Search This Blog

Sunday, June 30, 2019

శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి

హాస్య కథలకు ఆమేచిరునామా...

తెలుగు కథా ప్రపంచంలో ఆమెది ఒక సుస్థిర స్థానం... 

నవ్వించడం ఆవిడ చేస్తున్న మహాయజ్ఞం....

విజయం ఆవిడ పథం...

(ధైర్య) లక్ష్మి ఆవిడ నైజం... 

నడిచే నవ్వుల రథం...

ఆవిడే.. శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి గారు.


జననం :


విజయ లక్ష్మి గారు విజయ నామసంవత్సరం (అనగా  1953) జులై లో బాపట్లకు 9 కిలోమీటర్లు ఉన్న యాజలి లో జన్మించారు. వారి నాన్న గారు పి.డబల్యు  ఇంజినీరు కావడం వలన వారికి ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉండేవి.  కాబట్టి ఆవిడ చదువు చాలా ఊర్లల్లో జరిగింది. ఏడాదికి రెండో మూడో ఊర్లు తిరగడం మూలంగా ఎందరో వ్యక్తులను, వ్యక్తివ్యాలను,  దగ్గరగా పరిశీలించే అవకాశం ఆవిడకు లభించింది.  అదే తరవాత తరవాత రోజుల్లో ఆవిడకు కథా వస్తువులుగా పనికొచ్చాయి. విజయలక్ష్మి గారి నాన్న గారికి ఆవిడని ఒక డాక్టర్ గా చూడాలన్న కోరిక! కానీ ఆవిడకు పరీక్షలు రాయాలంటే బద్ధకం. పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు కావాలో అంతే పరీక్ష రాసేవారుట. ఆవిడ ఒక రచయిత్రి అవ్వాలని ఏనాడు అనుకోలేదు. పరీక్షలో జవాబు రాయడానికే బద్ధకించే తను ఇన్నిన్ని పేజీల నవలలూ, కథలు ఎలా రాయగలుగుతున్నానో అని ఆశ్చర్యపడ్డారు.


వివాహం :


విజయలక్ష్మి గారికి 17 వ ఏటనే వివాహం అయ్యింది. వివాహం అయిన వెంటనే ఆవిడ భర్త శివరావు గారితో కలిసి "చిత్తరంజన్ " కి వెళ్ళారు. తరవాత ఒక గృహిణిగా ఆవిడ ఇంటికి వచ్చేవారి వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడంలో పూర్తిగా లీనమైయ్యిపోయారు. వారికి ఒక అమ్మాయి శిరీష, కలకత్తాలో స్థిరపడ్డారు, శిరీష ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా "దాదాసాహెబ్ " అవార్డ్ తెచ్చుకున్నారు. ఒక అబ్బాయి ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటున్నారు.




రచయిత్రిగా :


1982 లో చిత్తరంజన్ లో తెలుగు పిల్లల చేత చిన్ని చిన్ని తెలుగు నాటకాలు వేయించడానికి చిన్న చిన్న కథలు రాశారు. అదే ఆవిడ రచయిత్రిగా మొదటి మెట్టు. తరవాత కొద్ది రోజులకి "స్క్రిప్ రెడిగా ఉంది.. సినిమా తీయ్యండి " అనే పేరుతో ఒక వ్యంగ్య కథ రాశారు అది "ఆంధ్ర ప్రభ " కి పంపారు. కొన్ని రోజుల వరకు అటు నుంచి ఏ రకమైనా ప్రత్యుత్తరం రాలేదు. మరి కొన్ని రోజుల తరవాత 'చతుర ' కి "ప్రేమించని ప్రేయశి " పేరుతో ఒక నవల రాశారు. కానీ 'చతుర ' వారు "ప్రేమ లేఖ " అనే పేరు మార్చారు. ఇలా రెండు కథలు పేపర్లలో పడడంతో ఇక వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు విజయ లక్ష్మి గారికి.


ఎక్కువ హాస్య కథలే రాసే విజయలక్ష్మి గారు అప్పుడప్పుడు కొన్ని హాస్యేతర కథలు కూడా రాసి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది "ఆత్మ కథ " . ఈ కథ " ...." లో సిరియల్గా వచ్చింది. చివరి భాగం పోస్ట్ చేశాక ప్రేక్షకుల నుండి  ఏడుప్తో ఆవిడకు ఫోన్ ల  వరదే వచ్చింది. 


ఆవిడ జ్ఞాపకాలను పదిలపరచి మనకు బహుమతిగా "జ్ఞాపకాల జావళి " గా ఇచ్చారు.


అలాగే పూర్వీ కథ... మనస్సుని కలిచివేస్తుంది, మానవత అంటే ఇదేనా అని అనిపిస్తుంది.
  


కథా వస్తువు :


విజయ లక్ష్మి గారికి  ఒక కథ అంటే అందులో కుటుంబం మొత్తం ఉండాలి. అందుకే ఆవిడ చుట్టూ ఉన్న జనాలే ఆవిడ కథా వస్తువులుగా ఎన్నుకొనేవారు. ఉదాహరణకి శ్రీవారికి ప్రేమ లేఖలో "సుత్తి వీర భద్ర రావు " కారెక్టరు... ఆవిడ మాతామహులే, పేకాట గాంగ్ వారి శ్రీవారి స్నేహితులే, కథలు చెప్పే శ్రీలక్ష్మి వారి ఇంటి పక్కావిడే.  ఆత్మ కథలో "బల్వి " చిత్తరంజన్ లో వారి స్నేహితుడే!


రచనలు : 


మా ఇంటి రామాయణం, పూర్వి, ఆత్మ కథ, పొత్తూరి విజయ లక్ష్మి హాస్య కథలు, ఆనందమే అందం, చంద్ర హారం,సంపూర్ణ గొలాయణం... అన్నీ అపురూపమైన కథలే!




సినిమాలో ప్రవేశం :


1983 లో ఉషా కిరణ్ మూవీస్ వారు చతురలో పడిన "ప్రేమ లేఖ " ఆధారంగా సినిమా తీయాలనుకున్నారుట. దానికి డైరెక్టర్ జంధ్యాల గారు. సువర్ణానికి సుగంధాన్ని అబ్బినట్టుగా  విజయ లక్ష్మి గారి హాస్య కథ, జంధ్యాల గారి దర్శకత్వంలో "శ్రీవారికి ప్రేమలేఖ " గా విజయవంతమయ్యింది.  అలా విజయ లక్ష్మి గారి రచన సినీ జగత్తులో కూడా వెలిగింది. ఆ తరవాత  "సంపూర్ణ గోలాయణం ", "ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం " అనే నవలలు కూడా సినిమాలుగా తెరకెక్కాయి.


చిరంజీవి నటించిన "చూడాలని ఉంది " సినిమాలో బెంగాల్ లో ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు బ్రహ్మానందం చెప్పే డైలాగులు విజయలక్ష్మి గారు రాసినవే. ఇలా సినిమాలలో అప్పుడప్పుడు రాసినా పూర్తిగా మాత్రం కథలు రాయడం లోనే స్థిరపడారు విజయలక్ష్మి గారు.


సంఘ సేవకురాలిగా :


చిత్తరంజన్ లొ ఉండగా విజయలక్ష్మి గారు తెలుగు ఎసోషియేషన్ కి జెన్రల్ సెకరేటరీగా ఉండేవారు. అప్పుడే ఆర్ధికంగా వెనుక బడిన పిల్లలకి స్కూల్ ఫీజిలు, స్త్రీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సాయం చేశారు.


"నా  కథలు ఎవరి కష్టాలు తీర్చకపోవచ్చు, కానీ కాసేపైనా కష్టాలను మరచి హాయిగా నవ్వుకొనే భాగ్య కలిపిస్తాయి.., ఇది చాలు నా రచనలకి " అని ఆనంద పడ్డారు.


బహుమతులు అవార్డ్ లు :


2012 లో స్వాతికి రాసిన "సన్మానం " కథకి అనీల్ అవార్డ్ వచ్చింది.

పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుంచి "కీర్తి పురస్కారము "

గృహలక్ష్మి స్వర్ణకంకణం

ముణిమాణిక్యం నరసింహ రావుగారి "స్మారకపురస్కారము"

భానుమతి గారి పురస్కారము


ఈ బహుమతులు, అవార్డులు  విజయలక్ష్మిగారిని వరించి తరించాయి. 



ఆనందమే అందం :


" " 1970 లో నా పదిహేడవ ఏట ఏమీ తెలియని అమాయకత్వంలో "చిత్తరంజన్ " లో అడుగుపెట్టాను. భాష రాదు, ఒంటరి జీవితం, జీవితంలో సుఖాలే కాదు కష్టాలనీ చవి చూశాను. మా తాతగారు " ఎప్పుడేనా ఏదైనా సమస్య వస్తే ఒకసారి రామాయణం, భారతం గుర్తు తెచ్చుకో... నీకు తప్పకుండా పరీష్కారం దొరుకుతుంది. 


మనకు ఆకలి వేస్తే మనమే తినాలి, అట్లాగే మనకు కష్టం వస్తే మనమే భరించాలి. నీ కష్టాలు అందరితోనూ చెప్పుకోకు... నీ వ్యధ్య ఎదుటివారికి సొద " అన్న మాటలు నాకు భగవద్గీత ...

 

జీవితం ఇచ్చిన కష్టాలను తలచుకుంటూ బాధ పడే కంటే, అదే జీవితం ఇచ్చిన ఆనందాన్ని తీసుకొంటే మరింత ఆనందం పొందచ్చు. ఇదే నేను నమ్మిన సూత్రము... ఇదే నా కథలకు ఆధారం. "


ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే పొత్తూరి విజయలక్ష్మి గారు ఆవిడ జీవిత అనుభవాలను జ్ఞాపకాలను నాతో పంచుకుంటూ చెప్పిన మాటలు ఇవి.


ప్రస్తుతం :


పస్తుతం "ఆంధ్ర భూమి " లో "నోస్టాల్జి " రాస్తున్నారు. అప్పుడప్పుడు పత్రికలకు కథలు పంపుతున్నారు. ఫేస్ బుక్ లో కూడ అరాస్తున్నారు. వారు ఫేస్ బుక్ లో వారి పుస్తకాల  గురించి ఒక ఆర్టికల్ పెట్టినప్పుడు పుస్తకాలు సెట్ సెట్లే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.    


నవ్వుల ప్రపంచంలో విహరింప చేసే ఆ హాస్య సామ్రాజ్ఞి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 










Thursday, June 6, 2019

చేదు మనిషి

"అయ్యో అయ్యో ఇంట్లో చేదు వృక్షం ఉంటే ఇంటికి అరీష్టమని ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికి ఎక్కదా? " అంటూ మళ్ళీ వచ్చాడు సాక్షి రంగారావు గారు. ఆయనంటే ఎవరో నాకు తెలీదు, కానీ అచ్చు సాక్షి రంగారావులా ఉండేవాడు. ఎప్పుడు ఎవరింటికి వచ్చినా చెట్ల గురించే మాట్లాడేవాడు. అలా అని చెట్టు పాతమని ఎప్పుడూ చెప్పేవాడు కాదు, చెట్లు కొట్టెయమనే చెప్పేవాడు.


మా పక్కింట్లో ఒక వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదని ఆయన వాదన. ప్రతి వారం వచ్చేసేవాడు, వచ్చిన వాడు ఊరుకోకుండా ఇదిగో ఆ చెట్టుని కొట్టెయ్యమని చెవిలో ఇల్లు కట్టుకొని అరిచేవాడు. మా పక్కింటి వాళ్ళ బాత్ రూం పక్కనే కుంకుడు చెట్టు ఉండేది, బాత్ రూం నుంచి విసిరేసిన ఆ కుంకుడు గింజలు పాపం వాటంతట అవే మొలకలెత్తి, ఆ బాత్ రూం నుంచి వచ్చే నీళ్లతో చెట్తై కూర్చున్నాయి. మేము ఆ కాయలని పిన్నీసుతో గుచ్చి, బుడగలూదేవాళ్ళము.


ఇక మా ఇంట్లో, పక్కవారింట్లో జామచెట్లు ఉండేవి. ఈ సాక్షిరంగారావు, "ఇదిగో ఆ ఫల వృక్షాలు ఇంట్లో ఉండకూడదు, పిల్లలకి అరీష్టము " అని అనేవాడు. ఆయన మాటలు ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోలేదు. మాకు ఈ జామ చెట్లు  సాయంకాలము ఆడుకొనే ప్లే గ్రౌండ్స్, ఆ చెట్టు కాయలే ఈవింగ్ స్నాక్స్. మాకే కాదు రామచిలుకలకి, కోతిపిల్లలకి కూడా చెట్టు అంటే చాలా ఇష్టము. ఆ జామచెట్టుని కొట్టేయమంటే మా పిల్లల గ్యాంగ్ కి చాలా కోపం వచ్చేది. ఆయన వస్తున్నాడంటేనే విసుగ్గా అనిపించేది. ఆ వేపచెట్టు కన్నా ఇతనే చేదు మనిషి అని అనిపించేది.


మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఒకసారి ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి కాబోయే భర్త బైక్ మీద బయటకు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే.


ఈ పెద్దమనిషి అదే మన సాక్షి రంగారావు వచ్చి " చెప్పానా, ఆ చేదు మొక్క వలనే ఈ అరీష్టము, ఆ ఫల వృక్షము కూడా,  ముందు ఆ చెట్లను కొట్టించేసేయండి " అని మళ్ళి చెప్పాడు. తొభై తొమ్మిది గొడ్దలి దెబ్బలకు పడని వృక్షము, వందో దెబ్బకు పడినట్టు, ఆ రోజు ఆ మాటలు ఆ ఇంట్లో వాళ్లకి బాగా పని చేసాయి. పెళ్ళీ కి ముందు చెట్టు కొట్టకూడదని ఎందరో చెప్పినా వినలేదు, ఆ మరునాడే ఆ వేప చెట్టు, కుంకుడు చెట్టు జామ చెట్టు కొట్టేశారు.


అవి చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని మోసిన చెట్లు, అట్లతద్ది వస్తే మా అందరిని ఉయ్యాలూపిన ఆ వేప చెట్టు,  విరిగిపోయినా ఇంట్లో  చెక్క ఉయ్యాలయ్యి ఆ అక్క (పెళ్ళైన అమ్మాయి ) పిల్లలకి కూడా జోలపాట పాడింది. 

 

 

Wednesday, June 5, 2019

లవ-కుశ సుబ్రహ్మణ్యం

తెలుగు సినిమా జగత్తులో ఆణిముత్యాలు ఎన్నైనా మకుటముగా నిలిచినవి మాత్రం అతి కొన్నే! అందులో చెప్పుకోదగినది "లవ-కుశ " . ఈరోజుకీ సినిమాలకి దిక్సూచి, కొలమానము లవ-కుశ... ఎన్ని పౌరాణిక చిత్రాలు వచ్చినా లవ-కుశ మాత్రము.. "న భూతో న భవిష్యతి ". అందులో నటించిన సుబ్రహ్మణ్యం గారు... అదే కుశుడు గారు ఆయన అనుభవాలను మనకు ఈ ఎందరో మహానుభావులు " ద్వారా చెప్పారు.

 

బాల్యం- విద్యాభ్యాసం :

 

శ్రీ సుబ్రహ్మణ్యంగారు 1946 ఏప్రెల్ 21, గొల్లపాలెం లో జన్మించారు. వారి తల్లి సుబ్బాయమ్మగారు, తండ్రి వియూరి సుబ్బారావు గారు. వారి నాన్నగారిని "గొల్లపాలెం అబ్బాయి " గారు అనేవారు.(మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారిని 'కాకినాడ అబ్బాయీ అనేవారుట). ఆయన యన్ మెన్స్ క్లబ్ మెంబర్ గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు. 1953 లో దంటు భాస్కర రావు గారి ప్రోత్సాహంతో లవకుశ నాటకం వేశారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన తమ్ముడు ఫకీర్ బాబు.

 

 

వీరి నటన చూసి ఆ తరవాతి కాలంలో సి. పుల్లయ్యగారి "లవకుశ " లో సుబ్రహ్మణ్యంగారినే కుశుడి పాత్రకు ఎన్నుకున్నారు. సుబ్రహ్మణ్యం తమ్ముడిని అదే సినిమాలో సుర్యకాంతం కొడుక్కా నటింపచేశారు. ఈ లవకుశ సీనిమా ఐదేళ్ళ పాటు తీయడం వలన సుబ్రహ్మణ్యంగారు బడికి వెళ్ళలేకపోయారు. ఆ విధంగా చదువు కొనసాగలేదు.

నటించిన ఇతర సినిమాలు :

" వెలుగు నీడలు " సినిమాలో జగ్గయ్య మేనల్లుడిగా, "శ్రీవేంకటేశ్వర మహత్యం " సినిమాలో శాంతకుమారి పాట పాడినప్పుడు చిన్ని కృష్ణుడిగా, "సీతారామ కల్యాణం " లో చిన్నరాముడిగా (గురుబ్రహ్మ పాటలో), 2006 లో వచ్చిన 'కల్యాణం ' అనే సినిమాలో కూడా నటించారు.

 

వివాహం :

 

సుబ్రహ్మణ్యం గారికి వారికి 1978 లో వివాహం అయ్యింది. ముగ్గురు కొడులు. వారి శ్రీమతి నర్శారత్నం గారికి మూడొవ సంతానం కలిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలు ఆవిడ మంచానికే అంకితమవ్వాల్సి వచ్చింది. 2017 లో ఆవిడ పరమపదించారు.

వారి భార్య కి ఒంట్లో బాలేదని ఒకసారి ఆయన నాకు చెప్పారు. అప్పుడు నేను కొంతమంది మిత్రుల సహకారంతో (ఈ ఎఫ్.బి. లో ఉన్నారు వారంతా) వారికి సాయం చేశాను. ఆ డబ్బు అందిన వారం రోజులకే వారి భార్య పరమపదించారు. నేను ఆయనకు ఫోన్ చేసి "ఆ డబ్బు ఇలా ఉపయోగపడినందుకు చింతిస్తున్నాను " పరామర్శిస్తే "తల్లీ! పెళ్ళికంటే ఎవరేనా సాయం చేస్తారు, ఈ కార్యక్రమానికి ఎవరిని సాయం అడుగుతాను, కరక్ట్ టైం కి డబ్బు అందేలా ఇచ్చావు " అని అన్నారు.

ప్రస్తుతం సుబ్రహ్మణ్యంగారు అమలాపురంలో టైలరింగ్ చేసుకుంటున్నారు. కోటీశ్వరులకు లేని గౌరవమర్యాదలు వారికి ఈ లవకుశ సినిమా ద్వారా లభించాయని ఆనందపడుతూ ఉంటారు.

 

 

 

 

 

 

 

Monday, May 13, 2019

కె. రాణి

అమ్మకొంగు పట్టుకొని తాయిళాల కోసం తిరిగే లేత వయసు, స్నేహితులతో కలిసి లొల్లాయి పాటలు పాడుతూ గంతులు వేసే చిరుత ప్రాయం.. అంత చిన్న వయసులో గాన గంధర్వుడు ఘంటసాల పక్కన నిలబడి ఆయనతో కలిసి " చెలియ లేదు చెలిమి లేదు " అన్న విషాద గీతాన్ని ఆయనతో గళం కలిపిందంటే  ఆ చిన్నారి ఎంత అదృష్టవంతురాలో కదా!!  11 ఏళ్ళ వయసులో గొంతులో విషాదాన్ని ఒలొకిస్తూ ఆవిడ పాడిన "అంతా బ్రాంతి యేనా " సినీ విషాద గీతాలలో ఆణిముత్యము. ఆ పాట పాడినది  అలనాటి చిన్నారి శ్రీమతి కె. రాణి గారు.  కె. రాణీ గారి అసలు పేరు ఉష రాణి. ఆవిడ 1942 లో కర్ణాటక రాష్ట్రం లో "తుముకూరు " జిల్లాలో పుట్టారు. ఆవిడ తల్లీతండ్రులు కిషన్ గారు, లలిత గారు. కిషన్ గారు రైల్వే లో పని చేయడం వలన భారత దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు. బహుశా ఈ కారణం వలనేనేమో రాణీ గారికి పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించేలా చేసింది. రాణి గారికి నలుగురు అక్కలు, ఒక అన్నయ.


పాటల ప్రస్థానం :



అప్పుడు రాణి గారికి 8 ఏళ్ళ వయసు, మద్రాసులోని అన్నామలై మన్రాంలో  నటి వైజయంతి మాల గారు  చేసిన నృత్యప్రదర్శన కార్యక్రమంలో రాణి గారు " హృదయ్ సే పూజా కరో " అనే మీరా భజన పాడారు. అది నచ్చి సుబ్బిరామన్ గారు మరునాడు ఆవిడ ఇంటికి తబలా, హర్మోనియం తో వెళ్ళి శృతిలయలతో ఒక పాట పాడమన్నారు. ఆవిడ పాడిన విషాద గీతం నచ్చి మరునాడు కార్ పంపించి స్టూడియోకి పిలిపించారుట. అప్పుడు పాడిన పాట తమిళం లో "పారిజాతం ". రాణి గారికి అప్పటికి తమిళ్ రాదు. కానీ జిక్కి గారి సహాయంతో ఆ పాట పాడి సుబ్బిరామన్ గారి ప్రశంశలు పొందారుట.


ఆ తరవాత "ధర్మదేవత " (1952) లో "ఇదిగిదిగో ఇదిగిదిగో " అన్న పాట అప్పటి ప్రముఖ గాయణీమణి చేత పాడించారుట. కానీ ఆ గాత్రంలో చురుకుదనం లేని కారణం గా ఆ పాటలు మొత్తం రాణి గారి చేత పాడించారుట సుబ్బిరామన్ గారు. ఆ సినిమాలో "పాటకు పల్లవి కావాలోయ్ " పాట (రాగిణి మీద చిత్రీకరించారు) అప్పట్లో  విదేశీ బాణిలో ఉన్న హుషారు గీతాలలో ఒకటి. అది విన్నాక సుబ్బిరామన్ గారు ఆవిడ చేతే "పెళ్ళి చేసి చూడు " సినిమాలో "బ్రహ్మయ్య " "అమ్మా నొప్పులే " పాట పాడించాలని ఆర్డర్ వేసారుట. ఆవిడ గాత్రంలో హుషారు, చిన్న పిల్లల మాద్రవం తొణికిసలాడుతూ ఉండటంలో అప్పట్లో చిన్నపిల్లల పాటలకు ఆవిడనే ఎంపిక చేసేవారుట.


ఆ తరవాత ఎందరో జీవితాలను మార్చెసిన "దేవదాస్ " సినిమాకి సుబ్బిరామన్ గారు రాణి గారి చేత పాడించాలనుకున్నారు. ఆ సినిమా అన్నీ ప్రయోగాలతో మొదలయ్యిందే! అందరూ రాణి గారిని వద్దని వాదించారు వేదాంతం రాఘవయ్య గారు ససేమిరా అన్నారు. అంత ఆద్రతతో కూడిన గాత్రం ఎవరేనా ప్రముఖుల చేత పాడిద్దామని వేదాంతం గారు అంటే, అందుకు సుబ్బిరామన్ గారు ఒప్పుకోలేదు. పార్వతిగా సావిత్రినీ, ఆ పార్వతి గాత్రానికి రాణీని అప్పటి పెద్దలకు రుచించని విషయం. కానీ ఆ సినిమాయే ఇద్దరికీ బాగా పేరు తెచ్చిపెట్టింది. తీరా పాడేటప్పుడు "బాగా ఏడుపు కనిపించే పాట " అని చెప్పారుట రాణి గారితో సుబ్బిరామన్ గారు. అప్పుడు రాణీ గారు నిజంగా ఏడుస్తూ పాడారుట పాటని.  సుబ్బిరామన్ గారు " పాటలో ఏడుపు ఉండాలి, కానీ నువ్వు ఏడవకూడదు, ఏడుపంతా కంఠలో ఉంచుకొని పాడాలి " అని చెప్పారుట. పదకొండేళ్ళ పిల్లకి ఆయన  చెప్పింది ఎమర్ధమయ్యిందో కానీ " అంతా బ్రాంతి యేనా " పాట మాత్రం వారి నుండి వచ్చి జనాలకు ఏడిపించింది.


అదే సినిమాలో "చెలియ లేదు చెలిమి లేదు " అనే పాట గాన గంధర్వుడు ఘంటసాల గారితో పాడాల్సి వచ్చింది. పక్కన ఘంటసాల గారిని చూసి ఏమయ్యిందో పాపం రాణి గారి గొంతు పెగల్లేదు. ఘంటసాల గారు ఓర్పుతో పిల్ల పాడేవరకు చూసారుట. అక్కడ ఉన్న సిబ్బంది " వేరే ఇంకెవరి చేతేనా పాడిద్దాము.విషాదంతో గుండె బరువెక్కి పాడే ఈ పాట ఈ చిన్న పిల్ల పాడలేదు " అని అన్నారు. పాపం ఈ మాటలకి సుబ్బిరామన్ గారు చాలా కలత చెందారు. "ఏం ఘంటసాల అంటే ఏదైనా పులా? నువ్వు పాడకపోతే పైన ఉన్న ఫాన్ నీ ఊడదీసి నీ నెత్తిమీద పడేస్తాను " అని అరిచారుట. అంతే రాణి గారు పాట అందుకున్నారు.  ఆ తరవాత ఘంటసాల గారి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "మాయబజార్ " , "లవకుశ " మొదలైన సినిమాలలో రాణి గారు పాడే అవకాశాలు ఇచ్చారు. పాట విని సావిత్రి గారు కూడా "  ఏంటీ పార్వతికి ఈ పిల పాడిందా? " అని ఆశ్చర్యపోయారుట. సుబ్బిరామన్ గారు తనకి తండ్రిలాంటి వారని ఆయనే అందరికన్నా తన మీద నమ్మకం పెట్టుకొని ప్రోత్సహించారని రాణి గారు చెప్పారు. ఆయన అకాల మరణం తనని కలచివేసిందని చెప్పారు.


ఈ సినిమాకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ రాణి గారు.. దేవదాస్ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు అందరూ సినిమా అయ్యక లేచి వెళ్ళిపోయారు, నేను మాత్రం సీట్ లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఇంతలో ఏ.ఎన్.ఆర్ వచ్చి "ఏవయ్యింది? ఎందుకేడుస్తున్నావు? " అని అడిగారు.


"పాపం దేవదాసు చనిపొయాడు "


"నేనే దేవదాస్ ని.. ఏడవకు " అని ఏ.ఎన్. ఆర్ అన్నారు


"అరే ఎలా బ్రతికిపొయారు " అని ఏడుస్తూనే అన్నాను...


అప్పుడు ఏ.ఎన్.ఆర్ గారు నెత్తి మీద కొట్టి "ఇంటికి వెళ్లు" అని అన్నారు.


ఏ.ఎన్. ఆర్, సావిత్రి ఆటోగ్రాఫ్ అడిగారుట రాణి గారు. "కాయితం ఏది? " అని అడిగారు సావిత్రి గారు. తన దగ్గర ఉన్న రూపాయి నోటు ఇచ్చి దాని మీద సంతకం చేయమన్నారుట రాణి గారు. సావిత్రి గారు అలానే చేశారు. ఏ.ఎన్.ఆర్ సంతకానికి కాయితం లేదు, ఏ.ఎన్.ఆర్  రాణి గారి చేయి తీసుకొని "ఐ లవ్ ... " అని రాసి ఒకసారి రాణి గారి వైపు చూశారుట. ఆవిడ కంగారు పడిపోయారు,  "ఆర్ట్ " అని రాసి "ఏం పిల్లా కంగారు పడ్డావా " అని నవ్వారుట.


ఇలా పాటలకే అంకితం అయ్యిపోయినందు వలన రాణి గారికి ఇంటికే టీచర్లని పిలిపించి పాఠాలు, తమిళం, కన్నడ, మళయాళం నేర్పించేవారుట. ఆవిడకు ఏదైనా ఒక్కసారి చెబితే గుర్తుండిపోతుంది. ఎనిమిది  భాషలలో ఆవిడ అనర్గళంగా  మాట్లాడగలరు. రాణిగారు పాట విని బాగా పాడుతున్నావు .. సంగీతం నేర్చుకోకూడదు " అని పి. లీల గారు అన్నారుట. అలా అన్నందుకే ఆవిడ  వద్దే రాణి గారు సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ ద్వారా "గురువాయూరప్ప " ని కొలవడం నేర్చుకున్నారు. " ఆ గురువాయూరప్ప భక్తి లభించిందంటే అక్కే కారణం " అని అన్నారు రాణి గారు.(లిల గారిని అక్క అని పిలిచేవారు).


కాని ఈ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాకే తనకు పాటలు పాడటమంటే భయం మొదలయిందట. అంతకుముందు ఎటువంటి సంకోచంలేకుండా పాడమనటం ఆలశ్యం హాయిగా పాడేసేదాన్ని…కానీ కాలక్రమేణా లీలగారి ప్రోత్సాహంతో, సహకారంతో కచేరీలు కూడా చేసే స్థాయికి ఎదిగాను. కచేరీలు కూడా చేశాను” అన్నారు రాణీ.  ఎవరైనా గాయనీ, గాయకులు తమలోని ప్రావీణ్యానికి ఈ శాస్త్రీయ సంగీతంతో సాన పెట్టటం వల్ల చాలా ఉపయోగం వుంటుంది”  అని అన్నారు రాణీ.


కె. రాణి గారు ఆరాధించే గాయణీ గాయకులు ఘంటసాల, లతా మంగేష్కర్ లు. ఒకసారి మద్రాస్ వుడ్లాస్ హోటల్ లో లతాజీ ఉన్నప్పుడు రాణి గారు కలిసి " మా ఇంటికి వస్తారా? " అని అడిగారుట. ఆవిడ "నువ్వు ఒక పాట పాడితే తప్పకుండా వస్తా  " అని అన్నారుట. అప్పుడు రాణీగారు "బచ్పన్ కే దిన్ భులానా దేనా.. ఆజ హసే కల్ రులానా దేనా " అని పాడారుట. అప్పట్లో రాణి గారు ఆవిడకు తెలీకుండానే లతగారి గొంతుని అనుకరించారుట. మరునాడు ఇంట్లో రాణి గారి సందడి.. "లతా జీ  వస్తారు " అంటూ అందరికీ మరీ మరి చెప్పసాగారుట. ఇంట్లో వారు "ఏదో చిన్నపిల్లవని నిన్ను సముదాయించడానికి అని ఉంటారు.. నిజంగా ఆవిడేమీ రారూ " అని ఆటపట్టించారుట. పాపం సాయంత్రం 7 అయినా రాకపోయేసరికి రాణీ  మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉన్నారుట. ఇంతలో తలుపు చప్పుడయ్యిందిట. "ఎవరూ " అని రాణిగారు అరవగా "మై హూ లతా " అని జవాబు వచ్చిందిట. లతా మంగేష్కర్, మదన్ మోహన్ గారితో కలిసి రాణి గారి ఇంటికి వచ్చారు. అంతే ఒక్క ఉదుకున పరిగెడుతూ వెళ్ళి ఆవిడ కాళ్లని చుట్టేసుకున్నారుట. "చల్ ఉఠ్ పగ్లీ " అని ఆవిడను లేవదీసి పక్కన కూర్చోబెట్టుకొని పాటలు పాడించుకున్నారుట లతా మంగేష్కర్.


ఆవిడతో పాటు వచ్చేస్తానని రాణి గారు మారాము చేస్తే " సరే " అని లత గారు వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఆవిడే స్వయంగా "పూరణ్ పోళీ (బొబ్బట్లు) " చేసి తినిపించారుట. వెళ్లే ముందు రాణీ గారి చేతిలో ఒక కృష్ణుడి బొమ్మ ఉంచి "మంచి గాయణి అవుతావు " అని దీవించారుట లత. లత గారు ఆంధ్ర వచ్చినప్పుడు రాణి గారి వద్దే ఆవకాయలు తీసుకొనేవారుట.


అలాగే ఘంటసాల గారి ఇంట్లొ వారి పిల్లలతో సమానంగా ఘంటసాల గారి అమ్మగారు రాణిగారికి నోట్లో  అన్నం పెట్టేవారుట. అలాగే వైజయంతి మాల గారు రాణి గారిని సొంత చెల్లెలుగా చూసుకునేవారుట. ఇద్దరు ఒకే కంచం లో తిని,  ఒకే మంచం మీద పడుకొని పాటలు పాడుకునేవారుట. వైజయంతి మాల గారి డాన్స్ కి రాణి గారు పాటలు పాడెవారుట(లతా మంగేష్కర్వి).


వివాహం :


రాణి గారి బావగారి (అక్క భర్త) స్నేహితులు శ్రీ సీతారామరెడ్డిగారు. సీతారామరెడ్డి గారి తండ్రి బొబ్బిలి రావు బహదూరు సుబ్బారెడ్డి , తల్లి ఓబులమ్మ. సుబ్బారెడ్డిగారు కలెక్టరుగా పని చేశారు. సీతారామరెడ్డిగారికి హైదరాబాద్ లో సదరన్ మూవీటోన్ స్టూడియో వుంది. నిర్మాతగా”సతీ అరుంధతి”-“నిజం చెబితే నమ్మరు” చిత్రాలను నిర్మించారు. రాణి గారిని చూసే వంకతో వారి బావగారి ఇంటికి  వస్తూ ఉండేవారుట. ఒకరోజు పెళ్ళి ప్రస్తావన తీసుకొని రాగా, రాణి గారు ససేమిరా అన్నారుట. కానీ రాణి గారి బావగారు మధ్యవర్తిత్వం వహించి వారిరువురుకీ 1966 వివాహం జరిపించారుట.  ఆ తరవాత ఆవిడకు కొన్ని సినీ అవకాశాలు వచ్చినా భర్తకి ఇష్టం లేని కారణం గా వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరవాత సీతారామరెడ్డి గారు తీసిన "సతీ అనసూయ " సినిమాకు గానూ ఆవిడకు పాడే అవకాశం ఇచ్చారుట సీతారామరెడ్డి గారు. "సినిమా  పాటలు పాడవద్దన్నారుగా, ఇప్పుడు ఇది కూడా సినిమా పాటే.. నేను పాడను " అని అన్నారుట. కానీ తరవాత సీతారమరెడ్డి గారు బ్రతిమాలగా పాడారుట. 


ఆ తరవాత ఘంటసాల గారి సంగీత దర్శకత్వం లో  వచ్చిన " వస్తాడే మా బావ " అనే సినిమాకు పాడారు. ఆవిడ మొట్టమొదట పాడింది విషాద గీతం అవ్వడం వలన ఆవిడ  జీవితం  కూడా విషాదమయం అయ్యిందేమో అని బాధపడ్డారు రాణి గారు. పెళ్ళైన పదేళ్లకే భర్త పోయారు. ఆవిడ కూతుర్లు విజయ, కవిత అప్పటికి చాలా చిన్నపిల్లలు. వారిని చుసుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది. కాబట్టి పాటలకు, సినిమాలకు దూరం అయ్యి.. తల్లిగా పూర్తి జీవితం గడిపారు.



రాణి గారు గాయణి గా ఉన్నది కొద్ది కాలమైనా ఎన్నో అద్భుతాలను చేశారు. శ్రీలంక జాతీయ గీతం ఆలపించిన తెలుగు మహిళ ఆవిడే (సంగీతం సుసర్ల దక్షిణా మూర్తి గారు)! తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, సింహళి, ఉజ్బెక్ భాషల్లో పలు పాటలు ఆలపించారు.  మదరాసులో షిప్పింగ్ వ్యాపారంలో వున్న తమిళ ముస్లీములు హనీఫా వారి కోసం 150 కి పైగా భక్తి గీతాలను పాడారుట రాణి గారు. ఆ సమయంలోనే రాజ్ కపూర్, నర్గీస్, ముకేష్, దిళిప్ కుమార్, తలత్ మెహమూద్ గార్లతో పరిచయం ఏర్పడింది. ఆవిడ రాజ్ కపూర్ "జిస్ దేష్ మే గంగా బెహతీ హై " లో "ఓ మైనే ప్యార్ కియా " పాడరుట. ఆ తరవాత స్టేజ్ మీద రాజ్ కపూర్ మాట్లాడుతూ " వో చోటి లడ్కీ కహా హై " అని అడిగారుట. ఎవరో  రాణి గారిని స్టేజ్ మీదకు తీసుకొని వస్తే " ఈ సత్కారం నాకు కాదూ.. నీకు చెయ్యాలి " అని తన మెడలో ఉన్న పుల మాల రాణి గారి మెడలో వేశారుట. చిన్నతనం , అమాయకత్వం "అయ్యో రాజ్ కపూర్ నన్ను పెళ్ళి చేసేసుకున్నారా" అని తల్లి దగ్గర ఏడ్చారుట రాణి గారు. ఆవిడ తల్లి "నోరు మూయ్.. పిచ్చి మాటలు " అని తిట్టారుట.


అప్పటి గాయకులలో రాణి గారు చిన్నవారు కావడంతో స్టూడియోకి రాగానే పాలు, ఫలహారాలు పెట్టి ముద్దుగా చూసుకునేవారుట అందరూ . పాట పాడటం అయ్యాక ఆవిడకు చాకులెట్లు ఇచ్చేవారుట. భారత రాష్ట్రపతి డా: సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు రాష్ట్రపతి భవన్ లో పాడి ఆయన ప్రశంసలతోపాటూ ఆయన ఆశీసులు పొందిన భాగ్యశాలి. 1955 లో ఆనాటి మదరాసు రాష్ట్ర(తమిళనాడు)ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ రాణీకి బంగారు కృష్ణుడు వున్న బంగారు గొలుసును బహూకరించటమే కాక”మెల్లిసై రాణి”అనే బిరుదు ప్రదానం చేశారు. రాజగోపాలాచారి సమక్షంలో పాడి ఆయన మెప్పు పొందారు. ఆయన రాణీని “నీకు చాలా ఉజ్జ్వలమైన భవిష్యత్తు వుంది” అని ఆశీర్వదించారట. ప్రముఖ హిందుస్తానీ విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ ఘంటసాల ఇంట్లో బస చేసినప్పుడు రాణీ పాటను విని “నువ్వు మంచిగాయకురాలివి అవుతావు. నీకు మంచి భవిష్యత్తు వుంది” అని  ఆశీర్వదించారుట. లతతో పాటు రాణీ గారి ఇంటికి వచ్చిన మదన్ మోహన్(హిందీ సంగీత దర్శకులు) " బాగా సాధన చెయ్యి..మంచి గాయణివి అవుతావు " అని ఆశీర్వదించారుట. ఇవే ఆవిడకు లభించిన అవార్డ్లు.


నేను ఆవిడని కలవడానికి వెళ్ళినప్పుడు "నేను ఇంకా బ్రతికున్నానని ఈ ప్రపంచానికి తెలుసా? " అని అడిగారు. వీడియో తీస్తునప్పుడు ఆవిడకు పాటలు గుర్తొచ్చెవి కావు, వీడియో ఆపేశాక పాడటం మొదలెట్టెవారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆవిడకు ఏదైనా పాట గుర్తుకొస్తే పాడేవారు. ఎన్నో  జ్ఞాపకాలో పంచుకున్నారు ఆవిడ. ఆవిడ పెద్ద కుమార్తే విజయ గారి వద్ద ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యతో జూలై 13 వ తారీఖున 2017 న హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు రాణి గారు. ఆవిడ భౌతికంగా దూరమైనా పాటలతో ఎప్పటికీ  చిరంజీవే! 


ఆవిడ పాడిన కొన్ని తెలుగు పాటలు :


1. అంతా బ్రాంతియేనా(దేవదాసు)

2. చెలియ లేదు చెలిమి లేదు(దేవదాసు)

3. దయచేయండి దయచెయండి (ఒకటే మా వయసు.. మాయాబజార్)

4. రామన్న రాముడు కోదండ రాముడు (లవ కుశ)

5. బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య,  అమ్మ నొప్పులే అమ్మమ్మ నొప్పులే(పెళ్ళి చేసి చూడు)

6. చందమామ ఇటు చూడరా (శభాష్ రాముడు)

7. ఎవడే ఎవడే చల్లని జల్లులు (చంద్రహారం)

8. రావోయి వరా నా ఏలిక (చండీ రాణి)

9. చిన్నరి చేతులా (అన్నా తమ్ముడు)

10. తినబోతూ రుచి అడగకు-తీయని కోర్కెలు దాచకు ((చివరి పాట)వస్తాడే మా బావ)

11. ఇదిగిదిగో  ఇదిగిదిగో (లంబాడి లంబాడి లంబ లంబ.. )(ధర్మ దేవత)

12. పాటకు పల్లవి కావాలోయ్ ( ధర్మ దేవత)

13. ఏ ఊరే చిన్నదానా (ధర్మ దేవత)

14. కొండ మీది కొక్కిరాయి (జయసింహ)

15. విరిసే చల్లని వెన్నెల(లవకుశ)

16. అశ్వమేధ యాగానికి జయము జయము జయము(లవకుశ)

17. ఓ పంతులు గారు (పిచ్చి పుల్లయ్య) 

 

 

 



 

Monday, May 6, 2019

కె. రాణి

సన్మిత్రులకు నమస్కారములు!! తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హింది, బెంగాలి, ఉజ్బెక్ భాషల్లో పాడిన తెలుగు గాయనీమణి... కె. రాణి గారు. మొదట పాటే గుండెలని పిండేసే విషాద గీతం.. అదే "అంతా భ్రాంతి యేనా(దేవదాసు సినిమాలోది). " . ఆ పాట పాడేటప్పటికి ఆవిడ వయస్సు 11 సంవత్సరాలు మాత్రమే!

ఆవిడజీవిత విశేషాలు ఆవిడ ద్వారా తెలుసుకుంద్దాము...



Monday, April 15, 2019

బ్యాగోపాఖ్యానం

పాత బండారులంక దగ్గర హ్యాండ్ బ్యాగ్ మామ్మ గారు ఎక్కేవారు, ఆవిడ చేతిలో ఒక హ్యాండు బ్యాగు ఉండేది. అప్పుడప్పుడు ఆ బాగులో నుండి బిస్కెట్టు పాకెట్టు తీసి రెండు బిస్కెట్లు నోట్లో వేసుకొని, ఒక చిన్న బాటిల్ తో నీరు తాగేవారు. మరి కొన్ని సార్లు చిప్స్ తినేవారు (మాకూ ఇచ్ఛేవారు లెండి). ఆ హాండ్ బ్యాగ్ లో నుంచి అప్పుడప్పుడు మాకు సంపెంగి పూలు(మరి కొన్నిసార్లు మల్లెదండలు) తీసి ఇచ్చేవారు. ఆవిడ పేరు చాలా మందికి తెలీదు కానీ బస్సు డ్రైవర్ నుంచి ఎక్కే జనాల వరకు అందరూ "హ్యాండ్ బ్యాగ్ మామ్మగారు " అని అనేవారు ఆవిడని. నా దృష్టిలో ఆ హ్యాండ్ బ్యాగు లో నుంచి క్షేరసాగర మధనం లో వచ్చే వస్తువులన్నీ వస్తాయేమో అని అనిపించేది. ఆవిడ ఆ హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని ఒక్కసారిగా బస్సు నుండి గంతుతూ దిగినప్పుడు కుప్పించి ఎగసిన పద్యములో " ఉరికిన యోర్వగ ఉదరంబులో నున్నజగముల వ్రేటున జగతి కదల " అన్నట్టు ఆవిడ బ్యాగులో ఉన్న వస్తువులన్నీ అల్లకల్లోలం అయ్యిపోయి ఉంటాయనిపించేది.

చిన్నప్పుడు ఇలా మాయల ఫకీరుల సంచీలాంటి హ్యాండ్ బ్యాంగ్ ని చూస్తే అందులో ఏముందో అన్న కుతూహులం చాలా ఉండేది. కాలక్రమంలో ఆ జోలీ నా భుజస్కందాల మీదకు కూడా వచ్చేసింది.

ఎప్పుడైన బయటకు వెళ్తే ఇంటి తాళాలు పక్కవారికొకటిచ్చి, ఇంకోటి బ్యాగులో వేసుకుంటాము. ఆ తరవాత ఎండలో వెళ్ళాలి కాబట్టి చిన్న గొడుకు, ఒక నీళ్ల బాటిలు తప్పనిసరి. ఏమో ఎక్కడేనా ఆకలి వేస్తే... ఒక చిన్న బిస్కెట్టు పాకేట్టో లేక ఒక నూట్రిషన్ బారో ఉంచుకోవాలి. అసలే ఆడవారు రెండు రకాలు.. ఒకటి ముడిపదార్ధాలు, ఇంకొకరు జడపదార్ధాలు... మరి బ్యాగులో దువ్వెన, రబ్బర్ బాండ్లు, ముడి పిన్నులు ఉండాలి కదా! చీరలకి పెట్టుకునే పిన్నులు, పిన్నీసుల కట్టా, బొట్టుబిల్లలు మొదలైనవి. (సుమంగళీ కి చిహ్నాలైన ఈ ఐదోతనాన్ని బ్యాగ్గులలో భద్రంగా దాచుకుంటూ). పాస్ పోట్ల నుంచి పాల కూపన్ల వరకు, బంగారు ఆభరణాల నుండి బండి తాళాల వరకు అన్నీ దాచుకొనే ఏకైక స్థలం.. ఈ హ్యాండ్ బ్యాగులు. ఇవి చాలవన్నట్టు ప్రయాణాలలో భర్తగారి పర్సులు, కళ్ళజోళ్లు, పెన్నులు. పిల్లల విడియో గేంస్ కూడా ఈ బ్యాగులో చేరతాయి. అప్పుడెప్పుడో చూసిన బాహుబలి సినిమా టికెట్లు, ఆ తరవాత తిన్న హోటల్ బిల్లు కూడా ఉంటాయి ఈ బ్యాగులో!

ఎవరింటికేనా వెళ్తే వారిచ్చే తాంబూలము, జాకెట్టు ముక్క, అందులో ఉంచిన అరటి పండో, బత్తాయి పండో ఈ బ్యాగులో పాడేసుకుంటాము. (ఎప్పుడో కంపువాసన వచ్చినప్పుడు కానీ ఈ పళ్ల విషయం గుర్తుకురాదు) . ఏ సమయానికి ఏ అవసరమొస్తుందో అని తలనొప్పి టాబెలెట్లు (ఎవరికి అని అడగొద్దు), జ్వరానికి పారాసిటిమాల్ , బ్యాగులో తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇన్ని దాచుకున్న బ్యాగు 'ఉరుకోదరుడి " లా ఎలా ఉంటుంది? కప్పని తిన్న పాములా, తొమిదోనెల గర్భిణిలా నిండుగా ఉంటుంది. చుట్టుపక్కల అమ్మలక్కల విషయాలన్నీ పొట్టలో దాచుకున్న పనిమనిషి కడుపులా ఎప్పుడెప్పుడు నోరు తెరిచేదామా అనట్టుంటుంది ఈ హ్యాండ్ బ్యాగు.

ఒకసారి మెమంతా పాపికొండలు చూడటానికి వెళ్ళాము. గోదావరి మధ్యలో ఒక చిన్న గుడి దగ్గర ఆపాడు. అక్కడ గోదావరికి నమస్కరించి పసుపు, కుంకుమ వెయ్యాలని చెప్పారు ఎవరో పెద్దవారు. బ్యాగులో చెయ్యి పెట్టి కాసేపు (పావుగంటే) వెతకగానే పసుపు కుంకుమ దొరికేశాయి. చక్కగా గోదావరికి నమస్కరించుకున్నాము.

మొన్న ఈ మధ్యనే తెలిసినవారి ఇంటిలో ఫంక్షన్ కి వెళ్ళాను, వారు ఇచ్చిన గిఫ్ట్, ప్రసాదం బ్యాగులో వేసుకున్నా, నా ఫ్రండ్ " నా కాలి చుట్లు కొత్తవి కొన్నాను ఇవి నీ బ్యాగులో వేసుకోవా? " అని అడిగింది. తీరా ఇంటికి చేరాకా నా చుట్లు ఇవ్వవా అని అడిగితే, నా బ్యాగ్ బోర్లించీ "నీ చుట్లు నువ్వు తీసుకో.. ఈ లోపల టీ తెస్తాను " అని చెప్పి లోపలకి వెళ్ళా, పాపం పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి వెతికినట్టు వెతుకుంది. దాని పిల్లలు " 5 సెకన్స్ లో ఈ చెత్తలో ఉన్న టొమాటో సాస్ ఎక్కడుందో చెప్పుకోవాలి " అంటూ హిడెన్ ఎక్స్ప్రెస్ ఆడుకున్నారు. (అప్పుడెప్పుడో సండ్ విచ్ కొన్నప్పుడు ఇచ్చిన టొమాటో సాస్ పాకెట్.. బ్యాగులో వేసుకున్నా), అయినా ఈ హ్యాండ్ బ్యాగ్ ఏవైనా కృష్ణ బిలమా? వెళ్ళిన వస్తువు మళ్ళీ కనిపించాపోడనికి? కాస్త ఓర్పుగా వెతికితే అదే దొరుకుతుంది.

పిల్లలు టి.వి. లో డోరేమాన్ చూస్తూ ఆ డోరేమాన్ ఎవరికి ఏమి కావాలన్నా బ్యాగ్ లో చెయ్యిపెట్టి ఇస్తూ ఉంటాడు, ఆ డోరేమాన్ దగ్గర ఉన్న బ్యాగు లాంటి బ్యాగు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. ఈ ఆడవారి హాండ్ బ్యాగులు అలాంటివే అని పాపం వారికి తెలీదు. పిల్లలంటే గుర్తొచ్చింది.. చంటి పిల్లల తల్లులకైతే సెపరేటుగా ఇంకో చేతిలో డైపర్ బ్యాగులు కూడా ఉంటాయి. ఈ మధ్య బ్యాగులలో పెప్పర్ స్ప్రె లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎంతైనా ఈ ఆడవారి హాండ్ బ్యాగులు ఎన్ని దాచుకున్న ఇంకా చోటు ఉండే పుష్పక విమానాలు.

భూభారం మోసే ఆదిశేషుడు కంటే గొప్పవారెవరూ? అష్టదిక్కులని తమ భుజాల మీద మోసే గజాల కన్నా ఓర్పు గల వారెవరూ? ఏంటీ... యక్ష ప్రశ్నలలా ఉన్నాయా? జావాబు ఏంటో తెలుసా? ఆడవరి హాండ్ బ్యాగులు. ఏంటీ నమ్మరా? సరే మీ ఇళ్లల్లో ఇంతులు వాడే హాండ్ బ్యాగ్ ని ఎప్పుడేనా ధైర్యం తీసి చూశారా? చూసినవారికే తెలుస్తుంది అందులో ఉన్న నిధి నిక్షేపాల గురించి. ఈ హ్యాండ్ బ్యాగ్ కి గనక మాటలొస్తే ఎన్ని తిట్లు తిడుతుందో? ప్రాణం వస్తే మాత్రం "డొమెస్టిక్ వాయిలెన్స్ " కి సంబంధించిన అన్నీ కేస్ లు పెట్టెస్తుంది.

ఆడవారి ఓర్పుకు, ఈ హండ్ బ్యాగులకు అవినాభావ సంబంధం ఉంది. కడుపులో ఎంతో దాచుకుంటారు!  నోరు ఉంది కదా అని బయటకు చెప్పరు ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి(బ్యాగులో వస్తువులు). ఇంటి బాధ్యతలని తన భుజస్కంధాల మీద మోస్తున్న స్త్రీ మూర్తుల సన్నిహిత నెచ్చెలి.. ఈ హ్యాండ్ బ్యాగు.






Wednesday, January 9, 2019

మంచు తెరలు

                                                                

గత వారం రోజులుగా ఒకటే పొగమంచు. సూర్యుడిని చూసి వారమౌతోంది. వాతావరణం అంతా మసకమసకగా ఉంది... కీర్తన మనసులా..


స్టవ్ మీద పాలల్లో బియ్యం  కుతకుతలాడుతూ ఉడుకుతోంది....  కీర్తన ఆలోచనలూ అలానే ఉన్నాయి. ఎంత సంభాలించుకుంద్దామన్నా ఆలోచనలు "ఆమె "  వైపే వెళ్తున్నాయి. మనసులో ఎంత మధనపడుతున్నా అడగడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు. అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? తను చేసిన తప్పు ఏవయ్యి ఉంటుంది? లంచ్ అంతా రెడీ చేసి, పాయసం చేస్తూ  అతని కోసం ఎదురుచూస్తోంది  కీర్తన. గన్ట క్రితం 'ఆమె ' నుంచి ఫోన్ వచ్చింది.. వస్తుంటే కారు ఆగిపోయిందిట వచ్చి పిక్ అప్ చెసుకోమని. వెంటనే తన భర్త "ఆమె " ని తీసుకొని రావడానికి బయలుదేరాడు.


 

***************


మూడు నెలల క్రితం కీర్తన భర్త మురళి "ఆమె " గురించి చెప్పాడు. ఆమె పేరు " సంజన" ట.  గుజరాతి అమ్మాయి. మురళి ఆఫీస్ లో ఆరు నెలల క్రితం జాయిన్ అయ్యిందిట. ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్ లో ఉండటంతో కలిసి లంచ్ లు, కార్ పూల్ లు సహజంగా జరుగుతూనే ఉన్నాయిట. ఇవేవీ అంతగా పట్టించుకోలేదు కీర్తన. కానీ ఒకరోజు మురళి  "నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను " అని పక్కన కూర్చొని తనతో అన్నాడు.


"సంజన నన్ను ఇష్టపడుతోంది... తను డైవర్సీ, నాతో కలిసి ఉంటానంటోంది. ఒకరోజు లంచ్ కి పిలుద్దామనుకుంటున్నాను, ఎల్లుండి ఆదివారం తనని పిలుస్తున్నాను " అని తన అభిప్రాయం కనుకోకుండా ఆఫీస్ కి టైం అవుతోందని లేచి వెళ్ళిపోయాడు.


***********


పాలు పొంగి చేతి మీద పడటంతో వాస్తవంలోకి వచ్చింది కీర్తన. ఇప్పుడు ఆ అమ్మయిని ఎందుకు తీసుకొస్తోనందుకు? మురళి అతని  ఇల్లు, వాకిలి చూపించి... ఇంకొన్ని రోజుల తరవాత " అవి నీవే " అని చెప్పడానికా? పదేళ్ళ కాపురంలో ఏ రోజూ అతని అభీష్టానికి వెతిరేకంగా తను ప్రవర్తించలేదు. అతని అమ్మని అతని కంటే ఎక్కువగా చూసుకుంది. అతని వైపు చుట్టాలు కూడా తనని చాలా ఇష్టపడతారు. మరి ఎందుకు ఇప్పుడీ కొత్త మోజు? పాయసం లో గరిటకు దాని రుచి తెలీదు, అలాగే ఈ మగాళ్ళకు భార్య విలువ తెలీదు.  పిల్లల పెంపకంలో కానీ, వాళ్ళ చదువులో కానీ ఏ రోజూ మురళి సాయాం లేకుండానే అన్నీ సమర్ధించింది తను. మరి ఏ తక్కువ చేశానని మురళి ఈ దారి వైపు వెళ్ళాడో... అన్ని ఆలోచనల మధ్యలో పాయసం అయితే పూర్తి చేసింది కానీ మనసు మనసులో లేదు.  కార్ హారన్ తో ఒక్కసారి ఉలికిపడింది. రావల్సిన టైం వచ్చేసింది.. "ఆమె " అదే సంజన వచ్చేసింది. తను ఇప్పుడు వెళ్ళి ఇద్దరికీ హారతి ఇచ్చి స్వాగతం చెప్పాలా? " భగవంతుడా ఇలాంటి పరీస్థితి ఏ భార్యకూ రాకూడదు. మురళి కారు దిగి , పక్కకు వచ్చి కార్ వెనక డోర్ తీసి సంజనను ఇంట్లోకి రమ్మన్నట్టు సైగతో ఆహ్వానించాడు. సంజనతో పాటు ఐదేళ్ళ బాబు కూడా వచ్చాడు. ఆ బాబు సంజన కొడుకని కిటికీలోనుంచి చూస్తొన్న కీర్తన అర్ధం చేసుకుంది.


"కీర్తి... కీర్తీ.. " అరచుకుంటూ  ఇంట్లోకి హడావిడిగా వచ్చాడు మురళి...


మురళి వెనకాలే సంజనా, కొడుకు.


" నేను చెప్పాను కదా ... మా ఆఫీస్ లో పని చేసే ఆమె .. సంజన అని " అని పరిచయం చేశాడు.


కీర్తన చేతులు జోడించి నమస్తే చెప్పింది.. సంజన మొదట "హాయ్ " చెప్పింది కానీ కీర్తన నమస్తే చెప్పడం తో ఆమె కూడా నమస్తేనే చెప్పింది.


ఇంట్లోకి రాగానే సంజన కొడుకు " ఈ ఇల్లు చాలా బాగుంది.. మనం ఇక్కడే ఉండిపోద్దామా " అని అడిగాడు


మురళి... " ఈ ఇల్లు ఆంటీది.. ఆంటీ ఒప్పుకుంటే ఉండిపోవచ్చు " అని అన్నాడు...


హ్మ్మ్.. పిల్లాడి దగ్గర నుంచి ప్రిపేర్ అయ్యిపోయి వచ్చేసినట్టున్నారని మనసులోనే అనుకుంది కీర్తన.


చిరునవ్వు నవ్వుతూ " మంచి నీళ్ళు కావాలా? " అని అడిగింది. వాళ్ళ సంభాషణ మొత్తం హింది, ఇంగ్లీష్ లోనే జరుగుతోంది.


"పర్లేదు.. వద్దు " అని సంజన అంది.


" కీర్తన మాత్రం లేచి వంటింట్లోకి వెళ్ళి మూడు గ్లాసులతో మంచి నీళ్ళు తీసుకొని వచ్చింది.


"పిల్లలు ఎక్కడకి వెళ్ళారు? " అని అడిగింది సంజన


"వాళ్ళ నాన్నమ్మతో ఊరు వెళ్ళారు రేపు వచ్చేస్తారు " అని సమాధానం చెప్పింది కీర్తన.


ఇంటికి వచ్చినప్పటి నుంచి కీర్తనని చూస్తూనే ఉంది సంజన. ఈ విషయం కీర్తన కూడా గ్రహించింది. కానీ పట్టించుకోనట్టుగానే ఉంది. సంజన  పాతిక నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటుంది . కానీ నిత్యం బ్యూటీ పార్లర్ కి వెళ్ళే రకం అని మొహం చూస్తేనే అర్ధమవ్వుతుంది. అందువల్లనేనేమో వయస్సు ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే నమ్మేయవచ్చు. నార్త్ ఇండియన్ ఏమో మంచి రంగు, సన్నగా నాజూకుగా ఉంది.   సంజనని చూశాక కీర్తన మనసు ఇంకొంచం కలత చెందింది. "చిదిమితే పాలుగారే మొహం సంజనది, తానేమో చామన ఛాయ , సంజన స్టైల్ గా ఉంటుంది, తానేమో పాత చింతకాయ పచ్చడిలా మొహానికి పౌడర్ కూడా రసుకోదు , సంజన జట చక్కగా కట్టింగ్ చేయించుకొని అలా వదిలేసుకొని ఉంది, తానేమో పెద్ద జడ వేసుకొని జిడ్డుమొహంతో ఉంది... బహుశా ఇందుకేనేమో భర్తకు ఆమె నచ్చింది " అని అనుకొంది.


మనసులోని భావాలు ఏవీ బయటపడనివ్వకుండా చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంది కీర్తన. భోజనాల దగ్గర " ఇన్ని రకాల వంటకాలు ఎందుకు చేశారు? " అని అడిగింది సంజన...


"మామూలుగా హాలీడే రోజు మేము రెండు కూరలు, పప్పు, రసం, పచ్చడి తో తింటాము, ఆయనకి అలానే ఇష్టం " అని అంది కీర్తన...


"నేను రోజు ఒక దాల్, లేకపోతే ఒకసబ్జీ చేస్తాను  అంతే... ఇన్ని రకాలు ఇంట్లో ఏదైనా పండగ అప్పుడే లేకపోతే ఇంటికి ఎవరేనా వస్తేనే చేస్తాము " అని అంది సంజన.


" మీ వంట నేను మురళి టిఫిన్ బాక్స్ లో నుంచి చాలా సార్లు తిన్నా , ఇన్ని ఐటంస్ మీరు ఒక్కరే ఎలా చేశారు? పొద్దుటే లేచి చేసారా? " అని అడిగింది సంజన...


"లేదు తను ఒక్క గంటలో ఇరవై మందికి వండగలదు , అదీ రుచి చూడకుండా పెర్ఫెక్ట్ గా " అని అన్నాడు మురళి.


"వంటలు ఎంత బాగా చేసినా మిమల్ని మెప్పించలేకపోయాను కదా " అని మనసులోనే అనుకుంది కీర్తన.


భోజాలు కడుపు నిండా తిన్నాక మురళి సంజనకి ఇల్లు చూపిస్తూ మేడపైకి తీసుకొని వెళ్ళాడు.. వాళ్ళ వెనకాల కీర్తన , సంజన కొడుకూ వెళ్లారు, మేడ పైన వీణలు చూసి " ఇవి ఎవరు వాయిస్తారు " అని అడిగింది సంజన


" ఇవి కీర్తనే వాయిస్తుంది, తను వీణ కూడా నేర్పిస్తుంది... ఇదిగో గోడ మీద పైంటింగ్ కూడా కీర్తన వేసినదే, ఈ పాట్ పైంటింగ్ కూడా తనదే, కర్టేన్స్ మీద పైంటింగ్స్ తనవే... " అని ఒక్కొక్కదాన్నే చూపించాడు మురళి...


బాల్కనిలో మొక్కలు, వాటికి వచ్చిన పూలు కాయలు, పళ్ళూ చూసి ఆశ్చర్యపోయింది సంజన. ఇంత తక్కూ స్థలంలో ఇన్ని మొక్కలు, వాటికి ఇన్ని పూలూ కాయలా? అని అంది...


"గార్డనింగ్ అంతా కీర్తిదే... నేను ఏ రోజు మొక్కకి నీరు పోసింది లేదు "


"  కష్టపడితేనే మొక్కలు పెరుగుతాయి, కానీ కలుపు మొక్కలు వద్దంటేనే వస్తాయి " అని అనాలనుకుంది...కానీ అనలేకపోయింది కీర్తన....


వాటిని కీర్తనని మార్చి మార్చి చూడసాగింది సంజన. కబుర్లతో సాయంత్రం అయ్యిపోయింది. "ఇక బయలుదేరుతా " అని బ్యాగ్ తీసుకుంది సంజన...కానీ సంజన కొడుక్కి వెళ్లడ ఇష్టం లేదు... "మనం ఇక్కడే ఉండిపోద్దాం.." అని మారాము చేశాడు.


"హాలీడేస్ వచ్చినప్పుడు మళ్ళీ రా " అని చేతిలో చాక్లెట్లు ఇచ్చింది కీర్తన...


"పద మనం వెళ్ళి సంజనని డ్రాప్ చేసి వద్దాము " అని అన్నాడు మురళి.


సంజన కి రాత్రికి తినుబండారాలు ప్యాక్ చేసి ఇచ్చింది కీర్తన.


కార్ దిగి సంజన మురళి పక్కకు వచ్చి " కీర్తనని చూస్తుంటే చాలా జెలసీ గా ఉంది " అని అనేసి పిల్లాడిని తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో కీర్తన సంజన కొడుకుతో మాట్లాడుతోంది.. కానీ ఆ మాట కీర్తన చెవిలో పడినట్టు మురళి, సంజన గ్రహించలేదు.


సంజనని దింపి కారులో ఇంటికి వస్తునప్పుడు ఇద్దరి మధ్యలో మౌనమే రాజ్యం చేసింది. సాయంత్రం ఆరు దాటిందేమో దారి ని కప్పేస్తూ పొగమంచు. మంచుపొరల కన్నా మనసులో పొరలే దిట్టంగా ఉన్నాయి...


రాత్రి కీర్తనకు నిద్దర పట్టలేదు. ఇప్పుడు ఇంట్లో తన స్థానం ఏంటో అర్ధం కావడం లేదు. ఇంట్లో ఉండాలా? ఒకవేళ మురళి ఇంత్లో నుంచి వెళ్ళిపొమ్మంటే... బ్రతిమాలాలా? లేక వెళ్ళిపోవాలా? వెళ్తే ఎక్కడకు వెళ్ళాలి? ... పొద్దుట ఐదు అయ్యేటప్పటికి లేచి ఈ అలోచనలతో సోఫాలో కూలబడింది.


ఎప్పుడు లేచాడో కానీ మురళి రెండు కాఫీ కప్పులతో కీర్తన దగ్గరకు వచ్చి ఒక కపు కీర్తనకిచ్చి " నీ అంత బాగా కాఫీ కలపలేను కానీ... ప్రస్తుతానికి ఇది తీస్కో... " అని ఇచ్చాడు.


మురళి వైపు కాస్త ఆశ్చర్యంగా చూసింది కీర్తన.


కాఫీ సిప్ చేస్తూ మురళి  "   సంజన చాలా తెలివైన పిల్ల , కానీ అంత కన్నా మొండిది, మంకుపట్టుది. తను చాలా డిప్రషన్ లో ఉంది, భర్త డ్రగ్ ఎడిక్ట్, చాలా టార్చర్ పెట్టాడుట, తను చిన్న పిల్ల చెప్పినా వినిపించుకోదు "


"తను ఎర్రగా బుర్రగా ఉంటుంది, నేనే రంగు తక్కువా, ఊరి దానిలా ఉంటాను " అని ఎన్నో అనాలనుకున్నా.. కీర్తన నోటంపట ఈ మాటొక్కటే వచ్చింది... బహుశా అడగడానికి సంస్కారం అడ్డొచ్చింది కాబోలు..


 "  తనని ఇంటికి పిలిచి నీ మనసు బాధ పెట్టానా?నిన్నూ, నీ పద్దతినీ, నా జీవితంలో నీ స్థానాన్ని ఒక్కసారి సంజనకి చూపించాలని తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయికి ఏ విధంగా చెప్పాలో అలా చెప్పాలనుకున్నా, నిన్ను చూశాక అర్ధమయ్యింది,   ఆ అమ్మాయికి నేను ఎంత అద్రుష్టవంతుడినో అని... " తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది కీర్తన...


" నువ్వు పాత చింతకాయ పచ్చడి అని అనుకుంటున్నావు... నాకు మాత్రం నువ్వు బాపూ బొమ్మవి, పెళ్ళి చేసుకున్నప్పు డు నిన్ను ఎంత ఇష్టపడ్డానో ఇప్పటికీ అదే ఇష్టంతో ఉన్నాను. పైపై మెరుగులకి ఎట్రాక్ట్ అయ్యేవాడిని కాదు, ఎవెరెస్ట్ శిఖరం ఎక్కినవాడు ఇసుక తిన్నెలు ఎక్కాలనుకోడు, పెసిఫిక్ ఓషన్ ఈదినవాడు పిల్లకాలువలు ఇదాలనుకోడు " అని తనదైన స్టైల్ లో చెప్పాడు మురళి...


తూరుపున లేలేత సూర్య కిరణాలు మంచుతెరలను తొలగించుకుంటూ మరో శుభోదయానికి నాందిపలుకుతూ వస్తున్నాయి...

Friday, January 4, 2019

అ ' పరిచిత '




ట్రైన్ బెంగుళూరు లో మొదలయ్యింది. అప్పుడప్పుడే ఎండలు మొదలవుతున్నాయేమో చాలా వేడిగా ఉంది. ఒక్కసారి రైలు బయలుదేరాక చల్లగా అనిపించింది.  పొద్దుట నుంచి ప్రయాణ హాడావిడిలో ఉన్నారేమో జనాలు రైలు ఎక్కగానే కాస్త  స్థిమిత పడ్డాక కారేజీలు తీసి భోజనాలు మొదలెట్టారు. నేను భోజనం చేసి  బయలుదేరాను కాబట్టి ఏమీ తినలేదు. అందరూ తినగానే ఎవరి బెర్తుల వైపు వాళ్ళు వెళ్ళి కాసేపు నడుము వాల్చారు. నేను ఏదో పుస్తకం పట్టుకొని చదువుతున్నాను.

నా ఎదురుగా ఒక జంట వాళ్లకి ఇద్దరు పిల్లలు పాపకి ఏడూ ఎనిమిదేళ్ళ   మధ్య ఉంటుంది వయసు.  బాబుకి మూడేళ్లు ఉంటాయి. పదేళ్ళ నుండి బెంగుళూరులోనే ఉంటున్నారుట ... అతని పేరు ముకుంద్, అతని భార్య పేరు శిరీషట.   ఇంకో పెద్ద జంట యాభై పైనే ఉంటుంది వారి వయసు. అతని పేరు సూర్యనారాయణ  భార్య పేరు శైలజ , కొడుకు ఇంటికి వెళ్ళి వస్తున్నారుట. ఇవన్నీ రైలు ఎక్కిన అరగంటలో అయిన పరిచయాలు.


రైలు కుప్పం దగ్గర ఆగింది.. కొందరు పుస్తకాలు అమ్మే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అమ్మే పుస్తకాలలో 'చందమామ ' కూడా ఉంది. నేను కొనుకున్నాను.. ఇంకా వేరే ఏ పుస్తకాలు ఉన్నాయో అని చూస్తుండగా... ఒక 'ఆవిడ ' పెద్ద సూట్ కేస్తో హడావిడిగా రైలు ఎక్కింది . సన్నగా, పొడుగ్గా ఉంది.  నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలిపేసినట్టుగా తెల్లవెంట్రుకల  మధ్యలో నల్ల వెట్రుకలతో జుత్తు చిన్న ముడి, ఒంటి మీద ఏ రకమైన నగ నట్ర లేదు.. చేతికి వాచి తప్పా. నీలి అంచుతో తెల్లటి ధర్మవరపు చీర, డబ్భైలో జయసుధ వేసుకొనే కాలర్ బ్లౌజ్ తో ఉంది.  అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఏదో తెలియని అందం ఉంది ఆవిడలో. మా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. బహుశా అదే 'పెద్ద ' ఆభరణమేమో ఆవిడకి. మా పక్కనే కూర్చుంది. కాస్త ఆయస పడుతోంది.    డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాల అతనిని పంపేశాను.

మా వైపు చూసి " హడావిడిగా ఎక్కేశానండి.. నెక్స్ట్  స్టాప్ లో దిగి వేరే బోగి లోకి వెళ్తాను " అని మెల్లగా చెప్పింది. 

"పరవాలేదండి, మంచి నీళ్ళు కావాలా   " అని అడిగాను.

"థాంక్స్ తల్లి, కాసేపాగి తాగుతాను " అని తన హాండ్ బాగ్ నుంచి నీళ్ళ బాటిల్ బయటకు తీసుకొంది. 

రెండు నిమిషాలు ఆయసం తీర్చుకున్నాక నా చేతిలో 'చందమామ ' చూసి...

"ఒకప్పుడు ఉన్న కథలు ఇప్పుడు లేవమ్మా... ఒకప్పుడు కథలు బాగుండేవి.. ఇప్పుడు ఏదో అభిమానం కొద్ది కొంటున్నాము కానీ ఆ సారం లేదమ్మ " అంది ఆవిడ.

"అవునండి " అన్నాను నేను.

"  'చందమామ 'లో వచ్చే ప్రతీ కథ ఒక అపురూపమైన జ్ఞాపకం అమ్మా, ముఖ్యంగా 'తోక చుక్క ' ,  ' కంచుకోట ' ,'  రాకాసిలోయ' మొ!!  కథలు కల్పితాలైన ఎంత బాగుండేవో ? రాసిన ఆయిన దాసరి సుబ్రహ్మణ్యం గారు శైలి కూడా బాగుందేది,  ఆ కథలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆశక్తిగా చదివేవాళ్ళం. మళ్ళీ వచ్చే నెల పుస్తకం కోసం ఎదురు చూపులు చూసేవాళ్ళం,   అసలు పిల్లలు తెలుగు నేర్చుకున్నారంటే కారణం ఆ అపురూపమైన పుస్తకాలే కదండి, ఈ రోజుల్లో అటువంటి పుస్తాకాలేవీ?  " అని వాపోయింది. 

మా మాటలన్నీ ఆశక్తిగా వింటున్నాను. నాకు నిజంగా 'చందమామ ' లో కథలు "దాసరి సుబ్రహ్మణ్యం గారు ' రాశారన్న సంగతి తెలియదు.

" మా నాన్న గారు చిన్నప్పటి నుంచి ఈ 'చందమామ ' కొనేవారండి. అంతకు ముందు వచ్చినవి కూడా బైండింగ్ చేసి ఉంచారండి. ఇప్పటి పాత 'చందమామ ' లు మా ఇంట్లో ఉన్నాయి  " అని అన్నాను.

" నీ పేరు ఏంటమ్మా? " అని అడిగింది ఆవిడ.

"సుగాత్రి అండి " అని చెప్పాను.

" భలే మంచి పేరు,  నీ పేరుకి అర్ధమేంటో తెలుసా? " అని అడిగింది

" ఆ తెలుసండి...  మంచి గాత్రము కలది..., కళాపుర్ణోదయం లో  నాయిక పేరు సుగాత్రి, అలాగే సరస్వతిదేవి సహస్రనామాలలో ఒకటి సుగాత్రి. "

" ఈ పేరు పెట్టుకున్నారంటే మీ తల్లితండ్రులకి మంచి టేస్ట్ ఉందని తెలుస్తోంది. " అంది ఆవిడ

" అవునండి మా నాన్న గారికి తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టము ... మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టము " అని చెప్పాను.

" సంగీతము మనము మనతో మాట్లాడుకోడానికి ఉన్న ఏకకైక భాష, సాహిత్యము మనమేమిటో మనకి చెప్పేది.. "ఏకమాపాత మధురం..... అన్యదాలోచనామృతం ' ఇవి లేని జీవితాలు నిస్సారాలే తల్లీ " అని అంది. 

ఇంతలో ముకుంద్ పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే " నో బేటా, కం అండ్ సిట్ హియర్.. ఐ విల్ గివ్ యూ చాక్ లెట్ ఇఫ్ యూ లిసిన్ టు మి " అంటూ ఇంకా ఏదో అంటున్నాడు.

వాళ్ల వైపు అలాగే చూస్తూ ఉంది ' ఆవిడ ' ...

" వేర్ ఆర్ యూ ఫ్రమ్ " అని అడిగింది

" కాకినాడ " అని చెప్పాడు ముకుంద్

" తెలుగు వాళ్ళు కాదా? " అని అడిగింది

" అబ్బే! తెలుగు వాళ్ళమేనండి... " అన్నాడు ముకుంద్ కొంచం ఇబ్బందిగా.

" మరి.... ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరు తెలుగులో మాట్లాడటం లేదు... "

" ఓ.. అదా.. మా పిల్లలు బెంగుళూరిలో పుట్టారు,   వాళ్ళ కోసం మేము ఇంట్లో ఇంగ్లీష్, హింది మాట్లాడుతాము, బయట ఇబ్బంది పడకూడదు కదండి  " అని నవ్వుతూ జవాబిచ్చాడు ముకుంద్.

" అదేంటయ్యా! ఇంత పసి పిల్లలకి ఏ భాషా  సరిగ్గా మాట్లాడటం రాదు....ఏ భాషైనా అర్ధం చేసుకోగల నైపుణ్యం మాత్రం ఉంటుంది... అదీ తల్లి లాలనతో చెపితే ఇంకా చక్కగా అర్ధం చేసుకుంటారు.  మీరు ఇలా మీ మాతృభాషని పిల్లలకి తెలియకుండా పెంచుతూ ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? వాళ్లకి నాన్నమ్మ, అమ్మమ్మ  తాతగార్లతో మాట్లాడే అవకాశం మీరు ఈ విధంగా కట్ చేసేస్తున్నారు. పిల్లలకి ఇంకో భాష తెలిస్తే తప్పేంటీ?

మన ముత్తాతలు గ్రాంధికంలో మాట్లాడుకునే వారుట, అప్పట్లో ఆడవాళ్ళు కూడా 'అమరకోశం '  చదువుకొని చాలా పదాలకి అర్ధలు తెలుసుకునే వారుట. మన తాతల దగ్గరకు వచ్చే సరికి గ్రాంధికం తగ్గింది... కొంచం వాడుక భాష వచ్చింది. పోనీ అదీ ఒకందుకు మంచిదే అనుకున్నాము.. మంచి మంచి పుస్తకాలు అందరూ చదివే అవకాశం వచ్చిందని ఆనందించాము.  మన దగ్గరకి వచ్చేసరికి వాడుక కూడా పోయీ.. 'తెలుగు ' కి 'తెగులు ' పట్టేసింది. ఇంక మన తరవాతి తరానికి వచ్చే సరికి 'సమాధులు ' కట్టేసే సమయం వచ్చేసింది. పిల్లలకి ఇంగ్లీష్, హింది మాట్లాడటం ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు.. ఈ రోజుల్లో స్కూల్లో అవి వాళ్లంతట వాళ్ళే నేర్చుకుంటున్నారు. కానీ మాతృభాష మాత్రం నేర్పవలసింది మాత్రం 'తల్లిదండ్రులే ' ఇంగ్లీష్, హింది నేర్చుకోవల్సిన అవసరం చాలా ఉంది కానీ మాతృభాష ని నేర్చుకోకుండా అవే నేర్చుకోవడం సబబు కాదు..
'ఆవు పాపు శ్రేష్టమైనవే... అలా అని గేదె దూడ ఆవు పాలు తాగదు కదా? .. పశువుల్లో ఉన్న ఇంగితం మనకు లేదా?'  " అంటూ కాస్త కోపంగా, బాధగా చెప్పుకుపోతోంది.

ఆవిడ మాట్లాడుతున్నంత సేపు అందరూ ఆవిడ వైపే చూస్తూ ఉండిపోయాము. మంచి వాక్పటిమ ఉన్నావిడే!! 'ముకుంద్ ' మొహం లో చిరాకు, విసుగు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి 'ఆవిడ ' మాటలకి.

పక్కన కూర్చొని వింటున్న సూర్యనారాయణ గారు " అవునండి.. ఇప్పుడు మేము మా కొడుకింటి నుంచి వస్తున్నాము... మా మనవలకి ఇంగ్లీష్, హింది తప్ప వేరే భాష రాదు. మాకు ఇంగ్లీష్ హింది అర్ధమౌతాయి కానీ మాట్లడలేము. వాళ్ళని దగ్గరకు పిలిచి కథలు చెపుద్దామంటే భాషే పెద్ద ఆటంకం అయ్యింది. హాయిగా మాట్లడలేని పరీస్థితి మాది. వాళ్ళు మాకు ఇన్నాళ్లైనా 'దగ్గర ' కాలేకపోయారు.. కారణం ...'భాష ' " అని ఆయన బాధ చెప్పుకొన్నారు.

వీళ్లందరూ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ముకుంద్ కి, అతని భార్యకి కొంచం ఇబ్బందిగా అనిపించింది. వాళ్ల పిల్లలకి వీడియో గేంస్ ఇచ్చి పక్కకు తీసుకెళ్ళెపోయారు మమల్ని ఎవాయిడ్ చేస్తూ. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.

ఇంతలో 'చాయ్ ' వాడు వస్తే అందరూ 'చాయ్ ' తీసుకున్నారు.. నేను  రెండు 'టీ ' లు  తిసుకొని ఆవిడకు ఇచ్చాను. 

"పర్లేదండి.. నేను ఇస్తా ' అని చాలా బలవంతం పెట్టినా సరే ఆవిడే 'టీ ' వాడికి డబ్బులు ఇచ్చింది.

టీ తాగుతున్నప్పుడు అందరూ ఏదీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. 

" ఇంతకీ మీరేమి చేస్తూంటారు? " అని అడిగాను మౌనాన్ని ఛేదిస్తూ.. 

" నేను ఒక రైటర్ ని అమ్మా!, సాహిత్యము నా ఊపిరి " అని చెప్పింది ఆవిడ.

ఆవిడ రైటర్ అనగానే ఒక్కసారి అంతా ఆవిడ వైపు చూశారు.. 'ముకుంద్ ' తో సహా...

"ఏవేవి రాసారండి? "  అడిగాను

" చాలానే రాసానండి, రాసిన చాలా వాటికి వాజ్ పయ్ , పి.వి. నరసింహా రావు గారు, వేటూరి గారు మొ! వాళ్ళ నుండి ప్రశంసలు కూడా వచ్చాయి. " అని చెప్పింది

మేమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాము. ప్రముఖులతో ఆవిడ పరిచయాలు, సాహిత్యములో ఆవిడకు తెలిసిన విషయాలు చెప్తుంటే అంతా మంత్రముగ్ధులై వింటున్నాము. 

"ఢిల్లీ  లో మా ఇల్లు ఒక ' భువన విజయం ' లాగానే ఉండేది.  ఎంతో మంది కవులు పండితులు మా ఇంటికి వస్తూ ఉండేవారు.  మీరు ఎప్పుడేనా ఢిల్లీ వస్తే మా ఇంటికి రండి. " అని చెప్పింది.    

"మరి మీరు ఇక్కడకు ఎందుకొచ్చారు? అని అడిగాను....

ట్రైన్  ఆగడంతో ఆవిడ "సరేనమ్మ.. నేను వేరే బోగికి వెళ్తాను.. మీతో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.. " అని అంత పెద్ద సూట్ కేస్ మోసుకుంటూ దిగింది. సాయం చేస్తానని ఆ సూట్ కేస్ తీసుకుంటుంటే వారించింది  "నా పని నేనే చేసుకోవాలన్న స్వార్ధం ఉంది నాకు " అని నవ్వేసింది.

నా ప్రశ్నకు జవాబు ఆవిడ నుండి దొరకలేదు.

ట్రైన్ కదిలింది.. టి.సి.. అటువైపు గా వెళ్తోంటే టి.సి ని అడిగాను..

" ఒక పెద్దావిడ  అరవై డభై ఏళ్ళ మధ్యలో ఉంటుంది.. వేరే బోగిలోకి వెళ్తానని చెప్పింది.. ఆవిడ వేరే భోగి ఎక్కిందా సార్? " అని

"ఒక పెద్ద సూట్ కేస్ ఆవిడేనా? సన్నగా పొడుగ్గా ఉంటుంది ఆవిడేనా? " అని అడిగాడు

" అవునండి " అని అన్నాను

" ఆవిడ దిగి వెళ్ళిపోయింది... " అన్నడు

"అదేంటీ? " నేను ఆశ్చర్యంగా అన్నాను..

"ఆవిడకి మతి స్థిమితం లేదండి.. ఇలాగే వారానికో పది రోజులకోసారి ఒక గంట రెండు గంటల ప్రయాణం చేస్తుంది. మళ్ళీ స్టేషన్ లో దిగి వచ్చిన దారినే వెనక్కు వేరే ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతుంది.  ట్రైన్ లో కనపడిన వాళ్ళతో కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకుపోతూ ఉంటుంది. ఆవిడకు ఒక్కడే కొడుకట, అతను వేరే దేశం అమ్మాయి పెళ్ళి చేసుకొని అక్కడే పరాయి దేశం లో స్థిరపడిపోయాడుట. ఇక్కడకు రాడు, ఈవిడను అక్కడకు తీసుకెళ్ళడు.  తెలుగు లెక్చరెర్ గా చేసి రిటైర్ అయ్యింది.    మంచి రచయిత కూడా.  భాషాభిమానం ఎక్కువయ్యి ఇలా అయ్యిపోయింది. అప్పుడప్పుడు కొన్ని స్కూల్స్ కి వెళ్ళి 'తెలుగు ' లో మాట్లాడమని పిల్లలకు చెపుతూ ఉంటుంది. ఇవన్నీ నాకు ఆవిడ స్టూడెంట్స్  చెప్పారు ఇలాగే ప్రయాణం లో కలిసినప్పుడు.  బాగా బ్రతికినావిడే... ఎప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు ఆవిడ.. కబుర్లే బోలేడు చెప్తుంది.. అదో రకం.. అంతే " అని వెళ్ళిపోయాడు.  

నమ్మలేకపోయాను నేను టి.సి. మాటలని.

" నాకు ఎందుకో ఆవిడ పిచ్చిదనే అనిపించింది ఆ వాగుడికి. ఇలా తిక్క తిక్కగా వాగుతోంది కాబట్టే పిల్లలు భరించలేక వదిలేశారు, పిచ్చి మొహంది. భాష , సేవ ఇలాంటి తలతిక్క కబుర్లు చెప్తోంది కాబట్టే ఎవరూ పట్టించుకోరు.... పిచ్చిది నోరు మూసుకొని ఎక్కడో మూల కూర్చోకా ఊరు మీద పడి ఇలా ఈ పైత్యపు వాగుడెందుకో.. షిట్.. కబుర్లలో పెట్టి  ఎవరి దగ్గరేనా  దొంగ తనము కూడా చేస్తుందేమో !! బ్లెడీ... ఇలా తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడూ ఏ రైలు కింద పడో...."

"జుస్ట్ షట్ అప్ " అని గట్టిగా అరిచాను....

అంతా నావైపే చూస్తున్నారు....

"ఎవరికి పిచ్చి? భాష ని కాపాడాలని సాయశక్తులా ప్రయత్నిస్తోన్న ఆవిడకు కాదు 'పిచ్చి ' .  తల్లీతండ్రులని సరిగ్గా చూసుకోలేక వదిలేసిన ఆ కొడుక్కి  'పిచ్చి ',  పర భాష వ్యామోహం లో పడి మాతృభాష కి నీళ్ళొదిలేసిన మీలాంటి వాళ్ళకి 'పిచ్చి ', ఆవిడ కనీసం మన దగ్గర 'టి ' కూడా తీసుకోడానికి ఇష్టపడలేదు.  అలాంటావిడ దొంగతనం చేస్తుందనా మీకు భయం. ఎవరో ఆవిడకు మతిస్థిమితం లేదన్నారని మిగిలినవి మనం ఊహించేసుకోవడమే? మీకు పిల్లలతో మాట్లాడటానికి 'తెలుగు ' పనికి రాలేదు , కానీ ఆవిడని అసభ్యంగా తిట్టేటప్పుడు  'తెలుగు ' గుర్తుకొచ్చిందా? " ఒక్క నిముషం ఆగాను... 

" మీకు ఆవిడ మొసగత్తెగా, పిచ్చిదనిలా కనిపించిందేమో... నాకు మాత్రం చిక్కి శైల్యమై పోతున్న ఆదరణకు కరువైన,  అనాధ అయిన  'తెలుగు తల్లి ' గా కనిపిస్తోంది ఇప్పుడు. తనని కాపాడమని,  బ్రతికించమని ఇలా ప్రతీవారినీ దీనంగా వేడుకుంటోంది.  మీకు కుదిరితే చేతనైతే మాతృభాషలో మాట్లాడండి... 'తెలుగు ' బ్రతికించండి. లేకపోతే మీ  ఏడుపేదో మీరు ఏడవండి.. అంతే కానీ ఇలాంటివాళ్లని 'పిచ్చి వాళ్ళు ' అని ముద్ర వేసి మీ సంస్కారాన్ని బయట పెట్టుకోకండి " అని రాగల పర్యంతంగా వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ అన్నాను. 

" అవునమ్మా.. ఆవిడ పిచ్చిది కాదు " అని సముదాయిస్తూ అన్నారు సూర్యనారాయణ గారు, ఆయన భార్య.

కూర్చొని వెనకకు వాలగా.. ఏదో గట్టిగా తగిలింది. అది ఒక పుస్తకం లాంటి డైరీ! అందులో ఫొటోలు, కొన్ని కవితలు ఉన్నాయి. కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పుస్తకం. చదువుతుంటే ఎక్కడో చదివనట్టు ఉంది.. అవును.. అది అది.. ' సుగాత్రి ' గారివి. ఆవిడ మీద అభిమానంతోటే మా నాన్నగారు నాకా పేరు పెట్టారు. అవును ఆవిడ గొప్ప సాహిత్యాభిమాని "సుగాత్రి " !!