Search This Blog

Monday, April 23, 2018

ఎస్.జానకి

 

 

 

చక్కని గాత్రము కోసము ఏ రాగాలాపన తో ఆ శారదా దేవిని ఆవాహనము చేసారో, ఏ నాద సాధనాలతో ఆరాధించారో , ఏ గాన నీరాజణము చేశారో ,ఏ నివేదనలు , ఏ సంప్రోక్షణాలు చేసారో కానీ ఆ గీర్వాణి తన వాణినిని ఆ జానకమ్మ కి ప్రసన్నంగా ప్రసాదించింది . ఆమె గళమునే తన రత్న సింహాసనము గా సుస్థిర స్థానముగా చేసుకుంది. 


“పగలు రేయిగా పండు వెన్నెల గా “ మార్చగలిగిన స్వరము “ కదలే ఊహలకు కన్నులు ఉంటే “ ఎలా ఉంటుందో చిత్రించే మాధుర్యము , అదుపు లేని గాలిని సైతము తన గానామృతము తో గంగ వెల్లువగా ప్రవహింపచేయగలిగే సుమధుర గళం... జానకమ్మ సొంతం!!


1938 ఏప్రైల్ 23 న రేపల్లే లో పుట్టిన ఈ స్వర బాల మూడవ ఏటనే పాటల కచేరీలు ఇవ్వడము ప్రారంభించింది .నాదస్వర విధ్వాసులైన శ్రీ గాడవల్లి పైడిస్వామి వారి వద్ద సంగీత శిక్షణ పొందారు.

మొట్టమొదటి సారి సినిమాలో పాడింది ( తెలుగు పాట) పెండ్యాల గారి దర్సకత్వములోని “ నీ ఆశ అడియాశ చేజారే మణిపూస “(1957 ) ( ఈ పాట ఆధారముగానే లంబాడోళ్ల రామదాసు సినిమా తీసారు – 1978).



మొదట పాడిన పాట ఏదైననూ ఆవిడకు బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినది మాత్రము “ నీ లీల పాడెద దేవ “ ఈ పాట కోసము ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు గారు ఒక సన్నాయి లాంటి గళానికి కోసము వెతుకుతుండగా , జానకి గారి మావగారైన డా!చంద్రశేఖర్ గారి ద్వారా ఆవిడ గురించి వినడము , ఆ తరవాత కరైకూచి అరుణాచలం గారి నాదస్వరానికి పోటీ పడుతూ ఆవిడ పాడిన ఆ పాట ఆ నాటి నుండి ఈ నాటి వరకు సంగీతభిమానులను డోళలాడిస్తూనే ఉంది . అటు వంటి పాట అంతవరకు ఎవరూ పాడలేదు...... పాడలేరు. శ్రీ గాడవల్లి పైడిస్వామి గారు సన్నాయి విద్వాంసులు, ఇలా ఆవిడ పాడిన ఈ గానం గురుదక్షిణగా అయ్యింది.


ఆ పాట విని సి.నారాయణ రెడ్డి గారు “ అమ్మాయి.. నీ గొంతు సన్నాయి “ అని అభివర్ణించారుట. ఈ పాట పాటలప్రపంచములో ఒక సుస్థిరస్థాన్నాన్ని ఏరపరచుకొని అభేరీ రాగానికే ‘ ఆభరణం ‘ అయ్యింది.


1970 – 80 ప్రాంతములో సినీ గీతాభిమానులు , సంగీత దర్శకులు పాటలలో కొత్త దనాన్ని ఆస్వాధించనారంభించారు . ఎక్కువ గా గాత్రము తో ,వాయిద్యాలతో ప్రయోగాలు చేసి జనాలను మెప్పించడానికి కొత్తదనాన్ని సృష్టించడానికి ఇష్టపడే వారు సంగీత దర్శకులు. ,ఆ సమయములో వచ్చిన పాటలు చాలా మటుకు జానకమ్మ గాత్రానికి సరిపోయేవి కావడం , ఎటువంటి ప్రయోగాలకైనా ఆవిడ గళము సరిపోవడముతో ఎక్కువ పాటలు ఆవిడనే వరించాయి.

ఎస్.జానకి అంటే.. 'సంగీత జానకి'గా సంగీతాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న అద్భుత గాయనీమణి జానకమ్మ. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 15 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు సృష్టించారు. 

ఆవిడ తెలుగు , తమిళ్ ,కన్నడా, మళయాళం , హింది , సింహళి ,జపనీస్ లో పదిహేను వేలకు పైగా పాటలు పాడారు. ఒకప్పుడు ఉత్తి శృంగార గీతాలకే పరిమితం అనుకునే ఆవిడ గాత్రము అన్నీ రకాల రసాలు పలికించగలదని నిరూపించుకున్నారు.


ఆవిడ నాదస్వరముతోటే కాదు బిస్మిల్లాహ్ ఖన్ గారి తో షెహనాయి లో , ఎం.ఎస్. గోపాల కృష్ణన్ తో వయూలీనము లో , హరి ప్రసాద్ చౌరాసియా తో వేణు వు లో ను పోటీ పడుతూ ఎన్నో గీతాలు పాడారు.


“వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెపుతాను “ , "పాప పేరు మల్లీ నా ఊరు కొత్త ఢిల్లి " అంటూ హాస్య గీతాలు. ఎన్నో పాడారు.


“ఎందుకో చేరువై దూరమౌతావు ( నీలి మేఘాలలో)….. ” ,

“నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు (కళ్ళలో ఉన్నదేదో కన్నుల కే తెలుసు )” …,


“పువ్వు రాలిన వేళ కళ్యాణము అందాక ఆరాటం ( మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం ) ” ఈ పాట కి ముందు ఆలాపన చెప్పనలవి కానిది. ,


“నాకు లేదు మమకారం మనసుపైన అధికారం …ఆశలు బాసిన వేసవిలో (వెన్నెల్లో గోదారి అందం )….


“మము గన్న మా యమ్మ అలివెలు మంగా (నడి రేయి ఏ జాములో ) …అంటూ అద్రతగా అనగలగడం … ..


మచ్చుక్కి ఇటువంటి పాటలు చాలవా గుండే భారమెక్కడానికి?


“అర్జున ఫల్గున పార్ధ కిరీటి బిరుగొన్న విజయ “( నరవరా ఓ కురువరా ) అనే మాటా ఒకే ఫేస్ లో పాడటం…. ,


వల్లభా ప్రియ వల్లభ లో “బుగ్గలకావిరి తగిలేలా సిగ్గులు సెగలై చెలగేనా ” అంటూ అలలా పైకెగిరే స్థాయి…,


నను నీవు నిను నేను తనివితీరగ తలచుకొని (“కుశలమా ఎచనుంటివో ప్రియతమా ),


విహార వీణలు విందులు కాగా ..తనువు మనసు ఊలీ సోలి….అన్న తీరు (వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా ) , ( డా!! బాల మురళీ కృష్ణ తో హాయి గా సాగిన యుగల గీతము….)


“ఒకసారి కలలోకి రావయ్యా…”అంటూ వేడుకుంటోనట్లు పలికిన తీరు ,


తల్లి మళ్ళి తరుణైయింది... గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది (గాలికదుపులేదు )అంటూ గాలిలా అన్ని వైపులకూ సాగేపోతునట్లు ,


సన్నజాజీ పడకా…మాటవినకుందే ఎందుకే…..అంటూ సాగతీయడం


మదిలోని వాడు గదిలోకి వస్తే ….(మావయ్య వాస్తాడంట ) తుళ్ళుతూ సాగే పాట..


” ఓ వనె కాడ నిన్ను చూడ “(శ్రీ కృష్ణ పాడవీయం )( ఈ పాటలో ఒక్కొక్క చరణం ఒక్కొక్క బాణిలో ఉంటుంది ) అంత వైవిధ్యమైన పాటలు పాడటము లో ఆమేకు ఆమే సాటి……. .


ఊలుకు పలుకు లేకుండా మనిషి ఏ మాత్రము కదలకుండా పాటకు ఏ భావము ఎంత వరకు కావాలో అందించగల నేర్పరి . మాటలతోటే కాకుండా నవ్వు ల తో కూడా ఎన్నెన్నో భావాలు ప్రకటించగల రాగమంజరి .


పాటలలోనే కాదు చిన్న నవ్వులో ఎన్నేన్నో భావాలు తెలపగల జాణతనం కలదు ఆ గళానికి.


“నవ్వు తో ముసి నవ్వు తో ” అన్నప్పుడు విసిరిన ఆ ‘ముసీ నవ్వు , వింతగా కవ్వింత గా అంటూ గిలిగింతలు పెట్టించేది గా …


“పక్కన నువ్వుంటే ప్రతి రాత్రి పున్నమిరా ” అంటూ సిగ్గు పడె నవ్వు వెన్నెల గొప్పించిన రేయి లా ….


“సిరి మల్లే పువ్వల్లే నవ్వు ” లోని నవ్వు సెలయేటి తరగలలాగా కదిలేది గా…


“ నవ్వింది మల్లె చెండు “ లోని నవ్వు పరవళ్ళు తొక్కుతున్న గోదారిలా ..


“రాగమో అనురాగమో “ లోని నవ్వు ఎగిరే కెరటం కొండను ఢీ కొట్టుకునట్లు గా..


“శివ శివ అనలేలరా “ లోని నవ్వు కోరెకలను నిద్రలేపేదిగా …


“ పరువమా చిలిపి పరుగు తీయకు “ లో నవ్వు తొలకరి ఝల్లులాగా…


“ఈ పగలు రేయి గా పండు వెన్నెల గా “ లోని నవ్వు చలి లో విరిసిన అరవిందము గా ..


“పంట చేల్లో పాలకంకి నవ్వింది “ లో నవ్వు కోనసీమ లోని పచ్చని చేలు లా..


“పూవులు పూయును పదివేలు “ లో నవ్వు కుప్పించిన జాణతనములా ….


“సిగ్గు పూబంతి “ లో నవ్వు సాగరము లో కలిసే కన్నే గోదారిలా గంభీరము గా ఉంటుంది.


ఆవిడ పాడిన ఎన్నో యుగల గీతాలు ప్రజాధరణ పొందాయి.ఆనాటి నుండి ఈ నాటి వరకు యువతరానికి వేద మంత్రమయ్యాయి .


“ఊపిరి తగిలిన వేళ ….”అంటూ వెచ్చగా పలికిన తీరు (“వీణ వేణు వైన )..

అబ్బో నేరేడు పళ్లు లో “అబ్బో ” అన్న తీరు ,

వెచ్చ వెచ్చని నీ ఒడిలో ..లో “ నాకు నువ్వు నీకు నేనూ రోజు రోజు…” అన్న తీరు రేపంటి రూపం కంటి లో “ నేనోడి నీవే గెలిచి “ స్పురిస్తుంది .


శ్రీవారికి ప్రేమ లేఖ లో “ తొలిసారి మిమల్ని …లో ఎన్నో కలలు కన్న “కన్నె బంగారు “ ఆ మాట వింటే చాలు దేవులపల్లి వారి “ జాబిలి కూన “ గుర్తు రాక మానదు.


టిక్ టిక్ టిక్ గడియారం లో గోముగా పలికిన తీరు , ..

“ఎర్రాన్ని కుర్ర దాన్ని గోపాలా ” , “వద్దంటే వినడే పోకిరి ” , “ఆడదాని ఓరచూపుకే జగాన ఓడిపోని ధీరుడెవ్వడు “,


“సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట “( మౌనమేలనోయి ఈ మరపురాని రేయి)


“పట్టి తెచ్చనులే పండు వెన్నెలను నేనే “..అంటూ వెన్నెలలలు కురిపించే పాటలు… ఇలా ఎన్నో రకాల పాటలలో సరిలేరు ఆమెకెవ్వరూ…



ఇళయరాజా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకి గురించి మాట్లాడుతూ..''జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతిరోజూ కొన్ని లీటర్ల తేనె తాగుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా'' అని జానకి గాత్రంలోని మాధుర్యం గురించి చమత్కరించారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గానంలో మాధుర్యం ఎంతో.


తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, సినాÛలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్, సింహళీ భాషల్లో తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కె.జె.జేసుదాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, పి. జయచంద్రన్, పి.లీలా, కె.ఎస్.చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి.శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి.బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పాటు మనో, వందే మాతరం శ్రీనివాస్ వంటి వర్థమాన గాయకులెందరితోనో కలిసి పాడారు.


బిస్మిల్లాఖాన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి ప్రముఖ సంగీత విద్వాంసులతోనూ కలిసి పనిచేశారు. ఎస్.రాజేశ్వరరావు, దక్షిణమూర్తి, సుబ్బయ్య నాయుడు, పెండ్యాల, కె.వి.మహదేవన్, ఎమ్.ఎస్.విశ్వనాథం, రాజన్ నాగేంద్ర, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా, రమేష్ నాయుడు, జాన్సన్, శ్యామ్, వందేమాతరం శ్రీనివాస్, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి ఎందరో సంగీత దర్శకులకు గాత్రం అందించారు.


ఆరుసార్లు జాతీయ స్థాయిలో గాయనిగా అవార్డు అందుకున్నారు. వాటిల్లో తెలుగులో వంశీ దర్శకత్వంలో ఆమె పాడిన 'సితార' చిత్రంలోని 'వెన్నెల్లో గోదారి అందం' పాటకుగాను ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు అందుకున్నారు.


మహమ్మద్ రఫీ, లతామంగేష్కర్, ఆశాభోంస్లేలు జానకికి ఇష్టమైన సింగర్స్. ఐదు తరాల నటీమణులకు జానకి తన గళాన్ని అందించడం మరో విశేషం. రామోజీరావు నిర్మించిన 'మౌనపోరాటం' చిత్రానికి జానకి సంగీత దర్శకత్వం వహించారు. ఆ తరం వారిలో భానుమతి, పి.లీల తర్వాత జానకి మాత్రమే మహిళా సంగీత దర్శకురాలు. ప్రస్తుతం ఉన్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు, గాయకురాలు ఎంఎం శ్రీలేఖ మాత్రమే.


ఏ భాషలో పాడినా... పాటలో ఆ నేటివిటీ ధ్వనించేలా పాడగలగడమే ఆమె అందరి అభిమానం చూరగొనేలా చేసింది. ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి వి.రామ ప్రసాద్ ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.


ఆవిడ నాదస్వరముతోటే కాదు బిస్మిల్లాహ్ ఖన్ గారి తో షెహనాయి లో , ఎం.ఎస్. గోపాల కృష్ణన్ తో వయూలీనము లో , హరి ప్రసాద్ చౌరాసియా తో వేణు వు లో ను పోటీ పడుతూ ఎన్నో గీతాలు పాడారు.


ఆవిడ పాటలలోనే కాదు మంచి మిమిక్రి ఆర్టిస్ట్ కూడా. గోవ్వుల్లు తెల్లనా గోపయ్య నల్లనా ( సప్తపది ) ,అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింకా (శ్రీవారి శొభనం ), చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య ( స్వాతి ముత్యం ) , పంటచేల్లో పాలకంకి నవ్వింది ( పదహారేళ్ల వయ్య్సూ ) ,గున్నమామిడి కొమ్మ మీద (బాలమిత్రుల కథ ) లో ఐదేళ్ల చిన్న పాపలాగా, అరవై ఏళ్ల ముసలామే లాగా పాడారు. అన్నిటి కనా ఆవిడే పాడారు అని చెబితే నమ్మలేని పాట... "పాప పేరి మల్లి (మౌన గీతం) " లో పాట. ఇలా ఆవిడ గళానికి ప్రతి పాట ఒక ఛాలెంజ్! 


ఆవిడ పాటలు పాడడం లోనే కాదు పాటలకు సంగీతన్ని కూడా అందించగల విదుషీమణి. మౌనపోరాటం సినిమా ద్వారా ఆవిడ సినీ సంగీత దర్శకురాలిగా ప్రఖ్యాతి పొందారు. అటువంటి గాయనీ మణి, సంగీత దర్సకురాలు నాభూతో న భవిష్యతి !


చాలా కొద్దిమందికే తెలిసిన మరో విద్య కూడా కలదు ఆవిడలో … అవిడ మంచి చిత్రకారిణి కూడా. అన్నిటి కన్నా చాలా మృదుభాషిణి, ఏమాత్రం గర్వం లేని వ్యక్తిత్వం ఆవిడది.  

 ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు. 1980-90 దశకంలో విడుదలైన చిత్రాలన్నింటిలో జానకి గాత్రం వినబడేది. బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రం అందించారు. జానకి అద్భుతమైన పాటలనెన్నింటినో వీనుల విందుగా ఆలపించి శ్రోతలను పరవశింప చేశారు.

ఆ తల్లి గురించి ఎంత చెప్పిన తక్కువే కానీ కొండత దేవుడి కి కొండంత పత్రిని సమర్పించలేము కదా?


ఓక జాలరి సముద్రములోకి వెళ్లి తన అదృష్టము కొద్ది ఆణిముత్యాలు , రత్నాలు, వజ్రాలు తీసుకొని వస్తాడు ….ఎస్.జానకి అనే సంగీత సాగరములో నాకు దొరికినవి మాత్రము ఈ కొన్ని ఆణిముత్యలే మరి...




Tuesday, April 10, 2018

జ్ఞాపకాలు

"పాతా...బాతా... సీతామ్మా " అంటూ రోజూ మధ్యాహ్నం ఒకతను వీధుల్లో అరచుకుంటూ వెళ్ళేవాడు. సీతకి  ఈ " పాత.. బాత "ఎంటో చాలా రోజులు అర్ధం కాలేదు.  రోజు మిడసరి లగ్నంలో వచ్చేవాడు. నెత్తిమీద ఒక గంప పెట్టుకొని అందులో ఏవో కొన్ని గిన్నెలు పెట్టుకొని అరుస్తూ వీధి వీధి తిరిగేవాడు. అతను అరుస్తుంటే చిన్నపిల్లలమేమో (అప్పుడు) మేమూ అదే స్టైల్ లో అరవడానికి ప్రయత్నించేవాళ్ళం. ఓసారి మా చిన్నమావయ్య మేము అన్నది విని నవ్వి, ఆ వీధిలో అతను "పాతా బాతా సీతామ్మా " అని అరవడం లేదు.. "పాతా బట్టలకి స్టీల్ బాసాన్లమ్మా " అని అరుస్తున్నాడని గీతాబోధ చేశాడు.  😄

రోజూ పొద్దు పొద్దుటే ఆరు, ఆరున్నర మధ్యలో, మళ్ళీ సాయంత్రం ఐదూ ఐదున్నర మధ్యలో సైకిల్ మీద ఒకతను వచ్చేవాడు.. అతను ప్రతీ వీధి తిరుగుతూ "బుల్లమ్మా " అని అరచుకుంటూ వెళ్ళేవాడు. పాపం ఎవరో బుల్లమ్మ ని వెతుకుంటున్నాడేమో అని అనుకునేదాన్ని నేను. మధ్య మధ్యలో కొందరి ఇంటి లోపలకి వెళ్ళీ ఒక పొట్లం ఇచ్చి బుల్లమ్మని వెతుకునేవాడు..పాపం. తరవాత కాలం లో అర్ధమయ్యింది ఏమిటంటే అతను "బుల్లమ్మ " ని వెతుకోవడం లేదని అతను "పూలమ్మా " అని అరుస్తూ అమ్ముకునేవాడని.    😜 


అలాగే వీధిలో "మౌజ్ " అని అరిచేవాడు.. ఎదో ఎలక అమ్మేవాడు అనుకునేవాళ్ళం.. తీరా చూస్తే అది "చీటీ వాలా మౌజ్ (అదేనండి చుక్కల అరటి పళ్ళు). 

మా ఊరులో ఇలాగే "ప్పో... " అంటూ మిట్ట మధ్యాహ్నం పూట ఒకడు వచ్చేవాడు. అతను అమ్మేది "ఉప్పు " . ఎప్పుడూ ఉప్పో అని అమ్మేవాడు కాదు, ఆ ఊరిలో ఎవరిదేనా పెళ్ళి కుదిరితే  " పెళ్ళివారుప్పో " అనీ, పెళ్ళి అయితే "కొత్త కాపురం ఉప్పో " అని, లేకపోతే "అత్తాకోడలుప్పో " అనో , ఎండా కాలం లో "ఆవకాయుప్పో " అని అరుస్తూ ఉండేవాడు. ఒకసారి మా పక్కూరిలో ఒక ఇంట్లో అత్తాకోడళ్ళు కొట్టుకొని వేరింటి కాపురం పెట్టుకొన్నారు, ఆ ఊరు వెళ్ళి ఈ ఉప్పు అతను " వేరింటి కాపురం ఉప్పో " అని అరిచాడు. పాపం అతన్ని ఎముకళ్ళొకి ఉప్పులేకుండా కొట్టేశారు ఆ అత్తాకోడళ్ళు. 😢😢😢😢😢

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మా వీధిలోకి "ప్పో " అని అరుస్తూ ఒకావిడ వచ్చింది. వెళ్ళి చూస్తే అది "ఉప్పు " కాదు.. "సొప్పు (ఆకుకూరలు). ఇదిగో పైన చెప్పిన వారందరూ  గుర్తుకొచ్చేశారు. 😎

Saturday, March 31, 2018

మన్నెం శారద గారు

ఒక చేతితో కలాన్ని, ఇంకో చేతితో కుంచెని అవలీలగా వాడే నిపుణురాలు... పోటీ కథలకు కేరాఫ్ ఎడ్రస్ ఆవిడ. ముప్పై ఏళ్ళుగా వెయ్యకు పైగా కథలు, నలభై నాలుగు నవలలూ, టి.వి సీరియల్స్ కి స్క్రిప్ట్లు, మరెన్నో కాన్వర్స్ బొమ్మలకు సజీవం పోస్తోన్న కళామతల్లి... శ్రీమతి మన్నెం శారద గారు. 



వృత్తి రీత్యా ఒక ఇంజినీర్ అయినా...  ఆవిడలో ఉన్న భావుకత ఎన్నో కథలకు ప్రాణం పోసింది.  ఎన్ని ఉన్నా  ఏమాత్రం మిడిసిపడని వినయం ఆవిడ సొంతం.  ఈ ఎందరో మహానుభావుల శీర్షిక ద్వారా ఆవిడని కలవడం నా అదృష్టం!! ఆవిడ నడిచే ఒక గ్రంధాలయం... నవ్వుల సాగరం!  



ఆవిడ ద్వారా ఆవిడ జీవిత విశేషాలని తెలుసుకుంద్దాము!!

 

 

 

 

 

 

 

Saturday, March 24, 2018

శ్రీరామ నవమి

 



 

చైత్రమాసం ఆరంభం.. అప్పుడప్పుడే ఎండలు కొంచం కొంచం ముదురుతూ ఉంటాయి. తెల్లవారుజామునే "కౌశల్య సుప్రజా రామా " అంటూ అటు రాముణ్ణి ఇటు ఇంట్లో జనాలని నిద్రలేపే సుప్రభాతాలు. బయట మా వీధికొచ్చే ముసలితాత హార్మోనియం పట్టుకొని " జయ జయ శ్రీరామా రఘువరా " అంటూ ఇంకో సుప్రభాతం. సుప్రభాతం అవ్వడమేమిటి... "అదిగో భద్రాద్రి.. గౌతమి ఇదిగో చూడండి " అంటూ అపర రామదాసులాగా మన బాలమురళీ కృష్ణగారు మనల్ని ఉన్న చోట నుంచే భద్రాచలం తీసుకొని ఆ పుణ్య గౌతమితో పాటూ రాములోరి దర్శనం చేయించేసేవారు. ఇంతలో పక్కన ఉన్న ఐసోల రామం గారి ఇంట్లో నుంచి రామ రక్షా స్త్రోత్రంతో శ్రీరామ పట్టాభిషేకం మొదలయ్యేది. ఆ పక్క వీధిలో రామాలయంలో నుంచి మంత్రాలుతో రామ కల్యాణానికి అంకురార్పణ మొదలయ్యేది.


తలంటు పోసుకొని కళ్ళల్లో కుంకుడి రసం పడిన మంట ఒక వైపూ, ఎండలో పట్టు పరికిణీ చిరాకు ఇంకొక వైపూ, చిక్కు జడలో మల్లెపూల బరువు ఒక వైపూ, ఇన్ని చిరాకులలతో ఆ రామ దర్శనానికి వెళ్తూ ఉన్న ఆనందం.. ఉగాది పచ్చడి తిని ఇంకా వారమే అవుతోంది కదా.. ఆ రుచులు ఇలా జీవితంలో అగుపడతాయేమో అని అనిపిస్తూ ఉండేది.


రామాలయంలో రాముడికి ఒక దండం, వస్తూ వస్తూ అమ్మత్త వాళ్ళ రాముడికి ఇంకో దండం, ఆ తరవాత మా పక్కింటి ఐసోల రామం గారి రాముడికి ఇంకో దండం. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. రామ పట్టాభిషేకం మా ఐసోల రామం గారి ఇంట్లో చాలా బాగా జరిగేది. మంత్రం పుష్పం చాలా బాగా చదివేవారు ఆయన, ఇంకా సాంభ శివ రావు గారూ! ఆ పూజ చూసి ఇంటికి వచ్చి ఇంట్లో టి.వి. లో లవ కుశ చూసేవాళ్ళం. ఈ లవ కుశ చూడలేని రామ నవమి మా చిన్నప్పుడు లేనే లేదు. ఆ సినిమా అవుతుండగా ఇంతలో రేడియో లో భద్రాద్రి రామయ్య కల్యాణం పెట్టేవారు. వ్యాఖ్యానం ఉషశ్రీ గారూ, మల్లాది వారు! అబ్బా.. ఇంతవరకూ నేను ప్రత్యక్షంగా భద్రాద్రి రామయ్య కల్యాణం చూడలేదు కానీ అలా అని నాకు ఎప్పుడూ అనిపించకపోవడానికి కారణం మల్లాది వారే! "అమ్మా.. సీతమ్మా! కాస్త తల పైకెత్తి రాముల వారిని చూడమ్మా" అంటూ ఆ కల్యాణ వైభోగం అంతా కళ్ళకు కట్టేవారు! ఆ కల్యాణం సరిగ్గా మిడసరి లగ్నం లో అయ్యేది. ఇటు వైపు రేడియోలో భద్రాద్రి రామయ్య కల్యాణం, ఇంకో వైపు నుంచి పక్కన ఐసోల రామం గారి ఇంట్లో నుంచి గట్టి మేళం, ఆ పక్క నుంచి పక్క వీధి రామాలయం నుంచి మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా ఆ సీతారామ కల్యాణం జరిగేది. కల్యాణం అయ్యిన వెంటనే "శ్రీ సీతారాముల కల్యాణం చూదము రారండి " పాట! ఈ పాట లేని శ్రీరామ నవమి కానీ పెళ్ళి కానీ ఉండదంటే అతిశయోక్తి కాదేమో!!


ఇవన్నీ అయ్యాక ఇంట్లో నైవేద్యం పెట్టిన పానకం, వడపప్పు ప్రసాదం తినడం. ఆ పానకం కూడా ఒక పక్క తీయగా ఇంకో పక్క మిరియాల ఘాటుతో భలే గొప్ప రుచిగా ఉండేది. "జనన మరణ భయ శోక విదూరం.. సకల శాస్త్ర నిగమాగమ సారం... "


ఆ ముచ్చట్లు దాటి ఈ జీవిత ప్రయాణం లో ఎంతో ముందుకి వచ్చినా... శ్రీరామ నవమి అనగానే మనసు మాత్రం అక్కడ నుంచి రానంటోంది!!



మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. శ్రీరామ రక్షా!!








Wednesday, March 21, 2018

నాకు ఇష్టమైన పద్యము - 1

వేదపురాణశాస్త్ర పదవీ నదవీ యసియైన పెద్దము

త్తైదువ  కాశికానగర హాటకపీఠి శిఖాదిరూఢ య

య్యాదిమ శక్తి సంయమివరా! యిటు రమ్మని బిల్చె హస్తసం

జ్ఞాదర వీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లునన్



ఈ పద్యము శ్రీనాధుడు వ్రాసిన "కాశీఖండము " లోనిది.  సకల వేదాలకు, సమస్త పురాణాలకు, సకల శాస్త్రాలూ నిర్దేసిస్తున్న మార్గానికి దగ్గరగా వున్న పెద్దముత్తైదువ, కాశీ నగరం అనే బంగారుపీఠం పై అధిరోహించిన ఆ ఆగమశక్తి , చేతితో సంజ్ఞ చేసింది. అప్పుడామె రత్న ఖచితమైన ఆభరణాలు ఘల్లు ఘల్లుమన్నాయి. అలా ఘల్లు ఘల్లుమంటున్న ఆ గాజుల శబ్ధంతో ఆవిడ " ఓ సమ్యమివరా! ఇటు రమ్ము " అని వ్యాసుడిని పిలిచింది. 



ఒకసారి వేదవ్యాసుడు తన శిష్యగణముతో కాశీ నగరానికి చేరుకున్నాడు. అతనికి ఆ రోజు ఎక్కడా భోజనము దొరకలేదు. వ్యాసుడు అతని పది వేలమంది శిష్యులు భుజిస్తే కానీ భుజించకూడదన్న నియమము పెట్టుకున్నాడు. అలా ఆ రోజు భిక్ష దొరకలేదు. మరునాడు కూడా ఎవరి ఇంటా భిక్ష దొరకలేదు. ఆ క్షుద్బాధకు తాలలేక వేద వ్యాసుడు భిక్ష పాత్రను వీధి మధ్యలో పగుల గొట్టి  " కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, ధనమూ, మోక్షమూ లేకుండా పోవాలని " శపించాడు . 


ఇంతలో ఒక ఇంటిలోనుంచి సామాన్య స్త్రీలాగా పార్వతీదేవి వచ్చి " నీకు గొంతు దాకా తినడానికి మధుర భక్షాలు లేవని ఇలా గంతులు వేస్తున్నావు. ఇక్కడ ఉన్న మునీశ్వరులు, యతులు నీ కన్న తెలివి తక్కువ వారా?  ఉన్న ఊరు కన్న తల్లి తో సమానము. ఈ కాశీ మోక్షకాపురి... శివుని భార్యలాంటిది. నీకు తిండి దొరకలేక లేదని కాశీనే శపిస్తావా? నీవు ఆకలితో వున్నావు, మా ఇంటికి భోజనానికి రా " అని ఆహ్వానించింది.


"అమ్మా! నేను నా పది వేలమంది శిష్యులతో వచ్చాను. వారు భుజించనిదే నేను భుజించ కూడదన్న నియమముతో ఉన్నాను " అని అన్నాడు.


"మునీశ్వరా... నీవు నీ శిష్యులను వెంట బెట్టుకొనిరా! ఆ ఈశ్వరుడి దయ వల్ల ఎంత మంది అతిధులు వచ్చినా అందరికీ కోరిన అన్నము పెడతాను " అని అభయమిచ్చింది ఆ అన్నపూర్ణాదేవి.  


మొదట కోరిన పదార్ధాలతో క్షుద్బాధ తీర్చి, ఆ తరవాత జ్ఞాన భోధ కూడా చేసింది ఆ విశాలాక్షి. 

 

 

 

Tuesday, February 20, 2018

ఋష్యేంద్రమణి

ఈ మధ్య "మాయాబజార్ " సినిమా చూశా.. (మొదటి సారి కాదు.. ఎన్నో సారో గుర్తు లేదు). సుభద్ర,అభిమన్యులును కృష్ణుడు దారకుడికి అప్పగించి "ఘటోత్కజుడి ఆశ్రమం" కి తీసుకెళ్ళమని చెబుతాడు. తీరా వెళ్ళేటప్పుడు మాధవపెద్ది సత్యం పాట.. అదేనండి భళి భళి భళీ దేవా వస్తుంది. ఆ దారకుడు కూడా మాధవ పెద్ది సత్యమే ( ఇది మాకు తెలుసు అనకండి). పాట అయ్యేటప్పటికి రాక్షసులు అభిమన్యుడిని అడ్డగిస్తారు. వారందరినీ చంపేస్తాడు అభిమన్యుడు. ఇంక ఘటోత్కచుడు ఎంటర్ అవుతాడు. కాసేపు ఫైటింగ్ అయ్యాక.. "పేరు చెప్పి శరణు వేడు, వదిలేస్తా " అని వార్నింగ్ ఇస్తాడు ఘటోత్కచుడు. "పిరికివాడిలా పేరు చెప్పడం ఎందుకు " అని భీష్మించుకుంటాడు అభిమన్యుడు. ఇంతలో ఘటోత్కచుడి గద తగిలి అభిమన్యుడు మూర్చపోతాడు.

 

మన సుభద్ర గారు విల్లు ధరించి....

"అఖిల రాక్షస మంత్రతంత్ర అతిశయమణచు శ్రీకృష్ణుని సోదరినగుదునేమీ

దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనకు అర్జును పత్నినే అగుదునేని "

 

అంటూ అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల 'ప్రవర ' చెప్పేస్తుంది. ఉత్తి పేరు చెప్పమంటే ఇంత సీన్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఇంత గొప్ప పరిచయమా? అదేదో ముందుగా చెప్పి ఉంటే అభిమన్యుడు మూర్చ పోయేవాడు కాదు కదా!

 

అదీ కాక " ఈ శరంబు అసురు గూల్చి సిద్ధించు గాక.. పాండవకులైక భూషణ ప్రాణ రక్షా " అని అంటుంది. ఈ పద్యము "ఋషేద్ర మణి గారు " బహు బాగా పాడారు కానీ.. "పాండవ కులైక భూషణుడు " అభిమన్యుడొక్కడే కాదు కదా? ఎదురుగ ఇంకో భూషణుడు అదే ఘటోత్కచుడు ఉన్నాడు. అదీ కాక ఉపపాండవులూ ఇంకా ఉన్నారు ( సినిమాలో పాండవులే లేరు ఈ ఉపపాండవులెక్కడా అని అడగకండి). ఇంత మంది భూషణులు ఉండగా పాపం ఆవిడ ఎకైక భూషణుడని అభిమన్యుడికి కీర్తించేస్తే ఎలా? ఇది అప్పుడు ఎవరూ అడగలేదా? అడిగినా చక్రపాణి గారు , పింగళి గారు "ఎవరూ కల్పించకపోతే కట్టు కథలు ఎలా పుడతాయి ? " అని అనేశారా?

 

అప్పుడు వాళ్ళు అడగకపోయినా ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఏడిచినట్టే ఉంది.. ఎవర్ని అడుగుతావు అని అడగొద్దు. నా ప్రశ్న ఏడ్చినట్టున్నా, ఏడ్చి మొహం కడుకున్నట్టున్నా.. అడిగేస్తాను.. అంతే!

 

 

ఈ రోజు ఋష్యేంద్రమణి గారి పుట్టినరోజు... ఆ పద్యం... ఆ ఠీవి చూసేయండి.. ఈ ప్రశ్నలన్నీ మరచిపోవచ్చు.

 

 

 

 

Thursday, February 1, 2018

రాజన్- నాగేంద్ర

సప్తస్వర.. ఆయన నివాసం

సరిగమలు.. వారి నేస్తం

సరస్వతీదేవికి వారి ఇల్లే ఆవాసం

రెండు దశాబ్ధాలు దక్షిణ సినిమా సంగీతాన్ని ఏలినది ఆ యుగళం...



వారే... రాజన్- నాగేంద్ర.. సంగీత ద్వయం...

ఖైదీ కన్నయ్య చేత ' పూజ ' లెన్నో చేయించి, వారికి  "నవగ్రహ పూజా మహిమా " 'కనకదుర్గ పూజా మహిమ ' తెలియచేసి,' సొమ్మొకడిది సోకొకడిదిగా ' జల్సా చేస్తూ,  'అప్పుల అప్పారావు' గా ఉన్న' అల్లరి బావ '  'నాగమల్లి 'ని చూసిన వెంటనే 'ప్రేమఖైది '  ని చేసి,  ఆ 'అమ్మాయి మనసు ' ని అర్ధం చేసుకుని, వారి 'చూపులు కలిసిన శుభవేళ ' వారి చేత 'పణయ గీతం ' పాడించి, వారి ప్రేమని 'మంచు పల్లకి ' ఎక్కించి, వారిని "మూడు ముళ్ళ బంధం' తో కలిపి  వారిని "వయ్యరి భామలు - వగలమారి భర్తలు " చేసి, వారి "ఇంటింటి రామాయణాన్ని " ' పంతులమ్మ ' గా మనందరికీ తెలియచేసి ' కోటికొక్కడు ' గా మిగిలిన  'అగ్గి పిడుగు " లు రాజన్ నాగేంద్ర గార్లు.  


ఎనుబది పదులలో కూడా సంగీత సేద్యం చేస్తున్న వారు రాజన్ గారు. ఆ మహానుభావుడు నిత్య సంగీత కృషివలుడు . వారు ప్రస్తుతం బెంగుళూరు నగరంలో ఉంటున్నారు. 



ఐరావతం రాజప్ప గారు చాలా గొప్ప సంగీతాభిమాని మరియూ గొప్ప సంగీత నిపుణులు. వారు తబలా, హార్మోనియం, వీణా, ఫ్లూట్ వాయించగలిగేవారు. వారి కొడుకులు రాజన్- నాగేంద్ర గార్లు కూడా తండ్రికి తగిన తనయులే! 


రాజన్ గారు 1932 లో మైసూర్ లోని శివరామ్ పేట లో జన్మించారు.  వీరు తెలుగు వారే కానీ కొన్ని తరాల క్రితమే మైసూర్ లో స్థిరపడిపొవడం వలన ఎక్కువ కన్నడ కలిసిన తెలుగు మాట్లాడుతారు! రాజన్ - నాగేంద్ర కు హార్మోనియం, వేణువులు నేర్పిన మొదటి గురువు వారి తండ్రి అయిన రాజప్ప గారే! ఆ తరవాత బిడారం కిష్టప్ప గారి దగ్గర, దేవేంద్రప్ప గారి దగ్గర కర్ణాటక సంగీతం అభ్యసించారు.  ఆ తరవాత బిడారం కిష్టప్ప తో కొన్ని కచేరీలు బెంగుళూరులోనూ, మైసూర్ లోనూ ఇచ్చారు ఈ అన్నదమ్ములు.  రాజన్ నాగేంద్ర లో నాగేంద్ర గాయకుడు కూడా! ఒకసారి మైసూర్ ప్యాలస్ లో జరిగిన వీరి కచేరి విని వారికి సంగీత దర్శకులు గా అవకాశం దొరికింది. అలా వారు 'సౌభాగ్య లక్ష్మి " అనే కన్నడ సినిమాకు తొలిసారి సంగీత దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి విఠలాచార్య దర్శకులు.


ఆ తరవాత విఠలాచార్య తెలుగులో తీసిన " కనకదుర్గ పూజా మహిమ " సినిమాకి కూడా ఈ జంటనే సంగీత దర్శకులుగా ఎన్నుకున్నారు. ఆ తరవాత వారు తీసిన "నవగ్రహపూజా మహిమ " సినిమాలో  చాలా పాటలతో బాటు జానకితో ఘంటసాల ఆలపించిన "ఎవరో.. ఏల పగబూని సాధింతురు " అన్న పాట ప్రేక్షకాధరణ పొందింది. తెలుగులో వీరి మొదటి సినిమా " వద్దంటే పెళ్ళి ". "ఖైదీ కన్నయ్య " లో " తియతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా " పాట కూడా ఆ రోజుల్లో చాలా పేరుపొందింది. 


ఆ తరవాత "అగ్గిపిడుగు " సినిమాలో "ఏమో ఏమో ఇది " అన్న పాట కూడా ప్రఖ్యాతిగాంచింది. 1976 లో వచ్చిన "పూజ " సినిమా లో వారు సమకూర్చిన అన్ని పాటలు  తెలుగునాట  ఈ రోజుకి మారుమ్రోగుతున్నాయి. 



1978 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డ్లు సంగీత దర్శకులకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తొలి అవార్డు "పంతులమ్మ " సినిమాకు గానూ రాజన్ నాగేంద్రలకు దక్కింది. ఆ సినిమా తరవాత 'నవతా కృష్ణం రాజు " తీసిన ప్రతి సినిమాకు వీరే సంగీత దర్శకులయ్యారు. 



సంగీత దర్శకత్వం వహించినకొన్ని తెలుగు సినిమలు :



పంతులమ్మ, ఇంటింటి రామాయణం, పూజ, సొమ్మొకడిది సోకొకడిది, నవగ్రహపూజా మహిమ, నాగమల్లి, తాతయ్య ప్రేమలేఖలు, అల్లరిబావ, అద్దాల మేడ, ప్రణయ గీతం, మంచుపల్లకి, వయ్యారిభామలు వగలమారి భర్తలు, నాలుగు స్థంబాలాట, అమ్మాయి మనసు, మూడు ముళ్ళు, పులి-బెబ్బులి, లంకె బిందెలు, రాజు-రాణి-జాకి, రెండు రెళ్లు ఆరు, ఆడపడుచు, చూపులు కలిసిన శుభ వేళ, ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, రాగ లీల, కోటికొక్కడు, దేవుని గెలిచిన మానవుడు, నాగార్జున, ఖైదీ కన్నయ్య, వరలక్ష్మీ వ్రతం, అన్నా చెల్లెలు, శ్రీ కృష్ణ గారడి, సర్దార్ ధర్మన్న, రౌడీ పోలీస్, వియజసింహ, అనురాగ బంధం, సీత పుట్టిన దేశం, అ ఆ ఇ ఈ.... 


నాగేంద్ర గారు కన్నడాలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎక్కువగా హాస్య నటులకు వీరు గాత్రం సరిపోతుంది. వారు నవంబర్ 3 2000 సంవత్సరంలో కన్నుమూశారు. 



ఎనిమిది పదుల వయసులో కూడా రాజన్ గారు సంగీత సేవ ఇంకా చేస్తూనే ఉన్నారు. వారు సమకూర్చిన కొన్ని పాటలు ఎస్.పి. బాలు గారి చేతా మరి కొందరు గాయకుల చేత పాడించి కొన్ని ఆల్బంస్ గా విడుదల చేశారు. ఇప్పుడు పురంధర దాసు కీర్తనలు స్వరపరుస్తున్నారు. కొంత మంచి యువ గళాలకు "వాయస్ కల్చర్ " మీద టుటోరియల్స్ ఇస్తున్నారు. వారి చేత పురంధర దాసు కీర్తనలు పాడించి ఆల్బంస్ గా విడుదల చేస్తున్నారు. వారి సేవ అద్వితీయం... ఆ సరస్వతీదేవి కటాక్షం వారి మీదా మెండుగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను.