Search This Blog

Sunday, January 21, 2018

సంక్రాంతి స్మృతులు

ఒకప్పుడు మా ఊరిలో సంక్రాంతి అంటే పండగ శోభ అంతా ఆ ఊరిలోనే నిత్యవాసం చేసేది. ప్రతీ ఇంటి అరుగు మీద పట్టివర్ధనాలతో, అప్పుడే సంధ్యావందనం ముగించుకొన్న సోమయాజిలాంటి తాతగార్లు, పక్కన వారి మజ్జిగో లేక పాలో ఇవ్వడానికి కచ్చాపోస, కడియాలు, కాలికి నిండా పసుపు, తలలో ఓ మందారపువ్వు, మొహమ్నిండా పసుపు, మధ్యలో రూపాయి కాసంత బొట్టుతో సోమిదేవమ్మ లాంటి మామ్మ గార్ల్తో ఆ ఊరు మొతం కళకళలాడేది. ఆ ముసలి దంపతుల కొడుకుకోడల్లూ, ఆ తరవాత మా తరం వాళ్ళూ ఆ ఊరిలో ఉండేవాళ్ళము.


మా ఇంట్లో మా తాతగారు, మామ్మ, పక్క ఇంట్లో తాతతాతయ్య, గున్నమామ్మ, ఆ పక్క ఇంట్లో ఆవు మామ్మ, మీసాలతాతయ్య, ఆ పక్క శాస్త్రులు తాతగారు, రాజేశ్వరి మామ్మ, ఆ పక్క వీరన్న తాత, కావు మామ్మ.. ఇలా ఊరు ఊరంతా నిండుగా పూసిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉండేది.


ఊరు మొత్తం తాతగారి పెదనాన్న చిన్నాన సంతానమే అవ్వడంతో ఊరంతా మాకు బాబయ్యలూ, పెదనాన్ననూ, వారి సంతానమే! పండగ వస్తే ఇంటి అడపిల్లలు వచ్చేవారు. పండగ పిండి వంటలు కోడళ్ళు చేస్తే, పిల్లలకు తలస్నానాలు, వారి చేత భోగి మంటల్లో పిడకల దండలు వేయించడం అత్తల వంతు. పొగమంచులో కొబ్బరాకు పొయ్యి పెట్టి పెద్ద డేశాతో వేడినీళ్ళు కాచి ఆ నీళ్ళతో స్నానం. అదేంటో నీళ్ళు కూడా భలే మంచి వాసన వచ్చేవి. కంట్లో కుంకుడు కాయ పులుసు పడితే స్నానమయ్యాక ఒక ఉప్పు కణిక నోట్లో వేసుకొని తలకి పిడప కట్టుకొని భోగి మంటల దగ్గరకు పిడకల దండ వేయడానికి వెళ్ళేవాళ్ళము. ఒక పక్క పుష్యమాసం చలి, ఇంకో పక్క భోగి మంట వెచ్చదనం, ఓ పక్క కంట్లో పులుసు పడిన మంట, మరో పక్క ఆ భోగి మంటకు ఒక ఊరట, నోట్లో ఉప్పుకణిక , కన్నీటి ఉప్పదనం... ఏంటో అన్నీ కలబోతలే.


భోగి మంట అయ్యాక అందరికీ దండాలు... అలా డబ్బులు వసూలూ! అందరి ఇల్లకు వెళ్ళి దండం పెడితే రూపాయో రెండు రూపాయిలో ఇచ్చేవారు. ఆ ఇంటి మామ్మలైతే పండగ కోసం చేసిన జంతికలు, బెల్లం మిఠాయి ఇచ్చేవారు. అవి బ్రేక్ ఫాస్ట్ చేసి కొత్తబట్టలు అందరికీ చూపించి మురిసిపోయేవాళ్ళము. అప్పుడు పండగలకీ, పుట్టిన రోజులకే కొనుకునేవాళ్ళము కొత్త బట్టలు. కానీ ఆ కొత్తబట్టలు చూసుకొని చూసుకొని మురిసిపోయేవాళ్ళము. అదేంటో ఇప్పుడు ఇన్ని కొత్తబట్టలు కొన్నా ఆ ఆనందం లేదేంటో? చిన్నతనం పోయిందా? పెద్దరికం వచ్చిందా?

లేక మనసు మొద్దుబారిపోయిందా?


సాయంత్రం గొబ్బెమ్మల పేరంటాలు, బొమ్మల కొలువు పేరంటాలు. గట్టిగా పాటలు పాడి ఆ పేరంటానికి ఇచ్చిన ప్రసాదం తినేసి మళ్ళీ ఏదో సంబరంతో తిరిగేవాళ్ళము. కనుమ రోజు "ప్రభల తీర్ధం ". దాని వర్ణించడం కష్టమే... రెండు కళ్ళూ చాలవు చూడటానికి. 


అన్నిటి కన్నా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ముగ్గులు. చిన్నతనంలో వీధిలో ముగ్గు వేసే అర్హత రావాలంటే ముందు పెరట్లో వేయాలి. పెరట్లో ముగ్గు వెయ్యాలంటే అస్సలు ఇష్టముండేది కాదు. వీధిలో ముగ్గు వేసే ఛాన్స్ అత్తలు ఇచ్చేవారు కాదు. (అప్పటి ఇంకా చేతబడి ముగ్గులే వచ్చు). మా మామ్మ అనేది "పెరటి గుమ్మము పేద ముత్తైదువా ... అలా చిన్న చూపు చూడకూడదు... అక్కడ కూడా పెద్ద ముగ్గు వేయండి అని" . పెరట్లో జూనియర్స్ కి ముగ్గు వేసే అవకాశం వచ్చేది.


నేను ఇంటర్కి వచ్చాక వీధిలో ముగ్గు వేసే ప్రమోషన్ వచ్చింది. నేను ముగ్గు వేస్తుంటే మా తాతగారు కాపలా కూర్చునేవారు. చుక్కలు వేస్తుంటేనే అనేవారు " మంచు పడుతోంది.. ఇంక చాలమ్మ.. పద లోపలకి " అని. పాపం రాత్రి 9 గంటల కల్లా పడుకొనే వారు నా కోసం మాత్రం నిద్ర ఆపుకొని 11 గంటల వరకూ  మరీ కూర్చునేవారు. ప్రతీ అరగంటకోసారి "ఇక చాలమ్మ... మంచు పడుతోంది, వెళ్ళి పడుక్కో " అని అనేవారు.  దానికి మా మామ్మ అనేది " అది రేపు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్తే ఏవైపోతారూ? " అని...


అప్పుడు ఆ మాట సరదాగా అనిపించేది. కానీ నిజంగా నేను వెళ్ళిపోతే ఏవైపోతారో అని ఆలోచించలేదు. నేను అత్తారింటికి వెళ్ళిపోతే బెంగపెట్టుకొని ఆ ముసలి ప్రాణి తట్టుకోలేక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారని ఆ సమయంలో నాకు తెలియదు. తెలిసేటప్పటికి ఆయన లేరు.


Thursday, December 21, 2017

నూరు గొడ్లను తిన్న రాబందు

"పెళ్ళికూతురు ఎలా వుంటుంది వదినా "

"కార్తీక మాసం తేగలా ఉంది వదినా "

నాకు భలే నవ్వొచ్చింది. ఎందుకంటే ఆ పెళ్ళికి నేనూ వెళ్ళాను. ఆ పెళ్ళికూతురు సన్నగా తెల్లగా ఉంది.

ఇంతలో అటుగా వెళ్తొన్న మా ఊరి అల్లుడు గారు " ఆ పాలల్లో పడ్డ బల్లిలా ఉంది.. అదీ ఒక అందమే " అన్నాడు. బల్లి పాలలో పడితే ఎలా ఉంటుందో ఊహించుకున్నా... యాక్... ఛీ.. ఇదో పోలికా..

"పెళ్ళికొడుకు రేవులో తాడిలా ఉన్నాడు.. ఇంటికి బూజు దులపడానికి పనికొస్తాడు బాగా " అని అనేసి వెళ్ళిపోయాడు.

ఆయనకి ఎదురు చెప్పడం ఊరిలో ఎవరికీ రాదు. అందరికి భయమో లేక గౌరవమో తెలీదు. ఆయన పేరు గౌతమేశ్వరుడు. మా ఊరిలో ఓ పెద్దాయకి అల్లుడు ఇతగాడు. ఊరులో మొత్తం ఆ పెద్దాయకి అన్నదమ్ములే ఉండటంతో ఊరిమొత్తానికి అల్లుడై కూర్చున్నాడు. ఆయన భార్య సర్వలక్ష్మి ఆయనకు సమ ఉజ్జే!

వీధి అరుగు మీద కూర్చొని అటు వెళ్ళే వాళ్ళని ఇటు వచ్చేవారిని పట్టుకొని " ఏవే ఇలా రా " లేక పోతే "ఒరేయ్ ఇలా రా అని పిలిచే వారు " తీరా వాళ్ళు వచ్చాక ఆ వచ్చిన వ్యక్తిని ఏదో అడిగి వాడిని ఇదిగో ఇలాంటి పుల్ల విరుపు మాట ఏదో ఒకటి అనేసి పంపేవారు.

ఒకసారి నేను పేరంటానుంచి వస్తుంటే "ఇలా రావే " అని పిలిచింది మా సరత్తయ్య.

నన్ను చూసి గౌతమేశ్వరుడు గారు "దీనిది అచ్చు వీళ్ళ నాన్న మొహమే " అన్నాడు

"అవును ఐదు పైసల మొహమూ " అంది సరత్తయ్య

" పావుకోళ్ళ మొహమూ ఇదీనూ " అన్నాడు గౌతమేశ్వరుడు మావయ్య

"వీళ్ళ అమ్మ ది సిబ్బిరేకు మొహం.. గుండ్రంగా ఉంటుంది, దీనికే వాళ్ళ నాన్న, మామ్మ మొహం వచ్చింది.. మీరన్నట్టు పావుకోళ్ళ మొహం " అని అంది సరత్తయ్య నవ్వుతూ....

నాకు ఈ పావుకోళ్ళు అంటే అప్పటికి తెలీదు. అదేదో జాతి కోళ్ళు అనుకున్నా. ఇంటికొచ్చి మా మామ్మకు చెప్పా

"గవాక్షుడిలా మొహం వేసుకొని వచ్చే పోయే వాళ్ళని అనడమే వాడికి తెలుసు, అయినా ఆ సరమ్మ కూడా సొంత పిన్ని ని అని కూడా చూడకుండా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆ మాటలేంటీ? " అని బాధపడింది. కానీ ఆ సరత్తయ్యని అనే ధైర్యం లేదు మా మామ్మకి. ఇంతకీ ఆ గవాక్షుడెవడో తెలీదు.

ఊర్లో పెళ్ళీళ్ళు అయితే ఆడపెళ్ళివారికి మగపెళ్ళివారికి గొడవలు పెట్టేసేవారు ఈ గౌతమేశ్వరుడు గారు! ఒకసారి మా ఊర్లో ఒకాయన కూతురు పెళ్ళి చేసుకున్నాడు. కాకినాడ నుంచి మగపెళ్ళివారి బస్సు విడిది ఇంటి దగ్గర దిగింది. చాలా సేపు బస్సు ప్రయాణం చేసి ఉన్నారు పాపం ఆడవాళ్ళకి కాలకృత్యాలకి ఇబ్బందిగా ఉండి ఉంటుందని, అందులో ఒక పెద్దాయన ఈ గౌతమేశ్వరుడి దగ్గరకు వచ్చి " ఆడవాళ్ళు ఎవరేనా ఉన్నారా అండి? " అని అడిగాడు

ఈయనకి అసలే వెటకారం పాళ్ళు ఎక్కువ " ఏం... ఎంత మంది కావాలేంటీ? " అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ...

అంతే మగపెళ్ళివారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఒక అరగంట ఆ మగపెళ్ళివారికీ, ఈ గౌతమేశ్వరుడికి పోట్లాట. పాపం ఆడపిల్ల తండ్రి అందరిని బతిమాలుకొని పెళ్ళి చేశాడు.

ఇలా ఉండగా ఆ సరత్తయ్య ఇంట్లోకి ఒక పక్క వాటాలోకి మా ఊరి మాష్టారు అద్దెకొచ్చారు. వాళ్లకి ఒక 4 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. వాడికి పిలిచి రోజు ఏదో ఒకటి అంటునే ఉండేవారు ఆ దంపతులు. అక్కడితో ఆగక దారిలో వచ్చే పోయే వాళ్ళని ఆ పిల్లాడి చేత "లం.. కొడకా " అని తిట్టించేవారు. జనాలు మనసులో తిట్టుకుంటూ ఏవీ అనకుండా వెళ్ళిపోయేవారు.

ఒకసారి మా ఊరి ఆస్థాన మంగలాకారుడు ఎం. ధర్మరాజు(మంగలి ధర్మరాజు) , ఆ మాష్టారి అబ్బాయి శంకర్ కట్టింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఇంటి అరుగు మీద కూర్చొబెట్టి తల ని దువ్వుతున్నాడు ఎం. ధర్మరాజు. ఆ బుజ్జి శంకర్ " నాకు చిరంజీవి కట్టింగ్ చేయ్ ధల్మలాజు ... " అని ఇంకా ఏదో చెబుతున్నాడు

ఇంతలో గౌతమేశ్వరుడు "వెధవకి డిప్పకట్టింగ్ చేసేయ్... నాలుగేళ్ళు లేవు వీడికి చిరంజీవి కావాల్సి వచ్చాడా " అని అన్నాడు 

 అంతే ఆ నాలుగేళ్ళ కిశోరం.." ఈ వెధవ ఇలాగే అంటాడు, గవాక్షుడు మొహం వేసుకొని.. పగిలిన మంగలం మొహం వీడూనూ, రేవులో తాడిలా పెరిగాడు కానీ.. లం...కొడుకు " అనేసి పారిపోయాడు.

అక్కడున్న అందరూ నోరు కళ్ళు తెరచుకొని అలా ఉండుపోయారు. మరునాడు గౌతమేశ్వరుడు మావయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చిపోయాడు. అత్తయ్యకి నోరు పడిపొయింది. జరిగింది చెప్పడానికి ఆయన లేడు, చెబ్దామన్న సరత్తయ్యకి నోరూ లేదు (అప్పుడు, ఇప్పుడు ఆవిడే లేదు), ధర్మరాజు చెప్పడు.. శంకర్ చెప్పలేడు... అంతే!

 

 

Wednesday, December 13, 2017

ఆనందం


ఆనందం ఎక్కడ ఉంది? ఖరీదైన వస్తువులలోనా? పెద్ద పెద్ద బంగ్లాలలోనా? కాస్ట్లీ బట్టలలోనా? ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే ఎన్ని గ్రంధాలు తిరగెయ్యాలి? ఎంత మంది గురువులని ఆశ్రయించాలి? ఇవన్నీ ఒక ఎత్తు.. ప్రకృతి పార్వతీ దేవి స్వరూపంగా భావించే వారికి ప్రతి అణువు ఒక పాఠమే! ప్రతి జంతువు, ప్రతి పునుగు  మనకు ప్రతి నిత్యం ఏదో ఒకటి భోధిస్తూనే వుంటుంది. 


అసలు విషయానికి వస్తే.. గత నెల్లాళ్ల నుంచి మా ఇంటి కిటికీ దగ్గరకు ఒక పక్షి పొద్దుటే అదేదో డ్యూటికి వచ్చినట్టువస్తోంది. సాయంత్రం చీకటి పడెవరకు ఆ కిటికీ బయట నుంచి దాని మొహం దానికి కనిపిస్తోందేమో,  రోజూ ఆ ప్రతి బింబంతో పోట్లాటే! ఆ కిటికీ దాటాక ఏ లోకం ఉందో అని దాని ఆలోచనో ఏమిటో మరి! దాని ముక్కు ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం కూడా వేస్తుంది అది కిటికీని కొట్టే విధానం చూస్తే! ఒకసారి ఆ కిటికీ తలుపు తీసి "అంత అందమైనది కానే కాదు పిచ్చమ్మ " అని చెప్పాలనిపిస్తుంది.



ఇంకో విషయం... మా పనిమనిషి కూతురు. దాని పేరు సత్య. రోజూ రాగానే "ఆంటీ బిస్ కెట్లు  " అంటుంది. బిస్ కెట్టు ఇస్తే కొన్ని సార్లు తింటుంది, మరి కొన్ని సార్లు దాచుకుంటుంది. కానీ ఈ రోజు అది ఆ బిస్కెట్టు పాకెట్టు తీసుకొని అద్దం లో చూసుకొంటూ డాన్స్ చేస్తుకుంటూ పాటలు పాడుకోసాగింది. చాలా సేపు దాని వైపు ముచ్చటగా చూస్తూనే ఉన్నా! తరవాత ఆ బిస్కెట్లతో బ్రిడ్జ్ కట్టింది, ఇంకా ఏవేవో కట్టింది. 


సాయి బాబా జీవిత చరిత్రలో "ఈశావాస్యోపనిషత్ " ఘట్టం గుర్తొచ్చింది. లేదన్న చింతన లేదు, ఉందన్న గర్వం లేదు. ఎప్పటికీ నిలిచే ఆనందమే... నిత్యానందం... బ్రహ్మానందం.!!

Sunday, December 3, 2017

వోలేటి పార్వతీశం

వోలేటి పార్వతీశం గారు... ఒక గొప్ప రచయిత, వ్యక్త, నిగర్వి, సాహితీవేత్త, పరిశోధకుడు, అన్నిటినీ మించి... ఒక మంచి వ్యక్తి! దూరదర్శన్ లో 'జాబులు - జవాబులు " లో తనదైన ఒక ముద్ర వేసుకొన్న వారు. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వోలేటి పార్వతీశం గారి మనువడు. విద్వత్కవి శ్రీ కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు. సుప్రసిద్ధ గేయకవి "శశాంక  గారి " తనయుడు. ఇవి వారికి జన్మతహ లభించిన అదృష్టాలు.  

 

 

వారిది శ్రవణ సుభగమైన కంఠస్వరం. ఎన్నో అర్హతలు కలిగినా ఏమాత్రమూ అహం లేని గొప్ప వ్యక్తి వారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు ప్రసారమాధమానికి సేవలందించారు. గంభీర గళంతో, స్వచ్ఛమైన భాషణంతో, అచ్చమైన భావంతో, అందమైన లాస్యంతో తెలుగు భాషకే వన్నె తెచ్చిన నిలువెత్తు తెలుగు సంతకం... వోలేటి గారు!!

ఏమాత్రము గర్వమూ, అతిశయోక్తి లేకుండా వారి గురించి తెలుసుకోడానికి వెళ్ళిన నాతో వారి జీవిత విశేషాలు చెప్పారు.
ఇప్పటికీ ఎన్నో సాహితీ సభలకు అధ్యక్షత వహించి ఎంతో సాహితీ సేవ చేస్తున్న 'మహానుభావులు"  !!    ఆ మహానుభావుడి ద్వారా విన్న ఆయన జీవిత విషయాలు మీతో పంచుకుంటున్నాను. 

 

 


 

 

 

Thursday, November 9, 2017

పాటలతో.... పాట్లు

"గుడివాడ వెళ్లాను గుంటూరు పోయా... " పాట పూర్తవ్వలేదు... నెత్తి మీద ఠంగుమని మోగింది. ఒక్కసారి దక్షుడి 28 మంది కూతుర్లు కనిపించేశారు. ఇంతకీ నేనేం తప్పు పాడానని ఇలా ముదస్తు హెచ్చరిక లేకుండా ఈ పిడుగు ? (అదే మొట్టికాయ) , అదే ప్రశ్నార్ధకమైన మొహంతో చూశాను అమ్మమ్మ వైపు. " ఇలాంటి పిచ్చి పాటలు పాడకు" అన్న వార్నింగ్ ఇచ్చింది. ఇది పిచ్చిపాట ఎందుకయ్యిందో ఆలోచించే వయసు కాదు. చిన్నప్పుడు కొన్ని పాట పాడితే, గుళ్ళో గంట కొట్టినట్టు ఇదిగో ఇలా మొట్టికాయలు పడిపోతుండేవి. ఎప్పుడేనా బాత్ రూం లో గట్టిగా పాడేసుకుంటుంటే మా అమ్మమ్మ వచ్చి " ఇలా పాటలు పాడుకునే బదులు, ఎక్కాలు చదువుకోవచ్చు కదా " అని అనేది. ఎంత ఐనస్టీన్ అయినా ఆనందానికి " న్యూటన్స్ లా " నో "ఆర్కమెడీస్ తియరీ " ఓ చదువుతాడేంటీ? ఈ అమ్మమ్మల చాదస్తం కాకపోతే!

చిన్నప్పుడు ఇలాగే బోలెడు పాటలకి అర్ధాలు తెలియకుండా పాడేసేవాళ్ళము. ఒకసారి.. కాదు మొదటి సారి నేను టేప్ రికార్డర్ లో విన్న పాట "శంకరాభరణం " . ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు. ఆ పాటలో "రసికులకనురాగమై " అన్న చోట అర్ధం కాలేదు. (మిగితాదంతా అర్ధమయ్యిపోయినట్టు అనుకోకండి). అంటే ' రసికులు ' అనేది అంత వరకు వినని పదం. ఆ రికార్డ్ లో ఒక చోట పాపం ఒకాయన "ఖళ్ళు ఖళ్ళు " అని దగ్గాడు కదా, ఆయనకి పాపం జ్వరం వచ్చింది, అందుకే 'రసుకులు " (rusks) అని పాడి ఉంటాడు. ఇలా తోచిన అర్ధం వెతికేసుకున్నాను.

అలాగే "మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు " లో "పదిలంగా " అన్న పదం. వాళ్ళ ఇంటి చుట్టూరా దండం కట్టుకొని పది లంగాలు ఆరేసేవాళ్ళేమో అని అనుకునేదాన్ని. ఆ పది పట్టులంగాలూ ఏ రంగువయ్యింటాయో అని ఊహలు కూడా ఉండేవి. కొన్నేళ్ళ తరవాత " ఈ గాలి ఈ నేల (సిరివెన్నల ) " పాటలో " నా కళ్ళ లోగిళ్ళు " విన్నాను. పాపం కళ్ళు లేవు కదా ఆ అబ్బాయికి అందుకే కళ్ళు గిళ్ళమంటున్నాడనుకునేదాన్ని. (దీనికి దానికి సంబంధమేంటీ అని అడగొద్దు).🤔

ఒకసారి మా పక్కింటి స్వరాజ్య లక్ష్మి అక్కని చూసి వెంకట్ అన్న" ఆ జడ పొడుగు మెడ నునుపు చూస్తుంటే " అనీ, " అడగక ఇచ్చిన మనసే ముద్దు లో... " చెక చెకలాడే " లైన్ పాడాడు. స్వరాజ్యం అక్క సిగ్గు పడింది. అదే నేను పాడితే మూతి మీద సిక్సర్ పడింది! 😷

ఒకసారి మా ఇంట్లో మా తాతగారి తల్లిగారి తద్దినం అయ్యింది. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే అన్నట్టు, 'తద్దినం కూడా తాంబూలాలు " లాంటిదే కొన్ని ఇళ్ళల్లో. (పెళ్ళికి ముందు తాంబూలం కాదు... భోజనం అయ్యాక తాంబూలం అన్న మాటా) . అదీ మనవలూ, మునిమనవలూ ఉన్న ఇళ్ళల్లో. ఇంట్లో గాడిపొయ్యె మీద వంట. గుండిగళ్ళతో హడావిడిగా ఇంట్లోకి బయటకు తిరిగే బాబయ్యలు, మావయ్యలు. నేనూ , మా కజిన్ వీధిలో రెండు స్థంబాలాట ఆడుకుంటున్నాము. ఆడుతూ పాడుతూ పరిగెడుతుంటే ఆకలి తెలియదని, గట్టిగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నాము. నేను 'బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే " అని పాడితే, మా కజిన్ "కాపురమొస్తే కాదంటానా " అంటూ పాడటం మొదలెట్టింది. అంతే... వెనకాల నుంచి ఎవరో మమల్ని గుండిగలు ఎత్తినట్టు ఎత్తుకొని పెరట్లోకి తీసుకెళ్ళిపోయి.. ప్రైవేట్ చెప్పేశారు! హన్నా... మేము చిన్నవాళ్ళమా.. చితకవాళ్ళమా? మా అంతటి వాళ్లము మేము. అయినా కాపురం అంటే డబ్బాల్లో పప్పులు, ఉప్పులు సర్ధడమే అని మా చినమామ్మ చెప్పింది. " పెద్దత్త కాపురానికి వెళ్తోంది " అని అన్నప్పుడు , "కాపురం అంటే ఏంటీ " అని అడిగాను, అదిగో అప్పుడు చెప్పింది. 😎😎


ఈ పైత్యం ఇటు తెలుగులోనే కాదు, హిందిలోకీ పాకింది. "క్యా హువా తేరా వాదా , ఓ కసం ఓ ఇరాదా " వచ్చినప్పుడు ఆ పాడేవాడు లెఖల మాస్టారేమో అని అనుకునేదాన్ని. ఎందుకంటే " ఒక్క సమ్ము చేయరాదా " అని అంటున్నట్టుగా ఉండేది. అలాగే జంగిలి సినిమాలో " ఎహసాన్ తెరా హోగా ముఝ్ పర్.... పల్ఖోంకి చావ్ మే రెహనేదో " నాకు "పళ్ళు తోముకొని చావు " అనేటట్టు వినపడేది. పాపం ఆ హీరో పాచి పళ్ళతో తిరుగుతోంటే హీరోయిన్ "పళ్ళు తోముకోమంటోంది " అని అనుకునేదాన్ని. " సంఝోతా గమోసే కర్లో " పాట "సంజోతా సమోసే కర్లో " లా వినపడీ, సమోసాలు అమ్ముకొనేవాడి పాటెమో అని ఊహించుకునేసేదాన్ని. 🤩😋


అప్పుడు ప్రైవేటు చెప్పినా, ఒన్ డే ఇంటర్నేషనల్ ఆడేసినా ఇప్పుడా పాటలు వింటే మాత్రం... పాటలతో పడిన ఆ పాట్లు... భలే నవ్వు తెప్పిస్తాయి. 😁

Thursday, October 26, 2017

కాదేది దొంగతనానికి అనర్హం

ఏంటో ఈ రోజు పొద్దుటే నాకు మా ఊరిలో "పాపి ' గుర్తుకొచ్చింది. పాపి ఎవరూ? ఆ వృతాంతం ఎట్టిది? అనగా... పాప మా ఊరిలో పొలం పనులు చేసుకొనే అమ్మాయి.. యువతి.. అన్న మాట. అసలు పేరు ఏంటో తెలియదు. కానీ ఆమె చేసే దొంగతనాలకు ఆ ఊరి ప్రజలందరూ ఆమెని 'పాపి " అని కసిగా పిలుచుకొనేవారు. పొద్దుట ఎవరింటి ముందు నుంచేనా వెళ్తే చాలు... సాయంత్రానికి వారింట్లో  వస్తువులు కనపడేవి కావు. కాదేది దొంగతనానికి అనర్హం అనే రీతిలో దొంగతనం చేసేది 'పాపి '.




అందరి ఇళ్ళల్లో దొంగతనం చేసే పాపి మనసు ఆదే ఊర్లో ఉంటొన్న 'ఇటికెడు ' దొంగలించేశాడు.  😍ఇటికెడు పాపి ని మించిన దొంగ కావడంతో వారి సంసారం 'మూడు దొంగతనాలు ఆరు దోపిడీలుగా ' సాగింది. వారి దోపీడీలకు చిహ్నాలుగా ఒక కొడుకు, ఇద్దరు కుతుర్లు... ఇలా ముగ్గురు పిల్లలూ పుట్టారు. 😍😍😍🤩 వాళ్ళ సుపుత్రుడు పుడుతూనే నర్స్ చేతి ఉంగరం దొంగలించేశాడని చెప్పుకుంటారు. 😎



ఒకసారి మా ఇంట్లో పప్పు గిన్నె పోయింది. మా మామ్మ పరవాన్నముతో ఆ గిన్నె పాపికి ఇచ్చింది. ఇంక అంతే... గిన్నె ఇవ్వలేదు సరిగదా... " గిన్నె ఎప్పుడిచ్చారు " అని ఎదురు ప్రశ్న వేసింది పాపి. ఇక తప్పేది లేదని ఒకసారి వీధిలోకి వచ్చిన 'పేరూరు ' ఇత్తెడి గిన్నెల అతను వస్తే కొనడానికి అనుకుంది మా మామ్మ. ఆ ఇత్తెడి గిన్నెల అతను కొన్ని గిన్నెలు చూపించాడు, ఒక గిన్నే అచ్చు మా ఇంట్లో పోయిన పప్పు గిన్నెలా ఉందని అదే గిన్నె తీసింది మా మామ్మ. దాని మీద పేరు చూసి అవాక్కయ్యింది. " కొ|| సు|| శాస్త్రి " అని ఉంది. అది మా తాతగారి పేరు. నా పోస్ట్లు తిరిగి మళ్ళీ నాకే వాట్స్ ఆప్ మేసేజ్ వచ్చినట్టు మా పప్పు గిన్నె మళ్ళీ మాకే వచ్చింది.😉 ఆ గిన్నె వివరాలు ఆ 'పేరూరి ఇత్తడి సామాన్ల " అతన్ని అడగగా, అది 'పాపి ' అమ్మినట్టు తెలిసింది. 'పాపి ' ని అడిగితే అంత నోరేసుకొని మరీ పోట్లాడేది. దానితో గొడవ ఎందుకులే అని ఇలానే చాలా మంది వదిలేసేవారు.


ఒకసారి దొంగతనానికి వెళ్ళిన ఇటికెడు, వాడి కొడుకు ఆ పొలంలో కరంటు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. ఊరి జనాల శాపానికే వాళ్ళు పోయారని 'పాపి ' ఇంకా కసిగా దొంగతనాలు చేయడం మొదలెట్టింది. పాపి దొంగతనాల్కి ఎక్కడా అదుపు ఆపు లేకుండా పోయింది ఆ ఊర్లో!! ఒకసారి నరాయణ మూర్తి అనే రైతు అంత వరకు అతని అరటి తోట కి సేవ చేసుకొని అన్నం తినడానికి వెళ్ళాడు, అన్నం తిని వచ్చి చూస్తే అరటి గెలలు మాయం. సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి 'పాపి ' ని వెతుకుంటూ వెళ్తే అప్పటికే ఆ అరటి తోటలో గెలలు తీసేసి మార్కెట్టు లో అమ్మేసి ఆ డబ్బుతో 'కల్లు ' తాగేసి ఇంట్లో దొర్లుతూ ఉంది 'పాపి '. అసలే 'పాపి ' పైగా 'కల్లు ' తాగింది... ఇంక తన జోలికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని ఆ రైతు ఇంటి ముఖం పట్టాడు. 🤬🤬



ఇంక ఊరు జనం తట్టుకులేక పంచాయతిలో వారి గోడు వెళ్లగక్కుకుంటే 'పాపి ' కి ఊరి నుంచి బహీష్కరింపు వేశారు పంచాయతి వారు. కొన్ని రోజులకి తాగి తాగి మతి స్థిమితం తప్పింది పాపికి. పాపం ఆమె కూతుర్లు ఆమెని బానే చూసుకోసాగారు. రోజూ ఇంట్లో కనీసం పది రూపాయిలైనా ఆమెకు కనిపించెలా పెట్టేవారు. ఆ డబ్బు ఎవరూ చూడకుండా దొంగలించేసేది 'పాపి ' ఆ డబ్బు తిరిగి కూతురికి ఇచ్చి దానితోటే కూరలు కొనమనేది. ఏ వస్తువూ దొంగతనం చేయలేని రోజున ఏవీ తినేది కాదు పాపి. మంచం మీద పడ్డాక కూడా చేతిలో ఎంతో కొంత డబ్బు పెడితే కానీ మందు వేసుకొనేది కాదు పాపి. పోయే ముందు కూడా చేతిలో పది రూపాయిలు పెడితే కానీ ప్రాణం పోలేదు పాపికి!!  😥



ఇంతకీ పాపి ఎందుకు గుర్తొచ్చింది అనేగా మీ ప్రశ్న. పొద్దుట వీధి గుమ్మం తలుపు తీయగానే ఒక తాడు వేళాడింది. అది భగత్ సింగ్ సినిమాలో అజయ్ దేవగన్ కి మొహం మీద వేసినట్టు నా మొహం మీదకి ఉంది. కెవ్వు మని అరవలేదు కాని భయపడ్డా.... ఆ తాడు చూసి పాము అనుకొని... తీరా తేరుకొని చూస్తే అది గుమ్మానికి కట్టిన గుమ్మెడి కాయకి కట్టిన తాడు. ఎవరో దిష్టి గుమ్మెడి కాయ దొబ్బేశారు. ఈ పాటికి అది ఏ పులుస్లోనో ముక్కయ్యి ఉంటుంది. కాదేది దొంగతనానికి అనర్హం....!!!😁😁

 

 

 














😁

Monday, October 9, 2017

గరికిపాటి నరసింహారావు గారు

" కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయ్ నవతరానికి " అని మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా ప్రస్తుత యువతరానికి తన మాటలతో ఉత్తేజాన్నిచ్చే వారు ఇన్నాళ్ళకు దొరికారు.  ప్రవచనాలంటే కాటికి కాలు చాపుకొనేవారే వింటారు అనే అపోహ ఈయన ప్రవచనం వింటే తొలగిపోతుంది. ఏ ప్రవచనం విని యువత లో ఒక వివకానందుకు వెలుగుతాడో.. ఆ ప్రవచనం ఆ గరికపాటివారి సొంతం.  ప్రస్తుతం సమాజం లో ఉన్న కుళ్ళును తన మాటలతో ఉతికిపారేసే నైజం వారిది.  ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రతీక.  నిద్రాణమైన యువత శక్తిని మేల్కొలిపే నవరసగూళికలు... వారి మాటలు. 



వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. వారి గురించి చెప్పడం ముంజేతి కంకణానికి అద్దం చూపడం లాంటిదే! కానీ వారి గురించి చెప్పడం లో చాలా ఆనందం ఉంది. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మిత్రులు పెద్దమనసుతో ఆశ్వాదిస్తారనే ఆశిస్తున్నాను.


 ఈ  సాహితీ రంగంలో అపార కృషి చేస్తున్న గరికిపాటి గారు కవి, పండితులు, అవధాని, గ్రంధ రచయిత, ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రవచనకర్తగా రాణిస్తున్నారు. సమ్రుదఘోష నెపంతో  సాహితీ సముద్రాన్నే  అవపోసన పట్టేసిన అపర
అగస్త్యుడు, ఆ మహాత్ముడు దగ్గరకు   ఒక చిన్న లోటాతో వెళ్ళి అంతే నీరు తెచ్చుకోగలిగాను. 


బాల్యము :


గరికిపాటి నరసింహారావు గారు భాద్రపద శుద్ద పాడ్యమి సెప్టెంబర్ 14వ తేదీ 1958 వ సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వేంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో ఎం. ఏ. , ఎం. ఫిల్, పి. హెచ్. డి.  చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. 


అవధానాలు :


తెలుగు, సంస్కృత  భాషలకే సొంతమైన ఈ అవధాన ప్రక్రియలో చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసిన బహు కొద్ది మందిలో గరికపాటి వారు చెప్పుకోతగినవారు.  వీరు 275 అవధానాలు, ఎనిమిది అర్ధ శత అవధానాలు, ఎనిమిది శతావధానాలు, ఎనిమిది ద్వి శతావధానాలు చేశారు. ఒక మహాసహస్రావధానము చేసి వారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. మొదటి అవధానం 1994 సంవత్సరం విజయదశమి రోజు చేశారు. 


2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు.  2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ( NIIMS ) ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. ఆ విధంగా మేధా పరీక్షావధానం కూడా తొలిసారి నిర్వహించింది శ్రీ గరికపాటి వారే!  యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.


రచనలు :



 సాగరఘోష - పద్యకావ్యం

 మనభారతం- పద్యకావ్యం

 బాష్పగుఛ్ఛం- పద్య కవితా సంపుటి

 పల్లవి - పాటలు

  సహస్రభారతి

  ద్విశతావధానం

  ధార ధారణ

  కవితా ఖండికా శతావధానం

  మౌఖిక సాహిత్యం- పరిశోధనా కావ్యం

  పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు

  మా అమ్మ- లఘుకావ్యం

  అవధాన శతకం

  శతావధాన భాగ్యం- సంపూర్ణ శతావధానం

  శతావధాన విజయం- 101 పద్యాలు


పురస్కారాలు :


ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)

* కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)

* సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)

* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)

* 2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం

* 2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి

* 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)

* 2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి

* భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం

* 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం

* 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం

* సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)

* తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012

* 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.


బిరుదులు :


కాకీనాడలో 1994 అక్టోబర్ 9 -10 (విజయదశమి) మొదటి శతావధానము  చేసినప్పుడు ధారణగా 75 పద్యాలు నలభై నిమిషాలలో చెప్పేశారు. అది చూసి ఆశ్చర్యపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మమ గారు వారికి "శతావధాన గీష్పతి "  అన్న బిరుదు ఇచ్చారు.  


ఆ తరవాత రెండో శతావధానం చేసినప్పుడు అంత కంటే తక్కువ వ్యవధిలో ధారణ పద్యాలు చెప్పారు.


కాకినాడలో జరిగిన "ఖండికా శతావధానం " చేసి, ప్రతీ పధ్యం లోనూ కవిత్వం వచ్చేలా చేసి, ఆ తరవాత ఆ 100 పద్యాలు ధారణ చేసినందుకు అబ్బురపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు గరికపాటివారికి " ధారణ లో నిన్ను మించినవారు లేరు  " అని మెచ్చుకున్నారుట.   


ఆ తరవాత సహస్రావధానంలో 750 పద్యాలు ధారణగా చెప్పినందుకు " ఈ విధంగా 750 పద్యాలు సహస్రావధానంలో అప్పజెప్పడం ఇదే ప్రధమం, ఏ బిరుదివ్వాలో తెలియడం లేదు.. ఈ ధారణకి సాటైన బిరుదేవీ లేదు..... అందుకే "ధారణ బ్రహ్మ రాక్షసుడు " అన్న బిరుదు ఇస్తున్నాను " అని అన్నారుట.


భక్తి టి.వి. లో మహాభారతం ప్రవచనం చెప్పినప్పుడు , శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు అభినందన సభలో శ్రీ గరికపాటి వారిని ప్రశంసించి " ప్రవచన కిరీటి " అన్న బిరుదు ఇచ్చారు.


వారికి "అవధాన శారద, అమెరికా అవధాన భారతి " అన్న బిరుదులు కూడా కలవు. ఈ బిరుదులన్నీ ఆయన్ను వరించి తరించాయి.


అష్టావ శతావధానలలో   ఘనాపాటి

నవీన భారత కురుక్షేత్రం లో చెమక్కులతో చురకలేసే ప్రవచన  కిరీటి...

ప్రవచనాలతో సమాజాన్ని జాగృతం చేయడం లో ఆయనకు ఆయనే సాటి

ఆయనే శ్రీ గరికపాటి...


ఆ గరికపాటి వారికి నా ఈ చిన్ని అక్షర గరిక నివేదన!!


కరిముఖునకు హితకారిణి

పరమోతృష్టకణజాల పాపరహితమౌ

'గరిక ' గృహనామధేయులు

సరస సహస్రావధాన శతవందనముల్ !!

 

 

 

 

 వారితో మాట్లాడినప్పుడు తెలుసుకొన్న విషయాలు...