మేరుపర్వత గంభీరులు, సున్నిత మనస్కులు, మూర్తీభవించిన సంస్కారము, సాహితీ ప్రియులు, అన్నిటి కన్నా ముఖ్యంగా చెప్పుకోదగిన విశేషం... ఆయన నడిచే తెలుగు నిఘంటువు.... ఆయనే శ్రీ కొంపెల్ల రామకృష్ణ మూర్తి గారు. వారిని చూడటమే ఒక యోగం, ఆయనతో మాట్లాడటమే ఒక భాగ్యం, ఆయన ఆశీస్సులు పొందటం పూర్వ జన్మ ఫలము.
శ్రీ కొంపెల్ల రామకృష్ణ గారు 1949 డిసెంబరు 25 న జన్మించారు. వారు తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ గారు, తండ్రి శ్రీ వేంకటేశ్వర్లు గారు. వారి విద్యాభాస్యం కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠములోనూ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలోను జరిగింది. వారు 1976 నుంది 2007 వరకు గోదావరిగని లో సీనియర్ తెలుగు పండితుడిగా చేసి ఎందరినో విద్యావంతులుగా చేశారు. వారి తెలుగు భాష అమోఘము. వారు గొంతెత్తి పద్యము పాడితే చెవులకు తుప్పులొదిలిపోవాల్సిందే! తేనెలో ఊరేసిన రసాలమామిడి ఆయననోట తెలుగు మాట. ఒకప్పుడు దూరదర్శన్ లో ఏలూరుపాటి అనంతరామయ్య గారు నిర్వహించిన 'పద్యాల తోరణం " లో వారు పాల్గొన్నారు.
చాణక్య నీతి అని రోజుకొక పద్యం ఫేస్ బుక్ లో పెడుతూ తెలుగు భాషా సేవ చేస్తున్నారు. అంతే కాదు "ఆంధ్ర మహాభారతా " న్ని ఎందరికో అందుబాటులోకి తీసుకొని రావడానికి సులభమైన భాషలో రాస్తున్నారు. త్వరలోనే అది కూడా పూర్తవుతుంది.
వారి అర్ధాంగి భాస్కర లక్ష్మిగారు కూడా అన్నిటా ఆయనకి సమానురాలే! వారిరువురిని కలిసే భాగ్యము నాకు లభించింది. వారి ఆదరాభిమానాలు పొందగలిగిన అదృష్టవంతురాలిని నేను. మాష్టారు, పిన్ని గారు.... అనేక పాదాభివందనాలు.
మాష్టారూ! గంగా జలం తీసుకొని రాడానికి నేనో చిన్న గిన్నె తీసుకొని వెళ్ళిన అమాయకురాలిని. మీ నుంచి కూడా అలానే కొంచమే తీసుకొని రాగలిగాను. ఇది నా తెంపరితనముగా భావించకండి, నా అమాయకత్వం అని గ్రహించి క్షమించండి!