Search This Blog

Tuesday, February 20, 2018

ఋష్యేంద్రమణి

ఈ మధ్య "మాయాబజార్ " సినిమా చూశా.. (మొదటి సారి కాదు.. ఎన్నో సారో గుర్తు లేదు). సుభద్ర,అభిమన్యులును కృష్ణుడు దారకుడికి అప్పగించి "ఘటోత్కజుడి ఆశ్రమం" కి తీసుకెళ్ళమని చెబుతాడు. తీరా వెళ్ళేటప్పుడు మాధవపెద్ది సత్యం పాట.. అదేనండి భళి భళి భళీ దేవా వస్తుంది. ఆ దారకుడు కూడా మాధవ పెద్ది సత్యమే ( ఇది మాకు తెలుసు అనకండి). పాట అయ్యేటప్పటికి రాక్షసులు అభిమన్యుడిని అడ్డగిస్తారు. వారందరినీ చంపేస్తాడు అభిమన్యుడు. ఇంక ఘటోత్కచుడు ఎంటర్ అవుతాడు. కాసేపు ఫైటింగ్ అయ్యాక.. "పేరు చెప్పి శరణు వేడు, వదిలేస్తా " అని వార్నింగ్ ఇస్తాడు ఘటోత్కచుడు. "పిరికివాడిలా పేరు చెప్పడం ఎందుకు " అని భీష్మించుకుంటాడు అభిమన్యుడు. ఇంతలో ఘటోత్కచుడి గద తగిలి అభిమన్యుడు మూర్చపోతాడు.

 

మన సుభద్ర గారు విల్లు ధరించి....

"అఖిల రాక్షస మంత్రతంత్ర అతిశయమణచు శ్రీకృష్ణుని సోదరినగుదునేమీ

దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనకు అర్జును పత్నినే అగుదునేని "

 

అంటూ అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల 'ప్రవర ' చెప్పేస్తుంది. ఉత్తి పేరు చెప్పమంటే ఇంత సీన్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఇంత గొప్ప పరిచయమా? అదేదో ముందుగా చెప్పి ఉంటే అభిమన్యుడు మూర్చ పోయేవాడు కాదు కదా!

 

అదీ కాక " ఈ శరంబు అసురు గూల్చి సిద్ధించు గాక.. పాండవకులైక భూషణ ప్రాణ రక్షా " అని అంటుంది. ఈ పద్యము "ఋషేద్ర మణి గారు " బహు బాగా పాడారు కానీ.. "పాండవ కులైక భూషణుడు " అభిమన్యుడొక్కడే కాదు కదా? ఎదురుగ ఇంకో భూషణుడు అదే ఘటోత్కచుడు ఉన్నాడు. అదీ కాక ఉపపాండవులూ ఇంకా ఉన్నారు ( సినిమాలో పాండవులే లేరు ఈ ఉపపాండవులెక్కడా అని అడగకండి). ఇంత మంది భూషణులు ఉండగా పాపం ఆవిడ ఎకైక భూషణుడని అభిమన్యుడికి కీర్తించేస్తే ఎలా? ఇది అప్పుడు ఎవరూ అడగలేదా? అడిగినా చక్రపాణి గారు , పింగళి గారు "ఎవరూ కల్పించకపోతే కట్టు కథలు ఎలా పుడతాయి ? " అని అనేశారా?

 

అప్పుడు వాళ్ళు అడగకపోయినా ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఏడిచినట్టే ఉంది.. ఎవర్ని అడుగుతావు అని అడగొద్దు. నా ప్రశ్న ఏడ్చినట్టున్నా, ఏడ్చి మొహం కడుకున్నట్టున్నా.. అడిగేస్తాను.. అంతే!

 

 

ఈ రోజు ఋష్యేంద్రమణి గారి పుట్టినరోజు... ఆ పద్యం... ఆ ఠీవి చూసేయండి.. ఈ ప్రశ్నలన్నీ మరచిపోవచ్చు.

 

 

 

 

Thursday, February 1, 2018

రాజన్- నాగేంద్ర

సప్తస్వర.. ఆయన నివాసం

సరిగమలు.. వారి నేస్తం

సరస్వతీదేవికి వారి ఇల్లే ఆవాసం

రెండు దశాబ్ధాలు దక్షిణ సినిమా సంగీతాన్ని ఏలినది ఆ యుగళం...



వారే... రాజన్- నాగేంద్ర.. సంగీత ద్వయం...

ఖైదీ కన్నయ్య చేత ' పూజ ' లెన్నో చేయించి, వారికి  "నవగ్రహ పూజా మహిమా " 'కనకదుర్గ పూజా మహిమ ' తెలియచేసి,' సొమ్మొకడిది సోకొకడిదిగా ' జల్సా చేస్తూ,  'అప్పుల అప్పారావు' గా ఉన్న' అల్లరి బావ '  'నాగమల్లి 'ని చూసిన వెంటనే 'ప్రేమఖైది '  ని చేసి,  ఆ 'అమ్మాయి మనసు ' ని అర్ధం చేసుకుని, వారి 'చూపులు కలిసిన శుభవేళ ' వారి చేత 'పణయ గీతం ' పాడించి, వారి ప్రేమని 'మంచు పల్లకి ' ఎక్కించి, వారిని "మూడు ముళ్ళ బంధం' తో కలిపి  వారిని "వయ్యరి భామలు - వగలమారి భర్తలు " చేసి, వారి "ఇంటింటి రామాయణాన్ని " ' పంతులమ్మ ' గా మనందరికీ తెలియచేసి ' కోటికొక్కడు ' గా మిగిలిన  'అగ్గి పిడుగు " లు రాజన్ నాగేంద్ర గార్లు.  


ఎనుబది పదులలో కూడా సంగీత సేద్యం చేస్తున్న వారు రాజన్ గారు. ఆ మహానుభావుడు నిత్య సంగీత కృషివలుడు . వారు ప్రస్తుతం బెంగుళూరు నగరంలో ఉంటున్నారు. 



ఐరావతం రాజప్ప గారు చాలా గొప్ప సంగీతాభిమాని మరియూ గొప్ప సంగీత నిపుణులు. వారు తబలా, హార్మోనియం, వీణా, ఫ్లూట్ వాయించగలిగేవారు. వారి కొడుకులు రాజన్- నాగేంద్ర గార్లు కూడా తండ్రికి తగిన తనయులే! 


రాజన్ గారు 1932 లో మైసూర్ లోని శివరామ్ పేట లో జన్మించారు.  వీరు తెలుగు వారే కానీ కొన్ని తరాల క్రితమే మైసూర్ లో స్థిరపడిపొవడం వలన ఎక్కువ కన్నడ కలిసిన తెలుగు మాట్లాడుతారు! రాజన్ - నాగేంద్ర కు హార్మోనియం, వేణువులు నేర్పిన మొదటి గురువు వారి తండ్రి అయిన రాజప్ప గారే! ఆ తరవాత బిడారం కిష్టప్ప గారి దగ్గర, దేవేంద్రప్ప గారి దగ్గర కర్ణాటక సంగీతం అభ్యసించారు.  ఆ తరవాత బిడారం కిష్టప్ప తో కొన్ని కచేరీలు బెంగుళూరులోనూ, మైసూర్ లోనూ ఇచ్చారు ఈ అన్నదమ్ములు.  రాజన్ నాగేంద్ర లో నాగేంద్ర గాయకుడు కూడా! ఒకసారి మైసూర్ ప్యాలస్ లో జరిగిన వీరి కచేరి విని వారికి సంగీత దర్శకులు గా అవకాశం దొరికింది. అలా వారు 'సౌభాగ్య లక్ష్మి " అనే కన్నడ సినిమాకు తొలిసారి సంగీత దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి విఠలాచార్య దర్శకులు.


ఆ తరవాత విఠలాచార్య తెలుగులో తీసిన " కనకదుర్గ పూజా మహిమ " సినిమాకి కూడా ఈ జంటనే సంగీత దర్శకులుగా ఎన్నుకున్నారు. ఆ తరవాత వారు తీసిన "నవగ్రహపూజా మహిమ " సినిమాలో  చాలా పాటలతో బాటు జానకితో ఘంటసాల ఆలపించిన "ఎవరో.. ఏల పగబూని సాధింతురు " అన్న పాట ప్రేక్షకాధరణ పొందింది. తెలుగులో వీరి మొదటి సినిమా " వద్దంటే పెళ్ళి ". "ఖైదీ కన్నయ్య " లో " తియతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా " పాట కూడా ఆ రోజుల్లో చాలా పేరుపొందింది. 


ఆ తరవాత "అగ్గిపిడుగు " సినిమాలో "ఏమో ఏమో ఇది " అన్న పాట కూడా ప్రఖ్యాతిగాంచింది. 1976 లో వచ్చిన "పూజ " సినిమా లో వారు సమకూర్చిన అన్ని పాటలు  తెలుగునాట  ఈ రోజుకి మారుమ్రోగుతున్నాయి. 



1978 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డ్లు సంగీత దర్శకులకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తొలి అవార్డు "పంతులమ్మ " సినిమాకు గానూ రాజన్ నాగేంద్రలకు దక్కింది. ఆ సినిమా తరవాత 'నవతా కృష్ణం రాజు " తీసిన ప్రతి సినిమాకు వీరే సంగీత దర్శకులయ్యారు. 



సంగీత దర్శకత్వం వహించినకొన్ని తెలుగు సినిమలు :



పంతులమ్మ, ఇంటింటి రామాయణం, పూజ, సొమ్మొకడిది సోకొకడిది, నవగ్రహపూజా మహిమ, నాగమల్లి, తాతయ్య ప్రేమలేఖలు, అల్లరిబావ, అద్దాల మేడ, ప్రణయ గీతం, మంచుపల్లకి, వయ్యారిభామలు వగలమారి భర్తలు, నాలుగు స్థంబాలాట, అమ్మాయి మనసు, మూడు ముళ్ళు, పులి-బెబ్బులి, లంకె బిందెలు, రాజు-రాణి-జాకి, రెండు రెళ్లు ఆరు, ఆడపడుచు, చూపులు కలిసిన శుభ వేళ, ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, రాగ లీల, కోటికొక్కడు, దేవుని గెలిచిన మానవుడు, నాగార్జున, ఖైదీ కన్నయ్య, వరలక్ష్మీ వ్రతం, అన్నా చెల్లెలు, శ్రీ కృష్ణ గారడి, సర్దార్ ధర్మన్న, రౌడీ పోలీస్, వియజసింహ, అనురాగ బంధం, సీత పుట్టిన దేశం, అ ఆ ఇ ఈ.... 


నాగేంద్ర గారు కన్నడాలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎక్కువగా హాస్య నటులకు వీరు గాత్రం సరిపోతుంది. వారు నవంబర్ 3 2000 సంవత్సరంలో కన్నుమూశారు. 



ఎనిమిది పదుల వయసులో కూడా రాజన్ గారు సంగీత సేవ ఇంకా చేస్తూనే ఉన్నారు. వారు సమకూర్చిన కొన్ని పాటలు ఎస్.పి. బాలు గారి చేతా మరి కొందరు గాయకుల చేత పాడించి కొన్ని ఆల్బంస్ గా విడుదల చేశారు. ఇప్పుడు పురంధర దాసు కీర్తనలు స్వరపరుస్తున్నారు. కొంత మంచి యువ గళాలకు "వాయస్ కల్చర్ " మీద టుటోరియల్స్ ఇస్తున్నారు. వారి చేత పురంధర దాసు కీర్తనలు పాడించి ఆల్బంస్ గా విడుదల చేస్తున్నారు. వారి సేవ అద్వితీయం... ఆ సరస్వతీదేవి కటాక్షం వారి మీదా మెండుగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

 

 

 

 

 

 

 

 

Sunday, January 21, 2018

సంక్రాంతి స్మృతులు

ఒకప్పుడు మా ఊరిలో సంక్రాంతి అంటే పండగ శోభ అంతా ఆ ఊరిలోనే నిత్యవాసం చేసేది. ప్రతీ ఇంటి అరుగు మీద పట్టివర్ధనాలతో, అప్పుడే సంధ్యావందనం ముగించుకొన్న సోమయాజిలాంటి తాతగార్లు, పక్కన వారి మజ్జిగో లేక పాలో ఇవ్వడానికి కచ్చాపోస, కడియాలు, కాలికి నిండా పసుపు, తలలో ఓ మందారపువ్వు, మొహమ్నిండా పసుపు, మధ్యలో రూపాయి కాసంత బొట్టుతో సోమిదేవమ్మ లాంటి మామ్మ గార్ల్తో ఆ ఊరు మొతం కళకళలాడేది. ఆ ముసలి దంపతుల కొడుకుకోడల్లూ, ఆ తరవాత మా తరం వాళ్ళూ ఆ ఊరిలో ఉండేవాళ్ళము.


మా ఇంట్లో మా తాతగారు, మామ్మ, పక్క ఇంట్లో తాతతాతయ్య, గున్నమామ్మ, ఆ పక్క ఇంట్లో ఆవు మామ్మ, మీసాలతాతయ్య, ఆ పక్క శాస్త్రులు తాతగారు, రాజేశ్వరి మామ్మ, ఆ పక్క వీరన్న తాత, కావు మామ్మ.. ఇలా ఊరు ఊరంతా నిండుగా పూసిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉండేది.


ఊరు మొత్తం తాతగారి పెదనాన్న చిన్నాన సంతానమే అవ్వడంతో ఊరంతా మాకు బాబయ్యలూ, పెదనాన్ననూ, వారి సంతానమే! పండగ వస్తే ఇంటి అడపిల్లలు వచ్చేవారు. పండగ పిండి వంటలు కోడళ్ళు చేస్తే, పిల్లలకు తలస్నానాలు, వారి చేత భోగి మంటల్లో పిడకల దండలు వేయించడం అత్తల వంతు. పొగమంచులో కొబ్బరాకు పొయ్యి పెట్టి పెద్ద డేశాతో వేడినీళ్ళు కాచి ఆ నీళ్ళతో స్నానం. అదేంటో నీళ్ళు కూడా భలే మంచి వాసన వచ్చేవి. కంట్లో కుంకుడు కాయ పులుసు పడితే స్నానమయ్యాక ఒక ఉప్పు కణిక నోట్లో వేసుకొని తలకి పిడప కట్టుకొని భోగి మంటల దగ్గరకు పిడకల దండ వేయడానికి వెళ్ళేవాళ్ళము. ఒక పక్క పుష్యమాసం చలి, ఇంకో పక్క భోగి మంట వెచ్చదనం, ఓ పక్క కంట్లో పులుసు పడిన మంట, మరో పక్క ఆ భోగి మంటకు ఒక ఊరట, నోట్లో ఉప్పుకణిక , కన్నీటి ఉప్పదనం... ఏంటో అన్నీ కలబోతలే.


భోగి మంట అయ్యాక అందరికీ దండాలు... అలా డబ్బులు వసూలూ! అందరి ఇల్లకు వెళ్ళి దండం పెడితే రూపాయో రెండు రూపాయిలో ఇచ్చేవారు. ఆ ఇంటి మామ్మలైతే పండగ కోసం చేసిన జంతికలు, బెల్లం మిఠాయి ఇచ్చేవారు. అవి బ్రేక్ ఫాస్ట్ చేసి కొత్తబట్టలు అందరికీ చూపించి మురిసిపోయేవాళ్ళము. అప్పుడు పండగలకీ, పుట్టిన రోజులకే కొనుకునేవాళ్ళము కొత్త బట్టలు. కానీ ఆ కొత్తబట్టలు చూసుకొని చూసుకొని మురిసిపోయేవాళ్ళము. అదేంటో ఇప్పుడు ఇన్ని కొత్తబట్టలు కొన్నా ఆ ఆనందం లేదేంటో? చిన్నతనం పోయిందా? పెద్దరికం వచ్చిందా?

లేక మనసు మొద్దుబారిపోయిందా?


సాయంత్రం గొబ్బెమ్మల పేరంటాలు, బొమ్మల కొలువు పేరంటాలు. గట్టిగా పాటలు పాడి ఆ పేరంటానికి ఇచ్చిన ప్రసాదం తినేసి మళ్ళీ ఏదో సంబరంతో తిరిగేవాళ్ళము. కనుమ రోజు "ప్రభల తీర్ధం ". దాని వర్ణించడం కష్టమే... రెండు కళ్ళూ చాలవు చూడటానికి. 


అన్నిటి కన్నా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ముగ్గులు. చిన్నతనంలో వీధిలో ముగ్గు వేసే అర్హత రావాలంటే ముందు పెరట్లో వేయాలి. పెరట్లో ముగ్గు వెయ్యాలంటే అస్సలు ఇష్టముండేది కాదు. వీధిలో ముగ్గు వేసే ఛాన్స్ అత్తలు ఇచ్చేవారు కాదు. (అప్పటి ఇంకా చేతబడి ముగ్గులే వచ్చు). మా మామ్మ అనేది "పెరటి గుమ్మము పేద ముత్తైదువా ... అలా చిన్న చూపు చూడకూడదు... అక్కడ కూడా పెద్ద ముగ్గు వేయండి అని" . పెరట్లో జూనియర్స్ కి ముగ్గు వేసే అవకాశం వచ్చేది.


నేను ఇంటర్కి వచ్చాక వీధిలో ముగ్గు వేసే ప్రమోషన్ వచ్చింది. నేను ముగ్గు వేస్తుంటే మా తాతగారు కాపలా కూర్చునేవారు. చుక్కలు వేస్తుంటేనే అనేవారు " మంచు పడుతోంది.. ఇంక చాలమ్మ.. పద లోపలకి " అని. పాపం రాత్రి 9 గంటల కల్లా పడుకొనే వారు నా కోసం మాత్రం నిద్ర ఆపుకొని 11 గంటల వరకూ  మరీ కూర్చునేవారు. ప్రతీ అరగంటకోసారి "ఇక చాలమ్మ... మంచు పడుతోంది, వెళ్ళి పడుక్కో " అని అనేవారు.  దానికి మా మామ్మ అనేది " అది రేపు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్తే ఏవైపోతారూ? " అని...


అప్పుడు ఆ మాట సరదాగా అనిపించేది. కానీ నిజంగా నేను వెళ్ళిపోతే ఏవైపోతారో అని ఆలోచించలేదు. నేను అత్తారింటికి వెళ్ళిపోతే బెంగపెట్టుకొని ఆ ముసలి ప్రాణి తట్టుకోలేక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారని ఆ సమయంలో నాకు తెలియదు. తెలిసేటప్పటికి ఆయన లేరు.


Thursday, December 21, 2017

నూరు గొడ్లను తిన్న రాబందు

"పెళ్ళికూతురు ఎలా వుంటుంది వదినా "

"కార్తీక మాసం తేగలా ఉంది వదినా "

నాకు భలే నవ్వొచ్చింది. ఎందుకంటే ఆ పెళ్ళికి నేనూ వెళ్ళాను. ఆ పెళ్ళికూతురు సన్నగా తెల్లగా ఉంది.

ఇంతలో అటుగా వెళ్తొన్న మా ఊరి అల్లుడు గారు " ఆ పాలల్లో పడ్డ బల్లిలా ఉంది.. అదీ ఒక అందమే " అన్నాడు. బల్లి పాలలో పడితే ఎలా ఉంటుందో ఊహించుకున్నా... యాక్... ఛీ.. ఇదో పోలికా..

"పెళ్ళికొడుకు రేవులో తాడిలా ఉన్నాడు.. ఇంటికి బూజు దులపడానికి పనికొస్తాడు బాగా " అని అనేసి వెళ్ళిపోయాడు.

ఆయనకి ఎదురు చెప్పడం ఊరిలో ఎవరికీ రాదు. అందరికి భయమో లేక గౌరవమో తెలీదు. ఆయన పేరు గౌతమేశ్వరుడు. మా ఊరిలో ఓ పెద్దాయకి అల్లుడు ఇతగాడు. ఊరులో మొత్తం ఆ పెద్దాయకి అన్నదమ్ములే ఉండటంతో ఊరిమొత్తానికి అల్లుడై కూర్చున్నాడు. ఆయన భార్య సర్వలక్ష్మి ఆయనకు సమ ఉజ్జే!

వీధి అరుగు మీద కూర్చొని అటు వెళ్ళే వాళ్ళని ఇటు వచ్చేవారిని పట్టుకొని " ఏవే ఇలా రా " లేక పోతే "ఒరేయ్ ఇలా రా అని పిలిచే వారు " తీరా వాళ్ళు వచ్చాక ఆ వచ్చిన వ్యక్తిని ఏదో అడిగి వాడిని ఇదిగో ఇలాంటి పుల్ల విరుపు మాట ఏదో ఒకటి అనేసి పంపేవారు.

ఒకసారి నేను పేరంటానుంచి వస్తుంటే "ఇలా రావే " అని పిలిచింది మా సరత్తయ్య.

నన్ను చూసి గౌతమేశ్వరుడు గారు "దీనిది అచ్చు వీళ్ళ నాన్న మొహమే " అన్నాడు

"అవును ఐదు పైసల మొహమూ " అంది సరత్తయ్య

" పావుకోళ్ళ మొహమూ ఇదీనూ " అన్నాడు గౌతమేశ్వరుడు మావయ్య

"వీళ్ళ అమ్మ ది సిబ్బిరేకు మొహం.. గుండ్రంగా ఉంటుంది, దీనికే వాళ్ళ నాన్న, మామ్మ మొహం వచ్చింది.. మీరన్నట్టు పావుకోళ్ళ మొహం " అని అంది సరత్తయ్య నవ్వుతూ....

నాకు ఈ పావుకోళ్ళు అంటే అప్పటికి తెలీదు. అదేదో జాతి కోళ్ళు అనుకున్నా. ఇంటికొచ్చి మా మామ్మకు చెప్పా

"గవాక్షుడిలా మొహం వేసుకొని వచ్చే పోయే వాళ్ళని అనడమే వాడికి తెలుసు, అయినా ఆ సరమ్మ కూడా సొంత పిన్ని ని అని కూడా చూడకుండా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆ మాటలేంటీ? " అని బాధపడింది. కానీ ఆ సరత్తయ్యని అనే ధైర్యం లేదు మా మామ్మకి. ఇంతకీ ఆ గవాక్షుడెవడో తెలీదు.

ఊర్లో పెళ్ళీళ్ళు అయితే ఆడపెళ్ళివారికి మగపెళ్ళివారికి గొడవలు పెట్టేసేవారు ఈ గౌతమేశ్వరుడు గారు! ఒకసారి మా ఊర్లో ఒకాయన కూతురు పెళ్ళి చేసుకున్నాడు. కాకినాడ నుంచి మగపెళ్ళివారి బస్సు విడిది ఇంటి దగ్గర దిగింది. చాలా సేపు బస్సు ప్రయాణం చేసి ఉన్నారు పాపం ఆడవాళ్ళకి కాలకృత్యాలకి ఇబ్బందిగా ఉండి ఉంటుందని, అందులో ఒక పెద్దాయన ఈ గౌతమేశ్వరుడి దగ్గరకు వచ్చి " ఆడవాళ్ళు ఎవరేనా ఉన్నారా అండి? " అని అడిగాడు

ఈయనకి అసలే వెటకారం పాళ్ళు ఎక్కువ " ఏం... ఎంత మంది కావాలేంటీ? " అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ...

అంతే మగపెళ్ళివారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఒక అరగంట ఆ మగపెళ్ళివారికీ, ఈ గౌతమేశ్వరుడికి పోట్లాట. పాపం ఆడపిల్ల తండ్రి అందరిని బతిమాలుకొని పెళ్ళి చేశాడు.

ఇలా ఉండగా ఆ సరత్తయ్య ఇంట్లోకి ఒక పక్క వాటాలోకి మా ఊరి మాష్టారు అద్దెకొచ్చారు. వాళ్లకి ఒక 4 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. వాడికి పిలిచి రోజు ఏదో ఒకటి అంటునే ఉండేవారు ఆ దంపతులు. అక్కడితో ఆగక దారిలో వచ్చే పోయే వాళ్ళని ఆ పిల్లాడి చేత "లం.. కొడకా " అని తిట్టించేవారు. జనాలు మనసులో తిట్టుకుంటూ ఏవీ అనకుండా వెళ్ళిపోయేవారు.

ఒకసారి మా ఊరి ఆస్థాన మంగలాకారుడు ఎం. ధర్మరాజు(మంగలి ధర్మరాజు) , ఆ మాష్టారి అబ్బాయి శంకర్ కట్టింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఇంటి అరుగు మీద కూర్చొబెట్టి తల ని దువ్వుతున్నాడు ఎం. ధర్మరాజు. ఆ బుజ్జి శంకర్ " నాకు చిరంజీవి కట్టింగ్ చేయ్ ధల్మలాజు ... " అని ఇంకా ఏదో చెబుతున్నాడు

ఇంతలో గౌతమేశ్వరుడు "వెధవకి డిప్పకట్టింగ్ చేసేయ్... నాలుగేళ్ళు లేవు వీడికి చిరంజీవి కావాల్సి వచ్చాడా " అని అన్నాడు 

 అంతే ఆ నాలుగేళ్ళ కిశోరం.." ఈ వెధవ ఇలాగే అంటాడు, గవాక్షుడు మొహం వేసుకొని.. పగిలిన మంగలం మొహం వీడూనూ, రేవులో తాడిలా పెరిగాడు కానీ.. లం...కొడుకు " అనేసి పారిపోయాడు.

అక్కడున్న అందరూ నోరు కళ్ళు తెరచుకొని అలా ఉండుపోయారు. మరునాడు గౌతమేశ్వరుడు మావయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చిపోయాడు. అత్తయ్యకి నోరు పడిపొయింది. జరిగింది చెప్పడానికి ఆయన లేడు, చెబ్దామన్న సరత్తయ్యకి నోరూ లేదు (అప్పుడు, ఇప్పుడు ఆవిడే లేదు), ధర్మరాజు చెప్పడు.. శంకర్ చెప్పలేడు... అంతే!

 

 

Wednesday, December 13, 2017

ఆనందం


ఆనందం ఎక్కడ ఉంది? ఖరీదైన వస్తువులలోనా? పెద్ద పెద్ద బంగ్లాలలోనా? కాస్ట్లీ బట్టలలోనా? ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే ఎన్ని గ్రంధాలు తిరగెయ్యాలి? ఎంత మంది గురువులని ఆశ్రయించాలి? ఇవన్నీ ఒక ఎత్తు.. ప్రకృతి పార్వతీ దేవి స్వరూపంగా భావించే వారికి ప్రతి అణువు ఒక పాఠమే! ప్రతి జంతువు, ప్రతి పునుగు  మనకు ప్రతి నిత్యం ఏదో ఒకటి భోధిస్తూనే వుంటుంది. 


అసలు విషయానికి వస్తే.. గత నెల్లాళ్ల నుంచి మా ఇంటి కిటికీ దగ్గరకు ఒక పక్షి పొద్దుటే అదేదో డ్యూటికి వచ్చినట్టువస్తోంది. సాయంత్రం చీకటి పడెవరకు ఆ కిటికీ బయట నుంచి దాని మొహం దానికి కనిపిస్తోందేమో,  రోజూ ఆ ప్రతి బింబంతో పోట్లాటే! ఆ కిటికీ దాటాక ఏ లోకం ఉందో అని దాని ఆలోచనో ఏమిటో మరి! దాని ముక్కు ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం కూడా వేస్తుంది అది కిటికీని కొట్టే విధానం చూస్తే! ఒకసారి ఆ కిటికీ తలుపు తీసి "అంత అందమైనది కానే కాదు పిచ్చమ్మ " అని చెప్పాలనిపిస్తుంది.



ఇంకో విషయం... మా పనిమనిషి కూతురు. దాని పేరు సత్య. రోజూ రాగానే "ఆంటీ బిస్ కెట్లు  " అంటుంది. బిస్ కెట్టు ఇస్తే కొన్ని సార్లు తింటుంది, మరి కొన్ని సార్లు దాచుకుంటుంది. కానీ ఈ రోజు అది ఆ బిస్కెట్టు పాకెట్టు తీసుకొని అద్దం లో చూసుకొంటూ డాన్స్ చేస్తుకుంటూ పాటలు పాడుకోసాగింది. చాలా సేపు దాని వైపు ముచ్చటగా చూస్తూనే ఉన్నా! తరవాత ఆ బిస్కెట్లతో బ్రిడ్జ్ కట్టింది, ఇంకా ఏవేవో కట్టింది. 


సాయి బాబా జీవిత చరిత్రలో "ఈశావాస్యోపనిషత్ " ఘట్టం గుర్తొచ్చింది. లేదన్న చింతన లేదు, ఉందన్న గర్వం లేదు. ఎప్పటికీ నిలిచే ఆనందమే... నిత్యానందం... బ్రహ్మానందం.!!

Sunday, December 3, 2017

వోలేటి పార్వతీశం

వోలేటి పార్వతీశం గారు... ఒక గొప్ప రచయిత, వ్యక్త, నిగర్వి, సాహితీవేత్త, పరిశోధకుడు, అన్నిటినీ మించి... ఒక మంచి వ్యక్తి! దూరదర్శన్ లో 'జాబులు - జవాబులు " లో తనదైన ఒక ముద్ర వేసుకొన్న వారు. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వోలేటి పార్వతీశం గారి మనువడు. విద్వత్కవి శ్రీ కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు. సుప్రసిద్ధ గేయకవి "శశాంక  గారి " తనయుడు. ఇవి వారికి జన్మతహ లభించిన అదృష్టాలు.  

 

 

వారిది శ్రవణ సుభగమైన కంఠస్వరం. ఎన్నో అర్హతలు కలిగినా ఏమాత్రమూ అహం లేని గొప్ప వ్యక్తి వారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు ప్రసారమాధమానికి సేవలందించారు. గంభీర గళంతో, స్వచ్ఛమైన భాషణంతో, అచ్చమైన భావంతో, అందమైన లాస్యంతో తెలుగు భాషకే వన్నె తెచ్చిన నిలువెత్తు తెలుగు సంతకం... వోలేటి గారు!!

ఏమాత్రము గర్వమూ, అతిశయోక్తి లేకుండా వారి గురించి తెలుసుకోడానికి వెళ్ళిన నాతో వారి జీవిత విశేషాలు చెప్పారు.
ఇప్పటికీ ఎన్నో సాహితీ సభలకు అధ్యక్షత వహించి ఎంతో సాహితీ సేవ చేస్తున్న 'మహానుభావులు"  !!    ఆ మహానుభావుడి ద్వారా విన్న ఆయన జీవిత విషయాలు మీతో పంచుకుంటున్నాను. 

 

 


 

 

 

Thursday, November 9, 2017

పాటలతో.... పాట్లు

"గుడివాడ వెళ్లాను గుంటూరు పోయా... " పాట పూర్తవ్వలేదు... నెత్తి మీద ఠంగుమని మోగింది. ఒక్కసారి దక్షుడి 28 మంది కూతుర్లు కనిపించేశారు. ఇంతకీ నేనేం తప్పు పాడానని ఇలా ముదస్తు హెచ్చరిక లేకుండా ఈ పిడుగు ? (అదే మొట్టికాయ) , అదే ప్రశ్నార్ధకమైన మొహంతో చూశాను అమ్మమ్మ వైపు. " ఇలాంటి పిచ్చి పాటలు పాడకు" అన్న వార్నింగ్ ఇచ్చింది. ఇది పిచ్చిపాట ఎందుకయ్యిందో ఆలోచించే వయసు కాదు. చిన్నప్పుడు కొన్ని పాట పాడితే, గుళ్ళో గంట కొట్టినట్టు ఇదిగో ఇలా మొట్టికాయలు పడిపోతుండేవి. ఎప్పుడేనా బాత్ రూం లో గట్టిగా పాడేసుకుంటుంటే మా అమ్మమ్మ వచ్చి " ఇలా పాటలు పాడుకునే బదులు, ఎక్కాలు చదువుకోవచ్చు కదా " అని అనేది. ఎంత ఐనస్టీన్ అయినా ఆనందానికి " న్యూటన్స్ లా " నో "ఆర్కమెడీస్ తియరీ " ఓ చదువుతాడేంటీ? ఈ అమ్మమ్మల చాదస్తం కాకపోతే!

చిన్నప్పుడు ఇలాగే బోలెడు పాటలకి అర్ధాలు తెలియకుండా పాడేసేవాళ్ళము. ఒకసారి.. కాదు మొదటి సారి నేను టేప్ రికార్డర్ లో విన్న పాట "శంకరాభరణం " . ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు. ఆ పాటలో "రసికులకనురాగమై " అన్న చోట అర్ధం కాలేదు. (మిగితాదంతా అర్ధమయ్యిపోయినట్టు అనుకోకండి). అంటే ' రసికులు ' అనేది అంత వరకు వినని పదం. ఆ రికార్డ్ లో ఒక చోట పాపం ఒకాయన "ఖళ్ళు ఖళ్ళు " అని దగ్గాడు కదా, ఆయనకి పాపం జ్వరం వచ్చింది, అందుకే 'రసుకులు " (rusks) అని పాడి ఉంటాడు. ఇలా తోచిన అర్ధం వెతికేసుకున్నాను.

అలాగే "మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు " లో "పదిలంగా " అన్న పదం. వాళ్ళ ఇంటి చుట్టూరా దండం కట్టుకొని పది లంగాలు ఆరేసేవాళ్ళేమో అని అనుకునేదాన్ని. ఆ పది పట్టులంగాలూ ఏ రంగువయ్యింటాయో అని ఊహలు కూడా ఉండేవి. కొన్నేళ్ళ తరవాత " ఈ గాలి ఈ నేల (సిరివెన్నల ) " పాటలో " నా కళ్ళ లోగిళ్ళు " విన్నాను. పాపం కళ్ళు లేవు కదా ఆ అబ్బాయికి అందుకే కళ్ళు గిళ్ళమంటున్నాడనుకునేదాన్ని. (దీనికి దానికి సంబంధమేంటీ అని అడగొద్దు).🤔

ఒకసారి మా పక్కింటి స్వరాజ్య లక్ష్మి అక్కని చూసి వెంకట్ అన్న" ఆ జడ పొడుగు మెడ నునుపు చూస్తుంటే " అనీ, " అడగక ఇచ్చిన మనసే ముద్దు లో... " చెక చెకలాడే " లైన్ పాడాడు. స్వరాజ్యం అక్క సిగ్గు పడింది. అదే నేను పాడితే మూతి మీద సిక్సర్ పడింది! 😷

ఒకసారి మా ఇంట్లో మా తాతగారి తల్లిగారి తద్దినం అయ్యింది. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే అన్నట్టు, 'తద్దినం కూడా తాంబూలాలు " లాంటిదే కొన్ని ఇళ్ళల్లో. (పెళ్ళికి ముందు తాంబూలం కాదు... భోజనం అయ్యాక తాంబూలం అన్న మాటా) . అదీ మనవలూ, మునిమనవలూ ఉన్న ఇళ్ళల్లో. ఇంట్లో గాడిపొయ్యె మీద వంట. గుండిగళ్ళతో హడావిడిగా ఇంట్లోకి బయటకు తిరిగే బాబయ్యలు, మావయ్యలు. నేనూ , మా కజిన్ వీధిలో రెండు స్థంబాలాట ఆడుకుంటున్నాము. ఆడుతూ పాడుతూ పరిగెడుతుంటే ఆకలి తెలియదని, గట్టిగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నాము. నేను 'బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే " అని పాడితే, మా కజిన్ "కాపురమొస్తే కాదంటానా " అంటూ పాడటం మొదలెట్టింది. అంతే... వెనకాల నుంచి ఎవరో మమల్ని గుండిగలు ఎత్తినట్టు ఎత్తుకొని పెరట్లోకి తీసుకెళ్ళిపోయి.. ప్రైవేట్ చెప్పేశారు! హన్నా... మేము చిన్నవాళ్ళమా.. చితకవాళ్ళమా? మా అంతటి వాళ్లము మేము. అయినా కాపురం అంటే డబ్బాల్లో పప్పులు, ఉప్పులు సర్ధడమే అని మా చినమామ్మ చెప్పింది. " పెద్దత్త కాపురానికి వెళ్తోంది " అని అన్నప్పుడు , "కాపురం అంటే ఏంటీ " అని అడిగాను, అదిగో అప్పుడు చెప్పింది. 😎😎


ఈ పైత్యం ఇటు తెలుగులోనే కాదు, హిందిలోకీ పాకింది. "క్యా హువా తేరా వాదా , ఓ కసం ఓ ఇరాదా " వచ్చినప్పుడు ఆ పాడేవాడు లెఖల మాస్టారేమో అని అనుకునేదాన్ని. ఎందుకంటే " ఒక్క సమ్ము చేయరాదా " అని అంటున్నట్టుగా ఉండేది. అలాగే జంగిలి సినిమాలో " ఎహసాన్ తెరా హోగా ముఝ్ పర్.... పల్ఖోంకి చావ్ మే రెహనేదో " నాకు "పళ్ళు తోముకొని చావు " అనేటట్టు వినపడేది. పాపం ఆ హీరో పాచి పళ్ళతో తిరుగుతోంటే హీరోయిన్ "పళ్ళు తోముకోమంటోంది " అని అనుకునేదాన్ని. " సంఝోతా గమోసే కర్లో " పాట "సంజోతా సమోసే కర్లో " లా వినపడీ, సమోసాలు అమ్ముకొనేవాడి పాటెమో అని ఊహించుకునేసేదాన్ని. 🤩😋


అప్పుడు ప్రైవేటు చెప్పినా, ఒన్ డే ఇంటర్నేషనల్ ఆడేసినా ఇప్పుడా పాటలు వింటే మాత్రం... పాటలతో పడిన ఆ పాట్లు... భలే నవ్వు తెప్పిస్తాయి. 😁