ శివుని నయనత్రైలాస్యమే అని నిరూపించారు.

'విలువిద్యలు ఎన్ని కలిగిన కులవిద్యకు సాటి రాదు కువలయమందు' అని సూత్రధారిలా స్వయంకృషితో చెప్పారు.

విదేశాలకు వెళ్ళాకే మాతృదేశం యొక్క గొప్పదనం తెలుసుకొని, సొంత ఊరిని దత్తతు తీసుకొని అభివృద్ధి చెయ్యాలని జనని జన్మ భూమే గొప్పదని చాటారు.

విషకీటకమైనా శంకరుడి ఆభరణమైతే గౌరవించబడుతుందని, ఎంత ఎదిగినా అసూయతో రగిలితే ఆ జ్ఞానం అంధకారమే అని స్వాతికిరణంగా తెలిపారు.

సప్తపది ద్వారా పునర్వివాహం తప్పుకాదని చెప్పినా, 'నటరాజ స్వామి జటాఝూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది?' అని సముద్రానికి కూడా చెలియలికట్ట అవసరమని చెప్పారు.

వరకట్నం మీద విప్లవం తీసుకొని రాడానికే శుభలేఖ పంచారు. వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ స్వాతిముత్యమే అయ్యారు. తనదు స్వరసత్వము వారసత్వముగా ఇచ్చిన తల్లితండ్రులే శ్రుతిలయలు అని తెలిపారు.

ఈ మాత్రం సంగీతసాహిత్యాభిమానం మా తరానికి కలిగిందంటే ఆయనే కారణం! ప్రతీ సినిమాలోనూ ఒక అన్నమయ్య కీర్తనో, త్యాగరాయ కృతినో పెట్టి పండిత పామరులను అలరించారు, వాటిని పరిచయమూ చేశారు. ఆయన సినిమా అంటే ఇంట్లో అందరు కలిసి చూసే పండగలాంటిది. ఒక్కో సారి ఒక్కో విషయాన్ని తెలియచేస్తుంది చూసిన సినిమా అయినా!

'కలవని తీరాల నడుమ కలకలసాగక యమున వెనుకకు తిరిగిపోయిందా?' అని ప్రశ్నించినట్లు ఇటువంటి స్పీడ్ యుగంలో ఇలాంటి ఆణిముత్యాలు తీసి ప్రవాహానికి ఎదురేగారు . ఈ సినిమాలన్నీ ఆయన 'ఆత్మగౌరవాన్ని' పెంచినవే.
ఇన్నీ సినిమాలు తీసినా ఆయన గొప్పదనాన్ని పొగిడితే "ఆ టైంకి అలా అయ్యిపోయింది అంతే, అంతా ఆ శివుడి కృప" అని ఒక నమస్కారం పెట్టేశారు.

సినిమాల ద్వారా ఎన్నో పాటలకు అందమైన రుచులు చూపించినా, ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నప్పుడు కొత్తావకాయలో వెన్నతో మామిడిపండు ముక్కలు నంచుకోమని చెప్పి తినిపించిన ఆ రుచి మాత్రం మరువలేను (అప్పటి వరకు తినలేదు, ఇక తినబోను). ఇంట్లో ఒక పెదనాన్న గారో, ఒక తాతగారో అలా తినిపించినట్లు అనిపించింది.

శరీరానికి జరామరణం ఉంటుంది, ఉండి తీరాలి కూడా, కానీ ఆయన కోరుకున్నట్టు 'అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం' కోరిక ఆయనకు లభించింది. ఏ ఒక్క మచ్చ లేకుండా ఆ కాశీనాథుడిని చేరిన యశస్వి విశ్వనాథ్ గారు. బ్రతకడం ఇలా బ్రతకాలి, సినిమాలు ఇలా తియ్యాలి... శరీరాన్ని ఇలా వదలాలి అని బ్రతికి చూపించిన ఋషి ఆయన.
May be an illustration
All reaction

Sunday, June 30, 2019

శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి

హాస్య కథలకు ఆమేచిరునామా...

తెలుగు కథా ప్రపంచంలో ఆమెది ఒక సుస్థిర స్థానం... 

నవ్వించడం ఆవిడ చేస్తున్న మహాయజ్ఞం....

విజయం ఆవిడ పథం...

(ధైర్య) లక్ష్మి ఆవిడ నైజం... 

నడిచే నవ్వుల రథం...

ఆవిడే.. శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి గారు.


జననం :


విజయ లక్ష్మి గారు విజయ నామసంవత్సరం (అనగా  1953) జులై లో బాపట్లకు 9 కిలోమీటర్లు ఉన్న యాజలి లో జన్మించారు. వారి నాన్న గారు పి.డబల్యు  ఇంజినీరు కావడం వలన వారికి ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉండేవి.  కాబట్టి ఆవిడ చదువు చాలా ఊర్లల్లో జరిగింది. ఏడాదికి రెండో మూడో ఊర్లు తిరగడం మూలంగా ఎందరో వ్యక్తులను, వ్యక్తివ్యాలను,  దగ్గరగా పరిశీలించే అవకాశం ఆవిడకు లభించింది.  అదే తరవాత తరవాత రోజుల్లో ఆవిడకు కథా వస్తువులుగా పనికొచ్చాయి. విజయలక్ష్మి గారి నాన్న గారికి ఆవిడని ఒక డాక్టర్ గా చూడాలన్న కోరిక! కానీ ఆవిడకు పరీక్షలు రాయాలంటే బద్ధకం. పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు కావాలో అంతే పరీక్ష రాసేవారుట. ఆవిడ ఒక రచయిత్రి అవ్వాలని ఏనాడు అనుకోలేదు. పరీక్షలో జవాబు రాయడానికే బద్ధకించే తను ఇన్నిన్ని పేజీల నవలలూ, కథలు ఎలా రాయగలుగుతున్నానో అని ఆశ్చర్యపడ్డారు.


వివాహం :


విజయలక్ష్మి గారికి 17 వ ఏటనే వివాహం అయ్యింది. వివాహం అయిన వెంటనే ఆవిడ భర్త శివరావు గారితో కలిసి "చిత్తరంజన్ " కి వెళ్ళారు. తరవాత ఒక గృహిణిగా ఆవిడ ఇంటికి వచ్చేవారి వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడంలో పూర్తిగా లీనమైయ్యిపోయారు. వారికి ఒక అమ్మాయి శిరీష, కలకత్తాలో స్థిరపడ్డారు, శిరీష ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా "దాదాసాహెబ్ " అవార్డ్ తెచ్చుకున్నారు. ఒక అబ్బాయి ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటున్నారు.




రచయిత్రిగా :


1982 లో చిత్తరంజన్ లో తెలుగు పిల్లల చేత చిన్ని చిన్ని తెలుగు నాటకాలు వేయించడానికి చిన్న చిన్న కథలు రాశారు. అదే ఆవిడ రచయిత్రిగా మొదటి మెట్టు. తరవాత కొద్ది రోజులకి "స్క్రిప్ రెడిగా ఉంది.. సినిమా తీయ్యండి " అనే పేరుతో ఒక వ్యంగ్య కథ రాశారు అది "ఆంధ్ర ప్రభ " కి పంపారు. కొన్ని రోజుల వరకు అటు నుంచి ఏ రకమైనా ప్రత్యుత్తరం రాలేదు. మరి కొన్ని రోజుల తరవాత 'చతుర ' కి "ప్రేమించని ప్రేయశి " పేరుతో ఒక నవల రాశారు. కానీ 'చతుర ' వారు "ప్రేమ లేఖ " అనే పేరు మార్చారు. ఇలా రెండు కథలు పేపర్లలో పడడంతో ఇక వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు విజయ లక్ష్మి గారికి.


ఎక్కువ హాస్య కథలే రాసే విజయలక్ష్మి గారు అప్పుడప్పుడు కొన్ని హాస్యేతర కథలు కూడా రాసి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది "ఆత్మ కథ " . ఈ కథ " ...." లో సిరియల్గా వచ్చింది. చివరి భాగం పోస్ట్ చేశాక ప్రేక్షకుల నుండి  ఏడుప్తో ఆవిడకు ఫోన్ ల  వరదే వచ్చింది. 


ఆవిడ జ్ఞాపకాలను పదిలపరచి మనకు బహుమతిగా "జ్ఞాపకాల జావళి " గా ఇచ్చారు.


అలాగే పూర్వీ కథ... మనస్సుని కలిచివేస్తుంది, మానవత అంటే ఇదేనా అని అనిపిస్తుంది.
  


కథా వస్తువు :


విజయ లక్ష్మి గారికి  ఒక కథ అంటే అందులో కుటుంబం మొత్తం ఉండాలి. అందుకే ఆవిడ చుట్టూ ఉన్న జనాలే ఆవిడ కథా వస్తువులుగా ఎన్నుకొనేవారు. ఉదాహరణకి శ్రీవారికి ప్రేమ లేఖలో "సుత్తి వీర భద్ర రావు " కారెక్టరు... ఆవిడ మాతామహులే, పేకాట గాంగ్ వారి శ్రీవారి స్నేహితులే, కథలు చెప్పే శ్రీలక్ష్మి వారి ఇంటి పక్కావిడే.  ఆత్మ కథలో "బల్వి " చిత్తరంజన్ లో వారి స్నేహితుడే!


రచనలు : 


మా ఇంటి రామాయణం, పూర్వి, ఆత్మ కథ, పొత్తూరి విజయ లక్ష్మి హాస్య కథలు, ఆనందమే అందం, చంద్ర హారం,సంపూర్ణ గొలాయణం... అన్నీ అపురూపమైన కథలే!




సినిమాలో ప్రవేశం :


1983 లో ఉషా కిరణ్ మూవీస్ వారు చతురలో పడిన "ప్రేమ లేఖ " ఆధారంగా సినిమా తీయాలనుకున్నారుట. దానికి డైరెక్టర్ జంధ్యాల గారు. సువర్ణానికి సుగంధాన్ని అబ్బినట్టుగా  విజయ లక్ష్మి గారి హాస్య కథ, జంధ్యాల గారి దర్శకత్వంలో "శ్రీవారికి ప్రేమలేఖ " గా విజయవంతమయ్యింది.  అలా విజయ లక్ష్మి గారి రచన సినీ జగత్తులో కూడా వెలిగింది. ఆ తరవాత  "సంపూర్ణ గోలాయణం ", "ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం " అనే నవలలు కూడా సినిమాలుగా తెరకెక్కాయి.


చిరంజీవి నటించిన "చూడాలని ఉంది " సినిమాలో బెంగాల్ లో ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు బ్రహ్మానందం చెప్పే డైలాగులు విజయలక్ష్మి గారు రాసినవే. ఇలా సినిమాలలో అప్పుడప్పుడు రాసినా పూర్తిగా మాత్రం కథలు రాయడం లోనే స్థిరపడారు విజయలక్ష్మి గారు.


సంఘ సేవకురాలిగా :


చిత్తరంజన్ లొ ఉండగా విజయలక్ష్మి గారు తెలుగు ఎసోషియేషన్ కి జెన్రల్ సెకరేటరీగా ఉండేవారు. అప్పుడే ఆర్ధికంగా వెనుక బడిన పిల్లలకి స్కూల్ ఫీజిలు, స్త్రీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సాయం చేశారు.


"నా  కథలు ఎవరి కష్టాలు తీర్చకపోవచ్చు, కానీ కాసేపైనా కష్టాలను మరచి హాయిగా నవ్వుకొనే భాగ్య కలిపిస్తాయి.., ఇది చాలు నా రచనలకి " అని ఆనంద పడ్డారు.


బహుమతులు అవార్డ్ లు :


2012 లో స్వాతికి రాసిన "సన్మానం " కథకి అనీల్ అవార్డ్ వచ్చింది.

పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుంచి "కీర్తి పురస్కారము "

గృహలక్ష్మి స్వర్ణకంకణం

ముణిమాణిక్యం నరసింహ రావుగారి "స్మారకపురస్కారము"

భానుమతి గారి పురస్కారము


ఈ బహుమతులు, అవార్డులు  విజయలక్ష్మిగారిని వరించి తరించాయి. 



ఆనందమే అందం :


" " 1970 లో నా పదిహేడవ ఏట ఏమీ తెలియని అమాయకత్వంలో "చిత్తరంజన్ " లో అడుగుపెట్టాను. భాష రాదు, ఒంటరి జీవితం, జీవితంలో సుఖాలే కాదు కష్టాలనీ చవి చూశాను. మా తాతగారు " ఎప్పుడేనా ఏదైనా సమస్య వస్తే ఒకసారి రామాయణం, భారతం గుర్తు తెచ్చుకో... నీకు తప్పకుండా పరీష్కారం దొరుకుతుంది. 


మనకు ఆకలి వేస్తే మనమే తినాలి, అట్లాగే మనకు కష్టం వస్తే మనమే భరించాలి. నీ కష్టాలు అందరితోనూ చెప్పుకోకు... నీ వ్యధ్య ఎదుటివారికి సొద " అన్న మాటలు నాకు భగవద్గీత ...

 

జీవితం ఇచ్చిన కష్టాలను తలచుకుంటూ బాధ పడే కంటే, అదే జీవితం ఇచ్చిన ఆనందాన్ని తీసుకొంటే మరింత ఆనందం పొందచ్చు. ఇదే నేను నమ్మిన సూత్రము... ఇదే నా కథలకు ఆధారం. "


ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే పొత్తూరి విజయలక్ష్మి గారు ఆవిడ జీవిత అనుభవాలను జ్ఞాపకాలను నాతో పంచుకుంటూ చెప్పిన మాటలు ఇవి.


ప్రస్తుతం :


పస్తుతం "ఆంధ్ర భూమి " లో "నోస్టాల్జి " రాస్తున్నారు. అప్పుడప్పుడు పత్రికలకు కథలు పంపుతున్నారు. ఫేస్ బుక్ లో కూడ అరాస్తున్నారు. వారు ఫేస్ బుక్ లో వారి పుస్తకాల  గురించి ఒక ఆర్టికల్ పెట్టినప్పుడు పుస్తకాలు సెట్ సెట్లే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.    


నవ్వుల ప్రపంచంలో విహరింప చేసే ఆ హాస్య సామ్రాజ్ఞి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 










Thursday, June 6, 2019

చేదు మనిషి

"అయ్యో అయ్యో ఇంట్లో చేదు వృక్షం ఉంటే ఇంటికి అరీష్టమని ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికి ఎక్కదా? " అంటూ మళ్ళీ వచ్చాడు సాక్షి రంగారావు గారు. ఆయనంటే ఎవరో నాకు తెలీదు, కానీ అచ్చు సాక్షి రంగారావులా ఉండేవాడు. ఎప్పుడు ఎవరింటికి వచ్చినా చెట్ల గురించే మాట్లాడేవాడు. అలా అని చెట్టు పాతమని ఎప్పుడూ చెప్పేవాడు కాదు, చెట్లు కొట్టెయమనే చెప్పేవాడు.


మా పక్కింట్లో ఒక వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదని ఆయన వాదన. ప్రతి వారం వచ్చేసేవాడు, వచ్చిన వాడు ఊరుకోకుండా ఇదిగో ఆ చెట్టుని కొట్టెయ్యమని చెవిలో ఇల్లు కట్టుకొని అరిచేవాడు. మా పక్కింటి వాళ్ళ బాత్ రూం పక్కనే కుంకుడు చెట్టు ఉండేది, బాత్ రూం నుంచి విసిరేసిన ఆ కుంకుడు గింజలు పాపం వాటంతట అవే మొలకలెత్తి, ఆ బాత్ రూం నుంచి వచ్చే నీళ్లతో చెట్తై కూర్చున్నాయి. మేము ఆ కాయలని పిన్నీసుతో గుచ్చి, బుడగలూదేవాళ్ళము.


ఇక మా ఇంట్లో, పక్కవారింట్లో జామచెట్లు ఉండేవి. ఈ సాక్షిరంగారావు, "ఇదిగో ఆ ఫల వృక్షాలు ఇంట్లో ఉండకూడదు, పిల్లలకి అరీష్టము " అని అనేవాడు. ఆయన మాటలు ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోలేదు. మాకు ఈ జామ చెట్లు  సాయంకాలము ఆడుకొనే ప్లే గ్రౌండ్స్, ఆ చెట్టు కాయలే ఈవింగ్ స్నాక్స్. మాకే కాదు రామచిలుకలకి, కోతిపిల్లలకి కూడా చెట్టు అంటే చాలా ఇష్టము. ఆ జామచెట్టుని కొట్టేయమంటే మా పిల్లల గ్యాంగ్ కి చాలా కోపం వచ్చేది. ఆయన వస్తున్నాడంటేనే విసుగ్గా అనిపించేది. ఆ వేపచెట్టు కన్నా ఇతనే చేదు మనిషి అని అనిపించేది.


మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఒకసారి ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి కాబోయే భర్త బైక్ మీద బయటకు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే.


ఈ పెద్దమనిషి అదే మన సాక్షి రంగారావు వచ్చి " చెప్పానా, ఆ చేదు మొక్క వలనే ఈ అరీష్టము, ఆ ఫల వృక్షము కూడా,  ముందు ఆ చెట్లను కొట్టించేసేయండి " అని మళ్ళి చెప్పాడు. తొభై తొమ్మిది గొడ్దలి దెబ్బలకు పడని వృక్షము, వందో దెబ్బకు పడినట్టు, ఆ రోజు ఆ మాటలు ఆ ఇంట్లో వాళ్లకి బాగా పని చేసాయి. పెళ్ళీ కి ముందు చెట్టు కొట్టకూడదని ఎందరో చెప్పినా వినలేదు, ఆ మరునాడే ఆ వేప చెట్టు, కుంకుడు చెట్టు జామ చెట్టు కొట్టేశారు.


అవి చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని మోసిన చెట్లు, అట్లతద్ది వస్తే మా అందరిని ఉయ్యాలూపిన ఆ వేప చెట్టు,  విరిగిపోయినా ఇంట్లో  చెక్క ఉయ్యాలయ్యి ఆ అక్క (పెళ్ళైన అమ్మాయి ) పిల్లలకి కూడా జోలపాట పాడింది. 

 

 

Wednesday, June 5, 2019

లవ-కుశ సుబ్రహ్మణ్యం

తెలుగు సినిమా జగత్తులో ఆణిముత్యాలు ఎన్నైనా మకుటముగా నిలిచినవి మాత్రం అతి కొన్నే! అందులో చెప్పుకోదగినది "లవ-కుశ " . ఈరోజుకీ సినిమాలకి దిక్సూచి, కొలమానము లవ-కుశ... ఎన్ని పౌరాణిక చిత్రాలు వచ్చినా లవ-కుశ మాత్రము.. "న భూతో న భవిష్యతి ". అందులో నటించిన సుబ్రహ్మణ్యం గారు... అదే కుశుడు గారు ఆయన అనుభవాలను మనకు ఈ ఎందరో మహానుభావులు " ద్వారా చెప్పారు.

 

బాల్యం- విద్యాభ్యాసం :

 

శ్రీ సుబ్రహ్మణ్యంగారు 1946 ఏప్రెల్ 21, గొల్లపాలెం లో జన్మించారు. వారి తల్లి సుబ్బాయమ్మగారు, తండ్రి వియూరి సుబ్బారావు గారు. వారి నాన్నగారిని "గొల్లపాలెం అబ్బాయి " గారు అనేవారు.(మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారిని 'కాకినాడ అబ్బాయీ అనేవారుట). ఆయన యన్ మెన్స్ క్లబ్ మెంబర్ గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు. 1953 లో దంటు భాస్కర రావు గారి ప్రోత్సాహంతో లవకుశ నాటకం వేశారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన తమ్ముడు ఫకీర్ బాబు.

 

 

వీరి నటన చూసి ఆ తరవాతి కాలంలో సి. పుల్లయ్యగారి "లవకుశ " లో సుబ్రహ్మణ్యంగారినే కుశుడి పాత్రకు ఎన్నుకున్నారు. సుబ్రహ్మణ్యం తమ్ముడిని అదే సినిమాలో సుర్యకాంతం కొడుక్కా నటింపచేశారు. ఈ లవకుశ సీనిమా ఐదేళ్ళ పాటు తీయడం వలన సుబ్రహ్మణ్యంగారు బడికి వెళ్ళలేకపోయారు. ఆ విధంగా చదువు కొనసాగలేదు.

నటించిన ఇతర సినిమాలు :

" వెలుగు నీడలు " సినిమాలో జగ్గయ్య మేనల్లుడిగా, "శ్రీవేంకటేశ్వర మహత్యం " సినిమాలో శాంతకుమారి పాట పాడినప్పుడు చిన్ని కృష్ణుడిగా, "సీతారామ కల్యాణం " లో చిన్నరాముడిగా (గురుబ్రహ్మ పాటలో), 2006 లో వచ్చిన 'కల్యాణం ' అనే సినిమాలో కూడా నటించారు.

 

వివాహం :

 

సుబ్రహ్మణ్యం గారికి వారికి 1978 లో వివాహం అయ్యింది. ముగ్గురు కొడులు. వారి శ్రీమతి నర్శారత్నం గారికి మూడొవ సంతానం కలిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలు ఆవిడ మంచానికే అంకితమవ్వాల్సి వచ్చింది. 2017 లో ఆవిడ పరమపదించారు.

వారి భార్య కి ఒంట్లో బాలేదని ఒకసారి ఆయన నాకు చెప్పారు. అప్పుడు నేను కొంతమంది మిత్రుల సహకారంతో (ఈ ఎఫ్.బి. లో ఉన్నారు వారంతా) వారికి సాయం చేశాను. ఆ డబ్బు అందిన వారం రోజులకే వారి భార్య పరమపదించారు. నేను ఆయనకు ఫోన్ చేసి "ఆ డబ్బు ఇలా ఉపయోగపడినందుకు చింతిస్తున్నాను " పరామర్శిస్తే "తల్లీ! పెళ్ళికంటే ఎవరేనా సాయం చేస్తారు, ఈ కార్యక్రమానికి ఎవరిని సాయం అడుగుతాను, కరక్ట్ టైం కి డబ్బు అందేలా ఇచ్చావు " అని అన్నారు.

ప్రస్తుతం సుబ్రహ్మణ్యంగారు అమలాపురంలో టైలరింగ్ చేసుకుంటున్నారు. కోటీశ్వరులకు లేని గౌరవమర్యాదలు వారికి ఈ లవకుశ సినిమా ద్వారా లభించాయని ఆనందపడుతూ ఉంటారు.

 

 

 

 

 

 

 

Monday, May 13, 2019

కె. రాణి

అమ్మకొంగు పట్టుకొని తాయిళాల కోసం తిరిగే లేత వయసు, స్నేహితులతో కలిసి లొల్లాయి పాటలు పాడుతూ గంతులు వేసే చిరుత ప్రాయం.. అంత చిన్న వయసులో గాన గంధర్వుడు ఘంటసాల పక్కన నిలబడి ఆయనతో కలిసి " చెలియ లేదు చెలిమి లేదు " అన్న విషాద గీతాన్ని ఆయనతో గళం కలిపిందంటే  ఆ చిన్నారి ఎంత అదృష్టవంతురాలో కదా!!  11 ఏళ్ళ వయసులో గొంతులో విషాదాన్ని ఒలొకిస్తూ ఆవిడ పాడిన "అంతా బ్రాంతి యేనా " సినీ విషాద గీతాలలో ఆణిముత్యము. ఆ పాట పాడినది  అలనాటి చిన్నారి శ్రీమతి కె. రాణి గారు.  కె. రాణీ గారి అసలు పేరు ఉష రాణి. ఆవిడ 1942 లో కర్ణాటక రాష్ట్రం లో "తుముకూరు " జిల్లాలో పుట్టారు. ఆవిడ తల్లీతండ్రులు కిషన్ గారు, లలిత గారు. కిషన్ గారు రైల్వే లో పని చేయడం వలన భారత దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు. బహుశా ఈ కారణం వలనేనేమో రాణీ గారికి పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించేలా చేసింది. రాణి గారికి నలుగురు అక్కలు, ఒక అన్నయ.


పాటల ప్రస్థానం :



అప్పుడు రాణి గారికి 8 ఏళ్ళ వయసు, మద్రాసులోని అన్నామలై మన్రాంలో  నటి వైజయంతి మాల గారు  చేసిన నృత్యప్రదర్శన కార్యక్రమంలో రాణి గారు " హృదయ్ సే పూజా కరో " అనే మీరా భజన పాడారు. అది నచ్చి సుబ్బిరామన్ గారు మరునాడు ఆవిడ ఇంటికి తబలా, హర్మోనియం తో వెళ్ళి శృతిలయలతో ఒక పాట పాడమన్నారు. ఆవిడ పాడిన విషాద గీతం నచ్చి మరునాడు కార్ పంపించి స్టూడియోకి పిలిపించారుట. అప్పుడు పాడిన పాట తమిళం లో "పారిజాతం ". రాణి గారికి అప్పటికి తమిళ్ రాదు. కానీ జిక్కి గారి సహాయంతో ఆ పాట పాడి సుబ్బిరామన్ గారి ప్రశంశలు పొందారుట.


ఆ తరవాత "ధర్మదేవత " (1952) లో "ఇదిగిదిగో ఇదిగిదిగో " అన్న పాట అప్పటి ప్రముఖ గాయణీమణి చేత పాడించారుట. కానీ ఆ గాత్రంలో చురుకుదనం లేని కారణం గా ఆ పాటలు మొత్తం రాణి గారి చేత పాడించారుట సుబ్బిరామన్ గారు. ఆ సినిమాలో "పాటకు పల్లవి కావాలోయ్ " పాట (రాగిణి మీద చిత్రీకరించారు) అప్పట్లో  విదేశీ బాణిలో ఉన్న హుషారు గీతాలలో ఒకటి. అది విన్నాక సుబ్బిరామన్ గారు ఆవిడ చేతే "పెళ్ళి చేసి చూడు " సినిమాలో "బ్రహ్మయ్య " "అమ్మా నొప్పులే " పాట పాడించాలని ఆర్డర్ వేసారుట. ఆవిడ గాత్రంలో హుషారు, చిన్న పిల్లల మాద్రవం తొణికిసలాడుతూ ఉండటంలో అప్పట్లో చిన్నపిల్లల పాటలకు ఆవిడనే ఎంపిక చేసేవారుట.


ఆ తరవాత ఎందరో జీవితాలను మార్చెసిన "దేవదాస్ " సినిమాకి సుబ్బిరామన్ గారు రాణి గారి చేత పాడించాలనుకున్నారు. ఆ సినిమా అన్నీ ప్రయోగాలతో మొదలయ్యిందే! అందరూ రాణి గారిని వద్దని వాదించారు వేదాంతం రాఘవయ్య గారు ససేమిరా అన్నారు. అంత ఆద్రతతో కూడిన గాత్రం ఎవరేనా ప్రముఖుల చేత పాడిద్దామని వేదాంతం గారు అంటే, అందుకు సుబ్బిరామన్ గారు ఒప్పుకోలేదు. పార్వతిగా సావిత్రినీ, ఆ పార్వతి గాత్రానికి రాణీని అప్పటి పెద్దలకు రుచించని విషయం. కానీ ఆ సినిమాయే ఇద్దరికీ బాగా పేరు తెచ్చిపెట్టింది. తీరా పాడేటప్పుడు "బాగా ఏడుపు కనిపించే పాట " అని చెప్పారుట రాణి గారితో సుబ్బిరామన్ గారు. అప్పుడు రాణీ గారు నిజంగా ఏడుస్తూ పాడారుట పాటని.  సుబ్బిరామన్ గారు " పాటలో ఏడుపు ఉండాలి, కానీ నువ్వు ఏడవకూడదు, ఏడుపంతా కంఠలో ఉంచుకొని పాడాలి " అని చెప్పారుట. పదకొండేళ్ళ పిల్లకి ఆయన  చెప్పింది ఎమర్ధమయ్యిందో కానీ " అంతా బ్రాంతి యేనా " పాట మాత్రం వారి నుండి వచ్చి జనాలకు ఏడిపించింది.


అదే సినిమాలో "చెలియ లేదు చెలిమి లేదు " అనే పాట గాన గంధర్వుడు ఘంటసాల గారితో పాడాల్సి వచ్చింది. పక్కన ఘంటసాల గారిని చూసి ఏమయ్యిందో పాపం రాణి గారి గొంతు పెగల్లేదు. ఘంటసాల గారు ఓర్పుతో పిల్ల పాడేవరకు చూసారుట. అక్కడ ఉన్న సిబ్బంది " వేరే ఇంకెవరి చేతేనా పాడిద్దాము.విషాదంతో గుండె బరువెక్కి పాడే ఈ పాట ఈ చిన్న పిల్ల పాడలేదు " అని అన్నారు. పాపం ఈ మాటలకి సుబ్బిరామన్ గారు చాలా కలత చెందారు. "ఏం ఘంటసాల అంటే ఏదైనా పులా? నువ్వు పాడకపోతే పైన ఉన్న ఫాన్ నీ ఊడదీసి నీ నెత్తిమీద పడేస్తాను " అని అరిచారుట. అంతే రాణి గారు పాట అందుకున్నారు.  ఆ తరవాత ఘంటసాల గారి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "మాయబజార్ " , "లవకుశ " మొదలైన సినిమాలలో రాణి గారు పాడే అవకాశాలు ఇచ్చారు. పాట విని సావిత్రి గారు కూడా "  ఏంటీ పార్వతికి ఈ పిల పాడిందా? " అని ఆశ్చర్యపోయారుట. సుబ్బిరామన్ గారు తనకి తండ్రిలాంటి వారని ఆయనే అందరికన్నా తన మీద నమ్మకం పెట్టుకొని ప్రోత్సహించారని రాణి గారు చెప్పారు. ఆయన అకాల మరణం తనని కలచివేసిందని చెప్పారు.


ఈ సినిమాకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ రాణి గారు.. దేవదాస్ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు అందరూ సినిమా అయ్యక లేచి వెళ్ళిపోయారు, నేను మాత్రం సీట్ లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఇంతలో ఏ.ఎన్.ఆర్ వచ్చి "ఏవయ్యింది? ఎందుకేడుస్తున్నావు? " అని అడిగారు.


"పాపం దేవదాసు చనిపొయాడు "


"నేనే దేవదాస్ ని.. ఏడవకు " అని ఏ.ఎన్. ఆర్ అన్నారు


"అరే ఎలా బ్రతికిపొయారు " అని ఏడుస్తూనే అన్నాను...


అప్పుడు ఏ.ఎన్.ఆర్ గారు నెత్తి మీద కొట్టి "ఇంటికి వెళ్లు" అని అన్నారు.


ఏ.ఎన్. ఆర్, సావిత్రి ఆటోగ్రాఫ్ అడిగారుట రాణి గారు. "కాయితం ఏది? " అని అడిగారు సావిత్రి గారు. తన దగ్గర ఉన్న రూపాయి నోటు ఇచ్చి దాని మీద సంతకం చేయమన్నారుట రాణి గారు. సావిత్రి గారు అలానే చేశారు. ఏ.ఎన్.ఆర్ సంతకానికి కాయితం లేదు, ఏ.ఎన్.ఆర్  రాణి గారి చేయి తీసుకొని "ఐ లవ్ ... " అని రాసి ఒకసారి రాణి గారి వైపు చూశారుట. ఆవిడ కంగారు పడిపోయారు,  "ఆర్ట్ " అని రాసి "ఏం పిల్లా కంగారు పడ్డావా " అని నవ్వారుట.


ఇలా పాటలకే అంకితం అయ్యిపోయినందు వలన రాణి గారికి ఇంటికే టీచర్లని పిలిపించి పాఠాలు, తమిళం, కన్నడ, మళయాళం నేర్పించేవారుట. ఆవిడకు ఏదైనా ఒక్కసారి చెబితే గుర్తుండిపోతుంది. ఎనిమిది  భాషలలో ఆవిడ అనర్గళంగా  మాట్లాడగలరు. రాణిగారు పాట విని బాగా పాడుతున్నావు .. సంగీతం నేర్చుకోకూడదు " అని పి. లీల గారు అన్నారుట. అలా అన్నందుకే ఆవిడ  వద్దే రాణి గారు సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ ద్వారా "గురువాయూరప్ప " ని కొలవడం నేర్చుకున్నారు. " ఆ గురువాయూరప్ప భక్తి లభించిందంటే అక్కే కారణం " అని అన్నారు రాణి గారు.(లిల గారిని అక్క అని పిలిచేవారు).


కాని ఈ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాకే తనకు పాటలు పాడటమంటే భయం మొదలయిందట. అంతకుముందు ఎటువంటి సంకోచంలేకుండా పాడమనటం ఆలశ్యం హాయిగా పాడేసేదాన్ని…కానీ కాలక్రమేణా లీలగారి ప్రోత్సాహంతో, సహకారంతో కచేరీలు కూడా చేసే స్థాయికి ఎదిగాను. కచేరీలు కూడా చేశాను” అన్నారు రాణీ.  ఎవరైనా గాయనీ, గాయకులు తమలోని ప్రావీణ్యానికి ఈ శాస్త్రీయ సంగీతంతో సాన పెట్టటం వల్ల చాలా ఉపయోగం వుంటుంది”  అని అన్నారు రాణీ.


కె. రాణి గారు ఆరాధించే గాయణీ గాయకులు ఘంటసాల, లతా మంగేష్కర్ లు. ఒకసారి మద్రాస్ వుడ్లాస్ హోటల్ లో లతాజీ ఉన్నప్పుడు రాణి గారు కలిసి " మా ఇంటికి వస్తారా? " అని అడిగారుట. ఆవిడ "నువ్వు ఒక పాట పాడితే తప్పకుండా వస్తా  " అని అన్నారుట. అప్పుడు రాణీగారు "బచ్పన్ కే దిన్ భులానా దేనా.. ఆజ హసే కల్ రులానా దేనా " అని పాడారుట. అప్పట్లో రాణి గారు ఆవిడకు తెలీకుండానే లతగారి గొంతుని అనుకరించారుట. మరునాడు ఇంట్లో రాణి గారి సందడి.. "లతా జీ  వస్తారు " అంటూ అందరికీ మరీ మరి చెప్పసాగారుట. ఇంట్లో వారు "ఏదో చిన్నపిల్లవని నిన్ను సముదాయించడానికి అని ఉంటారు.. నిజంగా ఆవిడేమీ రారూ " అని ఆటపట్టించారుట. పాపం సాయంత్రం 7 అయినా రాకపోయేసరికి రాణీ  మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉన్నారుట. ఇంతలో తలుపు చప్పుడయ్యిందిట. "ఎవరూ " అని రాణిగారు అరవగా "మై హూ లతా " అని జవాబు వచ్చిందిట. లతా మంగేష్కర్, మదన్ మోహన్ గారితో కలిసి రాణి గారి ఇంటికి వచ్చారు. అంతే ఒక్క ఉదుకున పరిగెడుతూ వెళ్ళి ఆవిడ కాళ్లని చుట్టేసుకున్నారుట. "చల్ ఉఠ్ పగ్లీ " అని ఆవిడను లేవదీసి పక్కన కూర్చోబెట్టుకొని పాటలు పాడించుకున్నారుట లతా మంగేష్కర్.


ఆవిడతో పాటు వచ్చేస్తానని రాణి గారు మారాము చేస్తే " సరే " అని లత గారు వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఆవిడే స్వయంగా "పూరణ్ పోళీ (బొబ్బట్లు) " చేసి తినిపించారుట. వెళ్లే ముందు రాణీ గారి చేతిలో ఒక కృష్ణుడి బొమ్మ ఉంచి "మంచి గాయణి అవుతావు " అని దీవించారుట లత. లత గారు ఆంధ్ర వచ్చినప్పుడు రాణి గారి వద్దే ఆవకాయలు తీసుకొనేవారుట.


అలాగే ఘంటసాల గారి ఇంట్లొ వారి పిల్లలతో సమానంగా ఘంటసాల గారి అమ్మగారు రాణిగారికి నోట్లో  అన్నం పెట్టేవారుట. అలాగే వైజయంతి మాల గారు రాణి గారిని సొంత చెల్లెలుగా చూసుకునేవారుట. ఇద్దరు ఒకే కంచం లో తిని,  ఒకే మంచం మీద పడుకొని పాటలు పాడుకునేవారుట. వైజయంతి మాల గారి డాన్స్ కి రాణి గారు పాటలు పాడెవారుట(లతా మంగేష్కర్వి).


వివాహం :


రాణి గారి బావగారి (అక్క భర్త) స్నేహితులు శ్రీ సీతారామరెడ్డిగారు. సీతారామరెడ్డి గారి తండ్రి బొబ్బిలి రావు బహదూరు సుబ్బారెడ్డి , తల్లి ఓబులమ్మ. సుబ్బారెడ్డిగారు కలెక్టరుగా పని చేశారు. సీతారామరెడ్డిగారికి హైదరాబాద్ లో సదరన్ మూవీటోన్ స్టూడియో వుంది. నిర్మాతగా”సతీ అరుంధతి”-“నిజం చెబితే నమ్మరు” చిత్రాలను నిర్మించారు. రాణి గారిని చూసే వంకతో వారి బావగారి ఇంటికి  వస్తూ ఉండేవారుట. ఒకరోజు పెళ్ళి ప్రస్తావన తీసుకొని రాగా, రాణి గారు ససేమిరా అన్నారుట. కానీ రాణి గారి బావగారు మధ్యవర్తిత్వం వహించి వారిరువురుకీ 1966 వివాహం జరిపించారుట.  ఆ తరవాత ఆవిడకు కొన్ని సినీ అవకాశాలు వచ్చినా భర్తకి ఇష్టం లేని కారణం గా వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరవాత సీతారామరెడ్డి గారు తీసిన "సతీ అనసూయ " సినిమాకు గానూ ఆవిడకు పాడే అవకాశం ఇచ్చారుట సీతారామరెడ్డి గారు. "సినిమా  పాటలు పాడవద్దన్నారుగా, ఇప్పుడు ఇది కూడా సినిమా పాటే.. నేను పాడను " అని అన్నారుట. కానీ తరవాత సీతారమరెడ్డి గారు బ్రతిమాలగా పాడారుట. 


ఆ తరవాత ఘంటసాల గారి సంగీత దర్శకత్వం లో  వచ్చిన " వస్తాడే మా బావ " అనే సినిమాకు పాడారు. ఆవిడ మొట్టమొదట పాడింది విషాద గీతం అవ్వడం వలన ఆవిడ  జీవితం  కూడా విషాదమయం అయ్యిందేమో అని బాధపడ్డారు రాణి గారు. పెళ్ళైన పదేళ్లకే భర్త పోయారు. ఆవిడ కూతుర్లు విజయ, కవిత అప్పటికి చాలా చిన్నపిల్లలు. వారిని చుసుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది. కాబట్టి పాటలకు, సినిమాలకు దూరం అయ్యి.. తల్లిగా పూర్తి జీవితం గడిపారు.



రాణి గారు గాయణి గా ఉన్నది కొద్ది కాలమైనా ఎన్నో అద్భుతాలను చేశారు. శ్రీలంక జాతీయ గీతం ఆలపించిన తెలుగు మహిళ ఆవిడే (సంగీతం సుసర్ల దక్షిణా మూర్తి గారు)! తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, సింహళి, ఉజ్బెక్ భాషల్లో పలు పాటలు ఆలపించారు.  మదరాసులో షిప్పింగ్ వ్యాపారంలో వున్న తమిళ ముస్లీములు హనీఫా వారి కోసం 150 కి పైగా భక్తి గీతాలను పాడారుట రాణి గారు. ఆ సమయంలోనే రాజ్ కపూర్, నర్గీస్, ముకేష్, దిళిప్ కుమార్, తలత్ మెహమూద్ గార్లతో పరిచయం ఏర్పడింది. ఆవిడ రాజ్ కపూర్ "జిస్ దేష్ మే గంగా బెహతీ హై " లో "ఓ మైనే ప్యార్ కియా " పాడరుట. ఆ తరవాత స్టేజ్ మీద రాజ్ కపూర్ మాట్లాడుతూ " వో చోటి లడ్కీ కహా హై " అని అడిగారుట. ఎవరో  రాణి గారిని స్టేజ్ మీదకు తీసుకొని వస్తే " ఈ సత్కారం నాకు కాదూ.. నీకు చెయ్యాలి " అని తన మెడలో ఉన్న పుల మాల రాణి గారి మెడలో వేశారుట. చిన్నతనం , అమాయకత్వం "అయ్యో రాజ్ కపూర్ నన్ను పెళ్ళి చేసేసుకున్నారా" అని తల్లి దగ్గర ఏడ్చారుట రాణి గారు. ఆవిడ తల్లి "నోరు మూయ్.. పిచ్చి మాటలు " అని తిట్టారుట.


అప్పటి గాయకులలో రాణి గారు చిన్నవారు కావడంతో స్టూడియోకి రాగానే పాలు, ఫలహారాలు పెట్టి ముద్దుగా చూసుకునేవారుట అందరూ . పాట పాడటం అయ్యాక ఆవిడకు చాకులెట్లు ఇచ్చేవారుట. భారత రాష్ట్రపతి డా: సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు రాష్ట్రపతి భవన్ లో పాడి ఆయన ప్రశంసలతోపాటూ ఆయన ఆశీసులు పొందిన భాగ్యశాలి. 1955 లో ఆనాటి మదరాసు రాష్ట్ర(తమిళనాడు)ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ రాణీకి బంగారు కృష్ణుడు వున్న బంగారు గొలుసును బహూకరించటమే కాక”మెల్లిసై రాణి”అనే బిరుదు ప్రదానం చేశారు. రాజగోపాలాచారి సమక్షంలో పాడి ఆయన మెప్పు పొందారు. ఆయన రాణీని “నీకు చాలా ఉజ్జ్వలమైన భవిష్యత్తు వుంది” అని ఆశీర్వదించారట. ప్రముఖ హిందుస్తానీ విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ ఘంటసాల ఇంట్లో బస చేసినప్పుడు రాణీ పాటను విని “నువ్వు మంచిగాయకురాలివి అవుతావు. నీకు మంచి భవిష్యత్తు వుంది” అని  ఆశీర్వదించారుట. లతతో పాటు రాణీ గారి ఇంటికి వచ్చిన మదన్ మోహన్(హిందీ సంగీత దర్శకులు) " బాగా సాధన చెయ్యి..మంచి గాయణివి అవుతావు " అని ఆశీర్వదించారుట. ఇవే ఆవిడకు లభించిన అవార్డ్లు.


నేను ఆవిడని కలవడానికి వెళ్ళినప్పుడు "నేను ఇంకా బ్రతికున్నానని ఈ ప్రపంచానికి తెలుసా? " అని అడిగారు. వీడియో తీస్తునప్పుడు ఆవిడకు పాటలు గుర్తొచ్చెవి కావు, వీడియో ఆపేశాక పాడటం మొదలెట్టెవారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆవిడకు ఏదైనా పాట గుర్తుకొస్తే పాడేవారు. ఎన్నో  జ్ఞాపకాలో పంచుకున్నారు ఆవిడ. ఆవిడ పెద్ద కుమార్తే విజయ గారి వద్ద ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యతో జూలై 13 వ తారీఖున 2017 న హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు రాణి గారు. ఆవిడ భౌతికంగా దూరమైనా పాటలతో ఎప్పటికీ  చిరంజీవే! 


ఆవిడ పాడిన కొన్ని తెలుగు పాటలు :


1. అంతా బ్రాంతియేనా(దేవదాసు)

2. చెలియ లేదు చెలిమి లేదు(దేవదాసు)

3. దయచేయండి దయచెయండి (ఒకటే మా వయసు.. మాయాబజార్)

4. రామన్న రాముడు కోదండ రాముడు (లవ కుశ)

5. బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య,  అమ్మ నొప్పులే అమ్మమ్మ నొప్పులే(పెళ్ళి చేసి చూడు)

6. చందమామ ఇటు చూడరా (శభాష్ రాముడు)

7. ఎవడే ఎవడే చల్లని జల్లులు (చంద్రహారం)

8. రావోయి వరా నా ఏలిక (చండీ రాణి)

9. చిన్నరి చేతులా (అన్నా తమ్ముడు)

10. తినబోతూ రుచి అడగకు-తీయని కోర్కెలు దాచకు ((చివరి పాట)వస్తాడే మా బావ)

11. ఇదిగిదిగో  ఇదిగిదిగో (లంబాడి లంబాడి లంబ లంబ.. )(ధర్మ దేవత)

12. పాటకు పల్లవి కావాలోయ్ ( ధర్మ దేవత)

13. ఏ ఊరే చిన్నదానా (ధర్మ దేవత)

14. కొండ మీది కొక్కిరాయి (జయసింహ)

15. విరిసే చల్లని వెన్నెల(లవకుశ)

16. అశ్వమేధ యాగానికి జయము జయము జయము(లవకుశ)

17. ఓ పంతులు గారు (పిచ్చి పుల్లయ్య) 

 

 

 



 

Monday, May 6, 2019

కె. రాణి

సన్మిత్రులకు నమస్కారములు!! తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హింది, బెంగాలి, ఉజ్బెక్ భాషల్లో పాడిన తెలుగు గాయనీమణి... కె. రాణి గారు. మొదట పాటే గుండెలని పిండేసే విషాద గీతం.. అదే "అంతా భ్రాంతి యేనా(దేవదాసు సినిమాలోది). " . ఆ పాట పాడేటప్పటికి ఆవిడ వయస్సు 11 సంవత్సరాలు మాత్రమే!

ఆవిడజీవిత విశేషాలు ఆవిడ ద్వారా తెలుసుకుంద్దాము...



Monday, April 15, 2019

బ్యాగోపాఖ్యానం

పాత బండారులంక దగ్గర హ్యాండ్ బ్యాగ్ మామ్మ గారు ఎక్కేవారు, ఆవిడ చేతిలో ఒక హ్యాండు బ్యాగు ఉండేది. అప్పుడప్పుడు ఆ బాగులో నుండి బిస్కెట్టు పాకెట్టు తీసి రెండు బిస్కెట్లు నోట్లో వేసుకొని, ఒక చిన్న బాటిల్ తో నీరు తాగేవారు. మరి కొన్ని సార్లు చిప్స్ తినేవారు (మాకూ ఇచ్ఛేవారు లెండి). ఆ హాండ్ బ్యాగ్ లో నుంచి అప్పుడప్పుడు మాకు సంపెంగి పూలు(మరి కొన్నిసార్లు మల్లెదండలు) తీసి ఇచ్చేవారు. ఆవిడ పేరు చాలా మందికి తెలీదు కానీ బస్సు డ్రైవర్ నుంచి ఎక్కే జనాల వరకు అందరూ "హ్యాండ్ బ్యాగ్ మామ్మగారు " అని అనేవారు ఆవిడని. నా దృష్టిలో ఆ హ్యాండ్ బ్యాగు లో నుంచి క్షేరసాగర మధనం లో వచ్చే వస్తువులన్నీ వస్తాయేమో అని అనిపించేది. ఆవిడ ఆ హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని ఒక్కసారిగా బస్సు నుండి గంతుతూ దిగినప్పుడు కుప్పించి ఎగసిన పద్యములో " ఉరికిన యోర్వగ ఉదరంబులో నున్నజగముల వ్రేటున జగతి కదల " అన్నట్టు ఆవిడ బ్యాగులో ఉన్న వస్తువులన్నీ అల్లకల్లోలం అయ్యిపోయి ఉంటాయనిపించేది.

చిన్నప్పుడు ఇలా మాయల ఫకీరుల సంచీలాంటి హ్యాండ్ బ్యాంగ్ ని చూస్తే అందులో ఏముందో అన్న కుతూహులం చాలా ఉండేది. కాలక్రమంలో ఆ జోలీ నా భుజస్కందాల మీదకు కూడా వచ్చేసింది.

ఎప్పుడైన బయటకు వెళ్తే ఇంటి తాళాలు పక్కవారికొకటిచ్చి, ఇంకోటి బ్యాగులో వేసుకుంటాము. ఆ తరవాత ఎండలో వెళ్ళాలి కాబట్టి చిన్న గొడుకు, ఒక నీళ్ల బాటిలు తప్పనిసరి. ఏమో ఎక్కడేనా ఆకలి వేస్తే... ఒక చిన్న బిస్కెట్టు పాకేట్టో లేక ఒక నూట్రిషన్ బారో ఉంచుకోవాలి. అసలే ఆడవారు రెండు రకాలు.. ఒకటి ముడిపదార్ధాలు, ఇంకొకరు జడపదార్ధాలు... మరి బ్యాగులో దువ్వెన, రబ్బర్ బాండ్లు, ముడి పిన్నులు ఉండాలి కదా! చీరలకి పెట్టుకునే పిన్నులు, పిన్నీసుల కట్టా, బొట్టుబిల్లలు మొదలైనవి. (సుమంగళీ కి చిహ్నాలైన ఈ ఐదోతనాన్ని బ్యాగ్గులలో భద్రంగా దాచుకుంటూ). పాస్ పోట్ల నుంచి పాల కూపన్ల వరకు, బంగారు ఆభరణాల నుండి బండి తాళాల వరకు అన్నీ దాచుకొనే ఏకైక స్థలం.. ఈ హ్యాండ్ బ్యాగులు. ఇవి చాలవన్నట్టు ప్రయాణాలలో భర్తగారి పర్సులు, కళ్ళజోళ్లు, పెన్నులు. పిల్లల విడియో గేంస్ కూడా ఈ బ్యాగులో చేరతాయి. అప్పుడెప్పుడో చూసిన బాహుబలి సినిమా టికెట్లు, ఆ తరవాత తిన్న హోటల్ బిల్లు కూడా ఉంటాయి ఈ బ్యాగులో!

ఎవరింటికేనా వెళ్తే వారిచ్చే తాంబూలము, జాకెట్టు ముక్క, అందులో ఉంచిన అరటి పండో, బత్తాయి పండో ఈ బ్యాగులో పాడేసుకుంటాము. (ఎప్పుడో కంపువాసన వచ్చినప్పుడు కానీ ఈ పళ్ల విషయం గుర్తుకురాదు) . ఏ సమయానికి ఏ అవసరమొస్తుందో అని తలనొప్పి టాబెలెట్లు (ఎవరికి అని అడగొద్దు), జ్వరానికి పారాసిటిమాల్ , బ్యాగులో తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇన్ని దాచుకున్న బ్యాగు 'ఉరుకోదరుడి " లా ఎలా ఉంటుంది? కప్పని తిన్న పాములా, తొమిదోనెల గర్భిణిలా నిండుగా ఉంటుంది. చుట్టుపక్కల అమ్మలక్కల విషయాలన్నీ పొట్టలో దాచుకున్న పనిమనిషి కడుపులా ఎప్పుడెప్పుడు నోరు తెరిచేదామా అనట్టుంటుంది ఈ హ్యాండ్ బ్యాగు.

ఒకసారి మెమంతా పాపికొండలు చూడటానికి వెళ్ళాము. గోదావరి మధ్యలో ఒక చిన్న గుడి దగ్గర ఆపాడు. అక్కడ గోదావరికి నమస్కరించి పసుపు, కుంకుమ వెయ్యాలని చెప్పారు ఎవరో పెద్దవారు. బ్యాగులో చెయ్యి పెట్టి కాసేపు (పావుగంటే) వెతకగానే పసుపు కుంకుమ దొరికేశాయి. చక్కగా గోదావరికి నమస్కరించుకున్నాము.

మొన్న ఈ మధ్యనే తెలిసినవారి ఇంటిలో ఫంక్షన్ కి వెళ్ళాను, వారు ఇచ్చిన గిఫ్ట్, ప్రసాదం బ్యాగులో వేసుకున్నా, నా ఫ్రండ్ " నా కాలి చుట్లు కొత్తవి కొన్నాను ఇవి నీ బ్యాగులో వేసుకోవా? " అని అడిగింది. తీరా ఇంటికి చేరాకా నా చుట్లు ఇవ్వవా అని అడిగితే, నా బ్యాగ్ బోర్లించీ "నీ చుట్లు నువ్వు తీసుకో.. ఈ లోపల టీ తెస్తాను " అని చెప్పి లోపలకి వెళ్ళా, పాపం పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి వెతికినట్టు వెతుకుంది. దాని పిల్లలు " 5 సెకన్స్ లో ఈ చెత్తలో ఉన్న టొమాటో సాస్ ఎక్కడుందో చెప్పుకోవాలి " అంటూ హిడెన్ ఎక్స్ప్రెస్ ఆడుకున్నారు. (అప్పుడెప్పుడో సండ్ విచ్ కొన్నప్పుడు ఇచ్చిన టొమాటో సాస్ పాకెట్.. బ్యాగులో వేసుకున్నా), అయినా ఈ హ్యాండ్ బ్యాగ్ ఏవైనా కృష్ణ బిలమా? వెళ్ళిన వస్తువు మళ్ళీ కనిపించాపోడనికి? కాస్త ఓర్పుగా వెతికితే అదే దొరుకుతుంది.

పిల్లలు టి.వి. లో డోరేమాన్ చూస్తూ ఆ డోరేమాన్ ఎవరికి ఏమి కావాలన్నా బ్యాగ్ లో చెయ్యిపెట్టి ఇస్తూ ఉంటాడు, ఆ డోరేమాన్ దగ్గర ఉన్న బ్యాగు లాంటి బ్యాగు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. ఈ ఆడవారి హాండ్ బ్యాగులు అలాంటివే అని పాపం వారికి తెలీదు. పిల్లలంటే గుర్తొచ్చింది.. చంటి పిల్లల తల్లులకైతే సెపరేటుగా ఇంకో చేతిలో డైపర్ బ్యాగులు కూడా ఉంటాయి. ఈ మధ్య బ్యాగులలో పెప్పర్ స్ప్రె లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎంతైనా ఈ ఆడవారి హాండ్ బ్యాగులు ఎన్ని దాచుకున్న ఇంకా చోటు ఉండే పుష్పక విమానాలు.

భూభారం మోసే ఆదిశేషుడు కంటే గొప్పవారెవరూ? అష్టదిక్కులని తమ భుజాల మీద మోసే గజాల కన్నా ఓర్పు గల వారెవరూ? ఏంటీ... యక్ష ప్రశ్నలలా ఉన్నాయా? జావాబు ఏంటో తెలుసా? ఆడవరి హాండ్ బ్యాగులు. ఏంటీ నమ్మరా? సరే మీ ఇళ్లల్లో ఇంతులు వాడే హాండ్ బ్యాగ్ ని ఎప్పుడేనా ధైర్యం తీసి చూశారా? చూసినవారికే తెలుస్తుంది అందులో ఉన్న నిధి నిక్షేపాల గురించి. ఈ హ్యాండ్ బ్యాగ్ కి గనక మాటలొస్తే ఎన్ని తిట్లు తిడుతుందో? ప్రాణం వస్తే మాత్రం "డొమెస్టిక్ వాయిలెన్స్ " కి సంబంధించిన అన్నీ కేస్ లు పెట్టెస్తుంది.

ఆడవారి ఓర్పుకు, ఈ హండ్ బ్యాగులకు అవినాభావ సంబంధం ఉంది. కడుపులో ఎంతో దాచుకుంటారు!  నోరు ఉంది కదా అని బయటకు చెప్పరు ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి(బ్యాగులో వస్తువులు). ఇంటి బాధ్యతలని తన భుజస్కంధాల మీద మోస్తున్న స్త్రీ మూర్తుల సన్నిహిత నెచ్చెలి.. ఈ హ్యాండ్ బ్యాగు.