Search This Blog

Thursday, December 27, 2018

రోషిని శర్మ

రోషిని శర్మ... కన్యాకుమారి నుండి కాష్మీర్ (లేహ్ ) వరకు బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేసిన మొట్టమొదటి వనిత. ఆడపిల్ల  రాత్రి పూట పక్కనే ఉన్న వీధిలోకి ఒంటరిగా  వెళ్ళడనికే భయపడే ఈ రోజుల్లో ఆమె ఇంత దూరం ఒంటరిగా ఎలా ప్రయాణించింది? అందుకు ఆమె కి స్ఫూర్తి ఎవరు? ఎంత మంది వెనకకు లాగారో తెలుసుకుంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎంతో మంది ఈ నాటి ఆడపిల్లలకు స్ఫూర్తి. 



సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషిని నలుగు అక్క చెల్లెల్లో ఒకతి. ఆమె తండ్రి ఆటో మొబైల్ వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పుడు వాళ్ల నాన్నగారు తనకు బైక్ నడపడం నేర్పించారుట. ఆ తరవాత పదేళ్ళ పాటు మళ్ళీ బైక్ నడిపే అవకాశం తనకి రాలేదు. ఒకసారి బెంగుళూరు లో బైక్ రేస్ జరుగుతోంటే ఆమె చాలా ఉత్సాహంతో ఆ రేస్ లో పాల్గొన్నారు. ఒక స్నేహితుడి ద్వారా కన్యాకుమారి నుండి కాష్మీర్ వరకు బైక్ మీద ప్రయాణం గురించి తెలుసుకొని ఇంట్లో చెప్తే.. ఇంట్లో మొదట ససేమిరా అన్నారుట. ఆ తరవాత ఒక గ్రూప్ గా వెళ్తే ఒప్పుకుంటాము కానీ ఓంటరిగా వద్దు అని చెప్పారు. ఆమె దృఢ సంకల్పము ముందు అందరూ తల ఒగ్గక తప్పలేదు. ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి తనని తాను సిద్ధం చేసుకోడానికి, తాను వెళ్ళాల్సిన మార్గం గురించి తెలుసుకోడానికి  ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టిందిట. రోషిని జూన్ 24 న బయలుదేరి జూన్ 28 కి కన్యాకుమారి చేరింది. అక్కడి నుండి తను అనుకొన్న ప్రయాణం మొదలైయ్యింది. జులై పదో తారుఖు కల్లా తను లడక్ చేరుకొంది.

పదిహేను రోజుల్లో (140 గంటల్లో) ఆమె తన గమ్యాన్ని సురక్షితంగా చేరింది. ప్రయాణం హైవే రోడ్ అంత సాఫీగా మాత్రం లేదు. అంత కష్టపడింది కాబట్టే 'లిమ్‌కా బుక్ ఆఫ్ ఇండియా 'లో తన స్థాన్నాన్ని ఏర్పరచుకుంది.  

 చేరిన వెంటనే ఆమె వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుకుందిట. వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ సమయములో పొందిన ఆనందము, గర్వము కన్నా తనకి  ఏ అవార్డ్ ఆనందాన్ని ఇవ్వలేకపోయాయిట. ఈ ప్రయాణం పూర్తి అయ్యక తను నేర్చుకొన్నది :

"దేశాన్ని ఇంకా ప్రేమించాలి , ఆర్మీ లో ఉన్న వారిని చాలా గౌరవించాలి, ప్రాంతాన్ని బట్టి మనుషులను లెక్క కట్టకూడదు " . 



ఒక సారి దారి అంతా ప్రయాణించాక అక్కడ జనాల ద్వారా తెలిసిందిట ఆ దారిలో రాత్రి పూట ఒక స్త్రీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుందనీ, ఆమె ఒక దెయ్యం అని. ఇంకోసారి రోడ్ల మీద ఖాళీ లేకుండా ట్రక్కులు ఉన్నప్పుడు తనకు కొన్ని గంటల పాటు అలా వరుసలో నిలబడాల్సి వచ్చినప్పుడు అనిపించిందిట.." ఎందుకీ ప్రయాశ సుఖంగా ఏ.సి. లో కూర్చొని నెల తిరిగేసరికి మంచి జీతం తీసుకొంటూ, అప్పుడప్పుడు తల్లితండ్రీ, అక్క చెల్లెలతో ఏదైనా మంచి చోటు చూసి సరదాగా గడపక ఈ ఎండలో ఈ ట్రాఫిక్ లో దుమ్ముధూళిలో ఈ కష్టాలు కొని తెచ్చుకున్నానని... " కానీ తన గమ్యము గుర్తుకు రాగానే ఈ కష్టాలన్నీ పెద్దగా కలవరపెట్టలేదు.


రోషినికి బైకే కాదు, మౌటేన్ ట్రెక్కింగ్, సైకిల్ రైడింగ్ అంటే కూడా ఇష్టము. వారాంతరాలలో తాను ఎప్పుడూ పర్వతారోహణము చేయడానికే ఇష్టపడుతుందిట. ఇప్పటికీ దక్షిణ భారత దేశములో ఉన్న అన్నీ ముఖ్యమైన పర్వతాలు ఎక్కేసింది.

ప్రస్తుతం బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తొంది రోషిని. " ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చుకోడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఏ కల రాత్రికి రాత్రే ఫలించదు. దాని కోసం కష్టపడాలి. అప్పుడే కల సాకారమౌతుంది, సమాజములో పేరూ వస్తుంది. ఎంతో మంది మాట అనకుండా ఉండరు, అవి పాజిటివ్ గా తీసుకొని ముందుకే నడవాలి " అని రోషిని,   ఈ  ' కె. టూ కె. '(K-K )  బైక్ రైడ్ అయ్యక యువతకు సందేశం ఇచ్చింది. 




((నాలుగేళ్ల క్రితం ఈ అమ్మాయిని కలిసే అవకాశం లభించింది, అప్పుడు ఆమె నాతో చెప్పిన విషయాలు) 

Wednesday, December 26, 2018

అరుణ కిరణం...

నిన్న మా ఫ్రండ్ మానస కూతురి పుట్టినరోజుకి వెళ్ళాను. అక్కడ కి వెళ్ళి కూర్చూగానే మా ఫ్రండ్ వాళ్ళ చుట్టం ఒకావిడ నా చేతిలో ఒక జూస్ గ్లాస్ పెట్టింది. ఇంకా ఆ పుట్టినరోజు పిల్లని తయ్యారు చేస్తున్నారు. నేను వెళ్ళి మా ఫ్రండ్ అత్తగారిని పలకరించి ఆవిడ పక్కన కూర్చున్నాను. ఆవిడ కాస్త పొట్టిగా పాత సినిమాలో ' రాజసులోచన ' లా ఉంటుంది.

ఆవిడ నన్ను పలకరించిందే కానీ చూపులు మాత్రం నిలకడగా లేవు.. ఏదో వెతుకుతోంది... ఇంత లో వెనకకు చూసింది.. అక్కడ ఆవిడ మనవడు (కూతురి కొడుకు) కొత్త పెళ్ళం చెయ్యి పట్టుకొని నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. అంతే "ఒరేయ్ కిరణు.. కాస్త జానాలలోకి రారా " అని కాస్త సీర్యస్ గానే అంది. ఇంతలో నా ఫ్రండ్ వచ్చి " వాడు జనాలలోనే కదా ఉన్నాడు " అని నవ్వుతూ అంది. నన్ను పలకరించి మళ్ళీ లోపలకి వెళ్ళిపోయింది మానస.  

 ఇంతలో ఆ కిరణ్ వెనకాల వంటిట్లో రెండు కుర్చీలు వేసుకొని,  అతను అతని భార్య అరుణ మళ్లీ  కబుర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతలో ఈ రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణు.. ఇలా వచ్చి మావయ్య పక్కన కూర్చోరా " అంది. అబ్బే మన కిరణుడికి తాత్కాలిక చెవుడు వచ్చేసింది...  వినిపించుకునట్టుగా నటించేశాడు. ఈ రాజసులోచనగారు ఆగలేదు మళ్ళీ గొంతులో స్థాయి పెంచి పిలించింది. ఇంక ఆ అబ్బాయి తప్పదన్నట్టు లేచి వచ్చి హాల్ లో మానసా వాళ్ళ ఆయన పక్కన కూర్చున్నాడు. ఇక్కడ కిరణ్.. ఎదురుకుండా వంటిట్లో అరుణ.. హ్మ్మ్మ్.. కాసేపు కళ్ళతో కబుర్లు చెప్పేసుకోవడం, చూపులతో  సైగలు చేసేసుకోవడం మొదలెట్టారు. అటు చూసి ఇటు చూసి కిరణు మళ్లీ  వెళ్ళి అరుణ పక్కన చేరాడు. మళ్ళీ మన రాజసులోచన గారు వెతుకోవడం మొదలెట్టింది... ఇంతలో కేక్ కట్టింగులు అయ్యాయి. ఈ రాజసులోచన గారి దృష్టి అంతా కిరణ్ వైపు, నా దృష్టి  అంతా ఈవిడవైపే ఉండిపోయాయి.

ఒక ప్లేట్ లో పెద్ద కేక్ ముక్క పట్టుకొని కిరణ్ , అరుణ పక్కకెళ్లీ సగం సగం తింటున్నారు. ఇంతలో మన రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణూ.. ఇక్కడ కేకు ఉందిరా.. రా " అని అరిచింది. పాపం కిరణ్ అరుణని వదలలేక వదలలేక అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు.

ఇంక భోజనాల తంతు మొదలయ్యింది.  రాజసులోచన గారి హడావిడి చూసి ఆవిడకి ఒక ప్లేట్ లో భోజనం పెట్టి   పైకి వెళ్ళి కూర్చోమని ఆవిడ కొడుకు(మానస భర్త)  చెప్పాడు... ఆవిడ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ .. "ఒరేయ్ కిరణు.. నువ్వు ఇలా రా " అని పిలిచింది. ఆవిడ కొడుకు.. "నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళు , వాడిని ఎందుకు పిలుస్తావు... ఏదైనా వడ్దన పని ఉంటే వాడు చేయాలి కదా  " అని చెప్పి రాజసులోచన గారిని మేడ ఎక్కించేశారు. ఇక అరుణ, కిరణులు సరదాగ నవ్వుకుంటూ వడ్దన చేస్తుంటే అందరికీ చూడ ముచ్చటగా అనిపించింది. అరుణతోటే కదా కిరణం ఉండేది!!

ఒక చిన్న మొక్కని పాతి నీరు పోసి పెంచి పెద్ద చేశాక, తీరా అది ఫలాలు ఇచ్చే సమయానికి ఎవరో వచ్చి ఆ చెట్టుని తనది అనేస్తే.. ఆ పెంచిన వ్యక్తికి ఒకరకమైన బాధ, దుగ్ధ వేస్తుంది. ఈ రాజసులోచన గారి బాధ అదే. చిన్నప్పుడు తల్లీతండ్రీ పోతే ఈ రాజసులోచన గారు(అసలు పేరు ఇప్పటికీ తెలీదు) ఆ కిరణ్ ని పెంచింది. ఎక్కడ ఆ కొత్త పిల్ల ఆవిడ మనవడిని ఆవిడకి దూరం చేసేస్తుందో అన్న భయం. ఆ మనవడు అమాయకుడని, ఆ కొత్తగా వచ్చిన పిల్ల వాడిని ఆడించేస్తుందన్న భయము... ఈ భయంతోటే కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటారు వాళ్ళ జీవితాలలో... ఆ చెట్టు నాదే, ఆ కొత్త పిల్ల నాదే అన్న భావం వస్తే ఈ బాధ ఉండదు. ఎక్కువ చొరవ తీసుకుంటే వాళ్ళు మొదట నవ్వుకున్నా తరవాత తరవాత విసుకుంటారు కూడా. చెప్పడం తేలికే ఈ విషయం కానీ ఆచరించడం కష్టం... అయినా తప్పదు మన గౌరవం మనం నిలుపుకోవాలంటే!!

Sunday, December 9, 2018

ప్రయాగ

"నిన్ను అక్కడ నుంచి పక్కకు రమ్మని చెప్పాను కదమ్మా " అని ఐదో సారో ఆరో సారో అన్నారు పంతులు గారు సునందతో...

" వాడికి సరిగ్గా తెలియటం లేదండి " అని మళ్ళీ అదే జవాబు ఇచ్చింది సునంద...

"వాడికి అర్ధమయ్యేటట్టు నేను చెబుతా, నువ్వు పక్కకు రావమ్మా " అని కాస్త కటువుగా చెప్పారు పంతులు గారు.


చుట్టుపక్కల ఎనిమిదిమంది వారి వారి పితృదేవతలకి శ్రాద్ధం పెడుతున్నారు, అందరూ 40 ఏళ్లు దాటిన వారే, కొందరు 60 ఏళ్ళు దాటిన వారూ ఉన్నారు! అందులో  ఒకే ఒకడు మాత్రం పది పదకొండేళ్ళ మధ్యలో ఉన్న వాడు... పేరు సంతోష్! వాడికి ఏదీ అర్ధం కావటం లేదు... అందుకు అతని తల్లి మాటిమాటికి  వచ్చి పంతులుగారు చెప్పింది ఎలా చెయ్యాలో చెబుతోంది, ఇది ఆ పంతులుగారికి నచ్చక ఆవిడని కసురుకుంటున్నాడు.


"ఒరేయ్... అంత పెద్ద పెద్ద ఉండలు కాదురా... ఆ పిండితో నలభై ఉండలు చెయ్యాలి... నువ్వు ఐదు ఉండలు చేశావు ఒక్కో ఉండని ఎనిమిది చిన్న ఉండలు చెయ్యి " అని గదమాయిస్తూ చెప్పారు ఆ పంతులు గారు.


సంతోష్ ఆయన చెప్పినట్టే భయం భయంగా చేస్తున్నాడు.  చుట్టూ ఉన్నవారు అక్కడ జరిగేది చూడలేక సునందని అడిగారు " ఆ పిల్లాడు ఎవరికి పిండప్రదానం చేస్తున్నాడమ్మా? " అని


" నా భర్తకేనండి  " అని వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ అంది సునంద


అప్పుడు చూశాను ఆవిడని రమారమీ 25 - 27 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఇంకా మొహం లో లేతదనం పోలేదు. ఎవరూ ఆ పిల్లాడికి తల్లి అని అనుకోరు, అక్కేమో అని అనిపిస్తుంది.  ఇంత కష్టమా ఇంత చిన్న  వయసులో? 

" ప్రయాగ, కాశి, గయలో శ్రాద్ధం పెట్టిన వాడే అసలైన కొడుకుగా మన పురాణాలు చెబుతున్నాయి " అని గట్టిగా పంతులుగారు అన్నారు.


" చేతికున్న ఆ దర్భ పడిపోయిందిరా.. చూసుకో " అని సంతోష్ తో అన్నారు పంతులుగారు...

వాడు దర్భ అంటే ఏంటో అని విస్తరిలో చూస్తున్నాడు, సునంద ఆగలేక మళ్ళీ దగ్గరకు వెళ్ళి ఆ దర్భని తీసి ఇవ్వబోయింది..

"వాడికి తెలుగు అర్ధమౌతుంది కదా? నేను తెలుగులోనే చెబుతున్నాను కదమ్మా... నువ్వు పక్కకు వెళ్ళు " అని మళ్ళీ  గదమాయించాడు


చిన్నబుచ్చుకొన్న మొహం తో మళ్ళీ వెనకాలకి వచ్చింది సునంద.

"ఎలా పొయారమ్మ మీ వారు? " అని ఎవరో ఆ గుంపులో అడిగారు

" యాక్సిడెంట్ లో పోయారండి " అని సమాధానం ఇచ్చింది సునంద


" ఏదైనా ఆస్తి పాస్తులున్నాయా మరి? నువ్వేదైన ఉద్యోగం చేస్తున్నావా? " అని అడిగింది ఒక పెద్దావిడ ఉండబట్టలేక...

" ఒక పాన్ షాప్ ఉందండి, వెయ్యి గజాల స్థలం మాధాపూర్ లో ఉంది, అదిగో మా అమ్మ నాన్నతో ఉంటున్నాను " అని సంతోష్ పక్కన పితృకర్మలు చేస్తున్న తన తండ్రిని చూపించింది సునంద.


" అయ్యో తాత మనవడు ఇలా ప్రయాగలో ఒకేసారి పిండప్రదానం చేస్తున్నారా? పగవారికి కూడా ఇలాంటి  కష్టం రాకూడదు " అని కళ్ళ నీరు పెట్టుకుంది ఒక పెద్దావిడ


"నేను ఎక్కువ చదువుకోలేదండి, టెంత్ అయ్యిన వెంఠనే పెళ్ళి, పెళ్లైన ఏడాదిలోపలే వీడు పుట్టేశారు " అని చెప్పింది సునంద


" వీడెనా ఇంకా పిల్లలు ఉన్నారా? " అని ఇంకో ప్రశ్న


" ఇంకో ఆడపిల్ల ఉందండి "


"చెయ్యి ఎడమవైపు తిప్పాలిరా అలా కాదు " అని మళ్ళీ పంతులుగారి అరుపు


చెయ్యి అన్ని వైపుల  తిప్పెస్తూ పంతులుగారి వైపు తిప్పాడు  సంతోష్


"నాకు కాదురా ఆ పిండం పెట్టేది అటు వైపు తిప్పి నేను చెప్పింది చెప్పు " అని అన్నారు  పంతులుగారు


ఆ మాటకి కాస్త నవ్వు వచ్చినా అక్కడి జనాలు మాత్రం నవ్వితే ఎమంటారో అని నవ్వలేకపోయారు..

పక్కన ఉన్న సంతోష్ తాత కళ్ళతో అలా కాదు అని సైగ చేశాడు. అది అర్ధం చేసుకున్నాడేమో తాత ఎలా చేస్తున్నాడో చూసి అలా చెయ్యి తిప్పాడు సంతోష్.


మొత్తానికి ప్రయాగలో సంతోష్ చేత అతని తండ్రికి శ్రార్ధం పెట్టించింది సునంద. అందరూ ఆ పంతులుగారికి తోచిన రొక్కం చెల్లిస్తున్నారు. డబ్బులు ఇచ్చి అతని కాళ్ళకి దండం పెడుతున్నారు

సంతోష్ చేతికి రెండు వందల రుపాయిలు ఇచ్చి పంతులుగారికి ఇవ్వమని చెప్పించి సునంద.

సంతోష్ భయంగా ఆయన దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన చెయ్యి అడ్డం పెట్టారు

"అయ్యా.. డబ్బులు తక్కువైతే ఇంకో వంద ఇస్తానండి " అని సునంద పాపం కళ్ళలో నీళ్లతో అంది


"అమ్మా.. శ్రద్ధగా పెట్టేది శ్రార్ధం. ఇంత చిన్న వయసులో మీ అబ్బాయికి వచ్చిన కష్టం శతృవులకు కూడా రాకూడదమ్మా! ఎంతో డబ్బున్నా, శాస్త్రీయ కుటుంబాలకు చెందినవారు తల్లి తండ్రి పోతే ఎవరో ఒకరికి (డబ్బులు) కూలి  ఇచ్చి  దహన సంస్కారాలు చేయిస్తున్నారు. ఇక ఇలా ప్రయాగ, కాశీలో, గయలో పిండప్రధానం అనేదే లేదు. అలాంటిది నీ కొడుకు నా ద్వారా ఆ క్రతువు చేయించుకున్నాడు, ఆ తృప్తి చాలమ్మా. వాడిని కసిరింది వాడి ఆలోచనలు అటు ఇటు పోకూడదని, తప్పుగా అనుకోకే.. నా కూతురు లాంటి దానివి  "   అని పంతులుగారు అనడంతో అందరూ ఆయనవైపు చేతులు జోడించి మరీ చూశారు

సంతోష్ వైపు చూసి "అయ్యవారి కాళ్ళకి దండం పెట్టు " అని చెప్పింది సునంద

కాళ్లకి దండం పెట్టిన సంతొష్ ని లేవదీస్తూ " ఒరేయ్.. మీ నాన్న ఏ లోకాలలో ఉన్నా ఆయన  ఆత్మకి శాంతి కలిగించావు, ఉన్నత లోకాలు కలిగేటట్టుగా చేశావు. , బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకొని ఆవిడకీ కూడా ఆనందాన్ని ఇవ్వు " అని అన్నారు  పంతులు గారు.


 "యథా నవనీతం హృదయం బాహ్మణస్య

వాచి కురో నిశిత స్త్రీక్షధాః  " గుర్తొచ్చింది.


ప్రయాగ వెళ్ళినప్పుడు ఆయనకి నా తరఫున కూడా దండం పెట్టండి.