Search This Blog

Monday, April 15, 2019

బ్యాగోపాఖ్యానం

పాత బండారులంక దగ్గర హ్యాండ్ బ్యాగ్ మామ్మ గారు ఎక్కేవారు, ఆవిడ చేతిలో ఒక హ్యాండు బ్యాగు ఉండేది. అప్పుడప్పుడు ఆ బాగులో నుండి బిస్కెట్టు పాకెట్టు తీసి రెండు బిస్కెట్లు నోట్లో వేసుకొని, ఒక చిన్న బాటిల్ తో నీరు తాగేవారు. మరి కొన్ని సార్లు చిప్స్ తినేవారు (మాకూ ఇచ్ఛేవారు లెండి). ఆ హాండ్ బ్యాగ్ లో నుంచి అప్పుడప్పుడు మాకు సంపెంగి పూలు(మరి కొన్నిసార్లు మల్లెదండలు) తీసి ఇచ్చేవారు. ఆవిడ పేరు చాలా మందికి తెలీదు కానీ బస్సు డ్రైవర్ నుంచి ఎక్కే జనాల వరకు అందరూ "హ్యాండ్ బ్యాగ్ మామ్మగారు " అని అనేవారు ఆవిడని. నా దృష్టిలో ఆ హ్యాండ్ బ్యాగు లో నుంచి క్షేరసాగర మధనం లో వచ్చే వస్తువులన్నీ వస్తాయేమో అని అనిపించేది. ఆవిడ ఆ హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని ఒక్కసారిగా బస్సు నుండి గంతుతూ దిగినప్పుడు కుప్పించి ఎగసిన పద్యములో " ఉరికిన యోర్వగ ఉదరంబులో నున్నజగముల వ్రేటున జగతి కదల " అన్నట్టు ఆవిడ బ్యాగులో ఉన్న వస్తువులన్నీ అల్లకల్లోలం అయ్యిపోయి ఉంటాయనిపించేది.

చిన్నప్పుడు ఇలా మాయల ఫకీరుల సంచీలాంటి హ్యాండ్ బ్యాంగ్ ని చూస్తే అందులో ఏముందో అన్న కుతూహులం చాలా ఉండేది. కాలక్రమంలో ఆ జోలీ నా భుజస్కందాల మీదకు కూడా వచ్చేసింది.

ఎప్పుడైన బయటకు వెళ్తే ఇంటి తాళాలు పక్కవారికొకటిచ్చి, ఇంకోటి బ్యాగులో వేసుకుంటాము. ఆ తరవాత ఎండలో వెళ్ళాలి కాబట్టి చిన్న గొడుకు, ఒక నీళ్ల బాటిలు తప్పనిసరి. ఏమో ఎక్కడేనా ఆకలి వేస్తే... ఒక చిన్న బిస్కెట్టు పాకేట్టో లేక ఒక నూట్రిషన్ బారో ఉంచుకోవాలి. అసలే ఆడవారు రెండు రకాలు.. ఒకటి ముడిపదార్ధాలు, ఇంకొకరు జడపదార్ధాలు... మరి బ్యాగులో దువ్వెన, రబ్బర్ బాండ్లు, ముడి పిన్నులు ఉండాలి కదా! చీరలకి పెట్టుకునే పిన్నులు, పిన్నీసుల కట్టా, బొట్టుబిల్లలు మొదలైనవి. (సుమంగళీ కి చిహ్నాలైన ఈ ఐదోతనాన్ని బ్యాగ్గులలో భద్రంగా దాచుకుంటూ). పాస్ పోట్ల నుంచి పాల కూపన్ల వరకు, బంగారు ఆభరణాల నుండి బండి తాళాల వరకు అన్నీ దాచుకొనే ఏకైక స్థలం.. ఈ హ్యాండ్ బ్యాగులు. ఇవి చాలవన్నట్టు ప్రయాణాలలో భర్తగారి పర్సులు, కళ్ళజోళ్లు, పెన్నులు. పిల్లల విడియో గేంస్ కూడా ఈ బ్యాగులో చేరతాయి. అప్పుడెప్పుడో చూసిన బాహుబలి సినిమా టికెట్లు, ఆ తరవాత తిన్న హోటల్ బిల్లు కూడా ఉంటాయి ఈ బ్యాగులో!

ఎవరింటికేనా వెళ్తే వారిచ్చే తాంబూలము, జాకెట్టు ముక్క, అందులో ఉంచిన అరటి పండో, బత్తాయి పండో ఈ బ్యాగులో పాడేసుకుంటాము. (ఎప్పుడో కంపువాసన వచ్చినప్పుడు కానీ ఈ పళ్ల విషయం గుర్తుకురాదు) . ఏ సమయానికి ఏ అవసరమొస్తుందో అని తలనొప్పి టాబెలెట్లు (ఎవరికి అని అడగొద్దు), జ్వరానికి పారాసిటిమాల్ , బ్యాగులో తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇన్ని దాచుకున్న బ్యాగు 'ఉరుకోదరుడి " లా ఎలా ఉంటుంది? కప్పని తిన్న పాములా, తొమిదోనెల గర్భిణిలా నిండుగా ఉంటుంది. చుట్టుపక్కల అమ్మలక్కల విషయాలన్నీ పొట్టలో దాచుకున్న పనిమనిషి కడుపులా ఎప్పుడెప్పుడు నోరు తెరిచేదామా అనట్టుంటుంది ఈ హ్యాండ్ బ్యాగు.

ఒకసారి మెమంతా పాపికొండలు చూడటానికి వెళ్ళాము. గోదావరి మధ్యలో ఒక చిన్న గుడి దగ్గర ఆపాడు. అక్కడ గోదావరికి నమస్కరించి పసుపు, కుంకుమ వెయ్యాలని చెప్పారు ఎవరో పెద్దవారు. బ్యాగులో చెయ్యి పెట్టి కాసేపు (పావుగంటే) వెతకగానే పసుపు కుంకుమ దొరికేశాయి. చక్కగా గోదావరికి నమస్కరించుకున్నాము.

మొన్న ఈ మధ్యనే తెలిసినవారి ఇంటిలో ఫంక్షన్ కి వెళ్ళాను, వారు ఇచ్చిన గిఫ్ట్, ప్రసాదం బ్యాగులో వేసుకున్నా, నా ఫ్రండ్ " నా కాలి చుట్లు కొత్తవి కొన్నాను ఇవి నీ బ్యాగులో వేసుకోవా? " అని అడిగింది. తీరా ఇంటికి చేరాకా నా చుట్లు ఇవ్వవా అని అడిగితే, నా బ్యాగ్ బోర్లించీ "నీ చుట్లు నువ్వు తీసుకో.. ఈ లోపల టీ తెస్తాను " అని చెప్పి లోపలకి వెళ్ళా, పాపం పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి వెతికినట్టు వెతుకుంది. దాని పిల్లలు " 5 సెకన్స్ లో ఈ చెత్తలో ఉన్న టొమాటో సాస్ ఎక్కడుందో చెప్పుకోవాలి " అంటూ హిడెన్ ఎక్స్ప్రెస్ ఆడుకున్నారు. (అప్పుడెప్పుడో సండ్ విచ్ కొన్నప్పుడు ఇచ్చిన టొమాటో సాస్ పాకెట్.. బ్యాగులో వేసుకున్నా), అయినా ఈ హ్యాండ్ బ్యాగ్ ఏవైనా కృష్ణ బిలమా? వెళ్ళిన వస్తువు మళ్ళీ కనిపించాపోడనికి? కాస్త ఓర్పుగా వెతికితే అదే దొరుకుతుంది.

పిల్లలు టి.వి. లో డోరేమాన్ చూస్తూ ఆ డోరేమాన్ ఎవరికి ఏమి కావాలన్నా బ్యాగ్ లో చెయ్యిపెట్టి ఇస్తూ ఉంటాడు, ఆ డోరేమాన్ దగ్గర ఉన్న బ్యాగు లాంటి బ్యాగు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. ఈ ఆడవారి హాండ్ బ్యాగులు అలాంటివే అని పాపం వారికి తెలీదు. పిల్లలంటే గుర్తొచ్చింది.. చంటి పిల్లల తల్లులకైతే సెపరేటుగా ఇంకో చేతిలో డైపర్ బ్యాగులు కూడా ఉంటాయి. ఈ మధ్య బ్యాగులలో పెప్పర్ స్ప్రె లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎంతైనా ఈ ఆడవారి హాండ్ బ్యాగులు ఎన్ని దాచుకున్న ఇంకా చోటు ఉండే పుష్పక విమానాలు.

భూభారం మోసే ఆదిశేషుడు కంటే గొప్పవారెవరూ? అష్టదిక్కులని తమ భుజాల మీద మోసే గజాల కన్నా ఓర్పు గల వారెవరూ? ఏంటీ... యక్ష ప్రశ్నలలా ఉన్నాయా? జావాబు ఏంటో తెలుసా? ఆడవరి హాండ్ బ్యాగులు. ఏంటీ నమ్మరా? సరే మీ ఇళ్లల్లో ఇంతులు వాడే హాండ్ బ్యాగ్ ని ఎప్పుడేనా ధైర్యం తీసి చూశారా? చూసినవారికే తెలుస్తుంది అందులో ఉన్న నిధి నిక్షేపాల గురించి. ఈ హ్యాండ్ బ్యాగ్ కి గనక మాటలొస్తే ఎన్ని తిట్లు తిడుతుందో? ప్రాణం వస్తే మాత్రం "డొమెస్టిక్ వాయిలెన్స్ " కి సంబంధించిన అన్నీ కేస్ లు పెట్టెస్తుంది.

ఆడవారి ఓర్పుకు, ఈ హండ్ బ్యాగులకు అవినాభావ సంబంధం ఉంది. కడుపులో ఎంతో దాచుకుంటారు!  నోరు ఉంది కదా అని బయటకు చెప్పరు ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి(బ్యాగులో వస్తువులు). ఇంటి బాధ్యతలని తన భుజస్కంధాల మీద మోస్తున్న స్త్రీ మూర్తుల సన్నిహిత నెచ్చెలి.. ఈ హ్యాండ్ బ్యాగు.






Wednesday, January 9, 2019

మంచు తెరలు

                                                                

గత వారం రోజులుగా ఒకటే పొగమంచు. సూర్యుడిని చూసి వారమౌతోంది. వాతావరణం అంతా మసకమసకగా ఉంది... కీర్తన మనసులా..


స్టవ్ మీద పాలల్లో బియ్యం  కుతకుతలాడుతూ ఉడుకుతోంది....  కీర్తన ఆలోచనలూ అలానే ఉన్నాయి. ఎంత సంభాలించుకుంద్దామన్నా ఆలోచనలు "ఆమె "  వైపే వెళ్తున్నాయి. మనసులో ఎంత మధనపడుతున్నా అడగడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు. అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? తను చేసిన తప్పు ఏవయ్యి ఉంటుంది? లంచ్ అంతా రెడీ చేసి, పాయసం చేస్తూ  అతని కోసం ఎదురుచూస్తోంది  కీర్తన. గన్ట క్రితం 'ఆమె ' నుంచి ఫోన్ వచ్చింది.. వస్తుంటే కారు ఆగిపోయిందిట వచ్చి పిక్ అప్ చెసుకోమని. వెంటనే తన భర్త "ఆమె " ని తీసుకొని రావడానికి బయలుదేరాడు.


 

***************


మూడు నెలల క్రితం కీర్తన భర్త మురళి "ఆమె " గురించి చెప్పాడు. ఆమె పేరు " సంజన" ట.  గుజరాతి అమ్మాయి. మురళి ఆఫీస్ లో ఆరు నెలల క్రితం జాయిన్ అయ్యిందిట. ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్ లో ఉండటంతో కలిసి లంచ్ లు, కార్ పూల్ లు సహజంగా జరుగుతూనే ఉన్నాయిట. ఇవేవీ అంతగా పట్టించుకోలేదు కీర్తన. కానీ ఒకరోజు మురళి  "నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను " అని పక్కన కూర్చొని తనతో అన్నాడు.


"సంజన నన్ను ఇష్టపడుతోంది... తను డైవర్సీ, నాతో కలిసి ఉంటానంటోంది. ఒకరోజు లంచ్ కి పిలుద్దామనుకుంటున్నాను, ఎల్లుండి ఆదివారం తనని పిలుస్తున్నాను " అని తన అభిప్రాయం కనుకోకుండా ఆఫీస్ కి టైం అవుతోందని లేచి వెళ్ళిపోయాడు.


***********


పాలు పొంగి చేతి మీద పడటంతో వాస్తవంలోకి వచ్చింది కీర్తన. ఇప్పుడు ఆ అమ్మయిని ఎందుకు తీసుకొస్తోనందుకు? మురళి అతని  ఇల్లు, వాకిలి చూపించి... ఇంకొన్ని రోజుల తరవాత " అవి నీవే " అని చెప్పడానికా? పదేళ్ళ కాపురంలో ఏ రోజూ అతని అభీష్టానికి వెతిరేకంగా తను ప్రవర్తించలేదు. అతని అమ్మని అతని కంటే ఎక్కువగా చూసుకుంది. అతని వైపు చుట్టాలు కూడా తనని చాలా ఇష్టపడతారు. మరి ఎందుకు ఇప్పుడీ కొత్త మోజు? పాయసం లో గరిటకు దాని రుచి తెలీదు, అలాగే ఈ మగాళ్ళకు భార్య విలువ తెలీదు.  పిల్లల పెంపకంలో కానీ, వాళ్ళ చదువులో కానీ ఏ రోజూ మురళి సాయాం లేకుండానే అన్నీ సమర్ధించింది తను. మరి ఏ తక్కువ చేశానని మురళి ఈ దారి వైపు వెళ్ళాడో... అన్ని ఆలోచనల మధ్యలో పాయసం అయితే పూర్తి చేసింది కానీ మనసు మనసులో లేదు.  కార్ హారన్ తో ఒక్కసారి ఉలికిపడింది. రావల్సిన టైం వచ్చేసింది.. "ఆమె " అదే సంజన వచ్చేసింది. తను ఇప్పుడు వెళ్ళి ఇద్దరికీ హారతి ఇచ్చి స్వాగతం చెప్పాలా? " భగవంతుడా ఇలాంటి పరీస్థితి ఏ భార్యకూ రాకూడదు. మురళి కారు దిగి , పక్కకు వచ్చి కార్ వెనక డోర్ తీసి సంజనను ఇంట్లోకి రమ్మన్నట్టు సైగతో ఆహ్వానించాడు. సంజనతో పాటు ఐదేళ్ళ బాబు కూడా వచ్చాడు. ఆ బాబు సంజన కొడుకని కిటికీలోనుంచి చూస్తొన్న కీర్తన అర్ధం చేసుకుంది.


"కీర్తి... కీర్తీ.. " అరచుకుంటూ  ఇంట్లోకి హడావిడిగా వచ్చాడు మురళి...


మురళి వెనకాలే సంజనా, కొడుకు.


" నేను చెప్పాను కదా ... మా ఆఫీస్ లో పని చేసే ఆమె .. సంజన అని " అని పరిచయం చేశాడు.


కీర్తన చేతులు జోడించి నమస్తే చెప్పింది.. సంజన మొదట "హాయ్ " చెప్పింది కానీ కీర్తన నమస్తే చెప్పడం తో ఆమె కూడా నమస్తేనే చెప్పింది.


ఇంట్లోకి రాగానే సంజన కొడుకు " ఈ ఇల్లు చాలా బాగుంది.. మనం ఇక్కడే ఉండిపోద్దామా " అని అడిగాడు


మురళి... " ఈ ఇల్లు ఆంటీది.. ఆంటీ ఒప్పుకుంటే ఉండిపోవచ్చు " అని అన్నాడు...


హ్మ్మ్.. పిల్లాడి దగ్గర నుంచి ప్రిపేర్ అయ్యిపోయి వచ్చేసినట్టున్నారని మనసులోనే అనుకుంది కీర్తన.


చిరునవ్వు నవ్వుతూ " మంచి నీళ్ళు కావాలా? " అని అడిగింది. వాళ్ళ సంభాషణ మొత్తం హింది, ఇంగ్లీష్ లోనే జరుగుతోంది.


"పర్లేదు.. వద్దు " అని సంజన అంది.


" కీర్తన మాత్రం లేచి వంటింట్లోకి వెళ్ళి మూడు గ్లాసులతో మంచి నీళ్ళు తీసుకొని వచ్చింది.


"పిల్లలు ఎక్కడకి వెళ్ళారు? " అని అడిగింది సంజన


"వాళ్ళ నాన్నమ్మతో ఊరు వెళ్ళారు రేపు వచ్చేస్తారు " అని సమాధానం చెప్పింది కీర్తన.


ఇంటికి వచ్చినప్పటి నుంచి కీర్తనని చూస్తూనే ఉంది సంజన. ఈ విషయం కీర్తన కూడా గ్రహించింది. కానీ పట్టించుకోనట్టుగానే ఉంది. సంజన  పాతిక నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటుంది . కానీ నిత్యం బ్యూటీ పార్లర్ కి వెళ్ళే రకం అని మొహం చూస్తేనే అర్ధమవ్వుతుంది. అందువల్లనేనేమో వయస్సు ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే నమ్మేయవచ్చు. నార్త్ ఇండియన్ ఏమో మంచి రంగు, సన్నగా నాజూకుగా ఉంది.   సంజనని చూశాక కీర్తన మనసు ఇంకొంచం కలత చెందింది. "చిదిమితే పాలుగారే మొహం సంజనది, తానేమో చామన ఛాయ , సంజన స్టైల్ గా ఉంటుంది, తానేమో పాత చింతకాయ పచ్చడిలా మొహానికి పౌడర్ కూడా రసుకోదు , సంజన జట చక్కగా కట్టింగ్ చేయించుకొని అలా వదిలేసుకొని ఉంది, తానేమో పెద్ద జడ వేసుకొని జిడ్డుమొహంతో ఉంది... బహుశా ఇందుకేనేమో భర్తకు ఆమె నచ్చింది " అని అనుకొంది.


మనసులోని భావాలు ఏవీ బయటపడనివ్వకుండా చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంది కీర్తన. భోజనాల దగ్గర " ఇన్ని రకాల వంటకాలు ఎందుకు చేశారు? " అని అడిగింది సంజన...


"మామూలుగా హాలీడే రోజు మేము రెండు కూరలు, పప్పు, రసం, పచ్చడి తో తింటాము, ఆయనకి అలానే ఇష్టం " అని అంది కీర్తన...


"నేను రోజు ఒక దాల్, లేకపోతే ఒకసబ్జీ చేస్తాను  అంతే... ఇన్ని రకాలు ఇంట్లో ఏదైనా పండగ అప్పుడే లేకపోతే ఇంటికి ఎవరేనా వస్తేనే చేస్తాము " అని అంది సంజన.


" మీ వంట నేను మురళి టిఫిన్ బాక్స్ లో నుంచి చాలా సార్లు తిన్నా , ఇన్ని ఐటంస్ మీరు ఒక్కరే ఎలా చేశారు? పొద్దుటే లేచి చేసారా? " అని అడిగింది సంజన...


"లేదు తను ఒక్క గంటలో ఇరవై మందికి వండగలదు , అదీ రుచి చూడకుండా పెర్ఫెక్ట్ గా " అని అన్నాడు మురళి.


"వంటలు ఎంత బాగా చేసినా మిమల్ని మెప్పించలేకపోయాను కదా " అని మనసులోనే అనుకుంది కీర్తన.


భోజాలు కడుపు నిండా తిన్నాక మురళి సంజనకి ఇల్లు చూపిస్తూ మేడపైకి తీసుకొని వెళ్ళాడు.. వాళ్ళ వెనకాల కీర్తన , సంజన కొడుకూ వెళ్లారు, మేడ పైన వీణలు చూసి " ఇవి ఎవరు వాయిస్తారు " అని అడిగింది సంజన


" ఇవి కీర్తనే వాయిస్తుంది, తను వీణ కూడా నేర్పిస్తుంది... ఇదిగో గోడ మీద పైంటింగ్ కూడా కీర్తన వేసినదే, ఈ పాట్ పైంటింగ్ కూడా తనదే, కర్టేన్స్ మీద పైంటింగ్స్ తనవే... " అని ఒక్కొక్కదాన్నే చూపించాడు మురళి...


బాల్కనిలో మొక్కలు, వాటికి వచ్చిన పూలు కాయలు, పళ్ళూ చూసి ఆశ్చర్యపోయింది సంజన. ఇంత తక్కూ స్థలంలో ఇన్ని మొక్కలు, వాటికి ఇన్ని పూలూ కాయలా? అని అంది...


"గార్డనింగ్ అంతా కీర్తిదే... నేను ఏ రోజు మొక్కకి నీరు పోసింది లేదు "


"  కష్టపడితేనే మొక్కలు పెరుగుతాయి, కానీ కలుపు మొక్కలు వద్దంటేనే వస్తాయి " అని అనాలనుకుంది...కానీ అనలేకపోయింది కీర్తన....


వాటిని కీర్తనని మార్చి మార్చి చూడసాగింది సంజన. కబుర్లతో సాయంత్రం అయ్యిపోయింది. "ఇక బయలుదేరుతా " అని బ్యాగ్ తీసుకుంది సంజన...కానీ సంజన కొడుక్కి వెళ్లడ ఇష్టం లేదు... "మనం ఇక్కడే ఉండిపోద్దాం.." అని మారాము చేశాడు.


"హాలీడేస్ వచ్చినప్పుడు మళ్ళీ రా " అని చేతిలో చాక్లెట్లు ఇచ్చింది కీర్తన...


"పద మనం వెళ్ళి సంజనని డ్రాప్ చేసి వద్దాము " అని అన్నాడు మురళి.


సంజన కి రాత్రికి తినుబండారాలు ప్యాక్ చేసి ఇచ్చింది కీర్తన.


కార్ దిగి సంజన మురళి పక్కకు వచ్చి " కీర్తనని చూస్తుంటే చాలా జెలసీ గా ఉంది " అని అనేసి పిల్లాడిని తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో కీర్తన సంజన కొడుకుతో మాట్లాడుతోంది.. కానీ ఆ మాట కీర్తన చెవిలో పడినట్టు మురళి, సంజన గ్రహించలేదు.


సంజనని దింపి కారులో ఇంటికి వస్తునప్పుడు ఇద్దరి మధ్యలో మౌనమే రాజ్యం చేసింది. సాయంత్రం ఆరు దాటిందేమో దారి ని కప్పేస్తూ పొగమంచు. మంచుపొరల కన్నా మనసులో పొరలే దిట్టంగా ఉన్నాయి...


రాత్రి కీర్తనకు నిద్దర పట్టలేదు. ఇప్పుడు ఇంట్లో తన స్థానం ఏంటో అర్ధం కావడం లేదు. ఇంట్లో ఉండాలా? ఒకవేళ మురళి ఇంత్లో నుంచి వెళ్ళిపొమ్మంటే... బ్రతిమాలాలా? లేక వెళ్ళిపోవాలా? వెళ్తే ఎక్కడకు వెళ్ళాలి? ... పొద్దుట ఐదు అయ్యేటప్పటికి లేచి ఈ అలోచనలతో సోఫాలో కూలబడింది.


ఎప్పుడు లేచాడో కానీ మురళి రెండు కాఫీ కప్పులతో కీర్తన దగ్గరకు వచ్చి ఒక కపు కీర్తనకిచ్చి " నీ అంత బాగా కాఫీ కలపలేను కానీ... ప్రస్తుతానికి ఇది తీస్కో... " అని ఇచ్చాడు.


మురళి వైపు కాస్త ఆశ్చర్యంగా చూసింది కీర్తన.


కాఫీ సిప్ చేస్తూ మురళి  "   సంజన చాలా తెలివైన పిల్ల , కానీ అంత కన్నా మొండిది, మంకుపట్టుది. తను చాలా డిప్రషన్ లో ఉంది, భర్త డ్రగ్ ఎడిక్ట్, చాలా టార్చర్ పెట్టాడుట, తను చిన్న పిల్ల చెప్పినా వినిపించుకోదు "


"తను ఎర్రగా బుర్రగా ఉంటుంది, నేనే రంగు తక్కువా, ఊరి దానిలా ఉంటాను " అని ఎన్నో అనాలనుకున్నా.. కీర్తన నోటంపట ఈ మాటొక్కటే వచ్చింది... బహుశా అడగడానికి సంస్కారం అడ్డొచ్చింది కాబోలు..


 "  తనని ఇంటికి పిలిచి నీ మనసు బాధ పెట్టానా?నిన్నూ, నీ పద్దతినీ, నా జీవితంలో నీ స్థానాన్ని ఒక్కసారి సంజనకి చూపించాలని తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయికి ఏ విధంగా చెప్పాలో అలా చెప్పాలనుకున్నా, నిన్ను చూశాక అర్ధమయ్యింది,   ఆ అమ్మాయికి నేను ఎంత అద్రుష్టవంతుడినో అని... " తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది కీర్తన...


" నువ్వు పాత చింతకాయ పచ్చడి అని అనుకుంటున్నావు... నాకు మాత్రం నువ్వు బాపూ బొమ్మవి, పెళ్ళి చేసుకున్నప్పు డు నిన్ను ఎంత ఇష్టపడ్డానో ఇప్పటికీ అదే ఇష్టంతో ఉన్నాను. పైపై మెరుగులకి ఎట్రాక్ట్ అయ్యేవాడిని కాదు, ఎవెరెస్ట్ శిఖరం ఎక్కినవాడు ఇసుక తిన్నెలు ఎక్కాలనుకోడు, పెసిఫిక్ ఓషన్ ఈదినవాడు పిల్లకాలువలు ఇదాలనుకోడు " అని తనదైన స్టైల్ లో చెప్పాడు మురళి...


తూరుపున లేలేత సూర్య కిరణాలు మంచుతెరలను తొలగించుకుంటూ మరో శుభోదయానికి నాందిపలుకుతూ వస్తున్నాయి...

Friday, January 4, 2019

అ ' పరిచిత '




ట్రైన్ బెంగుళూరు లో మొదలయ్యింది. అప్పుడప్పుడే ఎండలు మొదలవుతున్నాయేమో చాలా వేడిగా ఉంది. ఒక్కసారి రైలు బయలుదేరాక చల్లగా అనిపించింది.  పొద్దుట నుంచి ప్రయాణ హాడావిడిలో ఉన్నారేమో జనాలు రైలు ఎక్కగానే కాస్త  స్థిమిత పడ్డాక కారేజీలు తీసి భోజనాలు మొదలెట్టారు. నేను భోజనం చేసి  బయలుదేరాను కాబట్టి ఏమీ తినలేదు. అందరూ తినగానే ఎవరి బెర్తుల వైపు వాళ్ళు వెళ్ళి కాసేపు నడుము వాల్చారు. నేను ఏదో పుస్తకం పట్టుకొని చదువుతున్నాను.

నా ఎదురుగా ఒక జంట వాళ్లకి ఇద్దరు పిల్లలు పాపకి ఏడూ ఎనిమిదేళ్ళ   మధ్య ఉంటుంది వయసు.  బాబుకి మూడేళ్లు ఉంటాయి. పదేళ్ళ నుండి బెంగుళూరులోనే ఉంటున్నారుట ... అతని పేరు ముకుంద్, అతని భార్య పేరు శిరీషట.   ఇంకో పెద్ద జంట యాభై పైనే ఉంటుంది వారి వయసు. అతని పేరు సూర్యనారాయణ  భార్య పేరు శైలజ , కొడుకు ఇంటికి వెళ్ళి వస్తున్నారుట. ఇవన్నీ రైలు ఎక్కిన అరగంటలో అయిన పరిచయాలు.


రైలు కుప్పం దగ్గర ఆగింది.. కొందరు పుస్తకాలు అమ్మే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అమ్మే పుస్తకాలలో 'చందమామ ' కూడా ఉంది. నేను కొనుకున్నాను.. ఇంకా వేరే ఏ పుస్తకాలు ఉన్నాయో అని చూస్తుండగా... ఒక 'ఆవిడ ' పెద్ద సూట్ కేస్తో హడావిడిగా రైలు ఎక్కింది . సన్నగా, పొడుగ్గా ఉంది.  నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలిపేసినట్టుగా తెల్లవెంట్రుకల  మధ్యలో నల్ల వెట్రుకలతో జుత్తు చిన్న ముడి, ఒంటి మీద ఏ రకమైన నగ నట్ర లేదు.. చేతికి వాచి తప్పా. నీలి అంచుతో తెల్లటి ధర్మవరపు చీర, డబ్భైలో జయసుధ వేసుకొనే కాలర్ బ్లౌజ్ తో ఉంది.  అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఏదో తెలియని అందం ఉంది ఆవిడలో. మా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. బహుశా అదే 'పెద్ద ' ఆభరణమేమో ఆవిడకి. మా పక్కనే కూర్చుంది. కాస్త ఆయస పడుతోంది.    డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాల అతనిని పంపేశాను.

మా వైపు చూసి " హడావిడిగా ఎక్కేశానండి.. నెక్స్ట్  స్టాప్ లో దిగి వేరే బోగి లోకి వెళ్తాను " అని మెల్లగా చెప్పింది. 

"పరవాలేదండి, మంచి నీళ్ళు కావాలా   " అని అడిగాను.

"థాంక్స్ తల్లి, కాసేపాగి తాగుతాను " అని తన హాండ్ బాగ్ నుంచి నీళ్ళ బాటిల్ బయటకు తీసుకొంది. 

రెండు నిమిషాలు ఆయసం తీర్చుకున్నాక నా చేతిలో 'చందమామ ' చూసి...

"ఒకప్పుడు ఉన్న కథలు ఇప్పుడు లేవమ్మా... ఒకప్పుడు కథలు బాగుండేవి.. ఇప్పుడు ఏదో అభిమానం కొద్ది కొంటున్నాము కానీ ఆ సారం లేదమ్మ " అంది ఆవిడ.

"అవునండి " అన్నాను నేను.

"  'చందమామ 'లో వచ్చే ప్రతీ కథ ఒక అపురూపమైన జ్ఞాపకం అమ్మా, ముఖ్యంగా 'తోక చుక్క ' ,  ' కంచుకోట ' ,'  రాకాసిలోయ' మొ!!  కథలు కల్పితాలైన ఎంత బాగుండేవో ? రాసిన ఆయిన దాసరి సుబ్రహ్మణ్యం గారు శైలి కూడా బాగుందేది,  ఆ కథలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆశక్తిగా చదివేవాళ్ళం. మళ్ళీ వచ్చే నెల పుస్తకం కోసం ఎదురు చూపులు చూసేవాళ్ళం,   అసలు పిల్లలు తెలుగు నేర్చుకున్నారంటే కారణం ఆ అపురూపమైన పుస్తకాలే కదండి, ఈ రోజుల్లో అటువంటి పుస్తాకాలేవీ?  " అని వాపోయింది. 

మా మాటలన్నీ ఆశక్తిగా వింటున్నాను. నాకు నిజంగా 'చందమామ ' లో కథలు "దాసరి సుబ్రహ్మణ్యం గారు ' రాశారన్న సంగతి తెలియదు.

" మా నాన్న గారు చిన్నప్పటి నుంచి ఈ 'చందమామ ' కొనేవారండి. అంతకు ముందు వచ్చినవి కూడా బైండింగ్ చేసి ఉంచారండి. ఇప్పటి పాత 'చందమామ ' లు మా ఇంట్లో ఉన్నాయి  " అని అన్నాను.

" నీ పేరు ఏంటమ్మా? " అని అడిగింది ఆవిడ.

"సుగాత్రి అండి " అని చెప్పాను.

" భలే మంచి పేరు,  నీ పేరుకి అర్ధమేంటో తెలుసా? " అని అడిగింది

" ఆ తెలుసండి...  మంచి గాత్రము కలది..., కళాపుర్ణోదయం లో  నాయిక పేరు సుగాత్రి, అలాగే సరస్వతిదేవి సహస్రనామాలలో ఒకటి సుగాత్రి. "

" ఈ పేరు పెట్టుకున్నారంటే మీ తల్లితండ్రులకి మంచి టేస్ట్ ఉందని తెలుస్తోంది. " అంది ఆవిడ

" అవునండి మా నాన్న గారికి తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టము ... మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టము " అని చెప్పాను.

" సంగీతము మనము మనతో మాట్లాడుకోడానికి ఉన్న ఏకకైక భాష, సాహిత్యము మనమేమిటో మనకి చెప్పేది.. "ఏకమాపాత మధురం..... అన్యదాలోచనామృతం ' ఇవి లేని జీవితాలు నిస్సారాలే తల్లీ " అని అంది. 

ఇంతలో ముకుంద్ పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే " నో బేటా, కం అండ్ సిట్ హియర్.. ఐ విల్ గివ్ యూ చాక్ లెట్ ఇఫ్ యూ లిసిన్ టు మి " అంటూ ఇంకా ఏదో అంటున్నాడు.

వాళ్ల వైపు అలాగే చూస్తూ ఉంది ' ఆవిడ ' ...

" వేర్ ఆర్ యూ ఫ్రమ్ " అని అడిగింది

" కాకినాడ " అని చెప్పాడు ముకుంద్

" తెలుగు వాళ్ళు కాదా? " అని అడిగింది

" అబ్బే! తెలుగు వాళ్ళమేనండి... " అన్నాడు ముకుంద్ కొంచం ఇబ్బందిగా.

" మరి.... ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరు తెలుగులో మాట్లాడటం లేదు... "

" ఓ.. అదా.. మా పిల్లలు బెంగుళూరిలో పుట్టారు,   వాళ్ళ కోసం మేము ఇంట్లో ఇంగ్లీష్, హింది మాట్లాడుతాము, బయట ఇబ్బంది పడకూడదు కదండి  " అని నవ్వుతూ జవాబిచ్చాడు ముకుంద్.

" అదేంటయ్యా! ఇంత పసి పిల్లలకి ఏ భాషా  సరిగ్గా మాట్లాడటం రాదు....ఏ భాషైనా అర్ధం చేసుకోగల నైపుణ్యం మాత్రం ఉంటుంది... అదీ తల్లి లాలనతో చెపితే ఇంకా చక్కగా అర్ధం చేసుకుంటారు.  మీరు ఇలా మీ మాతృభాషని పిల్లలకి తెలియకుండా పెంచుతూ ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? వాళ్లకి నాన్నమ్మ, అమ్మమ్మ  తాతగార్లతో మాట్లాడే అవకాశం మీరు ఈ విధంగా కట్ చేసేస్తున్నారు. పిల్లలకి ఇంకో భాష తెలిస్తే తప్పేంటీ?

మన ముత్తాతలు గ్రాంధికంలో మాట్లాడుకునే వారుట, అప్పట్లో ఆడవాళ్ళు కూడా 'అమరకోశం '  చదువుకొని చాలా పదాలకి అర్ధలు తెలుసుకునే వారుట. మన తాతల దగ్గరకు వచ్చే సరికి గ్రాంధికం తగ్గింది... కొంచం వాడుక భాష వచ్చింది. పోనీ అదీ ఒకందుకు మంచిదే అనుకున్నాము.. మంచి మంచి పుస్తకాలు అందరూ చదివే అవకాశం వచ్చిందని ఆనందించాము.  మన దగ్గరకి వచ్చేసరికి వాడుక కూడా పోయీ.. 'తెలుగు ' కి 'తెగులు ' పట్టేసింది. ఇంక మన తరవాతి తరానికి వచ్చే సరికి 'సమాధులు ' కట్టేసే సమయం వచ్చేసింది. పిల్లలకి ఇంగ్లీష్, హింది మాట్లాడటం ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు.. ఈ రోజుల్లో స్కూల్లో అవి వాళ్లంతట వాళ్ళే నేర్చుకుంటున్నారు. కానీ మాతృభాష మాత్రం నేర్పవలసింది మాత్రం 'తల్లిదండ్రులే ' ఇంగ్లీష్, హింది నేర్చుకోవల్సిన అవసరం చాలా ఉంది కానీ మాతృభాష ని నేర్చుకోకుండా అవే నేర్చుకోవడం సబబు కాదు..
'ఆవు పాపు శ్రేష్టమైనవే... అలా అని గేదె దూడ ఆవు పాలు తాగదు కదా? .. పశువుల్లో ఉన్న ఇంగితం మనకు లేదా?'  " అంటూ కాస్త కోపంగా, బాధగా చెప్పుకుపోతోంది.

ఆవిడ మాట్లాడుతున్నంత సేపు అందరూ ఆవిడ వైపే చూస్తూ ఉండిపోయాము. మంచి వాక్పటిమ ఉన్నావిడే!! 'ముకుంద్ ' మొహం లో చిరాకు, విసుగు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి 'ఆవిడ ' మాటలకి.

పక్కన కూర్చొని వింటున్న సూర్యనారాయణ గారు " అవునండి.. ఇప్పుడు మేము మా కొడుకింటి నుంచి వస్తున్నాము... మా మనవలకి ఇంగ్లీష్, హింది తప్ప వేరే భాష రాదు. మాకు ఇంగ్లీష్ హింది అర్ధమౌతాయి కానీ మాట్లడలేము. వాళ్ళని దగ్గరకు పిలిచి కథలు చెపుద్దామంటే భాషే పెద్ద ఆటంకం అయ్యింది. హాయిగా మాట్లడలేని పరీస్థితి మాది. వాళ్ళు మాకు ఇన్నాళ్లైనా 'దగ్గర ' కాలేకపోయారు.. కారణం ...'భాష ' " అని ఆయన బాధ చెప్పుకొన్నారు.

వీళ్లందరూ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ముకుంద్ కి, అతని భార్యకి కొంచం ఇబ్బందిగా అనిపించింది. వాళ్ల పిల్లలకి వీడియో గేంస్ ఇచ్చి పక్కకు తీసుకెళ్ళెపోయారు మమల్ని ఎవాయిడ్ చేస్తూ. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.

ఇంతలో 'చాయ్ ' వాడు వస్తే అందరూ 'చాయ్ ' తీసుకున్నారు.. నేను  రెండు 'టీ ' లు  తిసుకొని ఆవిడకు ఇచ్చాను. 

"పర్లేదండి.. నేను ఇస్తా ' అని చాలా బలవంతం పెట్టినా సరే ఆవిడే 'టీ ' వాడికి డబ్బులు ఇచ్చింది.

టీ తాగుతున్నప్పుడు అందరూ ఏదీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. 

" ఇంతకీ మీరేమి చేస్తూంటారు? " అని అడిగాను మౌనాన్ని ఛేదిస్తూ.. 

" నేను ఒక రైటర్ ని అమ్మా!, సాహిత్యము నా ఊపిరి " అని చెప్పింది ఆవిడ.

ఆవిడ రైటర్ అనగానే ఒక్కసారి అంతా ఆవిడ వైపు చూశారు.. 'ముకుంద్ ' తో సహా...

"ఏవేవి రాసారండి? "  అడిగాను

" చాలానే రాసానండి, రాసిన చాలా వాటికి వాజ్ పయ్ , పి.వి. నరసింహా రావు గారు, వేటూరి గారు మొ! వాళ్ళ నుండి ప్రశంసలు కూడా వచ్చాయి. " అని చెప్పింది

మేమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాము. ప్రముఖులతో ఆవిడ పరిచయాలు, సాహిత్యములో ఆవిడకు తెలిసిన విషయాలు చెప్తుంటే అంతా మంత్రముగ్ధులై వింటున్నాము. 

"ఢిల్లీ  లో మా ఇల్లు ఒక ' భువన విజయం ' లాగానే ఉండేది.  ఎంతో మంది కవులు పండితులు మా ఇంటికి వస్తూ ఉండేవారు.  మీరు ఎప్పుడేనా ఢిల్లీ వస్తే మా ఇంటికి రండి. " అని చెప్పింది.    

"మరి మీరు ఇక్కడకు ఎందుకొచ్చారు? అని అడిగాను....

ట్రైన్  ఆగడంతో ఆవిడ "సరేనమ్మ.. నేను వేరే బోగికి వెళ్తాను.. మీతో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.. " అని అంత పెద్ద సూట్ కేస్ మోసుకుంటూ దిగింది. సాయం చేస్తానని ఆ సూట్ కేస్ తీసుకుంటుంటే వారించింది  "నా పని నేనే చేసుకోవాలన్న స్వార్ధం ఉంది నాకు " అని నవ్వేసింది.

నా ప్రశ్నకు జవాబు ఆవిడ నుండి దొరకలేదు.

ట్రైన్ కదిలింది.. టి.సి.. అటువైపు గా వెళ్తోంటే టి.సి ని అడిగాను..

" ఒక పెద్దావిడ  అరవై డభై ఏళ్ళ మధ్యలో ఉంటుంది.. వేరే బోగిలోకి వెళ్తానని చెప్పింది.. ఆవిడ వేరే భోగి ఎక్కిందా సార్? " అని

"ఒక పెద్ద సూట్ కేస్ ఆవిడేనా? సన్నగా పొడుగ్గా ఉంటుంది ఆవిడేనా? " అని అడిగాడు

" అవునండి " అని అన్నాను

" ఆవిడ దిగి వెళ్ళిపోయింది... " అన్నడు

"అదేంటీ? " నేను ఆశ్చర్యంగా అన్నాను..

"ఆవిడకి మతి స్థిమితం లేదండి.. ఇలాగే వారానికో పది రోజులకోసారి ఒక గంట రెండు గంటల ప్రయాణం చేస్తుంది. మళ్ళీ స్టేషన్ లో దిగి వచ్చిన దారినే వెనక్కు వేరే ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతుంది.  ట్రైన్ లో కనపడిన వాళ్ళతో కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకుపోతూ ఉంటుంది. ఆవిడకు ఒక్కడే కొడుకట, అతను వేరే దేశం అమ్మాయి పెళ్ళి చేసుకొని అక్కడే పరాయి దేశం లో స్థిరపడిపోయాడుట. ఇక్కడకు రాడు, ఈవిడను అక్కడకు తీసుకెళ్ళడు.  తెలుగు లెక్చరెర్ గా చేసి రిటైర్ అయ్యింది.    మంచి రచయిత కూడా.  భాషాభిమానం ఎక్కువయ్యి ఇలా అయ్యిపోయింది. అప్పుడప్పుడు కొన్ని స్కూల్స్ కి వెళ్ళి 'తెలుగు ' లో మాట్లాడమని పిల్లలకు చెపుతూ ఉంటుంది. ఇవన్నీ నాకు ఆవిడ స్టూడెంట్స్  చెప్పారు ఇలాగే ప్రయాణం లో కలిసినప్పుడు.  బాగా బ్రతికినావిడే... ఎప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు ఆవిడ.. కబుర్లే బోలేడు చెప్తుంది.. అదో రకం.. అంతే " అని వెళ్ళిపోయాడు.  

నమ్మలేకపోయాను నేను టి.సి. మాటలని.

" నాకు ఎందుకో ఆవిడ పిచ్చిదనే అనిపించింది ఆ వాగుడికి. ఇలా తిక్క తిక్కగా వాగుతోంది కాబట్టే పిల్లలు భరించలేక వదిలేశారు, పిచ్చి మొహంది. భాష , సేవ ఇలాంటి తలతిక్క కబుర్లు చెప్తోంది కాబట్టే ఎవరూ పట్టించుకోరు.... పిచ్చిది నోరు మూసుకొని ఎక్కడో మూల కూర్చోకా ఊరు మీద పడి ఇలా ఈ పైత్యపు వాగుడెందుకో.. షిట్.. కబుర్లలో పెట్టి  ఎవరి దగ్గరేనా  దొంగ తనము కూడా చేస్తుందేమో !! బ్లెడీ... ఇలా తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడూ ఏ రైలు కింద పడో...."

"జుస్ట్ షట్ అప్ " అని గట్టిగా అరిచాను....

అంతా నావైపే చూస్తున్నారు....

"ఎవరికి పిచ్చి? భాష ని కాపాడాలని సాయశక్తులా ప్రయత్నిస్తోన్న ఆవిడకు కాదు 'పిచ్చి ' .  తల్లీతండ్రులని సరిగ్గా చూసుకోలేక వదిలేసిన ఆ కొడుక్కి  'పిచ్చి ',  పర భాష వ్యామోహం లో పడి మాతృభాష కి నీళ్ళొదిలేసిన మీలాంటి వాళ్ళకి 'పిచ్చి ', ఆవిడ కనీసం మన దగ్గర 'టి ' కూడా తీసుకోడానికి ఇష్టపడలేదు.  అలాంటావిడ దొంగతనం చేస్తుందనా మీకు భయం. ఎవరో ఆవిడకు మతిస్థిమితం లేదన్నారని మిగిలినవి మనం ఊహించేసుకోవడమే? మీకు పిల్లలతో మాట్లాడటానికి 'తెలుగు ' పనికి రాలేదు , కానీ ఆవిడని అసభ్యంగా తిట్టేటప్పుడు  'తెలుగు ' గుర్తుకొచ్చిందా? " ఒక్క నిముషం ఆగాను... 

" మీకు ఆవిడ మొసగత్తెగా, పిచ్చిదనిలా కనిపించిందేమో... నాకు మాత్రం చిక్కి శైల్యమై పోతున్న ఆదరణకు కరువైన,  అనాధ అయిన  'తెలుగు తల్లి ' గా కనిపిస్తోంది ఇప్పుడు. తనని కాపాడమని,  బ్రతికించమని ఇలా ప్రతీవారినీ దీనంగా వేడుకుంటోంది.  మీకు కుదిరితే చేతనైతే మాతృభాషలో మాట్లాడండి... 'తెలుగు ' బ్రతికించండి. లేకపోతే మీ  ఏడుపేదో మీరు ఏడవండి.. అంతే కానీ ఇలాంటివాళ్లని 'పిచ్చి వాళ్ళు ' అని ముద్ర వేసి మీ సంస్కారాన్ని బయట పెట్టుకోకండి " అని రాగల పర్యంతంగా వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ అన్నాను. 

" అవునమ్మా.. ఆవిడ పిచ్చిది కాదు " అని సముదాయిస్తూ అన్నారు సూర్యనారాయణ గారు, ఆయన భార్య.

కూర్చొని వెనకకు వాలగా.. ఏదో గట్టిగా తగిలింది. అది ఒక పుస్తకం లాంటి డైరీ! అందులో ఫొటోలు, కొన్ని కవితలు ఉన్నాయి. కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పుస్తకం. చదువుతుంటే ఎక్కడో చదివనట్టు ఉంది.. అవును.. అది అది.. ' సుగాత్రి ' గారివి. ఆవిడ మీద అభిమానంతోటే మా నాన్నగారు నాకా పేరు పెట్టారు. అవును ఆవిడ గొప్ప సాహిత్యాభిమాని "సుగాత్రి " !! 

Thursday, December 27, 2018

రోషిని శర్మ

రోషిని శర్మ... కన్యాకుమారి నుండి కాష్మీర్ (లేహ్ ) వరకు బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేసిన మొట్టమొదటి వనిత. ఆడపిల్ల  రాత్రి పూట పక్కనే ఉన్న వీధిలోకి ఒంటరిగా  వెళ్ళడనికే భయపడే ఈ రోజుల్లో ఆమె ఇంత దూరం ఒంటరిగా ఎలా ప్రయాణించింది? అందుకు ఆమె కి స్ఫూర్తి ఎవరు? ఎంత మంది వెనకకు లాగారో తెలుసుకుంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎంతో మంది ఈ నాటి ఆడపిల్లలకు స్ఫూర్తి. 



సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషిని నలుగు అక్క చెల్లెల్లో ఒకతి. ఆమె తండ్రి ఆటో మొబైల్ వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పుడు వాళ్ల నాన్నగారు తనకు బైక్ నడపడం నేర్పించారుట. ఆ తరవాత పదేళ్ళ పాటు మళ్ళీ బైక్ నడిపే అవకాశం తనకి రాలేదు. ఒకసారి బెంగుళూరు లో బైక్ రేస్ జరుగుతోంటే ఆమె చాలా ఉత్సాహంతో ఆ రేస్ లో పాల్గొన్నారు. ఒక స్నేహితుడి ద్వారా కన్యాకుమారి నుండి కాష్మీర్ వరకు బైక్ మీద ప్రయాణం గురించి తెలుసుకొని ఇంట్లో చెప్తే.. ఇంట్లో మొదట ససేమిరా అన్నారుట. ఆ తరవాత ఒక గ్రూప్ గా వెళ్తే ఒప్పుకుంటాము కానీ ఓంటరిగా వద్దు అని చెప్పారు. ఆమె దృఢ సంకల్పము ముందు అందరూ తల ఒగ్గక తప్పలేదు. ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి తనని తాను సిద్ధం చేసుకోడానికి, తాను వెళ్ళాల్సిన మార్గం గురించి తెలుసుకోడానికి  ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టిందిట. రోషిని జూన్ 24 న బయలుదేరి జూన్ 28 కి కన్యాకుమారి చేరింది. అక్కడి నుండి తను అనుకొన్న ప్రయాణం మొదలైయ్యింది. జులై పదో తారుఖు కల్లా తను లడక్ చేరుకొంది.

పదిహేను రోజుల్లో (140 గంటల్లో) ఆమె తన గమ్యాన్ని సురక్షితంగా చేరింది. ప్రయాణం హైవే రోడ్ అంత సాఫీగా మాత్రం లేదు. అంత కష్టపడింది కాబట్టే 'లిమ్‌కా బుక్ ఆఫ్ ఇండియా 'లో తన స్థాన్నాన్ని ఏర్పరచుకుంది.  

 చేరిన వెంటనే ఆమె వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుకుందిట. వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ సమయములో పొందిన ఆనందము, గర్వము కన్నా తనకి  ఏ అవార్డ్ ఆనందాన్ని ఇవ్వలేకపోయాయిట. ఈ ప్రయాణం పూర్తి అయ్యక తను నేర్చుకొన్నది :

"దేశాన్ని ఇంకా ప్రేమించాలి , ఆర్మీ లో ఉన్న వారిని చాలా గౌరవించాలి, ప్రాంతాన్ని బట్టి మనుషులను లెక్క కట్టకూడదు " . 



ఒక సారి దారి అంతా ప్రయాణించాక అక్కడ జనాల ద్వారా తెలిసిందిట ఆ దారిలో రాత్రి పూట ఒక స్త్రీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుందనీ, ఆమె ఒక దెయ్యం అని. ఇంకోసారి రోడ్ల మీద ఖాళీ లేకుండా ట్రక్కులు ఉన్నప్పుడు తనకు కొన్ని గంటల పాటు అలా వరుసలో నిలబడాల్సి వచ్చినప్పుడు అనిపించిందిట.." ఎందుకీ ప్రయాశ సుఖంగా ఏ.సి. లో కూర్చొని నెల తిరిగేసరికి మంచి జీతం తీసుకొంటూ, అప్పుడప్పుడు తల్లితండ్రీ, అక్క చెల్లెలతో ఏదైనా మంచి చోటు చూసి సరదాగా గడపక ఈ ఎండలో ఈ ట్రాఫిక్ లో దుమ్ముధూళిలో ఈ కష్టాలు కొని తెచ్చుకున్నానని... " కానీ తన గమ్యము గుర్తుకు రాగానే ఈ కష్టాలన్నీ పెద్దగా కలవరపెట్టలేదు.


రోషినికి బైకే కాదు, మౌటేన్ ట్రెక్కింగ్, సైకిల్ రైడింగ్ అంటే కూడా ఇష్టము. వారాంతరాలలో తాను ఎప్పుడూ పర్వతారోహణము చేయడానికే ఇష్టపడుతుందిట. ఇప్పటికీ దక్షిణ భారత దేశములో ఉన్న అన్నీ ముఖ్యమైన పర్వతాలు ఎక్కేసింది.

ప్రస్తుతం బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తొంది రోషిని. " ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చుకోడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఏ కల రాత్రికి రాత్రే ఫలించదు. దాని కోసం కష్టపడాలి. అప్పుడే కల సాకారమౌతుంది, సమాజములో పేరూ వస్తుంది. ఎంతో మంది మాట అనకుండా ఉండరు, అవి పాజిటివ్ గా తీసుకొని ముందుకే నడవాలి " అని రోషిని,   ఈ  ' కె. టూ కె. '(K-K )  బైక్ రైడ్ అయ్యక యువతకు సందేశం ఇచ్చింది. 




((నాలుగేళ్ల క్రితం ఈ అమ్మాయిని కలిసే అవకాశం లభించింది, అప్పుడు ఆమె నాతో చెప్పిన విషయాలు) 

Wednesday, December 26, 2018

అరుణ కిరణం...

నిన్న మా ఫ్రండ్ మానస కూతురి పుట్టినరోజుకి వెళ్ళాను. అక్కడ కి వెళ్ళి కూర్చూగానే మా ఫ్రండ్ వాళ్ళ చుట్టం ఒకావిడ నా చేతిలో ఒక జూస్ గ్లాస్ పెట్టింది. ఇంకా ఆ పుట్టినరోజు పిల్లని తయ్యారు చేస్తున్నారు. నేను వెళ్ళి మా ఫ్రండ్ అత్తగారిని పలకరించి ఆవిడ పక్కన కూర్చున్నాను. ఆవిడ కాస్త పొట్టిగా పాత సినిమాలో ' రాజసులోచన ' లా ఉంటుంది.

ఆవిడ నన్ను పలకరించిందే కానీ చూపులు మాత్రం నిలకడగా లేవు.. ఏదో వెతుకుతోంది... ఇంత లో వెనకకు చూసింది.. అక్కడ ఆవిడ మనవడు (కూతురి కొడుకు) కొత్త పెళ్ళం చెయ్యి పట్టుకొని నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. అంతే "ఒరేయ్ కిరణు.. కాస్త జానాలలోకి రారా " అని కాస్త సీర్యస్ గానే అంది. ఇంతలో నా ఫ్రండ్ వచ్చి " వాడు జనాలలోనే కదా ఉన్నాడు " అని నవ్వుతూ అంది. నన్ను పలకరించి మళ్ళీ లోపలకి వెళ్ళిపోయింది మానస.  

 ఇంతలో ఆ కిరణ్ వెనకాల వంటిట్లో రెండు కుర్చీలు వేసుకొని,  అతను అతని భార్య అరుణ మళ్లీ  కబుర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతలో ఈ రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణు.. ఇలా వచ్చి మావయ్య పక్కన కూర్చోరా " అంది. అబ్బే మన కిరణుడికి తాత్కాలిక చెవుడు వచ్చేసింది...  వినిపించుకునట్టుగా నటించేశాడు. ఈ రాజసులోచనగారు ఆగలేదు మళ్ళీ గొంతులో స్థాయి పెంచి పిలించింది. ఇంక ఆ అబ్బాయి తప్పదన్నట్టు లేచి వచ్చి హాల్ లో మానసా వాళ్ళ ఆయన పక్కన కూర్చున్నాడు. ఇక్కడ కిరణ్.. ఎదురుకుండా వంటిట్లో అరుణ.. హ్మ్మ్మ్.. కాసేపు కళ్ళతో కబుర్లు చెప్పేసుకోవడం, చూపులతో  సైగలు చేసేసుకోవడం మొదలెట్టారు. అటు చూసి ఇటు చూసి కిరణు మళ్లీ  వెళ్ళి అరుణ పక్కన చేరాడు. మళ్ళీ మన రాజసులోచన గారు వెతుకోవడం మొదలెట్టింది... ఇంతలో కేక్ కట్టింగులు అయ్యాయి. ఈ రాజసులోచన గారి దృష్టి అంతా కిరణ్ వైపు, నా దృష్టి  అంతా ఈవిడవైపే ఉండిపోయాయి.

ఒక ప్లేట్ లో పెద్ద కేక్ ముక్క పట్టుకొని కిరణ్ , అరుణ పక్కకెళ్లీ సగం సగం తింటున్నారు. ఇంతలో మన రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణూ.. ఇక్కడ కేకు ఉందిరా.. రా " అని అరిచింది. పాపం కిరణ్ అరుణని వదలలేక వదలలేక అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు.

ఇంక భోజనాల తంతు మొదలయ్యింది.  రాజసులోచన గారి హడావిడి చూసి ఆవిడకి ఒక ప్లేట్ లో భోజనం పెట్టి   పైకి వెళ్ళి కూర్చోమని ఆవిడ కొడుకు(మానస భర్త)  చెప్పాడు... ఆవిడ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ .. "ఒరేయ్ కిరణు.. నువ్వు ఇలా రా " అని పిలిచింది. ఆవిడ కొడుకు.. "నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళు , వాడిని ఎందుకు పిలుస్తావు... ఏదైనా వడ్దన పని ఉంటే వాడు చేయాలి కదా  " అని చెప్పి రాజసులోచన గారిని మేడ ఎక్కించేశారు. ఇక అరుణ, కిరణులు సరదాగ నవ్వుకుంటూ వడ్దన చేస్తుంటే అందరికీ చూడ ముచ్చటగా అనిపించింది. అరుణతోటే కదా కిరణం ఉండేది!!

ఒక చిన్న మొక్కని పాతి నీరు పోసి పెంచి పెద్ద చేశాక, తీరా అది ఫలాలు ఇచ్చే సమయానికి ఎవరో వచ్చి ఆ చెట్టుని తనది అనేస్తే.. ఆ పెంచిన వ్యక్తికి ఒకరకమైన బాధ, దుగ్ధ వేస్తుంది. ఈ రాజసులోచన గారి బాధ అదే. చిన్నప్పుడు తల్లీతండ్రీ పోతే ఈ రాజసులోచన గారు(అసలు పేరు ఇప్పటికీ తెలీదు) ఆ కిరణ్ ని పెంచింది. ఎక్కడ ఆ కొత్త పిల్ల ఆవిడ మనవడిని ఆవిడకి దూరం చేసేస్తుందో అన్న భయం. ఆ మనవడు అమాయకుడని, ఆ కొత్తగా వచ్చిన పిల్ల వాడిని ఆడించేస్తుందన్న భయము... ఈ భయంతోటే కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటారు వాళ్ళ జీవితాలలో... ఆ చెట్టు నాదే, ఆ కొత్త పిల్ల నాదే అన్న భావం వస్తే ఈ బాధ ఉండదు. ఎక్కువ చొరవ తీసుకుంటే వాళ్ళు మొదట నవ్వుకున్నా తరవాత తరవాత విసుకుంటారు కూడా. చెప్పడం తేలికే ఈ విషయం కానీ ఆచరించడం కష్టం... అయినా తప్పదు మన గౌరవం మనం నిలుపుకోవాలంటే!!

Sunday, December 9, 2018

ప్రయాగ

"నిన్ను అక్కడ నుంచి పక్కకు రమ్మని చెప్పాను కదమ్మా " అని ఐదో సారో ఆరో సారో అన్నారు పంతులు గారు సునందతో...

" వాడికి సరిగ్గా తెలియటం లేదండి " అని మళ్ళీ అదే జవాబు ఇచ్చింది సునంద...

"వాడికి అర్ధమయ్యేటట్టు నేను చెబుతా, నువ్వు పక్కకు రావమ్మా " అని కాస్త కటువుగా చెప్పారు పంతులు గారు.


చుట్టుపక్కల ఎనిమిదిమంది వారి వారి పితృదేవతలకి శ్రాద్ధం పెడుతున్నారు, అందరూ 40 ఏళ్లు దాటిన వారే, కొందరు 60 ఏళ్ళు దాటిన వారూ ఉన్నారు! అందులో  ఒకే ఒకడు మాత్రం పది పదకొండేళ్ళ మధ్యలో ఉన్న వాడు... పేరు సంతోష్! వాడికి ఏదీ అర్ధం కావటం లేదు... అందుకు అతని తల్లి మాటిమాటికి  వచ్చి పంతులుగారు చెప్పింది ఎలా చెయ్యాలో చెబుతోంది, ఇది ఆ పంతులుగారికి నచ్చక ఆవిడని కసురుకుంటున్నాడు.


"ఒరేయ్... అంత పెద్ద పెద్ద ఉండలు కాదురా... ఆ పిండితో నలభై ఉండలు చెయ్యాలి... నువ్వు ఐదు ఉండలు చేశావు ఒక్కో ఉండని ఎనిమిది చిన్న ఉండలు చెయ్యి " అని గదమాయిస్తూ చెప్పారు ఆ పంతులు గారు.


సంతోష్ ఆయన చెప్పినట్టే భయం భయంగా చేస్తున్నాడు.  చుట్టూ ఉన్నవారు అక్కడ జరిగేది చూడలేక సునందని అడిగారు " ఆ పిల్లాడు ఎవరికి పిండప్రదానం చేస్తున్నాడమ్మా? " అని


" నా భర్తకేనండి  " అని వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ అంది సునంద


అప్పుడు చూశాను ఆవిడని రమారమీ 25 - 27 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఇంకా మొహం లో లేతదనం పోలేదు. ఎవరూ ఆ పిల్లాడికి తల్లి అని అనుకోరు, అక్కేమో అని అనిపిస్తుంది.  ఇంత కష్టమా ఇంత చిన్న  వయసులో? 

" ప్రయాగ, కాశి, గయలో శ్రాద్ధం పెట్టిన వాడే అసలైన కొడుకుగా మన పురాణాలు చెబుతున్నాయి " అని గట్టిగా పంతులుగారు అన్నారు.


" చేతికున్న ఆ దర్భ పడిపోయిందిరా.. చూసుకో " అని సంతోష్ తో అన్నారు పంతులుగారు...

వాడు దర్భ అంటే ఏంటో అని విస్తరిలో చూస్తున్నాడు, సునంద ఆగలేక మళ్ళీ దగ్గరకు వెళ్ళి ఆ దర్భని తీసి ఇవ్వబోయింది..

"వాడికి తెలుగు అర్ధమౌతుంది కదా? నేను తెలుగులోనే చెబుతున్నాను కదమ్మా... నువ్వు పక్కకు వెళ్ళు " అని మళ్ళీ  గదమాయించాడు


చిన్నబుచ్చుకొన్న మొహం తో మళ్ళీ వెనకాలకి వచ్చింది సునంద.

"ఎలా పొయారమ్మ మీ వారు? " అని ఎవరో ఆ గుంపులో అడిగారు

" యాక్సిడెంట్ లో పోయారండి " అని సమాధానం ఇచ్చింది సునంద


" ఏదైనా ఆస్తి పాస్తులున్నాయా మరి? నువ్వేదైన ఉద్యోగం చేస్తున్నావా? " అని అడిగింది ఒక పెద్దావిడ ఉండబట్టలేక...

" ఒక పాన్ షాప్ ఉందండి, వెయ్యి గజాల స్థలం మాధాపూర్ లో ఉంది, అదిగో మా అమ్మ నాన్నతో ఉంటున్నాను " అని సంతోష్ పక్కన పితృకర్మలు చేస్తున్న తన తండ్రిని చూపించింది సునంద.


" అయ్యో తాత మనవడు ఇలా ప్రయాగలో ఒకేసారి పిండప్రదానం చేస్తున్నారా? పగవారికి కూడా ఇలాంటి  కష్టం రాకూడదు " అని కళ్ళ నీరు పెట్టుకుంది ఒక పెద్దావిడ


"నేను ఎక్కువ చదువుకోలేదండి, టెంత్ అయ్యిన వెంఠనే పెళ్ళి, పెళ్లైన ఏడాదిలోపలే వీడు పుట్టేశారు " అని చెప్పింది సునంద


" వీడెనా ఇంకా పిల్లలు ఉన్నారా? " అని ఇంకో ప్రశ్న


" ఇంకో ఆడపిల్ల ఉందండి "


"చెయ్యి ఎడమవైపు తిప్పాలిరా అలా కాదు " అని మళ్ళీ పంతులుగారి అరుపు


చెయ్యి అన్ని వైపుల  తిప్పెస్తూ పంతులుగారి వైపు తిప్పాడు  సంతోష్


"నాకు కాదురా ఆ పిండం పెట్టేది అటు వైపు తిప్పి నేను చెప్పింది చెప్పు " అని అన్నారు  పంతులుగారు


ఆ మాటకి కాస్త నవ్వు వచ్చినా అక్కడి జనాలు మాత్రం నవ్వితే ఎమంటారో అని నవ్వలేకపోయారు..

పక్కన ఉన్న సంతోష్ తాత కళ్ళతో అలా కాదు అని సైగ చేశాడు. అది అర్ధం చేసుకున్నాడేమో తాత ఎలా చేస్తున్నాడో చూసి అలా చెయ్యి తిప్పాడు సంతోష్.


మొత్తానికి ప్రయాగలో సంతోష్ చేత అతని తండ్రికి శ్రార్ధం పెట్టించింది సునంద. అందరూ ఆ పంతులుగారికి తోచిన రొక్కం చెల్లిస్తున్నారు. డబ్బులు ఇచ్చి అతని కాళ్ళకి దండం పెడుతున్నారు

సంతోష్ చేతికి రెండు వందల రుపాయిలు ఇచ్చి పంతులుగారికి ఇవ్వమని చెప్పించి సునంద.

సంతోష్ భయంగా ఆయన దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన చెయ్యి అడ్డం పెట్టారు

"అయ్యా.. డబ్బులు తక్కువైతే ఇంకో వంద ఇస్తానండి " అని సునంద పాపం కళ్ళలో నీళ్లతో అంది


"అమ్మా.. శ్రద్ధగా పెట్టేది శ్రార్ధం. ఇంత చిన్న వయసులో మీ అబ్బాయికి వచ్చిన కష్టం శతృవులకు కూడా రాకూడదమ్మా! ఎంతో డబ్బున్నా, శాస్త్రీయ కుటుంబాలకు చెందినవారు తల్లి తండ్రి పోతే ఎవరో ఒకరికి (డబ్బులు) కూలి  ఇచ్చి  దహన సంస్కారాలు చేయిస్తున్నారు. ఇక ఇలా ప్రయాగ, కాశీలో, గయలో పిండప్రధానం అనేదే లేదు. అలాంటిది నీ కొడుకు నా ద్వారా ఆ క్రతువు చేయించుకున్నాడు, ఆ తృప్తి చాలమ్మా. వాడిని కసిరింది వాడి ఆలోచనలు అటు ఇటు పోకూడదని, తప్పుగా అనుకోకే.. నా కూతురు లాంటి దానివి  "   అని పంతులుగారు అనడంతో అందరూ ఆయనవైపు చేతులు జోడించి మరీ చూశారు

సంతోష్ వైపు చూసి "అయ్యవారి కాళ్ళకి దండం పెట్టు " అని చెప్పింది సునంద

కాళ్లకి దండం పెట్టిన సంతొష్ ని లేవదీస్తూ " ఒరేయ్.. మీ నాన్న ఏ లోకాలలో ఉన్నా ఆయన  ఆత్మకి శాంతి కలిగించావు, ఉన్నత లోకాలు కలిగేటట్టుగా చేశావు. , బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకొని ఆవిడకీ కూడా ఆనందాన్ని ఇవ్వు " అని అన్నారు  పంతులు గారు.


 "యథా నవనీతం హృదయం బాహ్మణస్య

వాచి కురో నిశిత స్త్రీక్షధాః  " గుర్తొచ్చింది.


ప్రయాగ వెళ్ళినప్పుడు ఆయనకి నా తరఫున కూడా దండం పెట్టండి. 

Friday, November 23, 2018

పాటకలు

పున్నమి రాత్రిలో కూసే కోయిలలా ...

సముద్రపుటొడ్డున మేసే గోవులా..

కార్తీకాన విరబూసిన మల్లిలా...

నిత్యమూ ఆహ్లాదంగా నీ నవ్వు ఉంటుంది...


(రాత్రి పూట కోయిలా, సముద్రపు ఒడ్డున లేని గడ్డి మేసే ఆవు, కార్తీక మాసంలో మల్లెపువ్వు... దేవుడా)


నడిరోడ్డున ఏడుస్తొన్న ఆకాలి ఏడుపులు వినపడుతూ కూడా నువ్వు ఎలా తినగలుగుతున్నావు?


(అన్నం తినేటప్పుడు నాకు చెవులు పని చెయ్యవు)


పండక్కి నువ్వొక్కదానివే బట్టలు కొనుకుంటే చాలా... దేశంలో బట్టలు లేని వారు ఎందరో...

(పండక్కి కొత్త బట్టలు కొనికొని వెసుకోవడానికి కూడా కోర్టు అనుమతి కావాలా?)


ఇవన్నీ పొద్దుటే వచ్చే వాట్స్ ఆప్ లో కవితా సందేశాలు...కవితలనబడే ముక్కలు చేసేసిన వాక్యాలు.


ఇంకొందరు పాత పాటలలో అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసుకొని అతికించేసి రాసేస్తూ ఉంటారు. అప్పటికే మనసు చంపుకొని "వహ వా.. " అన్నాను... 


అన్నకా ఇంకా పెట్రేగి పోయి..."గంగాభగీరథి సమానురాలైన మా అమ్మ నిత్య పవిత్రురాలు " అంటూ రాసేశారు.. వాళ్ళ నాన్న గుండ్రాయిలా ఉన్నాడు. ఇలా అనకూడదు భర్త ఉన్న వాళ్లని అంటే "పద ప్రయోగం బాగుందని అనేశా... " అంటూ సకిళింపు లాంటి ఇకిలింపు...


రేపటి నుంచి రివర్స్ లో నేనూ పాటల ముక్కలు కవితలుగా .. అంటే "పాటకలు "  (అబ్బాబ్బ ఎంత బాగుందో పేరు) రాసేసి పంపేస్తా.. అంతే!!