Search This Blog

Wednesday, March 21, 2018

నాకు ఇష్టమైన పద్యము - 1

వేదపురాణశాస్త్ర పదవీ నదవీ యసియైన పెద్దము

త్తైదువ  కాశికానగర హాటకపీఠి శిఖాదిరూఢ య

య్యాదిమ శక్తి సంయమివరా! యిటు రమ్మని బిల్చె హస్తసం

జ్ఞాదర వీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లునన్



ఈ పద్యము శ్రీనాధుడు వ్రాసిన "కాశీఖండము " లోనిది.  సకల వేదాలకు, సమస్త పురాణాలకు, సకల శాస్త్రాలూ నిర్దేసిస్తున్న మార్గానికి దగ్గరగా వున్న పెద్దముత్తైదువ, కాశీ నగరం అనే బంగారుపీఠం పై అధిరోహించిన ఆ ఆగమశక్తి , చేతితో సంజ్ఞ చేసింది. అప్పుడామె రత్న ఖచితమైన ఆభరణాలు ఘల్లు ఘల్లుమన్నాయి. అలా ఘల్లు ఘల్లుమంటున్న ఆ గాజుల శబ్ధంతో ఆవిడ " ఓ సమ్యమివరా! ఇటు రమ్ము " అని వ్యాసుడిని పిలిచింది. 



ఒకసారి వేదవ్యాసుడు తన శిష్యగణముతో కాశీ నగరానికి చేరుకున్నాడు. అతనికి ఆ రోజు ఎక్కడా భోజనము దొరకలేదు. వ్యాసుడు అతని పది వేలమంది శిష్యులు భుజిస్తే కానీ భుజించకూడదన్న నియమము పెట్టుకున్నాడు. అలా ఆ రోజు భిక్ష దొరకలేదు. మరునాడు కూడా ఎవరి ఇంటా భిక్ష దొరకలేదు. ఆ క్షుద్బాధకు తాలలేక వేద వ్యాసుడు భిక్ష పాత్రను వీధి మధ్యలో పగుల గొట్టి  " కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, ధనమూ, మోక్షమూ లేకుండా పోవాలని " శపించాడు . 


ఇంతలో ఒక ఇంటిలోనుంచి సామాన్య స్త్రీలాగా పార్వతీదేవి వచ్చి " నీకు గొంతు దాకా తినడానికి మధుర భక్షాలు లేవని ఇలా గంతులు వేస్తున్నావు. ఇక్కడ ఉన్న మునీశ్వరులు, యతులు నీ కన్న తెలివి తక్కువ వారా?  ఉన్న ఊరు కన్న తల్లి తో సమానము. ఈ కాశీ మోక్షకాపురి... శివుని భార్యలాంటిది. నీకు తిండి దొరకలేక లేదని కాశీనే శపిస్తావా? నీవు ఆకలితో వున్నావు, మా ఇంటికి భోజనానికి రా " అని ఆహ్వానించింది.


"అమ్మా! నేను నా పది వేలమంది శిష్యులతో వచ్చాను. వారు భుజించనిదే నేను భుజించ కూడదన్న నియమముతో ఉన్నాను " అని అన్నాడు.


"మునీశ్వరా... నీవు నీ శిష్యులను వెంట బెట్టుకొనిరా! ఆ ఈశ్వరుడి దయ వల్ల ఎంత మంది అతిధులు వచ్చినా అందరికీ కోరిన అన్నము పెడతాను " అని అభయమిచ్చింది ఆ అన్నపూర్ణాదేవి.  


మొదట కోరిన పదార్ధాలతో క్షుద్బాధ తీర్చి, ఆ తరవాత జ్ఞాన భోధ కూడా చేసింది ఆ విశాలాక్షి. 

 

 

 

No comments:

Post a Comment