Search This Blog

Tuesday, February 20, 2018

ఋష్యేంద్రమణి

ఈ మధ్య "మాయాబజార్ " సినిమా చూశా.. (మొదటి సారి కాదు.. ఎన్నో సారో గుర్తు లేదు). సుభద్ర,అభిమన్యులును కృష్ణుడు దారకుడికి అప్పగించి "ఘటోత్కజుడి ఆశ్రమం" కి తీసుకెళ్ళమని చెబుతాడు. తీరా వెళ్ళేటప్పుడు మాధవపెద్ది సత్యం పాట.. అదేనండి భళి భళి భళీ దేవా వస్తుంది. ఆ దారకుడు కూడా మాధవ పెద్ది సత్యమే ( ఇది మాకు తెలుసు అనకండి). పాట అయ్యేటప్పటికి రాక్షసులు అభిమన్యుడిని అడ్డగిస్తారు. వారందరినీ చంపేస్తాడు అభిమన్యుడు. ఇంక ఘటోత్కచుడు ఎంటర్ అవుతాడు. కాసేపు ఫైటింగ్ అయ్యాక.. "పేరు చెప్పి శరణు వేడు, వదిలేస్తా " అని వార్నింగ్ ఇస్తాడు ఘటోత్కచుడు. "పిరికివాడిలా పేరు చెప్పడం ఎందుకు " అని భీష్మించుకుంటాడు అభిమన్యుడు. ఇంతలో ఘటోత్కచుడి గద తగిలి అభిమన్యుడు మూర్చపోతాడు.

 

మన సుభద్ర గారు విల్లు ధరించి....

"అఖిల రాక్షస మంత్రతంత్ర అతిశయమణచు శ్రీకృష్ణుని సోదరినగుదునేమీ

దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనకు అర్జును పత్నినే అగుదునేని "

 

అంటూ అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల 'ప్రవర ' చెప్పేస్తుంది. ఉత్తి పేరు చెప్పమంటే ఇంత సీన్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఇంత గొప్ప పరిచయమా? అదేదో ముందుగా చెప్పి ఉంటే అభిమన్యుడు మూర్చ పోయేవాడు కాదు కదా!

 

అదీ కాక " ఈ శరంబు అసురు గూల్చి సిద్ధించు గాక.. పాండవకులైక భూషణ ప్రాణ రక్షా " అని అంటుంది. ఈ పద్యము "ఋషేద్ర మణి గారు " బహు బాగా పాడారు కానీ.. "పాండవ కులైక భూషణుడు " అభిమన్యుడొక్కడే కాదు కదా? ఎదురుగ ఇంకో భూషణుడు అదే ఘటోత్కచుడు ఉన్నాడు. అదీ కాక ఉపపాండవులూ ఇంకా ఉన్నారు ( సినిమాలో పాండవులే లేరు ఈ ఉపపాండవులెక్కడా అని అడగకండి). ఇంత మంది భూషణులు ఉండగా పాపం ఆవిడ ఎకైక భూషణుడని అభిమన్యుడికి కీర్తించేస్తే ఎలా? ఇది అప్పుడు ఎవరూ అడగలేదా? అడిగినా చక్రపాణి గారు , పింగళి గారు "ఎవరూ కల్పించకపోతే కట్టు కథలు ఎలా పుడతాయి ? " అని అనేశారా?

 

అప్పుడు వాళ్ళు అడగకపోయినా ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఏడిచినట్టే ఉంది.. ఎవర్ని అడుగుతావు అని అడగొద్దు. నా ప్రశ్న ఏడ్చినట్టున్నా, ఏడ్చి మొహం కడుకున్నట్టున్నా.. అడిగేస్తాను.. అంతే!

 

 

ఈ రోజు ఋష్యేంద్రమణి గారి పుట్టినరోజు... ఆ పద్యం... ఆ ఠీవి చూసేయండి.. ఈ ప్రశ్నలన్నీ మరచిపోవచ్చు.

 

 

 

 

No comments:

Post a Comment